అపొస్తలుల కార్యములు 7:44-60

అపొస్తలుల కార్యములు 7:44-60 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

“దేవుడు మోషేకు చూపించిన నమూనా ప్రకారం, దేవుని సన్నిధి కలిగిన సాక్షి గుడారం అరణ్యంలో మన పితరుల దగ్గర ఉన్నది. ఆ గుడారాన్ని పొందుకొన్న తర్వాత, మన పితరులు యెహోషువ నాయకత్వంతో దేవుడు తమ ముందు నుండి వెళ్లగొట్టిన జనాలను నుండి స్వాధీనపరచుకున్న దేశంలోనికి తమతో పాటు దానిని తెచ్చారు. ఆ గుడారం దావీదు కాలం వరకు ఆ దేశంలోనే ఉన్నది. దావీదు దేవుని దయను అనుభవించినవాడై, యాకోబు దేవుని కోసం నివాస స్థలాన్ని ఏర్పాటుచేస్తానని దేవున్ని అడిగాడు. కానీ ఆయన కోసం నివాస స్థలాన్ని సొలొమోను కట్టించాడు. “అయినా, మానవుల చేతులతో నిర్మించే ఆలయాలలో సర్వోన్నతుడు నివసించడు. దాని గురించి ప్రవక్తలు ఈ విధంగా చెప్పారు: “ ‘ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం. మీరు నా కోసం ఎలాంటి నివాస స్థలాన్ని కడతారు? అని దేవుడు అంటున్నారు నా విశ్రాంతి స్థలం ఏది? వీటన్నిటిని చేసింది నా చేయి కాదా?’ “మెడవంచని ప్రజలారా! మీ హృదయాలు మీ చెవులు ఇంకా సున్నతి పొందనివిగా ఉన్నాయి. మీరు మీ పితరుల వలె ఎప్పుడు పరిశుద్ధాత్మను వ్యతిరేకిస్తున్నారు. మీ పితరులు హింసించని ప్రవక్త ఒకడైనా ఉన్నాడా? ఆ నీతిమంతుని రాకను ముందుగానే ప్రవచించిన వారందరిని చంపేశారు. ఇప్పుడు మీరు అతన్ని అప్పగించి హత్య చేశారు. దేవదూతల ద్వారా చేయించిన ధర్మశాస్త్రాన్ని మీరు పొందుకున్నారు కాని దానికి లోబడలేదు” అన్నాడు. న్యాయసభ సభ్యులు ఈ మాటలు విన్నప్పుడు, చాలా కోపంతో స్తెఫెనును చూసి పండ్లు కొరికారు. కానీ స్తెఫెను పరిశుద్ధాత్మతో నింపబడి ఆకాశం వైపు తన తలనెత్తి దేవుని మహిమను, దేవుని కుడిచేతి వైపున యేసు నిలబడి ఉండడం చూశాడు. అతడు వారితో, “చూడండి! నేను పరలోకం తెరవబడి ఉండడం, మనుష్యకుమారుడు దేవుని కుడిచేతి వైపున నిలబడి ఉండడం నేను చూస్తున్నాను” అని చెప్పాడు. అందుకు వారందరు తమ చెవులను మూసుకొని పెద్దగా కేకలువేస్తూ, అతని మీద పడి, పట్టణం బయటకు అతన్ని ఈడ్చుకొని వెళ్లి, రాళ్లతో కొట్టడం మొదలుపెట్టారు. చూసే సాక్షులందరు తమ వస్త్రాలను సౌలు అనే యువకుని పాదాల దగ్గర పెట్టారు. వారు స్తెఫెనును రాళ్లతో కొడుతున్నప్పుడు అతడు, “యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకో” అని ప్రార్థించాడు. తర్వాత అతడు మోకరించి, “ప్రభువా, ఈ పాపాన్ని వీరి మీద మోపకు” అని మొరపెట్టాడు. ఈ మాటలు చెప్పిన తర్వాత, అతడు నిద్రించాడు.

