మనం విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాం కాబట్టి మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మనం సమాధానాన్ని కలిగి ఉన్నాము. ఆయన ద్వారానే విశ్వాసం చేత ఇప్పుడు మనం నిలిచి ఉన్న కృపలోనికి రాగలిగాము. దేవుని మహిమను గురించిన నిరీక్షణలో మనం అతిశయిద్దాం. అంతేకాక, శ్రమలు ఓర్పును పుట్టిస్తాయని మనకు తెలుసు; కాబట్టి శ్రమలలో కూడా మనం ఆనందించగలము. ఓర్పు వలన గుణము, గుణము వలన నిరీక్షణ కలుగుతుంది. మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాల్లో క్రుమ్మరింపబడుతుంది, కాబట్టి నిరీక్షణ వలన మనకు ఎన్నడూ నిరాశ కలుగదు. మనం ఇంకను బలహీనులమై ఉన్నప్పుడే, సరియైన సమయంలో క్రీస్తు భక్తిహీనుల కోసం మరణించారు. ఒక మంచివాని కోసం ఎవరో ఒకరు చనిపోవడానికి సాహసం చేయవచ్చు, కాని ఒక నీతిమంతుని కోసం ఎవరైనా చనిపోవడం చాలా అరుదు. కాని మనం ఇంకా పాపులుగా ఉండగానే క్రీస్తు మన కోసం మరణించుట ద్వారా దేవునికి మన పట్ల ఉన్న తన ప్రేమను చూపించారు. ఇప్పుడైతే ఆయన రక్తం చేత నీతిమంతులంగా తీర్చబడిన మనం మరింత ఖచ్చితంగా ఆయన ద్వారా దేవుని ఉగ్రత నుండి రక్షించబడతాం! ఎందుకంటే, మనం దేవునికి శత్రువులమై ఉండగానే ఆయన కుమారుని మరణం ద్వారా మనం ఆయనతో తిరిగి సమాధానపరచబడితే ఆయన జీవం ద్వారా మరి అధికంగా రక్షించబడతాము. అంతే కాకుండా మనల్ని సమాధానపరచిన మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా ఇప్పుడు మనం దేవునిలో అతిశయిస్తున్నాము. ఒక్క మనుష్యుని ద్వారా ఈ లోకంలోనికి పాపం, పాపం ద్వారా మరణం ఎలా ప్రవేశించాయో, అలాగే అందరు పాపం చేశారు కాబట్టి మరణం ప్రజలందరికి వచ్చింది. ధర్మశాస్త్రం ఇవ్వబడక ముందే ఈ లోకంలో పాపం ఉంది కాని, ధర్మశాస్త్రం లేని సమయంలో ఎవరి మీద పాపం మోపబడలేదు. అయితే, ఆదాములా ఆజ్ఞను అతిక్రమించి పాపం చేయకపోయినప్పటికి, ఆదాము మొదలుకొని మోషే కాలం వరకు మరణం పరిపాలించింది. ఆదాము రాబోవుతున్న వానికి మాదిరిగా ఉన్నాడు. అయితే కృపావరమనేది అతిక్రమం వంటిది కాదు. ఒకవేళ ఒకని అతిక్రమాన్ని బట్టి అనేకమంది మరణిస్తే దేవుని కృప, యేసు క్రీస్తు అనే ఒక్క మనుష్యుని కృప చేత వచ్చిన కృపావరం అనేకమందికి విస్తరిస్తుంది కదా!
చదువండి రోమా పత్రిక 5
వినండి రోమా పత్రిక 5
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: రోమా పత్రిక 5:1-15
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్లైన్లో చదవండి, బోధన క్లిప్లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు