అపొస్తలుల కార్యములు 27:1-44
అపొస్తలుల కార్యములు 27:1-44 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
మేము ఓడ ఎక్కి ఇటలీ దేశానికి వెళ్లాలని నిర్ణయించినప్పుడు, పౌలు మరికొందరు ఖైదీలను చక్రవర్తి ఔగుస్తు సైనిక దళానికి చెందిన యూలి అనే శతాధిపతికి అప్పగించారు. మేము అద్రముత్తియ పట్టణం నుండి ఆసియా తీరప్రాంత పట్టణాల గుండా ప్రయాణించే ఓడ ఎక్కి, ప్రయాణించేటప్పుడు మాసిదోనియలోని థెస్సలొనీక పట్టణానికి చెందిన అరిస్తర్కు అనేవాడు మాతో ఉన్నాడు. మరుసటిరోజు మేము సీదోను పట్టణ ప్రాంతంలో దిగాం; యూలి శతాధిపతి పౌలు పట్ల దయ చూపించి, అతడు తన స్నేహితుల దగ్గరకు వెళ్లి తనకు అవసరమైన వాటిని సమకూర్చుకోవడానికి అతన్ని అనుమతించాడు. అక్కడినుండి మేము మళ్ళీ బయలుదేరి ప్రయాణిస్తున్నప్పుడు, గాలి మాకు వ్యతిరేక దిశలో వీస్తున్నందుకు కుప్ర దీవి చాటుగా ఓడను నడిపించాము. మేము కిలికియ పంఫులియా సముద్రతీరాలను దాటి, లుకియాలోని మూర అనే పట్టణానికి చేరుకొన్నాము. అక్కడ ఆ శతాధిపతి ఇటలీ దేశానికి వెళ్తున్న అలెక్సంద్రియ పట్టణానికి చెందిన ఓడను చూసి దానిలోనికి మమ్మల్ని ఎక్కించాడు. చాలా రోజులు మెల్లగా ప్రయాణించిన తర్వాత ఎంతో కష్టపడి క్నీదు పట్టణం చేరుకున్నాము. గాలి బలంగా వీస్తూ మమ్మల్ని ముందుకు పోనివ్వక పోవడంతో, సల్మోనేకు ఎదురుగా ఉన్న క్రేతు ద్వీపం చాటున మేము ప్రయాణించాము. మేము తీరం వెంబడి చాలా కష్టపడి ప్రయాణం చేసి, లసైయ పట్టణానికి ప్రక్కనే ఉన్న, మంచి ఓడల రేవు అని పిలువబడే స్థలానికి వచ్చాము. చాలా కాలం గడిచిపోయింది, ప్రయాణం చేయడం ఇప్పటికే ప్రమాదకరంగా మారింది, అప్పటికి ప్రాయశ్చిత్త దినం కూడా గతించింది. కాబట్టి పౌలు వారిని, “సహోదరులారా, మన ప్రయాణం ప్రమాదకరంగా ఉండబోతుంది ఓడకు దానిలోని సరుకులకును గొప్ప నష్టంరాబోతుంది మన ప్రాణాలకు కూడా ఆపద కలుగుతుందని నాకు అనిపిస్తుంది” అని హెచ్చరించాడు. కానీ శతాధిపతి, పౌలు చెప్పిన మాటలను వినకుండా, ఆ ఓడ యజమాని, ఓడ నడిపే వారి సలహాలను పాటించాడు. శీతాకాలంలో ఆ ఓడరేవు అనుకూలమైనది కాదు, మనం ఫీనిక్సు ఓడరేవును చేరుకొని అక్కడ శీతాకాలం గడపవచ్చు కాబట్టి మనం ముందుకే వెళ్దాం అని ఎక్కువ మంది నిర్ణయించారు. అది క్రేతులోని నైరుతి వాయువ్య దిశలకు ఎదురుగా ఉన్న ఓడల రేవు. దక్షిణపు గాలి మెల్లగా వీయడం మొదలు పెట్టేటప్పటికి, వారికి అవకాశం ఉన్నట్లు అనిపించింది; కాబట్టి లంగరు పైకెత్తి క్రేతు తీరం వైపు ఓడను నడిపించారు. ఎక్కువసేపు అవ్వక ముందే, ఈశాన్యగాలి అని పిలువబడే, పెనుగాలి బలంగా వీయడంతో, ద్వీపం నుండి దూరంగా కొట్టుకొని పోయాము. ఓడ తుఫానులో చిక్కుకొని గాలికి ఎదురు నడిపించలేక మేము గాలికి కొట్టుకుపోయాము. కౌద అనే చిన్న ద్వీపం వైపు మేము వెళ్లినప్పుడు, చాలా కష్టంగా ఓడకు కట్టిన రక్షక పడవను కాపాడగలిగాము. వాటిని పైకెత్తి కట్టిన తర్వాత తాళ్ళను ఓడ అడుగు నుండి తీసి, రెండింటిని కలిపి గట్టిగా బిగించారు. తాము సూర్తి అనే ఇసుకదిబ్బలను గుద్దుకొంటామేమో అని భయపడి, ఓడ లంగరును క్రిందికి దించి, గాలితో ఓడ కొట్టుకొని పోయేలా చేశారు. తుఫాను గాలి భయంకరంగా కొడుతుంది కాబట్టి మరుసటిరోజు ఓడలోని సరుకులను సముద్రంలో పడవేయడం మొదలుపెట్టారు. మూడవ రోజు, వారు తమ చేతులతో ఓడను నడిపే సామాగ్రిని కూడా పడవేశారు. అనేక రోజులగా సూర్యుడు కాని నక్షత్రాలు కాని కనిపించలేదు. తుఫాను మరింత తీవ్రంగా మారింది. చివరికి మేము ప్రాణాలతో తప్పించుకుంటామనే ఆశ పూర్తిగా పోయింది. వారు ఆ విధంగా ఆహారం లేకుండా చాలా రోజులు