మార్కు 12:13-27
మార్కు 12:13-27 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
తర్వాత వారు యేసును ఆయన మాటల్లోనే పట్టించాలని కొంతమంది పరిసయ్యులను హేరోదీయులను ఆయన దగ్గరకు పంపారు. వారు యేసు దగ్గరకు వచ్చి, “బోధకుడా, నీవు యథార్థవంతుడవని మాకు తెలుసు. ఎవరు అనేదానిపై నీవు దృష్టి పెట్టవు కాబట్టి ఇతరులచే నీవు ప్రభావితం కావు; కాని సత్యానికి అనుగుణంగా దేవుని మార్గాన్ని బోధిస్తావని మాకు తెలుసు. అయితే కైసరుకు పన్ను చెల్లించడం న్యాయమా కాదా?” మేము పన్ను కట్టాలా దగ్గరా? అని అడిగారు. అయితే యేసు వారి వేషధారణ తెలిసినవాడై, “మీరు ఎందుకు నన్ను చిక్కున పెట్టాలని ప్రయత్నిస్తున్నారు? నా దగ్గరకు ఒక దేనారం తీసుకురండి, నేను దాన్ని చూస్తాను” అన్నారు. వారు ఒక నాణెం తెచ్చారు, ఆయన వారిని, “దీనిపై ఉన్న బొమ్మ ఎవరిది? ఈ వ్రాయబడిన ముద్ర ఎవరిది?” అని అడిగారు. వారు, “కైసరువి” అన్నారు. అప్పుడు యేసు, “కైసరువి కైసరుకు, దేవునివి దేవునికి చెల్లించండి” అని వారితో చెప్పారు. ఆయన జవాబుకు వారు చాలా ఆశ్చర్యపడ్డారు. అప్పుడు పునరుత్థానం లేదని చెప్పే సద్దూకయ్యులు ఆయన దగ్గరకు ఒక ప్రశ్నతో వచ్చారు. “బోధకుడా, పెళ్ళి చేసుకున్న ఒక వ్యక్తి సంతానం లేకుండా చనిపోతే, వాని సోదరుడు ఆ విధవరాలిని పెళ్ళి చేసికొని చనిపోయిన తన సోదరునికి సంతానం కలిగించాలని మోషే మాకోసం వ్రాశాడు. అయితే ఒక కుటుంబంలో ఏడుగురు సోదరులు ఉన్నారు. మొదటివాడు పెళ్ళి చేసుకుని సంతానం లేకుండానే చనిపోయాడు. కాబట్టి రెండవవాడు ఆమెను పెళ్ళి చేసుకున్నాడు, కాని వాడు కూడా సంతానం లేకుండానే చనిపోయాడు. అలాగే మూడవ వానికి కూడా జరిగింది. వాస్తవానికి, ఆ ఏడుగురు కూడా సంతానం లేకుండానే చనిపోయారు. చివరికి, ఆ స్త్రీ కూడా చనిపోయింది. ఆమెను ఏడుగురు పెళ్ళి చేసుకున్నారు కాబట్టి పునరుత్థానంలో ఆమె ఎవరికి భార్యగా ఉంటుంది?” అని అడిగారు. అందుకు యేసు, “మీకు వాక్యం కాని దేవుని శక్తిని కాని తెలియదు కాబట్టి మీరు పొరపాటు చేయట్లేదా? చనిపోయినవారు తిరిగి బ్రతికిన తర్వాత వారు పెళ్ళి చేసుకోరు, పెళ్ళికివ్వబడరు; వారు పరలోకంలో దూతల్లా ఉంటారు. మృతులు తిరిగి లేచే విషయం మోషే వ్రాసిన గ్రంథంలో, మండుతున్న పొద సంఘటనలో దేవుడు మోషేతో మాట్లాడుతూ, ‘నేను అబ్రాహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడను’ అని చెప్పడం మీరు చదువలేదా? ఆయన మృతులకు దేవుడు కాడు, సజీవులకే దేవుడు. మీరు ఘోరంగా పొరబడుతున్నారు” అన్నారు.
మార్కు 12:13-27 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యేసును ఆయన మాటల్లోనే పట్టుకోవాలని వారు పరిసయ్యుల, హేరోదీయుల అనుచరులు కొందరిని ఆయన దగ్గరికి పంపారు. వారు వచ్చి ఇలా అన్నారు, “బోధకా! నీవు నిజం మాట్లాడేవాడివని మాకు తెలుసు. ఎవరినీ లెక్కచేయవని మాకు తెలుసు. నీవు మనుషులను పక్షపాతంతో చూడకుండా, సత్యమార్గాన్ని ఉన్నది ఉన్నట్టు బోధిస్తావు. సీజరు చక్రవర్తికి పన్నులు కట్టడం న్యాయమా కాదా? మనం పన్నులు కట్టాలా? మానాలా?” అని అడిగారు. అయితే యేసుకు వారి కుయుక్తి తెలిసి వారితో, “నన్నెందుకు పరీక్షిస్తున్నారు? ఒక దేనారం తీసుకు రండి” అన్నాడు. వారు ఒక నాణాన్ని తీసుకు వచ్చారు. “దీని మీద ఎవరి బొమ్మ ఉంది? ఎవరి శాసనం ఉంది?” అని ఆయన అడిగాడు. వారాయనతో, “సీజరుది” అన్నారు. అప్పుడు యేసు వారితో, “సీజరుకు చెందింది సీజరుకు ఇవ్వండి, దేవునికి చెందింది దేవునికి ఇవ్వండి” అన్నాడు. ఆయన సమాధానం విని వాళ్ళు ఆశ్చర్యపోయారు. అప్పుడు చనిపోయిన వారు తిరిగి బతకరు అని బోధించే సద్దూకయ్యులు కొందరు ఆయన దగ్గరికి వచ్చి ఆయనకు ఒక ప్రశ్న వేశారు. “బోధకా, ఒకడి సోదరుడు చనిపోతే, ఆ చనిపోయిన సోదరుని భార్యను అతడి సోదరుడు పెళ్ళి చేసుకుని, చనిపోయిన సోదరునికి సంతానం కలిగేలా చెయ్యాలని మోషే మనకోసం ధర్మశాస్త్రంలో రాశాడు. ఏడుగురు అన్నదమ్ములున్నారు. మొదటి వాడు ఒక స్త్రీని పెళ్ళి చేసుకుని సంతానం లేకుండా చనిపోయాడు. రెండవవాడు ఆమెను పెళ్ళిచేసుకున్నాడు. అతడు కూడా సంతానం లేకుండా చనిపోయాడు. మూడవ వాడికి కూడా అలాగే జరిగింది. ఆ ఏడుగురూ ఆమెను పెళ్ళిచేసుకుని సంతానం లేకుండా చనిపోయారు. చివరికి ఆ స్త్రీ కూడా చనిపోయింది. చనిపోయిన వారు తిరిగి బ్రతికినపుడు ఆమె ఎవరి భార్యగా ఉంటుంది? ఆమెను ఆ ఏడుగురూ పెళ్ళి చేసుకున్నారు కదా!” అని అడిగారు. యేసు వారికి జవాబిస్తూ, “మీకు లేఖనాలు, దేవుని శక్తి తెలియవు గనుక పొరబడుతున్నారు. చనిపోయిన వారు తిరిగి బ్రతికిన తరువాత వివాహం చేసుకోరు. వారు పరలోకంలో ఉన్న దేవదూతల్లా ఉంటారు. ఇక చనిపోయిన వారు బ్రతకడం విషయమైతే, మోషే తాను రాసిన గ్రంథంలో ‘పొదను గురించిన భాగం’ రాసినప్పుడు దేవుడతనితో, ‘నేను అబ్రాహాముకు దేవుణ్ణి, ఇస్సాకుకు దేవుణ్ణి, యాకోబుకు దేవుణ్ణి’ అని అతనితో చెప్పాడు. తాను వారికి దేవుణ్ణి అని అన్నప్పుడు ఆయన చనిపోయిన వారి దేవుడు కాదు, బ్రతికి ఉన్నవారికి మాత్రమే దేవుడు. మీరు చాలా పొరబడుతున్నారు” అన్నాడు.
