అపొస్తలుల కార్యములు 23:1-11

అపొస్తలుల కార్యములు 23:1-11 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

పౌలు న్వాయసభ వారిని సూటిగా చూసి, “నా సహోదరులారా, ఈ రోజు వరకు నేను నా మంచి మనస్సాక్షితో దేవుడు నాకు ఇచ్చిన కర్తవ్యాన్ని పూర్తి చేశాను” అని చెప్పాడు. అందుకు ప్రధాన యాజకుడైన అననీయ, పౌలుకు దగ్గరగా నిలబడి ఉన్నవానితో, అతని నోటి మీద కొట్టమని ఆదేశించాడు. అప్పుడు పౌలు అతనితో, “ఓ సున్నం కొట్టిన గోడా, దేవుడు నిన్ను కొడతాడు! ధర్మశాస్త్రం ప్రకారం నాకు తీర్పు తీర్చడానికి అక్కడ కూర్చుని, నన్ను కొట్టమని ఆదేశించి నీవు ధర్మశాస్త్ర ఆజ్ఞలను అతిక్రమిస్తున్నావు!” అన్నాడు. పౌలుకు దగ్గరగా నిలబడినవారు, “దేవుని ప్రధాన యాజకుని విమర్శించడానికి నీకెంత ధైర్యం!” అన్నారు. అందుకు పౌలు, “సహోదరులారా, ఇతడు ప్రధాన యాజకుడని నాకు తెలియలేదు; అయితే ‘మీ ప్రజల అధికారులను నిందించవద్దు అని’ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉంది” అన్నాడు. అక్కడ ఉన్నవారిలో కొందరు సద్దూకయ్యులు మరికొందరు పరిసయ్యులు ఉన్నారని పౌలు గ్రహించి, ఆ న్యాయసభలోని వారితో, “నా సహోదరులారా, నేను పరిసయ్యుడను, పరిసయ్యుల సంతానంగా పుట్టాను. నేను మృతులకు పునరుత్థానం ఉందనే నిరీక్షణను బట్టి ఈ విచారణ పాలయ్యాను” అని బిగ్గరగా చెప్పాడు. అతడు ఆ విధంగా చెప్పిన వెంటనే, అక్కడ ఉన్న పరిసయ్యులు సద్దూకయ్యుల మధ్య విభేదం పుట్టి, ఆ సభ రెండుగా చీలిపోయింది. ఎందుకంటే, సద్దూకయ్యులు పునరుత్థానం లేదని, దేవదూతలు లేరని, ఆత్మలు లేవని అంటారు. కానీ పరిసయ్యులు ఇవన్నీ ఉన్నాయని నమ్ముతారు. అప్పుడు పరిసయ్యులలోని ధర్మశాస్త్ర ఉపదేశకులు కొందరు లేచి, “ఈ వ్యక్తిలో మాకు ఏ తప్పు కనిపించడం లేదు, అతనితో ఆత్మ కాని దేవదూత కాని మాట్లాడి ఉంటే తప్పు ఏంటి?” అని అడుగుతూ గట్టిగా వాదించారు, కాబట్టి గొప్ప అల్లరి చెలరేగింది. ఈ విభేదం మరింత హింసాత్మకంగా మారినందుకు పౌలును ముక్కలుగా చీల్చివేస్తారేమో అని ఆ అధిపతి భయపడ్డాడు. అతడు సైనికులను వెళ్లి వారి మధ్యలో నుండి పౌలును బలవంతంగా పట్టుకుని, సైనికుల కోటలోకి తీసుకుని రమ్మని ఆదేశించాడు. ఆ రాత్రి ప్రభువు పౌలు దగ్గర నిలబడి, “ధైర్యం తెచ్చుకో! యెరూషలేములో నా గురించి నీవు సాక్ష్యమిచ్చినట్టే రోమాలో కూడా నీవు సాక్ష్యమివ్వాలి” అని చెప్పారు.

అపొస్తలుల కార్యములు 23:1-11 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