అపొస్తలుల కార్యములు 7:44-60 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

మోషే చూసిన నమూనా చొప్పున సాక్షపు గుడారం చేయాలని దేవుడు అతనితో మాట్లాడి ఆజ్ఞాపించాడు. ఆ సాక్షపు గుడారం అరణ్యంలో మన పితరుల దగ్గర ఉండేది. మన పూర్వీకులు దాన్ని తీసుకుని, దేవుడు తమ ఎదుట నుండి వెళ్ళగొట్టిన జనాలను వారు స్వాధీనపర్చుకున్నప్పుడు, యెహోషువతో కూడ ఈ దేశంలోకి దాన్ని తీసుకొచ్చారు. అది దావీదు కాలం వరకూ ఉంది. దావీదు దేవుని అనుగ్రహం పొంది యాకోబు దేవునికి నివాస స్థలాన్ని నిర్మించాలని ఆశించాడు. కాని సొలొమోను మందిరం కట్టించాడు. “అయితే, ప్రవక్త చెప్పినట్టుగా సర్వోన్నతుడు మనుషుల చేతులతో చేసిన ఇళ్ళలో నివసించడు. ‘ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం. మీరు నాకోసం ఎలాంటి ఇల్లు కడతారు? నా విశ్రాంతి స్థలమేది? ఇవన్నీ నా చేతిపనులు కావా? అని ప్రభువు అడుగుతున్నాడు.’ “మీరు మెడ వంచనివారూ, హృదయంలో చెవులలో సున్నతి లేని వారు. మీరు కూడా మీ పూర్వీకుల లాగే ప్రవర్తిస్తున్నారు, ఎప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నారు. మీ పూర్వీకులు ఏ ప్రవక్తను హింసించకుండా ఉన్నారు? ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందే తెలియజేసిన వారిని చంపేశారు. ఆయనను కూడా మీరిప్పుడు అప్పగించి హత్య చేసిన వారయ్యారు. దూతలు అందించిన ధర్మశాస్త్రాన్ని పొందారు గాని దాన్ని మీరే పాటించలేదు” అని చెప్పాడు. మహాసభ వారు ఈ మాటలు విని కోపంతో మండిపడి స్తెఫనును చూసి పళ్ళు కొరికారు. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండి ఆకాశం వైపు తదేకంగా చూస్తూ, దేవుని తేజస్సును చూశాడు. దేవుని కుడి పక్కన యేసు నిలబడి ఉండడం చూసి “ఆకాశం తెరుచుకోవడం, మనుష్య కుమారుడు దేవుని కుడి పక్క నిలిచి ఉండడం చూస్తున్నాను” అని పలికాడు. అప్పుడు వారు గట్టిగా కేకలు వేస్తూ చెవులు మూసుకుని మూకుమ్మడిగా అతని మీదికి వచ్చి అతనిని పట్టణం బయటకు ఈడ్చుకు పోయి, రాళ్ళతో కొట్టారు. సాక్షులు సౌలు అనే యువకుని పాదాల దగ్గర తమ పైబట్టలు పెట్టారు. వారు స్తెఫనును రాళ్ళతో కొడుతూ ఉన్నపుడు అతడు ప్రభువును పిలుస్తూ, “యేసు ప్రభూ, నా ఆత్మను చేర్చుకో” అని చెప్పాడు. అతడు మోకరించి, “ప్రభూ, వీరి మీద ఈ పాపం మోపవద్దు” అని గొంతెత్తి పలికాడు. ఈ మాట పలికి కన్ను మూశాడు. సౌలు అతని చావుకు సమ్మతించాడు.

అపొస్తలుల కార్యములు 7:44-60 పవిత్ర బైబిల్ (TERV)