గడిపిన తర్వాత, పౌలు వారి ముందు నిలబడి వారితో, “సహోదరులారా, నేను ఇచ్చిన సలహాను మీరు విని క్రేతు నుండి బయలుదేరకుండా ఉండవలసింది; అప్పుడు మీకు ఈ ప్రమాదం గాని నష్టం కాని జరుగకపోయేది. ఇప్పుడైనా మీరు ధైర్యం తెచ్చుకోండి, ఎందుకంటే మీలో ఎవరికి ప్రాణహాని కలుగదు; కేవలం ఓడ మాత్రమే పాడైపోతుంది. నేను ఎవరికి చెందిన వాడినో, నేను ఎవరిని సేవిస్తున్నానో ఆ దేవుని దూత నిన్న రాత్రి నా ప్రక్కన నిలబడి, ‘పౌలు భయపడకు. నీవు కైసరు ముందు విచారణకు నిలబడవలసి ఉంది. నీతో కూడ ఓడలో ప్రయాణం చేస్తున్న వారందరి జీవితాలను దేవుడు నీకు అనుగ్రహించాడు’ అని నాతో చెప్పాడు. అతడు నాకు చెప్పినట్లే జరుగుతుందని నాకు దేవునిలో విశ్వాసం ఉంది, కాబట్టి సహోదరులారా, మీరు ధైర్యం తెచ్చుకోండి. అయినప్పటికీ, మన ఓడ ఏదైనా ఒక ద్వీపం తగులుకోవాలి” అని చెప్పాడు. పద్నాలుగవ రోజు రాత్రి మేము ఇంకా అద్రియా సముద్రంలో కొట్టుకొనిపోతుండగా, ఇంచుమించు అర్థరాత్రి సమయంలో ఓడను నడిపేవారు ఒడ్డును సమీపిస్తున్నాం అని గ్రహించారు. వారు ఇనుప గుండు కట్టిన తాడు సముద్రంలో వేసి చూసి దానితో అక్కడ సుమారు నూట ఇరవై అడుగుల లోతుందని తెలుసుకున్నారు. మరికొద్ది సేపటికి సముద్రపు లోతును కనుగొనే దానిని మరలా వేసి తొంభై అడుగుల లోతుందని తెలుసుకొన్నారు. మేము రాతి దిబ్బలకు గుద్దుకొంటామేమో అనే భయంతో వారు నాలుగు లంగరులను ఓడ మూలలో నుండి క్రిందకు వేసి, పగటి వెలుగు కోసం ప్రార్థించాము. ఓడ నడిపేవారు ఓడలో నుండి పారిపోవాలని, తాము ఓడ ముందు భాగం నుండి కొన్ని లంగరులను పడవేయడానికి వెళ్తున్నట్లు నటిస్తూ రక్షక పడవను సముద్రంలోకి దింపారు. అప్పుడు పౌలు శతాధిపతితో, సైనికులతో, “ఈ మనుష్యులు ఓడలో ఉంటేనే తప్ప తమ ప్రాణాలను రక్షించుకోలేరు” అని చెప్పాడు. వెంటనే సైనికులు రక్షకపడవ దూరంగా కొట్టుకొని పోవడానికి దాని త్రాళ్లను కోసివేశారు. తెల్లవారుతునప్పుడు పౌలు వారందరిని ఆహారం తినమని వేడుకున్నాడు. “గత పద్నాలుగు రోజులనుండి ఏమి జరుగుతుందో అని మీరు ఏమి తినలేదు. మీరు బలహీనం కాకుండా దయచేసి భోజనం చేయండి, మీలో ఎవరి తల నుండి ఒక్క వెంట్రుక కూడా రాలదు” అని వారిని బ్రతిమాలాడు. అతడు ఈ మాటలను చెప్పిన తర్వాత, రొట్టెను తీసుకుని వారందరి ముందు దేవునికి కృతజ్ఞతలు చెల్లించి దానిని విరిచి తినడం ప్రారంభించాడు. అప్పుడు వారందరు ధైర్యం తెచ్చుకుని కొంత ఆహారం తిన్నారు. ఓడలో మొత్తం 276 మంది వ్యక్తులం ఉన్నాము. వారు తమకు కావలసినంత ఆహారం తిన్న తర్వాత, ఓడను తేలిక చేయడానికి ధాన్యాన్ని సముద్రంలో పడవేశారు. పగటి వెలుగు వచ్చినప్పుడు, వారు ఆ ప్రాంతాన్ని గుర్తించలేదు, కాని ఇసుకతీరం ఉన్న సముద్రపు పాయను చూసి, సాధ్యమైతే దానిలోనికి ఓడను నడిపించాలి అనుకున్నారు. త్రాళ్లను కోసి లంగరులను సముద్రంలో విడిచిపెట్టారు అదే సమయంలో చుక్కానులకు కట్టిన త్రాళ్లను విప్పేసారు. తర్వాత తెరచాపలను గాలికి ఎత్తి తీరం వైపునకు నడిపించారు. కాని రెండు ప్రవాహాలు కలిసిన చోట ఇసుకలో ఓడ ముందు భాగం కూరుకొనిపోయి కదల్లేదు. అలల తాకిడికి ఓడ వెనుక భాగం ముక్కలుగా విరిగి పోసాగింది. ఖైదీలు ఈదుకుని పారిపోకుండా వారిని చంపేయాలని సైనికులు అనుకున్నారు. కానీ శతాధిపతి పౌలు ప్రాణాన్ని కాపాడాలనుకొని సైనికులను తాము అనుకున్న దానిని చేయకుండా ఆపివేసి, ఈత వచ్చినవారు మొదట సముద్రంలోకి దూకి ఒడ్డుకు చేరుకోవాలని, మిగిలిన వారు చెక్కపలకల మీద లేదా ఓడ చెక్కల మీద ఒడ్డుకు చేరుకోవాలని ఆదేశించాడు. ఆ విధంగా వారందరు క్షేమంగా ఒడ్డుకు చేరుకొన్నారు.
