ఆది 41:17-57

ఆది 41:17-57 TSA

అప్పుడు ఫరో యోసేపుతో అన్నాడు, “నా కలలో నేను నైలు నది తీరాన నిలబడ్డాను, నదిలో నుండి పుష్టిగా అందంగా ఉన్న ఏడు ఆవులు పైకి వచ్చి జమ్ము మధ్య మేస్తున్నాయి. వాటి తర్వాత చిక్కిపోయి వికారంగా ఉన్న మరో ఏడు ఆవులు పైకి వచ్చాయి. అంత వికారమైన ఆవులను ఈజిప్టులో నేనెప్పుడు చూడలేదు. బక్కగా వికారంగా ఉన్న ఆవులు ముందు వచ్చిన పుష్టిగా ఉన్న ఏడు ఆవులను తినివేశాయి. కానీ అవి తిన్నా కూడా అవి తిన్నాయని ఎవరు చెప్పలేరు; అవి ముందు ఉన్నట్లే వికారంగా ఉన్నాయి. అప్పుడు నేను నిద్రలేచాను. “నా కలలో పుష్టిగా మంచిగా ఉన్న ఏడు వెన్నులు ఒకే కాడకు పెరుగుతున్నాయి. వాటి తర్వాత పీలగా తూర్పుగాలికి ఎండిపోయిన మరో పీలవెన్నులు వాటి తర్వాత మొలిచాయి. పీలవెన్నులు పుష్టిగా ఉన్న ఏడు వెన్నులను మ్రింగివేశాయి. ఇది మాంత్రికులకు చెప్పాను, కానీ దాని అర్థాన్ని చెప్పేవారు ఎవరూ లేరు.” అప్పుడు యోసేపు ఫరోకు చెప్పాడు, “ఫరో కలల భావం ఒక్కటే. దేవుడు ఏమి చేయబోతున్నారో ఫరోకు తెలియజేశారు. ఆ ఏడు మంచి ఆవులు ఏడు సంవత్సరాలు, అలాగే ఏడు మంచి వెన్నులు ఏడు సంవత్సరాలు; రెండు కలల భావం ఒకటే. వాటి తర్వాత వచ్చిన చిక్కిపోయి వికారంగా ఉన్న ఏడు ఆవులు ఏడు సంవత్సరాలు, పీలగా తూర్పుగాలికి ఎండిపోయిన ఏడు వెన్నులు కూడా అవే ఏడు సంవత్సరాలు; అవి ఏడు సంవత్సరాలు కరువు కాలము. “నేను ఫరోకు చెప్పినట్టే జరుగుతుంది. దేవుడు తాను ఏమి చేయబోతున్నారో ఫరోకు చూపించారు. ఈజిప్టు దేశమంతటా గొప్ప సమృద్ధిగల ఏడు సంవత్సరాలు రాబోతున్నాయి. కానీ వాటి తర్వాత ఏడు సంవత్సరాలు కరువు వస్తుంది. ఆ సమయంలో ఈజిప్టులో ఉండే సమృద్ధి అందరు మరిచిపోతారు, కరువు దేశాన్ని నాశనం చేస్తుంది. తర్వాత వచ్చే కరువు ఇంకా తీవ్రంగా ఉంటుంది కాబట్టి దేశంలో ఉండిన సమృద్ధి ఎవరికీ జ్ఞాపకం ఉండదు. కల రెండు విధాలుగా ఫరోకు ఇవ్వబడిన కారణం ఏంటంటే ఇది దేవునిచే దృఢంగా నిర్ణయించబడింది, దేవుడు త్వరలో దానిని చేస్తారు. “ఇప్పుడు ఫరో జ్ఞాన వివేచనలు కలిగిన ఒక వ్యక్తిని ఈజిప్టు అంతటి మీద అధికారిగా నియమించాలి. సమృద్ధిగా పండే ఏడు సంవత్సరాల్లో పంటలో అయిదవ భాగాన్ని సేకరించడానికి ఫరో దేశమంతా పర్యవేక్షకులను నియమించాలి. వారు ఈ మంచి సంవత్సరాల్లో పండే ధాన్యం సేకరించి ఫరో ఆధీనంలో పట్టణాల్లో ఆహారం ఉండేలా నిలువచేయాలి. ఈ ఆహారం దేశం కోసం నిలువచేయబడి ఈజిప్టు మీదికి వచ్చే ఏడు సంవత్సరాల కరువు కాలంలో ఉపయోగించబడుతుంది, అప్పుడు కరువు ద్వారా దేశం నాశనం కాదు.” ఈ మాట ఫరోకు అతని అధికారులకు నచ్చింది. కాబట్టి ఫరో వారిని, “ఇతనిలా దేవుని ఆత్మ కలిగిన వారెవరినైనా కనుగొనగలమా?” అని అడిగాడు. అప్పుడు ఫరో యోసేపుతో, “దేవుడు నీకు ఇదంతా తెలియజేశారు కాబట్టి, నీలా వివేచన జ్ఞానం కలిగిన