“మన పూర్వులు ఎడారుల్లో ఉన్నప్పుడు వాళ్ళ వద్ద దేవుని గుడారం ఉంది. ఇది మోషేచే నిర్మింపబడినది. ఇది నిర్మింపబడక ముందు దేవుడు ఒక నమూనాను మోషేకు చూపి దాని ప్రకారం నిర్మించుమని ఆజ్ఞాపించాడు. ఆ తర్వాత ఇది మన పూర్వికులకు లభించింది. వాళ్ళు యెహోషువ నాయకత్వాన, దేవుడు పారద్రోలిన ప్రజలు వదిలి వెళ్తున్న భూమిపై స్థిరపడుతున్న సమయాన ఈ గుడారం వాళ్ళ దగ్గరే ఉంది. దావీదు కాలందాకా అది ఆ దేశంలో ఉంది. దావీదు దేవుని అనుగ్రహం పొంది యాకోబు వంశీయుల కోసం మందిరాన్ని నిర్మించే అవకాశం యివ్వుమని దేవున్ని కోరాడు. అయితే ఈ మందిరాన్ని నిర్మించింది సొలొమోను రాజు. “కాని సర్వోన్నతుడైన దేవుడు మానవులు నిర్మించిన మందిరాల్లో నివసించడు. దీన్ని గురించి ప్రవక్త యిలా అన్నాడు: ‘ఆకాశం నా సింహాసనం! భూమి నా పాదపీఠం! నాకెలాంటి మందిరం నిర్మిస్తారు మీరు? విశ్రాంతికి నాకు స్థలం ఏది? ఇవన్నీ నిర్మించింది నేనే కాదా?’ అని ప్రభువన్నాడు.” స్తెఫను ఉపన్యాసం సాగిస్తూ, “మూర్ఖులారా! మీ హృదయాలు యూదులు కానివాళ్ళ హృదయాల వలే ఉన్నాయి. మీ చెవులు దైవసందేశాన్ని వినటానికి నిరాకరిస్తున్నాయి. మీరు మీ పూర్వులు ప్రవర్తించినట్లు ప్రవర్తిస్తున్నారు. వాళ్ళవలె మీరు కూడా అన్ని వేళలా పవిత్రాత్మను తృణీకరించారు. మీ పూర్వులు హింసించని ప్రవక్త ఒక్కడైనా ఉన్నాడా! నీతిమంతుడు రానున్నాడని ప్రవచనం చెప్పినవాళ్ళను వాళ్ళు చంపివేసారు. ఇక మీరు ద్రోహం చేసి క్రీస్తుని కూడా చంపేసారు. దేవదూతల ద్వారా అందివ్వబడిన దేవుని ధర్మశాస్త్రం లభించింది మీకు. కాని దాన్ని మీరు పాటించను కూడా లేదు” అని అన్నాడు. ఈ మాటలు విని వాళ్ళు కోపంతో మండిపోయి, అతణ్ణి చూసి పళ్ళు కొరికారు. కాని స్తెఫను పవిత్రాత్మతో నిండిపోయి పరలోకం వైపు చూసి దేవుని తేజస్సును, యేసు దేవుని కుడి వైపు ఉండటం చూసాడు. “అదిగో చూడండి! పరలోకం తెరుచుకోవటం. దేవుని కుమారుడు ఆయన కుడి వైపు నిలుచొని వుండటం చూస్తున్నాను!” అని అన్నాడు. ఈ మాటలు విని వెంటనే వాళ్ళు తమ చెవులు మూసుకున్నారు. బిగ్గరగా కేకలు వేస్తూ అతని మీదికి వెళ్ళారు. అతణ్ణి ఊరి బయటికి లాగి రాళ్ళతో కొట్టటం మొదలు పెట్టారు. ఈ సంఘటనను చూస్తున్నవాళ్ళు తమ వస్త్రాల్ని “సౌలు” అనబడే ఒక యువకుని కాళ్ళ ముందు వుంచారు. వాళ్ళు రాళ్ళు విసరుతుండగా స్తెఫను, “యేసు ప్రభూ! నా ఆత్మను నీలో చేర్చుకో!” అని ప్రార్థించాడు. ఆ తదుపరి మోకరిల్లి, “ప్రభూ! వాళ్ళపై ఈ పాపం మోపవద్దు!” అని బిగ్గరగా అన్నాడు. ఈ మాట అన్న వెంటనే కళ్ళు మూసాడు.

అపొస్తలుల కార్యములు 7:44-60 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

అతడు చూచిన మాదిరిచొప్పున దాని చేయవలెనని మోషేతో చెప్పినవాడు ఆజ్ఞాపించిన ప్రకారము, సాక్ష్యపుగుడారము అరణ్యములో మన పితరులయొద్ద ఉండెను. మన పితరులు తమ పెద్దలచేత దానిని తీసికొనినవారై, దేవుడు తమ యెదుటనుండి వెళ్లగొట్టిన జనములను వారు స్వాధీనపరచుకొన్నప్పుడు, యెహోషువతోకూడ ఈ దేశములోనికి దానిని తీసికొనివచ్చిరి. అది దావీదు దినములవరకు ఉండెను. అతడు దేవుని దయపొంది యాకోబుయొక్క దేవుని నివాసస్థలము కట్టగోరెను. అయితే సొలొమోను ఆయనకొరకు మందిరముకట్టించెను. అయినను –ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము మీరు నాకొరకు ఏలాటి మందిరము కట్టుదురు? నా విశ్రాంతి స్థలమేది? ఇవన్నియు నా హస్తకృతములు కావా? అని ప్రభువు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్త కృతాలయములలో నివసింపడు. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లనివారలారా, మీపితరులవలె మీరును ఎల్లప్పుడు పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. మీపితరులు ప్రవక్తలలో ఎవనిని హింసింపక యుండిరి? ఆ నీతిమంతుని రాకనుగూర్చి ముందు తెలిపినవారిని చంపిరి. ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసినవారైతిరి. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరిగాని దానిని గైకొనలేదని చెప్పెను. వారీ మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లుకొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడై ఆకాశమువైపు తేరిచూచి, దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి యుండుటను చూచి –ఆకాశము తెరవబడుటయు, మనుష్యకుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి యుండుటయు చూచుచున్నానని చెప్పెను. అప్పుడు వారు పెద్ద కేకలువేసి చెవులు మూసికొని యేకముగా అతనిమీదపడి పట్టణపు వెలుపలికి అతనిని వెళ్లగొట్టి, రాళ్లు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యౌవనుని పాదములయొద్ద తమ వస్త్రములుపెట్టిరి. ప్రభువునుగూర్చి మొరపెట్టుచు–యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనుమని స్తెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్లూని – ప్రభువా, వారిమీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను; ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను.

