ఆది 42:18-38

ఆది 42:18-38 OTSA

మూడవ రోజున యోసేపు వారితో, “మీరు ఒక పని చేస్తే బ్రతికి ఉంటారు, ఎందుకంటే నేను దేవునికి భయపడేవాన్ని: మీరు నిజంగా యథార్థవంతులైతే, మీ సోదరులలో ఒకరిని ఇక్కడ చెరసాలలో ఉండనివ్వండి, మిగితా వారు ఆకలితో ఉన్న మీ ఇంటివారికి ధాన్యం తీసుకెళ్లండి. అయితే మీ చిన్న తమ్మున్ని నా దగ్గరకు తీసుకురావాలి, అప్పుడు మీ మాటలు స్థిరపరచబడతాయి, మీరు చావరు” అని అన్నాడు. వారు అలానే చేశారు. అప్పుడు వారు ఒకరితో ఒకరు, “మన తమ్మున్ని బట్టి మనం ఇలా శిక్షించబడుతున్నాము. తనను చంపవద్దని అతడు మనలను ఎంత వేడుకున్నా మనం వినలేదు అప్పుడు అతడు ఎంత బాధపడ్డాడో చూశాం; మనం చేసిన ఆ దోషం వల్లే ఇప్పుడు మనకు ఈ దుస్థితి వచ్చింది” అని మాట్లాడుకున్నారు. రూబేను జవాబిస్తూ, “ఈ చిన్నవాని పట్ల పాపం చేయవద్దని నేను చెప్పలేదా? అయినా మీరు వినిపించుకోలేదు! ఇప్పుడు తన రక్తం కోసం మనం లెక్క అప్పగించాలి” అన్నాడు. యోసేపు దగ్గర భాషను తర్జుమా చేసేవాడు ఉన్నాడని అతడు వారి మాటలు అర్థం చేసుకోగలడని వారు గ్రహించలేదు. యోసేపు వారి దగ్గర నుండి వెళ్లి ఏడ్చి తిరిగివచ్చి వారితో మళ్ళీ మాట్లాడాడు. వారిలో నుండి షిమ్యోనును పట్టుకుని వారి కళ్లముందే బంధించాడు. యోసేపు వారి సంచుల్లో ధాన్యం నింపి, ఎవరి బస్తాలో వారి వెండిని తిరిగి పెట్టి, ప్రయాణంలో వారికి అవసరమైన భోజనపదార్థాలు ఇవ్వుమని ఆదేశించాడు. వారు తమ ధాన్యాన్ని తమ గాడిదల మీద పెట్టుకుని వెళ్లిపోయారు. రాత్రి గడపడానికి ఒక స్థలంలో ఆగినప్పుడు, వారిలో ఒకడు గాడిదకు మేతపెడదామని సంచి విప్పాడు, గోనెసంచి విప్పగానే అందులో తన వెండి ఉండడం చూశాడు. “నా వెండి నాకు తిరిగి ఇవ్వబడింది, నా గోనెసంచిలోనే అది ఉంది” అని సోదరులకు చెప్పాడు. వారి హృదయాలు కలవరపడ్డాయి. వారు వణకుతూ, ఒకరి వైపు ఒకరు తిరిగి, “దేవుడు మనకిలా చేశారేంటి?” అని చెప్పుకున్నారు. వారు కనాను దేశంలో తమ తండ్రి యాకోబు దగ్గరకు వచ్చినప్పుడు, తమకు జరిగిందంతా అతనికి చెప్పారు. వారు అన్నారు, “ఆ దేశాధిపతి మాతో కఠినంగా మాట్లాడాడు, మేము ఆ దేశానికి వేగుచూడటానికి వచ్చామని అనుకున్నాడు. అతనికి, ‘మేము యథార్థవంతులం; వేగులవారం కాము. మేము పన్నెండుమంది సోదరులం, ఒక తండ్రి కుమారులము. ఒకడు చనిపోయాడు, కనిష్ఠుడు కనానులో తండ్రి దగ్గర ఉన్నాడు’ అని చెప్పాము. “ఆ దేశాధిపతి మాతో, ‘ఇలా మీరు యథార్థవంతులని నాకు తెలుస్తుంది: మీ సోదరులలో ఒకరిని ఇక్కడ నా దగ్గర వదిలేసి, ఆకలితో ఉన్న మీ ఇంటివారికి ఆహారం తీసుకెళ్లండి. కాని మీ తమ్మున్ని నా దగ్గరకు తీసుకురండి, తద్వారా మీరు యథార్థవంతులని తెలుసుకుంటాను. అప్పుడు మీ సోదరుని తిరిగి ఇచ్చేస్తాను, ఈ దేశంలో మీరు వ్యాపారం చేసుకోవచ్చు’ అన్నాడు.” వారు తమ గోనెసంచులను ఖాళీ చేస్తుండగా, ఎవరి గోనెసంచిలో వారి వెండి మూట ఉంది. వారు, వారి తండ్రి, వారి డబ్బు మూటలు చూసి భయపడిపోయారు. వారి తండ్రి యాకోబు వారితో, “మీరు నన్ను పిల్లలు కోల్పోయేలా చేశారు. యోసేపు లేడు, షిమ్యోను లేడు, ఇప్పుడు బెన్యామీనును కూడా తీసుకెళ్లాలని చూస్తున్నారు. ప్రతిదీ నాకు వ్యతిరేకంగా ఉంది!” అని అన్నాడు. అప్పుడు రూబేను తన తండ్రితో, “నేను బెన్యామీనును తిరిగి నీ దగ్గరకు తీసుకురాకపోతే, నా ఇద్దరు కుమారులను నీవు చంపవచ్చు. అతన్ని నాకు అప్పగించు, నేను తిరిగి అతన్ని నీ దగ్గరకు తీసుకువస్తాను” అన్నాడు. అయితే యాకోబు, “నా కుమారుడు నీతో అక్కడికి రాడు; అతని అన్న చనిపోయాడు, మిగిలింది ఒక్కడే. మీరు వెళ్లే ప్రయాణంలో ఏదైన హాని జరిగితే, మీరు నెరిసిన వెంట్రుకలతో ఉన్న నన్ను దుఃఖంలో సమాధికి తీసుకెళ్తారు” అని అన్నాడు.

చదువండి ఆది 42

ఆది 42:18-38 కోసం వీడియో