మార్కు 12:13-27 పవిత్ర బైబిల్ (TERV)
ఆ తర్వాత యేసును ఆయన మాటల్లో పట్టేయాలని కొంతమంది పరిసయ్యుల్ని హేరోదు రాజు పక్షముననున్న వాళ్ళను ఆయన దగ్గరకు పంపారు. వాళ్ళు ఆయన దగ్గరకు వచ్చి, “అయ్యా! మీరు సత్యవంతులని మాకు తెలుసు. మీరు మానవుల మాటలకు లొంగిపోరు. వాళ్ళెవరనే విషయం మీకు అవసరం లేదు. సత్యమార్గాన్ని మీరు ఉన్నది ఉన్నట్లు బోధిస్తారు. మరి చక్రవర్తికి పన్నులు కట్టటం న్యాయమా? కాదా? మేము పన్నులు కట్టాలా మానాలా?” అని అడిగారు. యేసుకు వాళ్ళ కుట్ర తెలిసి పోయింది. “నన్నెందుకు మోసం చేయాలని అనుకుంటున్నారు? ఒక దేనారా యివ్వండి. నన్ను దాన్ని చూడనివ్వండి” అని అన్నాడు. వాళ్ళు ఒక నాణాన్ని తీసుకు వచ్చారు. యేసు, “దీని మీద ఎవరి బొమ్మ ఉంది? ఎవరి శాసనం ఉంది?” అని అడిగాడు. “చక్రవర్తిది” అని వాళ్ళు సమాధానం చెప్పారు. అప్పుడు యేసు వారితో, “చక్రవర్తికి చెందింది చక్రవర్తికి యివ్వండి, దేవునికి చెందింది దేవునికి యివ్వండి” అని అన్నాడు. ఆయన సమాధానం విని వాళ్ళు ఆశ్చర్యపొయ్యారు. చనిపోయిన వాళ్ళు మళ్ళీ బ్రతకరని వాదించే సద్దూకయ్యులు ఆయన దగ్గరకు వచ్చి ఒక ప్రశ్న వేసారు. “అయ్యా, ఒకని సోదరుడు చనిపోతే, ఆ చనిపోయిన సోదరునికి సంతానం లేకపోయినట్టయితే, ఆ చనిపోయిన సోదరుని భార్యను బ్రతికివున్న సోదరుడు వివాహమాడి, చనిపోయిన సోదరునికి సంతానం కలిగేటట్లు చెయ్యాలని మోషే మనకోసం ధర్మశాస్త్రంలో వ్రాసాడు. ఒకప్పుడు ఏడుగురు సోదరులుండే వాళ్ళు. మొదటివాడు వివాహం చేసుకొని సంతానం లేకుండా చనిపొయ్యాడు. రెండవ వాడు అతని వితంతువును వివాహమాడాడు. కాని అతడు కూడా సంతానం లేకుండా చనిపొయ్యాడు. మూడవ వానికి కూడా అదే సంభవించింది. ఆ ఏడుగురిలో ఎవ్వరికి సంతానం కలగలేదు. చివరకు ఆ స్త్రీకూడా చనిపోయింది. చనిపోయిన వాళ్ళు బ్రతికి వచ్చినప్పుడు ఆమె ఎవరి భార్యగా పరిగణింపబడుతుంది? ఆమెను ఆ ఏడగురు పెండ్లి చేసుకొన్నారు కదా?” అని అడిగారు. యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “మీకు లేఖనాలు, దేవుని శక్తి తెలియవు. కనుక పొరబడుతున్నారు. చనిపోయిన వాళ్ళు బ్రతికివచ్చాక వివాహం చేసుకోరు. వాళ్ళు ఆడ, మగ అని ఉండరు. వాళ్ళు పరలోకంలో ఉన్న దేవదూతల్లా ఉంటారు. ఇక చనిపోయిన వాళ్ళు బ్రతకటం విషయంలో మోషే తాను వ్రాసిన గ్రంథంలో ‘పొదను’ గురించి వ్రాసినప్పుడు, దేవుడు అతనితో ‘నేను అబ్రాహాముకు దేవుణ్ణి, ఇస్సాక్కు దేవుణ్ణి, యాకోబుకు దేవుణ్ణి’ అని అతనితో చెప్పాడు. ‘నేను వాళ్ళ దేవుణ్ణి’ అని ఆయన అన్నప్పుడు, వాళ్ళు నిజంగా చనిపోలేదన్న మాట. అంటే ఆయన బ్రతికివున్న వాళ్ళకు మాత్రమే దేవుడు. మీరు చాలా పొరబడుతున్నారు.”
