లూకా సువార్త 24:1-32

లూకా సువార్త 24:1-32 OTSA

వారం మొదటి రోజున తెల్లవారేటప్పుడు స్త్రీలు తాము సిద్ధపరచిన సుగంధ ద్రవ్యాలను తీసుకుని సమాధి దగ్గరకు వచ్చారు. వారు సమాధి రాయి దొర్లించబడి ఉండడం చూశారు, కాని వారు ఆ సమాధిలోనికి వెళ్లినప్పుడు, అక్కడ ప్రభువైన యేసు దేహం వారికి కనబడలేదు. వారు ఈ విషయాన్ని గురించి కలవరపడుతూ ఉండగా, మిలమిల మెరుస్తున్న వస్త్రాలను ధరించిన ఇద్దరు మనుష్యులు వారి ప్రక్కన నిలబడి ఉండడం చూశారు స్త్రీలు భయంతో తమ ముఖాలను నేలకు వంచుకొన్నారు కానీ ఆ పురుషులు వారితో, “మీరు సజీవుడైన వానిని మృతులలో ఎందుకు వెదకుతున్నారు? ఆయన ఇక్కడ లేరు, ఆయన లేచారు! ఆయన మీతో గలిలయలో ఉన్నప్పుడు మీతో ఏం చెప్పాడో జ్ఞాపకం చేసుకోండి, ‘మనుష్యకుమారుడిని పాపుల చేతికి అప్పగించబడతాడు, వారు ఆయనను సిలువ వేసి చంపుతారు, ఆయన మూడవ రోజున సజీవంగా లేస్తాడని’ చెప్పాడు కదా!” అని అన్నారు. అప్పుడు వారు ఆయన మాటలను జ్ఞాపకం చేసుకున్నారు. వారు సమాధి నుండి తిరిగివెళ్లి, ఈ సంగతులను పదకొండు మంది శిష్యులకు మిగిలిన వారందరికి చెప్పారు. శిష్యులకు అపొస్తలులకు ఈ విషయాన్ని చెప్పింది వీరే: మగ్దలేనే మరియ, యోహన్న, యాకోబు తల్లియైన మరియ ఇంకా వారితో ఉన్న ఇతర స్త్రీలు. ఈ స్త్రీలు చెప్పిన మాటలు వారికి వెర్రి మాటలుగా అనిపించాయి, కాబట్టి వారు నమ్మలేదు. అయితే పేతురు లేచి, సమాధి దగ్గరకు పరుగెత్తికొని పోయి, వంగి, నారబట్టలు మాత్రమే పడి ఉండడం చూసి, సమాధిలో ఏమి జరిగిందో అని ఆశ్చర్యపడుతూ ఇంటికి వెళ్లిపోయాడు. అదే రోజున ఇద్దరు శిష్యులు పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎమ్మాయి అనే గ్రామానికి వెళ్తున్నారు. వారు జరిగిన ఈ విషయాలన్నిటిని గురించి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. వారు అలా మాట్లాడుకుంటూ, చర్చించుకుంటూ ఉన్నప్పుడు, యేసు తానే వారి దగ్గరకు వచ్చి వారితో కూడ నడిచారు; కానీ వారు ఆయనను గుర్తించకుండా వారి కళ్లు మూయబడ్డాయి. ఆయన వారిని, “మీరు నడుస్తూ మాట్లాడుకుంటున్న మాటలు ఏమిటి?” అని అడిగారు. అందుకు వారు దిగులు ముఖాలతో నిలబడిపోయారు. వారిలో క్లెయొపా అనేవాడు, “గత కొద్ది దినాల్లో యెరూషలేములో జరిగిన సంగతుల గురించి తెలియని వ్యక్తివి నీ ఒక్కడివేనా?” అని అడిగాడు. “ఏ విషయాలు?” అని ఆయన అడిగారు. అందుకు వారు, “నజరేయుడైన యేసును గురించి, ఆయన దేవుని ముందు ప్రజలందరి ముందు, మాటలోను కార్యాలలోను శక్తిగల ప్రవక్త. మన ముఖ్య యాజకులు అధికారులు ఆయనను మరణశిక్షకు అప్పగించి, సిలువ వేయించారు; కాని ఇశ్రాయేలు ప్రజలను విమోచించువాడు ఈయనే అని మేము నిరీక్షణ కలిగి ఉన్నాము. ఇంతకన్నా ఏముంది, ఇదంతా జరిగి నేటికీ మూడవ రోజు అవుతుంది. దానికి తోడు, మాలో కొందరు స్త్రీలు మమ్మల్ని ఆశ్చర్యపరిచారు. ఈ రోజు తెల్లవారగానే వారు సమాధి దగ్గరకు వెళ్లారు, ఆయన దేహం అక్కడ కనబడలేదు. వారు తిరిగివచ్చి, దేవదూతలు తమకు కనబడి ‘ఆయన బ్రతికే ఉన్నాడు’ అని చెప్పినట్లు మాకు చెప్పారు. మాతో కూడ ఉన్నవారిలో కొందరు సమాధి దగ్గరకు వెళ్లి, ఆ స్త్రీలు చెప్పినట్లే చూశారు, కానీ వారు యేసును చూడలేదు” అని ఆయనకు చెప్పారు. అందుకాయన, “మీరు ఎంత అవివేకులు, ప్రవక్తలు చెప్పిన మాటలను నమ్మలేని మందమతులుగా ఉన్నారు. క్రీస్తు ఈ శ్రమలు అనుభవించి తన మహిమలో ప్రవేశించకూడదా?” అని వారితో అన్నారు. ఆయన మోషే మొదలుకొని ప్రవక్తలందరు లేఖనాల్లో తనను గురించి వ్రాసిన విషయాలను వారికి వివరించారు. ఇంతలో వారు వెళ్లవలసిన గ్రామం సమీపించారు, అయితే యేసు ఇంకా ముందుకు వెళ్తున్నట్లు వారికి అనిపించింది. అందుకని వారు, “ప్రొద్దు గ్రుంకి, సాయంకాలం కావచ్చింది, కాబట్టి మాతో కూడ ఉండండి” అని చెప్పి ఆయనను బలవంతం చేశారు. కాబట్టి ఆయన వారితో కూడ ఇంట్లోకి వెళ్లారు. యేసు వారితో భోజనానికి కూర్చున్నప్పుడు, ఆయన ఒక రొట్టెను తీసుకుని, కృతజ్ఞత చెల్లించి, దానిని విరిచి వారికి ఇవ్వడం మొదలుపెట్టారు. అప్పుడు వారి కళ్లు తెరవబడి ఆయనను గుర్తుపట్టారు, అయితే ఆయన వారికి కనబడకుండా పోయారు. అప్పుడు వారు ఒకనితో ఒకడు, “ఆయన త్రోవలో మనతో మాట్లాడుతూ లేఖనాలు వివరిస్తూ ఉంటే మన అంతరంగంలో మన హృదయాలు మండుతున్నట్లు అనిపించలేదా?” అని చెప్పుకొన్నారు.