వారెవరూ లేరు. నా రాజభవన అధికారిగా నీవు ఉంటావు, నా ప్రజలంతా నీ ఆదేశాలకు లోబడతారు. సింహాసనం విషయంలో మాత్రమే నేను నీ పైవాడిగా ఉంటాను” అని అన్నాడు. కాబట్టి ఫరో యోసేపుతో, “నేను నిన్ను ఈజిప్టు దేశమంతటికి అధికారిగా ప్రకటిస్తున్నాను” అని అన్నాడు. ఫరో తన రాజముద్ర ఉంగరం తీసి యోసేపు వ్రేలికి పెట్టాడు. సన్నని నారబట్టలు అతనికి తొడిగించాడు, అతని మెడలో బంగారు గొలుసు వేశాడు. తన రెండవ రథంలో అతన్ని కూర్చోబెట్టాడు, అప్పుడు ప్రజలు, “నమస్కారం చేయండి!” అని అంటూ అతని ముందు కేకలు వేశారు. ఈ విధంగా అతడు యోసేపును దేశమంతటిమీద అధికారిగా చేశాడు. అప్పుడు ఫరో యోసేపుతో, “నేను ఫరోను, కానీ నీ అనుమతి లేకుండా ఈజిప్టు అంతటిలో ఎవరు కూడా తన చేయి కానీ కాలు కానీ ఎత్తరు” అని అన్నాడు. ఫరో యోసేపుకు జఫెనత్-ఫనేహు అనే పేరు పెట్టాడు, ఓనులో యాజకుడైన పోతీఫెర కుమార్తె, ఆసెనతును అతనికి భార్యగా ఇచ్చాడు. యోసేపు ఈజిప్టు దేశమంతటా పర్యటించాడు. యోసేపు ఈజిప్టు రాజైన ఫరో సేవ మొదలుపెట్టినప్పుడు అతని వయస్సు ముప్పై సంవత్సరాలు. యోసేపు ఫరో ఎదుట నుండి వెళ్లి, ఈజిప్టు దేశమంతా సంచరించాడు. ఏడు సమృద్ధిగల సంవత్సరాల్లో భూమిపై విస్తారమైన పంట పండింది. యోసేపు ఈజిప్టులో ఆ ఏడు సంవత్సరాల పంటనంతా సేకరించి పట్టణాల్లో నిల్వచేశాడు. ప్రతి పట్టణం చుట్టూ ఉన్న పొలాల్లో సేకరించిన ధాన్యాన్ని ఆ పట్టణాల్లోనే నిల్వచేశాడు. యోసేపు సముద్రతీరాన ఇసుకంత విస్తారంగా ధాన్యాన్ని నిలువచేశాడు; అది విస్తారంగా ఉంది కాబట్టి దాన్ని కొలవడం ఆపేశాడు. కరువు సంవత్సరాలకు ముందు యోసేపుకు ఓనులో యాజకుడైన పోతీఫెర కుమార్తె, ఆసెనతు ద్వారా ఇద్దరు కుమారులు పుట్టారు. తన మొదటి కుమారునికి యోసేపు మనష్షే అని పేరు పెట్టి, “దేవుడు నా కష్టాలన్నీ, నా తండ్రి ఇంటివారందరినీ మరచిపోయేలా చేశారు” అని అన్నాడు. రెండవ కుమారునికి ఎఫ్రాయిం అని పేరు పెట్టి, “నాకు శ్రమలు కలిగిన దేశంలో దేవుడు నన్ను అభివృద్ధి చేశారు” అని అన్నాడు. ఈజిప్టులో సమృద్ధి కలిగిన ఏడు సంవత్సరాలు ముగిశాయి, యోసేపు చెప్పినట్టే ఏడు సంవత్సరాల కరువు ప్రారంభమయ్యింది. ఇతర దేశాల్లో కరువు ఉన్నది కానీ ఈజిప్టు దేశమంతా ఆహారం ఉంది. ఈజిప్టు అంతా కరువు అనుభవించడం ప్రారంభమైనప్పుడు, ఆహారం కోసం ప్రజలు ఫరోకు మొరపెట్టారు. అప్పుడు ఫరో ఈజిప్టు వారందరితో, “యోసేపు దగ్గరకు వెళ్లి అతడు చెప్పినట్టు చేయండి” అని చెప్పాడు. దేశమంతటా కరువు వ్యాపించినప్పుడు, యోసేపు ధాన్య కొట్లన్నీ తెరిచి, ఈజిప్టువారికి ధాన్యం అమ్మాడు, ఎందుకంటే ఈజిప్టు దేశంలో కరువు చాలా తీవ్రంగా ఉంది. లోకమంతా ఈజిప్టుకు వచ్చి యోసేపు దగ్గర ధాన్యం కొనుగోలు చేశారు, ఎందుకంటే కరువు అంతటా తీవ్రంగా ఉంది.

చదువండి ఆది 41

ఆది 41:17-57 కోసం వీడియో