మార్కు 12:13-27 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
వారు మాటలలో ఆయనను చిక్కుపరచవలెనని, పరిసయ్యులను హేరోదీయులను కొందరిని ఆయన యొద్దకు పంపిరి. వారు వచ్చి–బోధకుడా, నీవు సత్యవంతుడవు; నీవు ఎవనిని లక్ష్యపెట్టనివాడవని మే మెరుగుదుము; నీవు మోమోటములేనివాడవై దేవుని మార్గము సత్యముగా బోధించువాడవు. కైసరుకు పన్ని చ్చుట న్యాయమా కాదా? ఇచ్చెదమా ఇయ్యకుందుమా? అని ఆయన నడిగిరి. ఆయన వారి వేషధారణను ఎరిగి–మీరు నన్ను ఎందుకు శోధించుచున్నారు? ఒక దేనారము నా యొద్దకు తెచ్చి చూపుడని వారితో చెప్పెను. వారు తెచ్చిరి, ఆయన–ఈ రూపమును, పై వ్రాతయు, ఎవరివని వారి నడుగగా వారు–కైసరువి అనిరి. అందుకు యేసు – కైసరువి కైసరునకును దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పగా వారాయననుగూర్చి బహుగా ఆశ్చర్యపడిరి. పునరుత్థానము లేదని చెప్పెడి సద్దూకయ్యులు ఆయన యొద్దకువచ్చి –బోధకుడా, తనభార్య బ్రదికియుండగా ఒకడు పిల్లలు లేక చనిపోయినయెడల వాని సహోదరుడు వాని భార్యను పెండ్లిచేసికొని తన సహోదరునికి సంతానము కలుగజేయవలెనని మోషే మాకు వ్రాసియిచ్చెను. ఏడుగురు సహోదరులుండిరి. మొదటివాడు ఒక స్త్రీని పెండ్లిచేసికొని సంతానములేక చనిపోయెను గనుక రెండవవాడు ఆమెను పెండ్లి చేసికొనెను,వాడును సంతానము లేక చనిపోయెను; అటువలెనే మూడవవాడును చనిపోయెను. ఇట్లు ఏడుగురును సంతానములేకయే చనిపోయిరి. అందరివెనుక ఆ స్ర్తీ యు చనిపోయెను. పునరుత్థానమందు వారిలో ఎవనికి ఆమె భార్యగా ఉండును? ఆమె ఆ యేడుగురికిని భార్య ఆయెను గదా అని అడిగిరి. అందుకు యేసు–మీరు లేఖనములనుగాని దేవుని శక్తినిగాని యెరుగక పోవుటవలననే పొరబడుచున్నారు. వారు మృతులలోనుండి లేచునప్పుడు పెండ్లిచేసికొనరు, పెండ్లికియ్యబడరు గాని పరలోకమందున్న దూతలవలె నుందురు. వారు లేచెదరని మృతులనుగూర్చిన సంగతి మోషే గ్రంథమందలి పొదను గురించిన భాగములో మీరు చదువలేదా? ఆ భాగములో దేవుడు–నేను అబ్రాహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడనని అతనితో చెప్పెను. ఆయన సజీవుల దేవుడు గాని మృతుల దేవుడు కాడు. కావున మీరు బహుగా పొరబడు చున్నారని వారితో చెప్పెను.
