కీర్తనల గ్రంథము 9:1-12

కీర్తనల గ్రంథము 9:1-12 TERV

పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతిస్తాను. యెహోవా, నీవు చేసిన అద్భుతకార్యాలన్నింటిని గూర్చి నేను చెబుతాను. నీవు నన్ను ఎంతగానో సంతోషింపజేస్తున్నావు. మహోన్నతుడవైన దేవా, నీ నామానికి నేను స్తుతులు పాడుతాను. నా శత్రువులు నీ నుండి పారిపోయేందుకు మళ్లుకొన్నారు. కాని వారు పడిపోయి, నాశనం చేయబడ్డారు. నీవే మంచి న్యాయమూర్తివి. న్యాయమూర్తిగా నీవు నీ సింహాసనం మీద కూర్చున్నావు. యెహోవా, నీవు నా వ్యాజ్యెం విన్నావు. మరియు నన్ను గూర్చి న్యాయ నిర్ణయం చేశావు. యూదులు కాని ఆ మనుష్యులతో నీవు కఠినంగా మాట్లాడావు. యెహోవా, ఆ చెడ్డ మనుష్యుల్ని నీవు నాశనం చేశావు. బతికి ఉన్న మనుష్యుల జాబితాలో నుండి శాశ్వతంగా ఎప్పటికి వారి పేర్లను నీవు తుడిచి వేసావు. శత్రువు పని అంతం అయిపోయింది. యెహోవా, వారి పట్టణాలను నీవు నాశనం చేశావు. ఇప్పుడు శిథిల భవనాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ దుర్మార్గపు ప్రజలను జ్ఞాపకం చేసుకొనేటట్టు చేసేది ఏమీ మిగల్లేదు. అయితే యెహోవా శాశ్వతంగా పరిపాలిస్తాడు. యెహోవా తన రాజ్యాన్ని బలమైనదిగా చేసాడు. లోకానికి న్యాయం చేకూర్చేందుకు ఆయన దీనిని చేశాడు. భూమి మీద మనుష్యులందరికీ యెహోవా న్యాయంగా తీర్పు తీరుస్తాడు. యెహోవా రాజ్యాలన్నింటికి ఒకే విధంగా తీర్పు తీరుస్తాడు. అనేకమంది ప్రజలకు అనేక కష్టాలు ఉన్నాయి గనుక వారు చిక్కుబడి, బాధ పొందుతున్నారు. ఆ ప్రజలు వారి సమస్యల భారంతో నలిగిపోతున్నారు. యెహోవా, వారు పారిపోవుటకు భద్రతాస్థలంగా ఉండుము. నీ నామం తెలిసిన ప్రజలు నీమీద విశ్వాసం ఉంచాలి. యెహోవా, ప్రజలు నీ దగ్గరకు వస్తే సహాయం చేయకుండా నీవు వారిని విడిచి పెట్టవు. సీయోనులో నివసిస్తున్న ప్రజలారా, మీరు యెహోవాకు స్తుతులు పాడండి. యెహోవా చేసిన గొప్ప కార్యాలను గూర్చి ఇతర దేశాలతో చెప్పండి. సహాయం కోసం యెహోవా దగ్గరకు వెళ్లిన వారిని ఆయన జ్ఞాపకం చేసుకొన్నాడు. ఆ దీన ప్రజలు సహాయం కోసం మొరపెట్టారు. మరి యెహోవా వారిని మరచిపోలేదు.