అపొస్తలుల కార్యములు 27:1-44 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మేము ఓడలో ఇటలీ వెళ్ళాలని నిర్ణయమైంది. వారు పౌలునీ, మరికొందరు ఖైదీలనీ అగస్టస్ సైనిక దళంలోని శతాధిపతి అయిన జూలియస్ అనే అతనికి అప్పగించారు. ఆసియా తీరం పక్కగా ఉన్న పట్టణాల మీదుగా ప్రయాణించే అగస్టస్ సైనిక దళంలోని ఎక్కి మేము బయలుదేరాం. మాసిదోనియ లోని తెస్సలోనిక పట్టణం వాడైన అరిస్తార్కు మాతో కూడ ఉన్నాడు. మరునాడు సీదోను వచ్చాం. అప్పుడు జూలియస్ పౌలు మీద దయ చూపించి, అతడు తన స్నేహితుల దగ్గరికి వెళ్ళి పరిచర్యలు పొందడానికి అనుమతించాడు. అక్కడ నుండి బయలుదేరిన తరువాత ఎదురుగాలి కొట్టడం చేత సైప్రస్ దీవి చాటుగా ఓడ నడిపించాము. తరువాత కిలికియకు పంఫూలియకు ఎదురుగా ఉన్న సముద్రం దాటి లుకియ పట్టణమైన మురకు చేరాం. అక్కడ శతాధిపతి ఇటలీ వెళ్ళబోతున్న అలెగ్జాండ్రియ పట్టణపు ఓడను చూసి అందులో మమ్మల్ని ఎక్కించాడు. చాలా రోజుల పాటు మెల్లగా నడిచి, ఎంతో కష్టపడి క్నీదుకు ఎదురుగా వచ్చినప్పుడు గాలి మమ్మల్ని అడ్డగించడం చేత క్రేతు చాటుగా సల్మోనే తీరంలో ఓడ నడిపించాము. అతి కష్టంతో దాన్ని దాటి, ‘సురక్షిత ఆశ్రయాలు’ అనే స్థలానికి చేరాం. దాని పక్కనే లాసియ పట్టణం ఉంది. చాలా కాలం గడిచింది. చాలా కాలం గడిచింది కూడా అప్పటికి గడిచిపోయింది, ప్రయాణం చేయడం ప్రమాదకరంగా మారింది. అప్పుడు పౌలు, “సోదరులారా, ఈ ప్రయాణం వలన సరకులకు, ఓడకు మాత్రమే కాక మనకూ ప్రాణహానీ, తీవ్ర నష్టం కలగబోతున్నదని నాకనిపిస్తుంది” అని వారిని హెచ్చరించాడు. అయితే శతాధిపతి, పౌలు చెప్పింది కాక నావికుడు, ఓడ యజమాని చెప్పిందే నమ్మాడు. పైగా చలి కాలం గడపడానికి ఆ రేవు అనుకూలమైనది కాకపోవడం చేత అక్కడ నుండి బయలుదేరి వీలైతే ఫీనిక్సు చేరి అక్కడ చలికాలం గడపాలని ఎక్కువమంది ఆలోచన చెప్పారు. అది క్రేతులోని నైరుతి వాయువ్య దిక్కుల వైపు ఉన్న ఒక రేవు. అంతేగాక దక్షిణపు గాలి మెల్లగా విసరడంతో వారు తమ ఆలోచన సరైందని భావించి ఫీనిక్సు చేరి, క్రేతు తీరంలో ఓడను నడిపించారు. కొంచెం సేపటికి ఊరకులోను అనే పెనుగాలి క్రేతు మీద నుండి విసిరింది. ఓడ దానిలో చిక్కుకుపోయి గాలికి ఎదురు నడవలేక పోయింది. ఇక ఎదురు నడిపించడం మాని, గాలికి కొట్టుకుపోయాం. తరువాత కౌద అనే ఒక చిన్న ద్వీపం చాటుగా ఓడ నడిపించాం. బహు కష్టంగా ఓడకు కట్టిన పడవను కాపాడుకోగలిగాం. దాన్ని పైకెత్తి కట్టిన తరువాత తాళ్ళు మొదలైనవి తీసుకుని ఓడ చుట్టూ బిగించి కట్టారు. ఓడ సూర్తిస్ అనే ఇసుకతిప్పకు తగిలి పగిలిపోతుందేమో అని భయపడి, ఓడ చాపలు దింపివేసి, కొట్టుకుపోయారు. గాలి చాలా తీవ్రంగా కొట్టడం వలన ఆ మరునాడు సరుకులు పారవేయడం మొదలుపెట్టారు. మూడవ రోజున తమ చేతులారా ఓడ సామగ్రిని పారవేశారు. కొన్ని రోజులపాటు సూర్యుడుగానీ నక్షత్రాలుగానీ కనబడక పెద్దగాలి మా మీద కొట్టింది. మేము ప్రాణాలతో తప్పించుకుంటామనే ఆశ పూర్తిగా నశించిపోయింది. వారు చాలాకాలం పస్తులు ఉండగా పౌలు వారి మధ్య నిలబడి, “అయ్యలారా, మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరకుండానే ఉండవలసింది. అప్పుడీ హానీ, నష్టమూ కలగకపోయేది. ఇప్పుడైనా ధైర్యం తెచ్చుకోండి. ఓడకి మాత్రమే నష్టం కలుగుతుందిగానీ, మీలో ఎవరి ప్రాణానికీ హాని కలగదు. నేను ఎవరి వాడినో ఎవరిని సేవిస్తున్నానో ఆ దేవుని దూత గత రాత్రి నా పక్కన నిలబడి, ‘పౌలూ, భయపడకు. నీవు సీజరు ముందు నిలబడాల్సి ఉంది. ఇదిగో, నీతో కూడ ఓడలో ప్రయాణిస్తున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించాడు’ అని నాతో చెప్పాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి, నాతో దూత చెప్పిన ప్రకారం జరుగుతుందని నేను దేవుని నమ్ముతున్నాను. అయినప్పటికీ మనం కొట్టుకుపోయి ఏదైనా ఒక ద్వీపానికి తగులుకోవాలి” అని చెప్పాడు. పద్నాలుగవ రాత్రి మేము అద్రియ సముద్రంలో ఇటు అటు కొట్టుకు పోతుండగా అర్థరాత్రి వేళ ఓడ నావికులు ఏదో ఒక దేశం దగ్గర పడుతున్నదని ఊహించి ఇనుప గుండు కట్టిన తాడు వేసి చూసి సుమారు 120 అడుగుల లోతని తెలుసుకున్నారు. ఇంకా కొంతదూరం వెళ్ళిన తరువాత, మళ్ళీ గుండు వేసి చూసి 90 అడుగుల లోతని తెలుసుకున్నారు. అప్పుడు రాతి దిబ్బలకు కొట్టుకుంటామేమో అని భయపడి, వారు ఓడ అడుగు నుండి నాలుగు లంగరులు వేసి ఎప్పుడు తెల్లవారుతుందా అని కాచుకుని ఉన్నారు. అయితే ఓడవారు ఓడ విడిచి పారిపోవాలని ఆలోచించి, లంగరులు వేయబోతున్నట్లుగా నటించి సముద్రంలో పడవ దింపివేశారు. అందుకు పౌలు “వీరు ఓడలో ఉంటేనే గాని మీరు తప్పించుకోలేరు” అని శతాధిపతితో, సైనికులతో చెప్పాడు. వెంటనే సైనికులు పడవ తాళ్ళు కోసి దాని కొట్టుకు పోనిచ్చారు. తెల్లవారుతుండగా పౌలు, “పద్నాలుగు రోజుల నుండి మీరేమీ ఆహారం తీసుకోక పస్తులున్నారు. కాబట్టి ఆహారం పుచ్చుకోమని మిమ్మల్ని బతిమాలుతున్నాను. ఇది మీ ప్రాణరక్షణకు సహాయంగా ఉంటుంది. మీలో ఎవరి తలనుండీ ఒక్క వెంట్రుక కూడా నశించదు” అని చెప్పి ఆహారం తీసుకోమని అందరినీ బతిమాలాడు. ఈ మాటలు చెప్పి, ఒక రొట్టె పట్టుకుని అందరి ముందూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి తినసాగాడు. అప్పుడంతా ధైర్యం తెచ్చుకుని ఆహారం తీసుకున్నారు. ఓడలో ఉన్న మేమంతా రెండు వందల డెబ్భై ఆరుగురం. వారు తిని తృప్తి పొందిన తరువాత, గోదుమలను సముద్రంలో పారబోసి ఓడను తేలిక చేశారు. తెల్లవారిన తరవాత అది ఏ దేశమో వారు గుర్తు పట్టలేకపోయారు, కానీ తీరం గల ఒక సముద్రపు పాయను చూసి, సాధ్యమైతే ఓడను అందులోకి నడిపించాలని ఆలోచించారు. కాబట్టి వారు గుర్తు పట్టలేకపోయారు వాటిని సముద్రంలో విడిచి పెట్టి చుక్కానుల కట్లు విప్పి ముందటి తెరచాప గాలికెత్తి సరిగా ఒడ్డుకి నడిపించారు. కానీ ఓడ రెండు ప్రవాహాలు కలిసిన చోట చిక్కుకుపోయి ఇసుకలో ఇరుక్కుపోయింది. అందువల్ల ఓడ ముందు భాగం కూరుకుపోయి కదలలేదు. వెనక భాగం అలల దెబ్బకు బద్దలైపోతూ ఉంది. ఖైదీల్లో ఎవరూ ఈదుకుని పారిపోకుండేలా వారిని చంపాలనే ఆలోచన సైనికులకు కలిగింది గాని, శతాధిపతి పౌలుని రక్షించాలని కోరి వారి ఆలోచనకు అంగీకరించలేదు. ఈత వచ్చినవారు ముందు సముద్రంలో దూకి ఈదుకుంటూనూ, మిగిలినవారు ఓడ చెక్క పలకలు, ఇతర వస్తువుల సాయంతోనూ ఒడ్డుకు చేరాలని ఆజ్ఞాపించాడు. ఈ విధంగా అందరం తప్పించుకుని ఒడ్డుకు చేరాం.