మార్కు 12:13-27 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
తర్వాత వారు యేసును ఆయన మాటల్లోనే పట్టించాలని కొంతమంది పరిసయ్యులను హేరోదీయులను ఆయన దగ్గరకు పంపారు. వారు యేసు దగ్గరకు వచ్చి, “బోధకుడా, నీవు యథార్థవంతుడవని మాకు తెలుసు. ఎవరు అనేదానిపై నీవు దృష్టి పెట్టవు కాబట్టి ఇతరులచే నీవు ప్రభావితం కావు; కాని సత్యానికి అనుగుణంగా దేవుని మార్గాన్ని బోధిస్తావని మాకు తెలుసు. అయితే కైసరుకు పన్ను చెల్లించడం న్యాయమా కాదా?” మేము పన్ను కట్టాలా దగ్గరా? అని అడిగారు. అయితే యేసు వారి వేషధారణ తెలిసినవాడై, “మీరు ఎందుకు నన్ను చిక్కున పెట్టాలని ప్రయత్నిస్తున్నారు? నా దగ్గరకు ఒక దేనారం తీసుకురండి, నేను దాన్ని చూస్తాను” అన్నారు. వారు ఒక నాణెం తెచ్చారు, ఆయన వారిని, “దీనిపై ఉన్న బొమ్మ ఎవరిది? ఈ వ్రాయబడిన ముద్ర ఎవరిది?” అని అడిగారు. వారు, “కైసరువి” అన్నారు. అప్పుడు యేసు, “కైసరువి కైసరుకు, దేవునివి దేవునికి చెల్లించండి” అని వారితో చెప్పారు. ఆయన జవాబుకు వారు చాలా ఆశ్చర్యపడ్డారు. అప్పుడు పునరుత్థానం లేదని చెప్పే సద్దూకయ్యులు ఆయన దగ్గరకు ఒక ప్రశ్నతో వచ్చారు. “బోధకుడా, పెళ్ళి చేసుకున్న ఒక వ్యక్తి సంతానం లేకుండా చనిపోతే, వాని సోదరుడు ఆ విధవరాలిని పెళ్ళి చేసికొని చనిపోయిన తన సోదరునికి సంతానం కలిగించాలని మోషే మాకోసం వ్రాశాడు. అయితే ఒక కుటుంబంలో ఏడుగురు సోదరులు ఉన్నారు. మొదటివాడు పెళ్ళి చేసుకుని సంతానం లేకుండానే చనిపోయాడు. కాబట్టి రెండవవాడు ఆమెను పెళ్ళి చేసుకున్నాడు, కాని వాడు కూడా సంతానం లేకుండానే చనిపోయాడు. అలాగే మూడవ వానికి కూడా జరిగింది. వాస్తవానికి, ఆ ఏడుగురు కూడా సంతానం లేకుండానే చనిపోయారు. చివరికి, ఆ స్త్రీ కూడా చనిపోయింది. ఆమెను ఏడుగురు పెళ్ళి చేసుకున్నారు కాబట్టి పునరుత్థానంలో ఆమె ఎవరికి భార్యగా ఉంటుంది?” అని అడిగారు. అందుకు యేసు, “మీకు వాక్యం కాని దేవుని శక్తిని కాని తెలియదు కాబట్టి మీరు పొరపాటు చేయట్లేదా? చనిపోయినవారు తిరిగి బ్రతికిన తర్వాత వారు పెళ్ళి చేసుకోరు, పెళ్ళికివ్వబడరు; వారు పరలోకంలో దూతల్లా ఉంటారు. మృతులు తిరిగి లేచే విషయం మోషే వ్రాసిన గ్రంథంలో, మండుతున్న పొద సంఘటనలో దేవుడు మోషేతో మాట్లాడుతూ, ‘నేను అబ్రాహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడను’ అని చెప్పడం మీరు చదువలేదా? ఆయన మృతులకు దేవుడు కాడు, సజీవులకే దేవుడు. మీరు ఘోరంగా పొరబడుతున్నారు” అన్నారు.