అపొస్తలుల కార్యములు 7:44-60 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

“దేవుడు మోషేకు చూపించిన నమూనా ప్రకారం, దేవుని సన్నిధి కలిగిన సాక్షి గుడారం అరణ్యంలో మన పితరుల దగ్గర ఉన్నది. ఆ గుడారాన్ని పొందుకొన్న తర్వాత, మన పితరులు యెహోషువ నాయకత్వంతో దేవుడు తమ ముందు నుండి వెళ్లగొట్టిన జనాలను నుండి స్వాధీనపరచుకున్న దేశంలోనికి తమతో పాటు దానిని తెచ్చారు. ఆ గుడారం దావీదు కాలం వరకు ఆ దేశంలోనే ఉన్నది. దావీదు దేవుని దయను అనుభవించినవాడై, యాకోబు దేవుని కోసం నివాస స్థలాన్ని ఏర్పాటుచేస్తానని దేవున్ని అడిగాడు. కానీ ఆయన కోసం నివాస స్థలాన్ని సొలొమోను కట్టించాడు. “అయినా, మానవుల చేతులతో నిర్మించే ఆలయాలలో సర్వోన్నతుడు నివసించడు. దాని గురించి ప్రవక్తలు ఈ విధంగా చెప్పారు: “ ‘ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం. మీరు నా కోసం ఎలాంటి నివాస స్థలాన్ని కడతారు? అని దేవుడు అంటున్నారు నా విశ్రాంతి స్థలం ఏది? వీటన్నిటిని చేసింది నా చేయి కాదా?’ “మెడవంచని ప్రజలారా! మీ హృదయాలు మీ చెవులు ఇంకా సున్నతి పొందనివిగా ఉన్నాయి. మీరు మీ పితరుల వలె ఎప్పుడు పరిశుద్ధాత్మను వ్యతిరేకిస్తున్నారు. మీ పితరులు హింసించని ప్రవక్త ఒకడైనా ఉన్నాడా? ఆ నీతిమంతుని రాకను ముందుగానే ప్రవచించిన వారందరిని చంపేశారు. ఇప్పుడు మీరు అతన్ని అప్పగించి హత్య చేశారు. దేవదూతల ద్వారా చేయించిన ధర్మశాస్త్రాన్ని మీరు పొందుకున్నారు కాని దానికి లోబడలేదు” అన్నాడు. న్యాయసభ సభ్యులు ఈ మాటలు విన్నప్పుడు, చాలా కోపంతో స్తెఫెనును చూసి పండ్లు కొరికారు. కానీ స్తెఫెను పరిశుద్ధాత్మతో నింపబడి ఆకాశం వైపు తన తలనెత్తి దేవుని మహిమను, దేవుని కుడిచేతి వైపున యేసు నిలబడి ఉండడం చూశాడు. అతడు వారితో, “చూడండి! నేను పరలోకం తెరవబడి ఉండడం, మనుష్యకుమారుడు దేవుని కుడిచేతి వైపున నిలబడి ఉండడం నేను చూస్తున్నాను” అని చెప్పాడు. అందుకు వారందరు తమ చెవులను మూసుకొని పెద్దగా కేకలువేస్తూ, అతని మీద పడి, పట్టణం బయటకు అతన్ని ఈడ్చుకొని వెళ్లి, రాళ్లతో కొట్టడం మొదలుపెట్టారు. చూసే సాక్షులందరు తమ వస్త్రాలను సౌలు అనే యువకుని పాదాల దగ్గర పెట్టారు. వారు స్తెఫెనును రాళ్లతో కొడుతున్నప్పుడు అతడు, “యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకో” అని ప్రార్థించాడు. తర్వాత అతడు మోకరించి, “ప్రభువా, ఈ పాపాన్ని వీరి మీద మోపకు” అని మొరపెట్టాడు. ఈ మాటలు చెప్పిన తర్వాత, అతడు నిద్రించాడు.