అపొస్తలుల కార్యములు 27:1-44 పవిత్ర బైబిల్ (TERV)
మేము ఇటలీకి ఓడలో ప్రయాణం చేయాలని అధికారులు నిర్ణయించి పౌలును, ఇతర ఖైదీలను “యూలి” అనబడే శతాధిపతికి అప్పగించారు. ఇతడు చక్రవర్తి దళానికి చెందినవాడు. మేము ఆసియ తీరాలకు వెళ్ళటానికి సిద్ధమవుతున్న అద్రముత్తియ అనే ఓడనెక్కి ప్రయాణం అయ్యాము. మాసిదోనియ ప్రాంతంలోని థెస్సలొనీకకు చెందిన అరిస్తార్కు అనేవాడు మా వెంట ఉన్నాడు. మరునటి రోజు మేము సీదోను చేరుకున్నాము. యూలి, పౌలు తన స్నేహితుల్ని కలుసుకొని సహాయం పొందేటట్లు అతనికి అనుమతిచ్చి అతనిపై దయచూపాడు. అక్కడినుండి మళ్ళీ ఓడలో ప్రయాణం సాగించాము. ఎదురుగాలి వీస్తూ ఉంది. అందువల్ల కుప్రకు దక్షిణంగా గాలి వీచని నీళ్లలో ప్రయాణం సాగించాము. కిలికియ, పంఫూలియల దగ్గర ఉన్న సముద్రం మీద ప్రయాణం చేస్తూ “లుకియ” ప్రాంతంలో ఉన్న “మూర” అనే పట్టణాన్ని చేరుకున్నాము. మా వెంట ఉన్న శతాధిపతి ఇటలీకి వెళ్తున్న “అలెక్సంద్రియ” ఓడను చూసి, మమ్మల్ని ఆ ఓడలో ఎక్కించాడు. ఎదురు గాలి వీస్తూవుండటం వల్ల మా ప్రయాణం చాలా రోజుల వరకు మెల్లగా సాగింది. చాలా కష్టంగా “క్నిదు” తీరాన్ని చేరుకున్నాము. ఎదురు గాలి వల్ల ముందుకు వెళ్ళలేక పోయ్యాము. అందువల్ల దక్షిణంగా వెళ్ళి “క్రేతు” ద్వీపాన్ని అడ్డంగా పెట్టుకొని “సల్మోనే” తీరంగుండా ప్రయాణం సాగించాము. ఆ నీళ్లలో మా ప్రయాణం కష్టంగా సాగింది. ఏదో విధంగా “మంచి రేవులు” అనే స్థలాన్ని చేరుకున్నాము. ఈ తీరం లసైయ అనే పట్టణానికి దగ్గరగా ఉంది. అప్పటికే చాలా కాలం వృథా అయిపోయింది. కాని ప్రయాణం చెయ్యటం ప్రమాదకరమై పోయింది. ఉపవాస దినం చేసే దినం కూడా దాటి పోయింది. అందుకు పౌలు వాళ్ళను జాగ్రత్తపడమని చెబుతూ, “ప్రజలారా! ఈ ప్రయాణంలో మనకు కష్టాలు సంభవిస్తాయని నాకనిపిస్తూవుంది. ఓడను, సరుకును నష్టపోవటమే కాకుండా మన ప్రాణాలకు కూడా ప్రమాదం కలుగవచ్చు!” అని అన్నాడు. కాని ఆ శతాధిపతి పౌలు మాటలు వినక ఆ ఓడ యొక్క యజమాని మాటలు, నావికుని మాటలు విన్నాడు. వాళ్ళున్న రేవు చలి కాలంలో ఉండటానికి పనికిరాదు. కనుక అనేకులు ప్రయాణం సాగించమని సలహాయిచ్చారు. చలికాలం గడపటానికి “ఫీనిక్సు” అనే రేవు చేరగలమని అంతా ఆశించారు. ఈ ఫీనిక్సు రేవు క్రేతు ద్వీపంలో ఉంది. నైరుతి, వాయవ్య దిశలనుండి మాత్రమే ఆ రేవును ప్రవేశించటానికి వీలుంటుంది. దక్షిణ గాలి వీచగానే తమకు కావలసింది దొరికిందని వాళ్ళనుకున్నారు. లంగరు తీసి, ఓడను క్రేతు తీరం ప్రక్కగా నడుపుతూ ప్రయాణం సాగించారు. అంతలోనే, ఊరకులోను అనబడే తీవ్రమైన తుఫాను గాలి క్రేతు ద్వీపం మీదుగా వీచటం మొదలైంది. ఓడ ఆ తుఫానుగాలికి కొట్టుకొని పోయింది. ఎదురు గాలివల్ల మా ఓడ ముందుకు పోలేక పోయింది. మేమేమీ చెయ్యలేక పోయాము. గాలి వీచిన వైపు మా ఓడ కొట్టుకొని పోయింది. “కౌద” అనబడే చిన్న ద్వీపాన్ని అడ్డంగా పెట్టుకొని దాని ప్రక్కగా ప్రయాణం సాగించాము. ఓడకు కట్టబడిన పడవను చాలా కష్టంగా కాపాడగలిగాము. దానిని ఓడమీదకి ఎక్కించిన తర్వాత త్రాళ్ళు బిగించి ఓడను గట్టిగా కట్టారు. ఓడ “సూర్తిస్” ప్రాంతంలోని యిసుక తిప్పల మీదికి వెళ్తుందని భయపడ్డారు. కనుక తెరచాపలు దించి ఓడను గాలి వీచే వైపు పోనిచ్చారు. మరుసటి రోజు, తుఫానుగాలి తీవ్రంగా వీచటంవల్ల ఓడలోవున్న సరుకులు సముద్రంలో పడవేసారు. మూడవ రోజు ఓడలో ఉపయోగించే పనిముట్లను కూడా సముద్రంలో పడవేసారు. సూర్యుడు కాని, నక్షత్రాలు కాని చాలా రోజుల దాకా కనపడ లేదు. తుఫానుగాలి తీవ్రత తగ్గలేదు. మేము బ్రతుకుమీద ఆశ యిక పూర్తిగా వదులుకున్నాము. చాలా రోజులనుండి వాళ్ళు ఆహారం తినలేదు. పౌలు