మత్తయి సువార్త 3:7-17

మత్తయి సువార్త 3:7-17 TSA

అయితే తాను బాప్తిస్మం ఇస్తున్న ప్రాంతానికి పరిసయ్యులు సద్దూకయ్యులలో చాలామంది రావడం చూసి అతడు వారితో, “సర్పసంతానమా! రానున్న ఉగ్రత నుండి తప్పించుకోడానికి మిమ్మల్ని ఎవరు హెచ్చరించారు? పశ్చాత్తాపానికి తగిన ఫలాలను ఫలించండి. ‘అబ్రాహాము మాకు తండ్రిగా ఉన్నాడు’ అని మీలో మీరు అనుకోవద్దు. దేవుడు ఈ రాళ్ల నుండి కూడా అబ్రాహాముకు సంతానం కలుగజేయగలడని మీతో చెప్తున్నాను. ఇప్పటికే గొడ్డలి చెట్ల వేరు దగ్గర పెట్టబడింది. మంచి పండ్లు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది. “పశ్చాత్తాపం కోసం నేను నీటితో మీకు బాప్తిస్మమిస్తున్నాను. కాని నా తర్వాత రానున్నవాడు నాకన్నా శక్తిమంతుడు, ఆయన చెప్పులు విప్పడానికి కూడా నేను యోగ్యున్ని కాదు. ఆయన మీకు పరిశుద్ధాత్మతో, అగ్నితో బాప్తిస్మం ఇస్తారు. గోధుమల నుండి పొట్టును వేరు చేయడానికి తన చేతిలో చేటతో ఆయన సిద్ధంగా ఉన్నారు. ఆయన గోధుమలను తన ధాన్యపు కొట్టులో పోసి, తన నూర్చెడి కళ్లాన్ని శుభ్రం చేసి, పొట్టును ఆరని అగ్నిలో కాల్చివేస్తారు” అని అన్నాడు. అప్పుడు యేసు యోహాను చేత బాప్తిస్మం పొందడానికి గలిలయ నుండి యొర్దానుకు వచ్చారు. కాని యోహాను ఆయనతో, “నేనే నీ ద్వారా బాప్తిస్మం పొందాలి, అలాంటిది నీవు నా దగ్గరకు వస్తున్నావా?” అని అంటూ యేసును ఆపడానికి ప్రయత్నించాడు. అందుకు యేసు, “ఇప్పటికి ఇలా కానివ్వు. నీతి అంతటిని నెరవేర్చడానికి ఇలా చేయడం మనకు సరియైనది” అని చెప్పారు. కాబట్టి యోహాను ఒప్పుకున్నాడు. యేసు బాప్తిస్మం పొంది నీళ్లలో నుండి బయటకు వచ్చారు. ఆ క్షణంలో ఆకాశం తెరువబడి, దేవుని ఆత్మ పావురంలా దిగి వచ్చి ఆయన మీద వాలడం అతడు చూశాడు. పరలోకం నుండి ఒక స్వరం ఇలా చెప్పడం వినపడింది: “ఈయన నా ప్రియ కుమారుడు; ఈయనయందు నేను ఎంతో ఆనందిస్తున్నాను.”