సంఖ్యాకాండము 12:1-16

సంఖ్యాకాండము 12:1-16 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

మోషే కూషీయురాలిని పెళ్ళి చేసుకున్నందుకు, అతనికి వ్యతిరేకంగా మిర్యాము, అహరోనులు మాట్లాడడం ప్రారంభించారు, “యెహోవా కేవలం మోషే ద్వారానే మాట్లాడారా?” అని, “ఆయన మా ద్వారా కూడా మాట్లాడలేక?” అని అన్నారు. యెహోవా వారి మాటలు విన్నారు. మోషే చాలా దీనుడు, భూమి మీద ఉన్న మనుష్యులందరి కన్నా దీనుడు. వెంటనే యెహోవా మోషే, అహరోను మిర్యాములతో, “మీ ముగ్గురు, సమావేశ గుడారం దగ్గరకు రండి” అని చెప్పారు. కాబట్టి ముగ్గురు వెళ్లారు. అప్పుడు యెహోవా మేఘస్తంభంలో దిగి వచ్చారు; ఆయన గుడార ద్వారం దగ్గర నిలబడి అహరోను, మిర్యాములను పిలిచారు. ఆ ఇద్దరు ముందుకు వచ్చినప్పుడు, ఆయన, “నా మాటలు వినండి: “ఒకవేళ మీ మధ్య ప్రవక్త ఉంటే, యెహోవానైన నేను దర్శనాలలో వారికి ప్రత్యక్షమవుతాను, కలలలో నేను వారితో మాట్లాడతాను. అయితే నా సేవకుడైన మోషే విషయంలో ఇలా కాదు; అతడు నా ఇల్లంతటిలో నమ్మకస్థుడు. అతనితో నేను ముఖాముఖిగా మాట్లాడతాను, పొడుపుకథల్లా కాక స్పష్టంగా మాట్లాడతాను. అతడు యెహోవా రూపాన్ని చూస్తాడు. అలాంటప్పుడు మీరెందుకు భయపడకుండా నా సేవకుడైన మోషేకు వ్యతిరేకంగా మాట్లాడారు?” యెహోవా కోపం వారిపై రగులుకుంది, ఆయన వారిని విడిచి వెళ్లారు. మేఘం గుడారం నుండి పైకి వెళ్లిపోయాక, మిర్యాముకు కుష్ఠువ్యాధి వచ్చి చర్మం మంచులా తెల్లగా మారింది. అహరోను ఆమె వైపు చూసి, ఆమెకు కుష్ఠువ్యాధి వచ్చిందని గ్రహించి, అహరోను మోషేతో, “నా ప్రభువా, మేము తెలివితక్కువగా చేసిన పాపాన్ని మా మీదకు తేవద్దు. తల్లి గర్భంలో సగం మాంసం కుళ్ళిన శిశువులా ఆమెను కానివ్వకండి” అని అన్నాడు. కాబట్టి మోషే యెహోవాకు, “దేవా, దయచేసి ఈమెను స్వస్థపరచు!” అని మొరపెట్టాడు. అందుకు యెహోవా మోషేతో, “ఆమె తండ్రి ఆమె ముఖం మీద ఉమ్మివేస్తే, ఆమె ఏడు రోజులు అవమానంలో ఉండదా? ఆమెను శిబిరం బయట ఏడు రోజులు ఉంచు; ఆ తర్వాత ఆమెను వెనుకకు తీసుకురావచ్చు” అని జవాబిచ్చారు. కాబట్టి మిర్యాము శిబిరం బయట ఏడు రోజులు ఉన్నది, ఆమెను తిరిగి తీసుకువచ్చే వరకు ప్రజలు ముందుకు వెళ్లలేదు. ఆ పిమ్మట ప్రజలు హజేరోతు నుండి బయలుదేరి పారాను ఎడారిలో గుడారాలు వేసుకున్నారు.