పౌలు మహా సభవారిని సూటిగా చూసి, “సోదరులారా, నేను ఈ రోజు వరకూ దేవుని ముందు పూర్తిగా మంచి మనస్సాక్షితో నడచుకుంటున్నాను” అని చెప్పాడు. అందుకు ప్రధాన యాజకుడు అననీయ, “అతన్ని నోటి మీద కొట్టండి” అని దగ్గర నిలబడిన వారికి ఆజ్ఞాపించాడు. పౌలు అతణ్ణి చూసి, “సున్నం కొట్టిన గోడా, దేవుడు నిన్ను కొడతాడు. నీవు ధర్మశాస్త్రం ప్రకారం నన్ను విచారణ చేయడానికి కూర్చుని, ధర్మశాస్త్రానికి విరోధంగా నన్ను కొట్టమని ఆజ్ఞాపిస్తున్నావా?” అన్నాడు. అప్పుడు దగ్గర ఉన్నవారు, “నీవు దేవుని ప్రధాన యాజకుణ్ణి దూషిస్తున్నావేంటి?” అన్నారు. అందుకు పౌలు, “సోదరులారా, ఇతడు ప్రధాన యాజకుడని నాకు తెలియలేదు. ‘నీ ప్రజల అధికారిని నిందించవద్దు’ అని రాసి ఉంది” అన్నాడు. అక్కడ ఉన్న వారిలో ఒక భాగం సద్దూకయ్యులూ, మరొక భాగం పరిసయ్యులూ ఉన్నట్టు పౌలు గ్రహించి, “సోదరులారా, నేను పరిసయ్యుణ్ణి, పరిసయ్యుల సంతతివాణ్ణి. మనకున్న నిరీక్షణ గూర్చీ, మృతుల తిరిగి బ్రతకడం గూర్చీ నేను విచారణ పాలవుతున్నాను.” అని సభలో గొంతెత్తి చెప్పాడు. అతడా విధంగా చెప్పినప్పుడు పరిసయ్యులకు సద్దూకయ్యులకు మధ్య కలహం రేగింది. అందువల్ల ఆ సమూహం రెండు పక్షాలుగా చీలిపోయింది. సద్దూకయ్యులు పునరుత్థానం లేదనీ, దేవదూత గానీ, ఆత్మగానీ లేదనీ చెబుతారు. కాని పరిసయ్యులు ఇవన్నీ ఉన్నాయంటారు. అప్పుడు పెద్ద గోల పుట్టింది. పరిసయ్యుల పక్షంగా ఉన్న శాస్త్రుల్లో కొందరు లేచి, “ఈ మనిషిలో ఏ దోషమూ మాకు కనబడలేదు. బహుశా ఒక ఆత్మగానీ, దేవదూతగానీ అతనితో మాట్లాడాడేమో” అని వాదించారు. కలహం ఎక్కువైనప్పుడు వారు పౌలును చీల్చివేస్తారేమో అని సహస్రాధిపతి భయపడి, “వారి మధ్య నుండి అతణ్ణి బలవంతంగా పట్టుకుని కోటలోకి తీసుకుని రండి” అని సైనికులకు ఆజ్ఞాపించాడు. ఆ రాత్రి ప్రభువు అతని పక్కన నిలబడి “ధైర్యంగా ఉండు. యెరూషలేములో నన్ను గూర్చి నువ్వెలా సాక్ష్యం చెప్పావో అదే విధంగా రోమ్ నగరంలో కూడా చెప్పాల్సి ఉంటుంది” అని చెప్పాడు.

అపొస్తలుల కార్యములు 23:1-11 పవిత్ర బైబిల్ (TERV)

పౌలు మహాసభ వైపు సూటిగా చూసి, “సోదరులారా! నేను ఈనాటి వరకు నిష్కల్మషంగా జీవించాను. దీనికి దేవుడే సాక్షి” అని అన్నాడు. ఈ మాటలు అనగానే ప్రధాన యాజకుడైన అననీయ, పౌలు ప్రక్కన నిలుచున్నవాళ్ళతో, “అతని మూతి మీద కొట్టి నోరు మూయించండి” అని ఆజ్ఞాపించాడు. అప్పుడు పౌలు అతనితో, “దేవుడు నీ నోరు మూయిస్తాడు. నీవు సున్నం కొట్టిన గోడవి. ధర్మశాస్త్రం ప్రకారం నా మీద తీర్పు చెప్పటానికి నీవక్కడ కూర్చున్నావు. కాని నన్ను కొట్టమని ఆజ్ఞాపించి నీవా ధర్మశాస్త్రాన్నే ఉల్లంఘిస్తున్నావు” అని అన్నాడు. పౌలు ప్రక్కన నిలుచున్నవాళ్ళు, “దేవుని ప్రధానయాజకుని అవమానించటానికి నీకెంత ధైర్యం?” అని అన్నారు. అందుకు పౌలు, “సోదరులారా! ప్రధానయాజకుడని నాకు తెలియదు. మన లేఖనాల్లో యిలా వ్రాయబడివుంది, ‘ప్రజానాయకుల్ని గురించి చెడుగా మాట్లాడరాదు.’” పౌలుకు వాళ్ళలో కొందరు సద్దూకయ్యులని, మరి కొందరు పరిసయ్యులని తెలుసు. అందువల్ల అతడు ఆ మహాసభలో బిగ్గరగా, “సోదరులారా! నేను పరిసయ్యుణ్ణి. నా తండ్రి పరిసయ్యుడు. నేను యిక్కడ నిందితునిగా నిలుచోవటానికి కారణం చనిపోయినవాళ్ళు బ్రతికి వస్తారన్నదే నాలోని ఆశ” అని అన్నాడు. అతడీ మాట అనగానే, సద్దూకయ్యులకు, పరిసయ్యులకు సంఘర్షణ జరిగి వాళ్ళు రెండు భాగాలుగా చీలిపోయారు. సద్దూకయ్యులు మనుష్యులు బ్రతికి రారని, దేవదూతలు, ఆత్మలు అనేవి లేవని వాదిస్తారు. కాని పరిసయ్యులు యివి ఉన్నాయి అంటారు. సభలో పెద్ద అలజడి మొదలైంది. పరిసయ్యులకు సంబంధించిన కొందరు పండితులు లేచి బిగ్గరగా వాదిస్తూ, “యితనిలో మాకే తప్పు కనిపించలేదు. దేవదూతో లేక ఆత్మో అతనితో మాట్లాడి ఉండవచ్చు!” అని అన్నారు. సంఘర్షణ చాలా తీవ్రంగా మారిపోయింది. ఆ రెండు గుంపులు కలిసి, పౌలును చీల్చివేస్తారేమోనని సహస్రాధిపతి భయపడిపొయ్యాడు. అతడు తన సైనికులతో, “వెళ్ళండి! అతణ్ణి వాళ్ళనుండి విడిపించుకొచ్చి కోట లోపలికి తీసుకెళ్ళండి” అని ఆజ్ఞాపించాడు. ఆ రాత్రి ప్రభువు పౌలు ప్రక్కన నిలుచొని, “ధైర్యంగా ఉండి, నా గురించి నీవు యెరూషలేములో బోధించిన విధంగా రోమాలో కూడా బోధించాలి” అని అన్నాడు.

