మత్తయి సువార్త 27:35-66

మత్తయి సువార్త 27:35-66 OTSA

వారు ఆయనను సిలువ వేసిన తర్వాత, చీట్లు వేసి ఆయన వస్త్రాలను పంచుకున్నారు. వారు అక్కడే కూర్చుని, ఆయనకు కాపలాగా ఉన్నారు. ఆయన మీద మోపబడిన నేరం వ్రాసి ఆయన తలపైన బిగించారు: ఇతడు యేసు, యూదుల రాజు. ఆయనతో పాటు ఇద్దరు బందిపోటు దొంగలను, కుడి వైపున ఒకడిని, ఎడమవైపున ఒకడిని సిలువ వేశారు. ఆ దారిలో వెళ్తున్నవారు తలలు ఊపుతూ, “దేవాలయాన్ని పడగొట్టి మూడు దినాల్లో తిరిగి కడతానన్నావు, నిన్ను నీవే రక్షించుకో! నీవు దేవుని కుమారుడవైతే, సిలువ మీద నుండి దిగిరా” అని అంటూ దూషించారు. అలాగే ముఖ్య యాజకులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు నాయకులు కూడా ఆయనను ఎగతాళి చేశారు, “వీడు ఇతరులను రక్షించాడు, కాని తనను తాను రక్షించుకోలేడు! ఇశ్రాయేలీయుల రాజు కదా! ఇప్పుడు సిలువ మీది నుండి దిగివస్తే, మేము ఇతన్ని నమ్ముతాము. వీడు దేవుని నమ్మాడు. ‘నేను దేవుని కుమారుడనని’ చెప్పుకొన్నాడు కదా, దేవునికి ఇష్టమైతే దేవుడే ఇతన్ని తప్పిస్తాడు” అన్నారు. ఆయనతో కూడా సిలువవేయబడిన బందిపోటు దొంగలు కూడా ఆయనపై అవమానాలు గుప్పించారు. మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మూడు గంటల వరకు ఆ దేశమంతా చీకటి కమ్మింది. ఇంచుమించు మూడు గంటలప్పుడు యేసు, “ఏలీ, ఏలీ, లామా సబక్తానీ?” అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు, “నా దేవా, నా దేవా నన్నెందుకు చేయి విడిచావు?” అని అర్థము. అక్కడ నిలబడి ఉన్నవారిలో కొందరు ఆ మాట విని, “ఇతడు ఏలీయాను పిలుస్తున్నాడు” అన్నారు. వెంటనే వారిలో ఒకడు పరుగెత్తికొని వెళ్లి ఒక స్పంజీని తెచ్చాడు. దాన్ని ఆ చేదు చిరకలో ముంచి, కర్రకు తగిలించి, యేసుకు త్రాగడానికి అందించాడు. మిగిలిన వారు, “ఇప్పుడు వీన్ని ఒంటరిగా వదిలి వేద్దాము. ఏలీయా వచ్చి వీన్ని రక్షిస్తాడేమో చూద్దాం” అన్నారు. యేసు మరల బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచారు. ఆ క్షణంలో దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగిపోయింది. భూమి కంపించింది, బండలు బద్దలయ్యాయి. సమాధులు తెరవబడ్డాయి. చనిపోయిన చాలామంది పరిశుద్ధుల శరీరాలు జీవంతో లేచాయి. యేసు లేచిన తర్వాత వారు సమాధుల్లో నుండి బయటకు వచ్చి, పరిశుద్ధ పట్టణంలో చాలామందికి కనిపించారు. శతాధిపతి అతనితో కూడ యేసుకు కాపలా కాస్తున్నవారు వచ్చిన భూకంపాన్ని జరిగిన కార్యాలన్నిటిని చూసి, వారు భయపడి, “నిజంగా ఈయన దేవుని కుమారుడే!” అని చెప్పుకొన్నారు. అక్కడ చాలామంది స్త్రీలు ఉన్నారు, వారు దూరంగా నిలబడి చూస్తున్నారు. వారు యేసుకు సపర్యలు చేస్తూ గలిలయ నుండి ఆయనను వెంబడించారు. వారిలో మగ్దలేనే మరియ, యాకోబు యోసేపుల తల్లియైన మరియ, జెబెదయి కుమారుల తల్లి ఉన్నారు. సాయంకాలం అవుతున్నప్పుడు, తనకు తానే యేసు శిష్యునిగా మారిన, అరిమతయికు చెందిన యోసేపు అనే ధనవంతుడు వచ్చాడు. అతడు పిలాతు దగ్గరకు వెళ్లి, యేసు దేహాన్ని తనకు ఇమ్మని అడిగాడు, అందుకు పిలాతు దానిని అతనికి అప్పగించమని ఆదేశించాడు. యోసేపు ఆ దేహాన్ని తీసుకుని, శుభ్రమైన నారబట్టతో చుట్టి, తన కోసం రాతిలో తొలిపించుకొన్న క్రొత్త సమాధిలో దానిని పెట్టాడు. ఆ సమాధి ద్వారం ముందు ఒక పెద్ద రాయి దొర్లించి వెళ్లిపోయాడు. మగ్దలేనే మరియ, వేరొక మరియ అక్కడే ఆ సమాధి ఎదుట కూర్చుని ఉన్నారు. మరుసటిరోజు, అనగా సిద్ధపరచే దినానికి తర్వాత రోజు, ముఖ్య యాజకులు పరిసయ్యులు పిలాతు దగ్గరకు వెళ్లారు. వారు, “అయ్యా, ఆ మోసగాడు జీవిస్తున్నప్పుడే, ‘మూడు దినాల తర్వాత నేను లేస్తాను’ అని పలికిన మాట మాకు జ్ఞాపకం ఉంది. కాబట్టి మూడవ దినం వరకు సమాధిని భద్రం చేయడానికి ఆదేశించండి. లేకపోతే, అతని శిష్యులు వచ్చి వాని శరీరాన్ని ఎత్తుకుపోయి, అతడు మృతులలో నుండి లేచాడని ప్రజలతో చెప్పవచ్చు. అప్పుడు మొదటి మోసం కంటే కడపటి మోసం మరి విపరీతంగా ఉంటుంది” అని చెప్పారు. అందుకు పిలాతు, “కావలివారిని తీసుకోండి, మీరు వెళ్లి, మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రం చేసుకోండి” అని వారితో చెప్పాడు. కాబట్టి వారు వెళ్లి కావలివారిని ఏర్పాటు చేసి రాతికి ముద్రవేసి సమాధిని భద్రం చేశారు.