సంఖ్యాకాండము 12:1-16 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

మోషే కూషు దేశానికి చెందిన ఒక స్త్రీని పెళ్ళి చేసుకున్నాడు. అందుకని మిర్యాము, అహరోనులు మోషేకి వ్యతిరేకంగా మాట్లాడారు. “యెహోవా కేవలం మోషేతోనే మాట్లాడాడా? మాతో ఆయన మాట్లాడలేదా?” అని చెప్పుకున్నారు. వాళ్ల మాటలు యెహోవా విన్నాడు. మోషే ఎంతో సాధుగుణం గలవాడు. భూమిపైన ఉన్నవారందరిలో ఎంతో సాత్వికుడు. వెంటనే యెహోవా మోషే, అహరోను, మిర్యాములతో మాట్లాడాడు. “మీరు ముగ్గురూ ఉన్న పళంగా సన్నిధి గుడారం దగ్గరకి రండి” అన్నాడు. ఆ ముగ్గురూ అక్కడికి వెళ్ళారు. అప్పుడు యెహోవా మేఘస్తంభంలో దిగి వచ్చాడు. గుడారం ద్వారం దగ్గర నుండి అహరోను, మిర్యాములను పిలిచాడు. వారిద్దరూ అక్కడికి వెళ్ళారు. యెహోవా ఇలా అన్నాడు. “మీరు ఇప్పుడు నా మాటలు వినండి. మీ మధ్య నా ప్రవక్త ఎవరన్నా ఉంటే, నేను అతనికి స్వప్నాల ద్వారా దర్శనం ఇస్తాను. కలల ద్వారా అతనితో మాట్లాడతాను. నా సేవకుడు మోషే అలాంటి వాడు కాదు. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైనవాడు. నేను అతనితో స్వప్నాల్లోనో, నిగూఢమైన రీతిలోనో మాట్లాడను. ముఖాముఖీగా మాట్లాడతాను. అతడు నా స్వరూపాన్ని చూస్తాడు. అలాంటప్పుడు నా సేవకుడైన మోషేకి వ్యతిరేకంగా మాట్లాడడానికి మీరెందుకు భయపడలేదు?” యెహోవా వారిపై తీవ్రంగా ఆగ్రహించి అక్కడనుండి వెళ్ళిపోయాడు. గుడారం పైనుండి మేఘం పైకి వెళ్ళిపోయింది. అప్పుడు అకస్మాత్తుగా మిర్యాముకు కుష్టు వ్యాధి సోకింది. ఆమె మంచులా తెల్లగా కన్పించింది. అహరోను ఆమెని చూశాడు. ఆమెకి కుష్టువ్యాధి ఉండడం చూశాడు. అప్పుడు అహరోను మోషేతో ఇలా అన్నాడు. “అయ్యో నా ప్రభూ, మేము చేసిన పాపానికి శిక్ష మాకు వేయవద్దు. మేము తెలివి తక్కువగా మాట్లాడి పాపం చేశాం. తన తల్లి గర్భంలోంచి బయటకి వచ్చేటప్పటికే సగం మాంసం పోగొట్టుకున్న మృతశిశువులా ఆమెని ఉండనీయకు.” కాబట్టి మోషే యెహోవాకు మొర పెట్టాడు. “దేవా, దయచేసి ఈమెను బాగు చెయ్యి” అని ప్రార్ధించాడు. అప్పుడు యెహోవా మోషేతో “ఆమె తండ్రి ఆమె ముఖంపై ఉమ్మి వేస్తే ఆ అవమానం ఆమె ఏడు రోజులు భరిస్తుంది కదా. ఆ ఏడు రోజులూ ఆమెని శిబిరం బయట ప్రత్యేకంగా ఉంచు. ఆ తరువాత ఆమెని తిరిగి శిబిరంలోకి తీసుకు రా” అన్నాడు. కాబట్టి మిర్యాము ఏడు రోజులు శిబిరం బయటే గడిపింది. మిర్యాము తిరిగి శిబిరంలోకి వచ్చే వరకూ ప్రయాణం చేయకుండా ప్రజలు నిలిచిపోయారు. ఆ తరువాత ప్రజలు హజేరోతు నుండి ప్రయాణం చేసి పారాను అరణ్యంలో ఆగారు.