అపొస్తలుల కార్యములు 23:1-11 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

పౌలు మహా సభవారిని తేరిచూచి–సహోదరులారా, నేను నేటివరకు కేవలము మంచి మనస్సాక్షిగల వాడనై దేవునియెదుట నడుచుకొనుచుంటినని చెప్పెను. అందుకు ప్రధానయాజకుడైన అననీయ–అతని నోటిమీద కొట్టుడని దగ్గర నిలిచియున్నవారికి ఆజ్ఞాపింపగా పౌలు అతనిని చూచి–సున్నము కొట్టిన గోడా, దేవుడు నిన్ను కొట్టును; నీవు ధర్మశాస్త్రము చొప్పున నన్ను విమర్శింప కూర్చుండి, ధర్మశాస్త్రమునకు విరోధముగా నన్ను కొట్ట నాజ్ఞాపించుచున్నావా అనెను. దగ్గర నిలిచియున్నవారు –నీవు దేవుని ప్రధానయాజకుని దూషించెదవా? అని అడిగిరి. అందుకు పౌలు సహోదరులారా, యితడు ప్రధానయాజకుడని నాకు తెలియలేదు– నీ ప్రజల అధికారిని నిందింపవద్దు అని వ్రాయబడి యున్నదనెను. వారిలో ఒక భాగము సద్దూకయ్యులును మరియొక భాగము పరిసయ్యులునై యున్నట్టు పౌలు గ్రహించి–సహోదరులారా, నేను పరిసయ్యుడను పరిసయ్యుల సంతతివాడను; మనకున్న నిరీక్షణనుగూర్చియు, మృతుల పునరుత్థానమునుగూర్చియు నేను విమర్శింపబడుచున్నానని సభలో బిగ్గరగా చెప్పెను. అతడాలాగు చెప్పినప్పుడు పరిసయ్యులకును సద్దూకయ్యులకును కలహము పుట్టినందున ఆ సమూహము రెండు పక్షములు ఆయెను. సద్దూకయ్యులు పునరుత్థానము లేదనియు, దేవదూతయైనను ఆత్మయైనను లేదనియు చెప్పుదురు గాని పరిసయ్యులు రెండును కలవని యొప్పుకొందురు. అప్పుడు పెద్దగొల్లు పుట్టెను; పరిసయ్యుల పక్షముగా ఉన్న శాస్త్రులలో కొందరు లేచి–ఈ మనుష్యునియందు ఏ దోషమును మాకు కనబడలేదు; ఒక ఆత్మయైనను దేవదూతయైనను అతనితో మాటలాడియుంటే మాటలాడి యుండవచ్చునని చెప్పుచు తగువులాడిరి. కలహమెక్కు వైనప్పుడు వారు పౌలును చీల్చివేయుదురేమో అని సహస్రాధిపతి భయపడి–మీరు వెళ్లి వారి మధ్యనుండి అతనిని బలవంతముగా పట్టుకొని కోటలోనికి తీసికొని రండని సైనికులకు ఆజ్ఞాపించెను. ఆ రాత్రి ప్రభువు అతనియొద్ద నిలుచుండి–ధైర్యముగా ఉండుము, యెరూషలేములో నన్నుగూర్చి నీవేలాగు సాక్ష్యమిచ్చితివో ఆలాగున రోమాలో కూడ సాక్ష్య మియ్యవలసియున్నదని చెప్పెను.