వాళ్ళ మధ్య నిలబడి, “నా సలహా పాటించి మీరు క్రేతునుండి ప్రయాణం చేయకుండా ఉండవలసింది. అలా చేసి ఉంటే మీకు కష్టంగాని, నష్టంగాని కలిగేది కాదు. కాని, యిప్పుడు మిమ్మల్ని ఒకటి కోరుతున్నాను. ధైర్యంగా ఉండండి. మీలో ఒక్కరు కూడా ప్రాణాల్ని కోల్పోరు. కాని ఓడ మాత్రం నష్టమౌతుంది. నేను ఎవరికి చెందానో, ఎవరి సేవ నేను చేస్తున్నానో ఆయన దూత నిన్న రాత్రి నా ప్రక్కన నిలబడి ఇలా చెప్పాడు: ‘పౌలూ! భయపడకు. విచారణకై నీవు చక్రవర్తి ముందు నిలబడతావు. దేవుడు దయదలిచి, నీ కోసం నీతో ప్రయాణం చేస్తున్న వాళ్ళ ప్రాణాలను రక్షించాడు.’ అందువల్ల ప్రజలారా! దైర్యంగా ఉండండి. నాకు దేవుని పట్ల నమ్మకం ఉంది. ఆయన చెప్పినట్లే జరుగుతుంది. మనం త్వరలోనే ఒక ద్వీపానికి కొట్టకుపోతాము” అని అన్నాడు. పదునాల్గవ రోజు రాత్రి కూడా మేమింకా అద్రియ సముద్రంలో గాలికి కొట్టుకొని పోతున్నాము. సుమారు అర్ధరాత్రి వేళ నావికులు భూమి దగ్గరకొచ్చిందని గ్రహించారు. బుడుదు నీళ్ళలోకి వేసి ఇరవై బారల లోతుందని తెలుసుకున్నారు. కొంతసేపైన తర్వాత మళ్ళీ బుడుదు నీళ్ళలోకి వేసి పదునైదు బారల లోతుందని తెలుసుకున్నారు. ఓడ రాళ్ళకు కొట్టుకుంటుందని భయపడి ఓడ వెనుక భాగంనుండి నాలుగు లంగర్లు వేసారు. ఆ తదుపరి సూర్యుని వెలుగు కోసం ప్రార్థించారు. నావికులు ఓడ ముందుభాగంనుండి లంగర్లు నీళ్ళలోకి దింపుతున్నట్లు నటిస్తూ ఓడకు కట్టబడిన చిన్న పడవను సముద్రంలోకి దింపారు. తప్పించుకు వెళ్ళాలని వాళ్ళ ఉద్దేశ్యం. అప్పుడు పౌలు శతాధిపతితో, సైనికులతో, “ఈ నావికులు ఓడలో ఉంటే తప్ప మీరు రక్షింపబడరు” అని అన్నాడు. ఇది విని సైనికులు పడవకు కట్టిన త్రాళ్ళను కోసి ఆ పడవను నీళ్ళలోకి పోనిచ్చారు. సూర్యోదయానికి ముందు పౌలు వాళ్ళనందర్ని తినమని చెబుతూ, “గడిచిన పదునాలుగు రోజులనుండి మీరు ఆహారం ముట్టకుండా జీవించారు. ఏం జరుగనున్నదో మీకు తెలియదు. అయినా కాచుకున్నారు. ఇక మిమ్మల్ని కొంచెం తినమని వేడుకొంటున్నాను. మిమ్మల్ని రక్షించుకోవాలంటే తినటం అవసరం. మీ తలలపై ఉన్న ఒక్క వెంట్రుక కూడా రాలిపోదు” అని అన్నాడు. ఇలా చెప్పాక అతడు రొట్టెను తీసుకొని దేవునికి అందరి ముందు కృతజ్ఞతలు చెప్పి దాన్నుండి ఒక ముక్కను విరిచి తినటం మొదలు పెట్టాడు. అప్పుడందరూ ధైర్యం తెచ్చుకొని ఆహారం పుచ్చుకున్నారు. మా సంఖ్య మొత్తం రెండువందల డెబ్బది ఆరు. వాళ్ళంతా తృప్తిగా తిన్నారు. ఆ తర్వాత ఓడలో ఉన్న మిగతా ధాన్యాన్ని సముద్రంలోకి పారవేసి ఓడను తేలిక చేసారు. సూర్యోదయమయింది. వాళ్ళకు భూమి కనిపించింది. కాని వాళ్ళు అది గుర్తించలేదు. ఇసుక ఉన్న తీరం యొక్క పాయ కనపడగానే ఓడను వీలైతే అక్కడ ఆపాలనుకున్నారు. త్రాళ్ళు కోసేసి లంగర్లను సముద్రంలోకి పడనిచ్చారు. చుక్కానుల త్రాళ్ళు విప్పారు. ఓడ యొక్క ముందుభాగంలో ఉన్న తెరచాపను లేపి ఓడను తీరం వైపు పోనిచ్చారు. కాని ఆ ఓడ నీళ్ళలో ఉన్న యిసుకకు తగిలి భూమిలో చిక్కుకొని పోయింది. ఓడ యొక్క ముందుభాగం యిసుకలో చిక్కుకుపోవటం వల్ల ఓడ కదల్లేదు. అలలు తీవ్రంగా కొట్టటం వల్ల ఓడ యొక్క వెనుక భాగం ముక్కలై పోయింది. నేరస్థులు ఈది పారిపోకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో సైనికులు వాళ్ళను చంపాలని నిశ్చయించుకున్నారు, కాని పౌలు ప్రాణాన్ని కాపాడాలనే ఉద్దేశ్యంతో ఆ శతాధిపతి సైనికులు చేయదలచిన దానిని చేయనివ్వలేదు. ఈద గలిగినవాళ్ళను, నీళ్ళలోకి దూకి ఒడ్డును చేరుకోమని ఆజ్ఞాపించాడు. మిగతావాళ్ళను చెక్కల సహాయంతో, ఓడ యొక్క విరిగిన ముక్కల సహాయంతో ఒడ్డును చేరుకోమన్నాడు. ఈ విధంగా అందరూ క్షేమంగా తీరాన్ని చేరుకున్నారు.