సంఖ్యాకాండము 12:1-16 పవిత్ర బైబిల్ (TERV)

మిర్యాము, అహరోను మోషేకు వ్యతిరేకంగా మాట్లాడటం మొదలు పెట్టారు. అతని భార్య ఇథియోపియా స్త్రీ గనుక వారు అతణ్ణి విమర్శించారు. మోషే ఇథియోపియా ప్రజల్లోని స్త్రీని వివాహం చేసుకోవటం మంచిది కాదని వారు తలంచారు. “ప్రజలతో మాట్లాడటానికి యెహోవా మోషేను వాడుకొన్నాడు. కానీ మోషే ఒక్కడే ఉన్నాడా? మన ద్వారా కూడ యెహోవా మాట్లాడాడు కదా” అని వారు తమలో తాము అనుకొన్నారు. యెహోవా ఇది విన్నాడు. (మోషే చాలా దీనుడు. అతడు గొప్పలు చెప్పుకోలేదు, సణగ లేదు, భూమి మీద అందరికంటె అతడు దీనుడు.) కనుక యెహోవా అకస్మాత్తుగా మోషే, అహరోను, మిర్యాములతో మాట్లాడాడు. “మీరు ముగ్గురూ ఇప్పుడే సన్నిధి గుడారానికి రండి” అని చెప్పాడు. కనుక మోషే, అహరోను, మిర్యాము గుడారానికి వెళ్లారు. అప్పుడు యెహోవా ఒక మేఘంలో దిగివచ్చాడు. గుడార ప్రవేశం దగ్గర యెహోవా నిలబడ్డాడు. “అహరోను, మిర్యామును” తన దగ్గరకు రమ్మని పిల్చాడు యెహోవా. వాళ్లిద్దరూ ఆయనకు దగ్గరగా రాగానే దేవుడు అన్నాడు: “నా మాటలు వినండి, మీ మధ్యకు నేను ప్రవక్తలను పంపినప్పుడు, యెహోవానగు నేను వారికి దర్శనంలో కనబడతాను. కలలో నేనే వారితో మాట్లాడతాను. కానీ నా సేవకుడైన మోషే అట్టివాడు కాదు. అతడు నా ఇల్లంతటిలో నమ్మకస్థుడు. నేను అతనితో మాట్లాడినప్పుడు ముఖాముఖిగా నేను అతనితో మాట్లాడతాను. అతనితో నేను చెప్పాలనుకొనే విషయాలు వివరంగా నేను చెబుతాను. గూఢార్థపు పొడుపు కథలు నేను ప్రయోగించను. మోషే సాక్షాత్తు యెహోవా రూపాన్ని చూడవచ్చు. కనుక నా సేవకుడైన మోషేకు వ్యతిరేకంగా మీరెందుకు అంత ధైర్యంగా మాట్లాడారు?” అంతట యెహోవా వారిని విడిచి వెళ్లి పోయాడు. కానీ ఆయనకు వారిమీద చాలా కోపం వచ్చింది. యెహోవా మేఘం గుడారం మీదనుండి పైకి లేచి పోయింది. అప్పుడు అహరోను అటు తిరిగి మిర్యామును చూడగా, ఆమెకు భయంకర కుష్ఠురోగం రావటం అతనికి కనబడింది. ఆమె శరీరం మంచులా తెల్లగా ఉంది. అప్పుడు మోషేతో అహరోను అన్నాడు: “అయ్యా, బుద్ధిహీనంగా మేము పాపం చేసాము, మమ్మల్ని క్షమించు. చచ్చి పుట్టిన శిశువులా ఆమె తన శరీరాన్ని పోగొట్టుకోనియ్యకు.” (కొన్ని సార్లు అలాంటి శిశువు సగం శరీరం తినివేయబడి పుడుతుంది.) కనుక మోషే, “ఓ దేవా ఈ రోగంనుండి ఆమెను బాగుచేయి” అని యెహోవాకు మొరపెట్టాడు. “ఆమె తండ్రి ఆమె ముఖం మీద ఉమ్మి వేస్తే ఆమెకు ఏడు రోజులు అవమానం కలుగుతుంది. కనుక ఆమెను ఏడురోజులు పాళెమునకు బయట ఉంచండి. ఆ తర్వాత ఆమె తిరిగి లోనికి రావచ్చు” అని యెహోవా జవాబిచ్చాడు. కనుక మిర్యాము ఏడు రోజులపాటు పాళెమునకు వెలుపల ఉంచబడింది. ఆమె మరల లోనికి తీసుకొని రాబడేంతవరకు ప్రజలు అక్కడనుండి కదలలేదు. అది జరిగిన తర్వాత ప్రజలు హజేరోతు విడిచి పారాను అరణ్యానికి ప్రయాణం చేసారు. ప్రజలు ఆ అరణ్యంలో గుడారాలు వేసుకొన్నారు.

