2 తిమోతి పత్రిక 2:14-26

2 తిమోతి పత్రిక 2:14-26 TSA

దేవుని ప్రజలకు ఈ విషయాలను జ్ఞాపకం చేస్తూ ఉండు. వినేవారిని నాశనం చేయడమే తప్ప ఏ విలువ లేని మాటల గురించి వాదించవద్దని దేవుని ఎదుట వారిని హెచ్చరించు. ఆమోదించబడినవానిగా, సిగ్గుపడనక్కరలేని పనివానిగా, సత్య వాక్యాన్ని సరిగా బోధించేవానిగా నిన్ను నీవు దేవునికి నిరూపించుకోవడానికి ప్రయాసపడు. దుష్టమైన కబుర్లకు దూరంగా ఉండు, ఎందుకంటే వాటిలో మునిగిపోయేవారు మరింత భక్తిహీనంగా మారతారు. వారి బోధలు కుళ్ళింపచేసే వ్యాధిలాంటివి. అలాంటివారిలో హుమెనేయు, ఫిలేతు అనేవారు ఉన్నారు. వారు సత్యానికి దూరమయ్యారు. పునరుత్థానం ముందే జరిగిపోయిందని చెప్తూ, కొందరి విశ్వాసాన్ని చెడగొడుతున్నారు. అయితే దేవుని యొక్క పునాది స్థిరంగా నిలిచి ఉండి, దానిపై ఈ విధంగా ముద్ర వేయబడి ఉంది: “తన వారు ఎవరో ప్రభువుకు తెలుసు, ప్రభువు నామాన్ని ఒప్పుకునే ప్రతివారు దుష్టత్వం నుండి తొలగిపోవాలి.” ఒక పెద్ద ఇంట్లో బంగారు, వెండి పాత్రలే కాకుండా కర్రవి మట్టివి కూడా ఉంటాయి; వాటిలో కొన్ని ప్రత్యేకమైన వాటికి ఉపయోగపడితే, మరికొన్ని సాధారణమైన పనులకు వాడబడతాయి. అదే విధంగా, తమను తాము శుద్ధి చేసుకునేవారు ప్రత్యేకమైన పాత్రలుగా పరిశుద్ధపరచబడి, యజమానికి ఉపయోగకరంగా ఉండి, మంచి పని కోసం సిద్ధపరచబడిన పాత్రలుగా వాడబడతారు. యవ్వనకాల ఆశల నుండి పారిపో, కపటం లేని హృదయంతో ప్రభువును వేడుకొనువారితో పాటు నీతి, విశ్వాసం, ప్రేమ, శాంతిని అనుసరించు. మూర్ఖపు అవివేకమైన వాదనలను విసర్జించు, ఎందుకంటే అవి గొడవలను పుట్టిస్తాయని నీకు తెలుసు. ప్రభువు సేవకుడు కొట్లాడేవానిగా ఉండకుండా అందరితో దయగలవానిగా ఉండాలి, బోధించగల సామర్థ్యం కలిగి ఉండాలి, కోపిష్ఠిగా ఉండకూడదు. దేవుడిచ్చిన తరుణంలో మారుమనస్సును పొంది సత్యాన్ని గ్రహిస్తారనే ఆశ కలిగి, తనను ఎదిరించేవారిని దీనత్వంతో సరిదిద్దాలి. అప్పుడు వారు తమ తప్పును తెలుసుకుని, తన ఇష్టాన్ని చేయడానికి వారిని చెరలోనికి తీసుకెళ్లిన సాతాను ఉచ్చులో నుండి తప్పించుకోగలరు.