అపొస్తలుల కార్యములు 27:1-44 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
మేము ఓడయెక్కి ఇటలీ వెళ్లవలెనని నిర్ణయమై నప్పుడు, వారు పౌలును మరికొందరు ఖైదీలను ఔగుస్తు పటాలములో శతాధిపతియైన యూలి అను వానికి అప్పగించిరి. ఆసియ దరివెంబడినున్న పట్టణములకు ప్రయాణము చేయబోవు అద్రముత్తియ పట్టణపు ఓడనెక్కి మేము బయలుదేరితిమి; మాసిదోనీయుడును థెస్సలొనీక పట్టణస్థుడునైన అరిస్తార్కు మాతోకూడ ఉండెను. మరునాడు సీదోనుకు వచ్చితిమి. అప్పుడు యూలి పౌలు మీద దయగా ఉండి, అతడు తన స్నేహితులయొద్దకు వెళ్లి పరామరిక పొందుటకు అతనికి సెలవిచ్చెను. అక్కడనుండి బయలుదేరిన తరువాత ఎదురుగాలి కొట్టుచున్నందున కుప్రచాటున ఓడ నడిపించితిమి. మరియు కిలికియకును పంఫూలియకును ఎదురుగా ఉన్న సముద్రము దాటి లుకియలో ఉన్న మూరకు చేరితిమి. అక్కడ శతాధిపతి ఇటలీవెళ్లనైయున్న అలెక్సంద్రియ పట్టణపు ఓడ కనుగొని అందులో మమ్మును ఎక్కించెను. అనేక దినములు మెల్లగా నడచి, యెంతో కష్టపడి క్నీదుకు ఎదురుగా వచ్చినప్పుడు గాలి మమ్మును పోనియ్యకున్నందున క్రేతు చాటున సల్మోనే దరిని ఓడ నడిపించితిమి. బహు కష్టపడి దాని దాటి, మంచిరేవులు అను ఒక స్థలమునకు చేరితిమి. దానిదగ్గర లసైయ పట్టణముండెను. చాల కాలమైన తరువాత ఉపవాసదినము కూడ అప్పటికి గతించినందున ప్రయాణముచేయుట అపాయ కరమై యుండెను. అప్పుడు పౌలు–అయ్యలారా, యీ ప్రయాణమువలన సరకులకును ఓడకును మాత్రమే కాక మన ప్రాణములకు కూడ హానియు బహు నష్టమును కలుగునట్లు నాకు తోచుచున్నదని చెప్పి వారిని హెచ్చరించెను. అయినను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక నావికుడును ఓడ యజమానుడును చెప్పినదే నమ్మెను. మరియు శీతకాలము గడుపుటకు ఆ రేవు అనుకూలమైనది కానందున అక్కడనుండి బయలుదేరి యొకవేళ శక్యమైతే ఫీనిక్సునకుచేరి అక్కడ శీతకాలము గడపవలెనని యెక్కువ మంది ఆలోచన చెప్పిరి. అది నైరుతి వాయవ్యదిక్కులతట్టుననున్న క్రేతురేవై యున్నది. మరియు దక్షిణపు గాలి మెల్లగా విసరుచుండగా వారు తమ ఆలోచన సమ కూడినదని తలంచి లంగరెత్తి, క్రేతు దరిని ఓడ నడిపించిరి. కొంచెము సేపైన తరువాత ఊరకులోను అను పెనుగాలి క్రేతు మీదనుండి విసరెను. దానిలో ఓడ చిక్కుకొని గాలికి ఎదురు నడువలేక పోయినందున ఎదురు నడిపించుట మాని గాలికి కొట్టుకొనిపోతిమి. తరువాత కౌద అన బడిన యొక చిన్న ద్వీపము చాటున దాని నడిపింపగా పడవను భద్రపరచుకొనుట బహు కష్ట తరమాయెను. దానిని పైకెత్తి కట్టిన తరువాత త్రాళ్లు మొదలైనవి తీసి కొని ఓడచుట్టు బిగించి కట్టిరి. మరియు సూర్తిసను ఇసుకతిప్పమీద పడుదుమేమో అని భయపడి, ఓడ చాపలు దింపివేసి, కొట్టుకొనిపోయిరి. మిక్కిలి పెద్ద గాలి కొట్టుచున్నందున మరునాడు సరకులు పారవేయ సాగిరి. మూడవ దినమందు తమ చేతులార ఓడసామగ్రి పారవేసిరి. కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్దగాలి మామీద కొట్టినందున ప్రాణములతో తప్పించు కొందుమను ఆశ బొత్తిగ పోయెను. వారు బహు కాలము భోజనము లేక యున్నందున పౌలు వారిమధ్యను నిలిచి–అయ్యలారా, మీరు నా మాట విని క్రేతునుండి బయలుదేరకయే యుండవలసినది. అప్పుడీ హానియు నష్టమును కలుగకపోవును. ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకొనుడని మిమ్మును వేడుకొనుచున్నాను; ఓడకేగాని మీలో ఎవని ప్రాణమునకును హానికలుగదు. నేను ఎవనివాడనో, యెవనిని సేవించుచున్నానో, ఆ దేవుని దూత గడచిన రాత్రి నాయొద్ద నిలిచి–పౌలా, భయపడకుము; నీవు కైసరు ఎదుట నిలువవలసియున్నది; ఇదిగో నీతోకూడ ఓడలో ప్రయాణమై పోవుచున్న వారందరిని దేవుడు నీకు అనుగ్రహించియున్నాడని నాతో చెప్పెను. కాబట్టి అయ్యలారా, ధైర్యము తెచ్చుకొనుడి; నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను. అయినను మనము కొట్టుకొనిపోయి యేదైన ఒక ద్వీపముమీద పడవలసి యుండునని చెప్పెను. పదునాలుగవ రాత్రి వచ్చినప్పుడు మేము అద్రియ సముద్రములో ఇటు అటు కొట్టుకొనిపోవుచుండగా అర్ధరాత్రివేళ ఓడవారు ఏదో యొక దేశము దగ్గర పడు చున్నదని యూహించి బుడుదువేసి చూచి యిరువది బారల లోతని తెలిసికొనిరి. ఇంకను కొంతదూరము వెళ్లిన తరువాత, మరల బుడుదువేసి చూచి పదునైదు బారల లోతని తెలిసికొనిరి. అప్పుడు రాతి తిప్పలుగల చోట్ల పడుదుమేమో అని భయపడి, వారు ఓడ అమరములోనుండి నాలుగు లంగరులువేసి యెప్పుడు తెల్ల వారునా అని కాచుకొని యుండిరి. అయితే ఓడవారు ఓడ విడిచి పారిపోవలెనని చూచి, తాము అనివిలోనుండి లంగరులు వేయబోవునట్లుగా సముద్రములో పడవ దింపి వేసిరి. అందుకు పౌలు–వీరు ఓడలో ఉంటేనేగాని మీరు తప్పించుకొనలేరని శతాధిపతితోను సైనికులతోను చెప్పెను. వెంటనే సైనికులు పడవ త్రాళ్లు కోసి దాని కొట్టుకొని పోనిచ్చిరి. తెల్లవారుచుండగా పౌలు– పదునాలుగు దినములనుండి మీరేమియు పుచ్చుకొనక ఉపవాసముతో కనిపెట్టుకొని యున్నారు గనుక ఆహా రము పుచ్చుకొనుడని మిమ్మును వేడుకొనుచున్నాను; ఇది మీ ప్రాణరక్షణకు సహాయమగును. మీలో ఎవని తల నుండియు ఒక వెండ్రుకయైనను నశింపదని చెప్పుచు, ఆహారము పుచ్చుకొనుడని అందరిని బతిమాలెను. ఈ మాటలు చెప్పి, యొక రొట్టె పట్టుకొని అందరి యెదుట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాని విరిచి తిన సాగెను. అప్పుడందరు ధైర్యము తెచ్చుకొని ఆహారము పుచ్చుకొనిరి. ఓడలో ఉన్న మేమందరము రెండువందల డెబ్బది ఆరుగురము. వారు తిని తృప్తిపొందిన తరువాత, గోధుమలను సముద్రములో పారబోసి ఓడ తేలికచేసిరి. ఉదయమైనప్పుడు అది ఏ దేశమో వారు గుర్తుపట్టలేదు గాని, దరిగల యొక సముద్రపు పాయను చూచి, సాధ్యమైనయెడల అందులోనికి ఓడను త్రోయవలెనని ఆలో చించిరి గనుక లంగరుల త్రాళ్లుకోసి వాటిని సముద్రములో విడిచిపెట్టి చుక్కానుల కట్లు విప్పి ముందటి తెరచాప గాలికెత్తి సరిగా దరికి నడిపించిరి గాని రెండు ప్రవాహములు కలిసిన స్థలమందు చిక్కుకొని ఓడను మెట్ట పెట్టించిరి. అందువలన అనివి కూరుకొనిపోయి కదలక యుండెను, అమరము ఆ దెబ్బకు బద్దలై పోసాగెను. ఖైదీలలో ఎవడును ఈదుకొని పారిపోకుండునట్లు వారిని చంపవలెనని సైనికులకు ఆలోచన పుట్టెను గాని శతాధిపతి పౌలును రక్షింప నుద్దేశించి వారి ఆలోచన కొనసాగనియ్యక, మొదట ఈదగలవారు సముద్రములో దుమికి దరికి పోవలెననియు కడమ వారిలో కొందరు పలకలమీదను, కొందరు ఓడ చెక్కలమీదను, పోవలెననియు ఆజ్ఞాపించెను. ఈలాగు అందరు తప్పించుకొని దరిచేరిరి.