సంఖ్యాకాండము 12:1-16 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

మోషే కూషుదేశపు స్త్రీని పెండ్లి చేసికొని యుండెను గనుక అతడు పెండ్లిచేసికొనిన ఆ స్త్రీనిబట్టి మిర్యాము అహరోనులు అతనికి విరోధముగా మాటలాడిరి. వారు–మోషేచేత మాత్రమే యెహోవా పలి కించెనా? ఆయన మా చేతను పలికింపలేదా? అని చెప్పు కొనగా యెహోవా ఆ మాటవినెను. మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. యెహోవా –మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారమునకు రండని హఠాత్తుగా మోషే అహరోను మిర్యాములకు ఆజ్ఞనిచ్చెను. ఆ ముగ్గురు రాగా యెహోవా మేఘస్తంభములో దిగి ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్ద నిలిచి అహరోను మిర్యాములను పిలిచెను. వారిద్దరు రాగా ఆయన –నా మాటలు వినుడి; మీలో ప్రవక్త యుండినయెడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలిసి కొనునట్లు కలలో అతనితో మాటలాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడుకాడు. అతడు నా యిల్లంతటిలో నమ్మకమైనవాడు. నేను గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాటలాడుదును; అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాటలాడుటకు మీరేల భయపడలేదనెను. యెహోవా కోపము వారిమీద రగులుకొనగా ఆయన వెళ్లిపోయెను. మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారముమీదనుండి ఎత్తబడెను; అప్పుడు మిర్యాము హిమమువంటి తెల్లని కుష్ఠు గలదాయెను; అహరోను మిర్యామువైపు చూచినప్పుడు ఆమె కుష్ఠుగలదిగా కనబడెను. అహరోను–అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము; పాపులమైన మేము చేసిన యీ పాపమును మామీద మోపవద్దు. తన తల్లి గర్భములోనుండి పుట్టినప్పటికే సగముమాంసము క్షీణించిన శిశు శవమువలె ఆమెను ఉండనియ్యకుమని మోషేతో చెప్పగా మోషే యెలుగెత్తి–దేవా, దయచేసి యీమెను బాగుచేయుమని యెహోవాకు మొఱపెట్టెను. అప్పుడు యెహోవా మోషేతో ఆమె తండ్రి ఆమె ముఖముమీద ఉమ్మివేసినయెడల ఆమె యేడు దినములు సిగ్గు పడునుగదా; ఆమె పాళెము వెలుపల ఏడు దినములు ప్రత్యేకముగా ఉండవలెను. తరువాత ఆమెను చేర్చు కొనవలెను. కాబట్టి మిర్యాము ఏడు దినములు పాళెము వెలుపలనే గడిపెను. మిర్యాము మరల చేర్చబడువరకు జనులు ముందుకు సాగరైరి. తరువాత జనులు హజేరోతు నుండి సాగి పారాను అరణ్యములో దిగిరి.