మార్కు సువార్త 14:51-72

మార్కు సువార్త 14:51-72 OTSA

సన్నని నార వస్త్రం మాత్రమే ధరించిన ఒక యువకుడు, యేసును వెంబడిస్తున్నాడు. వారు అతన్ని పట్టుకున్నప్పుడు, అతడు ఆ వస్త్రాన్ని వదిలి దిగంబరిగా పారిపోయాడు. వారు యేసును ప్రధాన యాజకుని దగ్గరకు తీసుకెళ్లారు, ముఖ్య యాజకులు, నాయకులు ధర్మశాస్త్ర ఉపదేశకులు అందరు అక్కడ సమావేశం అయ్యారు. పేతురు ప్రధాన యాజకుని ఇంటి ప్రాంగణం వరకు, ఆయనను దూరం నుండి వెంబడిస్తూ వచ్చాడు. అక్కడ కాపలా కాస్తున్న వారితో చలిమంట దగ్గర కూర్చుని, చలి కాచుకుంటున్నాడు. ముఖ్య యాజకులు న్యాయసభ సభ్యులందరు యేసును చంపించాలని ఆయనకు వ్యతిరేకంగా సాక్ష్యాలను వెదకుతున్నారు. కానీ వారికి ఏమి దొరకలేదు. ఆయనకు వ్యతిరేకంగా అనేకులు తప్పుడు సాక్ష్యాలు ఇచ్చారు, కాని వాటిలో ఒకదానికొకటి సరిపోలేదు. అప్పుడు కొందరు లేచి ఆయనకు వ్యతిరేకంగా ఈ అబద్ధసాక్ష్యం చెప్పారు: “ ‘ఇతడు మనుష్యుల చేతులతో కట్టిన ఈ దేవాలయాన్ని పడగొట్టి మూడు దినాల్లో మనుష్యుల చేతులతో కట్టని మరొక దేవాలయాన్ని నిర్మిస్తాను’ అని చెప్పడం మేము విన్నాం” అన్నారు. అయినా వారి సాక్ష్యం కూడా సరిపోలేదు. అప్పుడు ప్రధాన యాజకుడు వారి ముందు నిలబడి యేసును, “నీవు వారికి సమాధానం ఇవ్వవా? నీకు వ్యతిరేకంగా వీరు చెప్తున్న సాక్ష్యాల గురించి నీవు ఏమంటావు?” అని అడిగాడు. కాని యేసు మౌనంగా ఉండి వారికి ఏ జవాబు ఇవ్వలేదు. ప్రధాన యాజకుడు మళ్ళీ యేసును, “నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువా?” అని అడిగాడు. అందుకు యేసు, “అవును” అంతేకాదు, “మనుష్యకుమారుడు సర్వశక్తిగల దేవుని కుడిచేతి వైపున కూర్చుని ఉండడం ఆకాశ మేఘాల మీద ఆయన రావడం మీరు చూస్తారు” అని చెప్పారు. అప్పుడు ప్రధాన యాజకుడు తన బట్టలను చింపుకొని, “ఇంకా మనకు సాక్షులు ఏం అవసరం? ఇప్పుడే దైవదూషణ మీరు విన్నారు. మీకు ఏమి అనిపిస్తుంది?” అని అడిగాడు. అందుకు వారందరు మరణశిక్ష విధించాలి అన్నారు. ఆ తర్వాత కొందరు యేసు మీద ఉమ్మివేయడం మొదలుపెట్టారు; వారు ఆయన కళ్లు మూసి, ఆయనను తమ పిడికిళ్ళతో గుద్ది, “నిన్ను ఎవరు కొట్టారో, చెప్పు!” అన్నారు. కావలివారు కూడా ఆయనను పట్టుకుని కొట్టారు. పేతురు ఇంటి ప్రాంగణంలో క్రింది భాగంలో ఉన్నప్పుడు, ప్రధాన యాజకుని దగ్గర పని చేసే అమ్మాయి అక్కడికి వచ్చింది. పేతురు చలి కాచుకుంటూ ఉండగా ఆమె, అతన్ని దగ్గర నుండి చూసింది. ఆ అమ్మాయి పేతురుతో, “నీవు కూడా నజరేతువాడైన, యేసుతో ఉన్నావు” అన్నది. కాని దానికతడు ఒప్పుకోలేదు. “నీవు ఏమి మాట్లాడుతున్నావో నాకు తెలియదు” అని చెప్పి, అతడు ద్వారం వైపుకు వెళ్లాడు. వెంటనే కోడి కూసింది. ఆ దాసియైన అమ్మాయి అతన్ని అక్కడ చూసినప్పుడు, చుట్టూ నిలబడి ఉన్నవారితో, “ఇతడు కూడా వారిలో ఒకడే” అన్నది. అతడు మళ్ళీ తిరస్కరించాడు. కొంతసేపటి తర్వాత, పేతురుకు దగ్గరలో నిలబడినవారు పేతురుతో, “ఖచ్చితంగా నీవు కూడ వారిలో ఒకడివి, ఎందుకంటే నీవు గలిలయ వాడవు” అన్నారు. అందుకతడు శపించడం మొదలుపెట్టి, “మీరు ఎవరి గురించైతే మాట్లాడుతున్నారో ఆయన నాకు తెలియదు!” అని వారితో ప్రమాణం చేశాడు. వెంటనే రెండవసారి కోడి కూసింది. అప్పుడు పేతురు, “కోడి రెండు సార్లు కూయక ముందే నేనెవరో నీకు తెలియదని మూడుసార్లు చెప్తావు” అని యేసు తనతో చెప్పిన మాటను పేతురు జ్ఞాపకం చేసుకుని, వెక్కివెక్కి ఏడ్చాడు.