మార్కు 5

5
1వారాసముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. 2ఆయన దోనె దిగగానే, అపవిత్రాత్మ పెట్టినవాడొకడు సమాధులలోనుండి వచ్చి, ఆయన కెదురు పడెను. 3వాడు సమాధులలో వాసము చేసెడివాడు, సంకెళ్లతోనైనను ఎవడును వాని బంధింపలేకపోయెను. 4పలుమారు వాని కాళ్లకును చేతులకును సంకెళ్లు వేసి బంధించినను, వాడు ఆ చేతిసంకెళ్లు తెంపి, కాలిసంకెళ్లను తుత్తునియలుగా చేసెను గనుక ఎవడును వానిని సాధు పరచలేకపోయెను. 5వాడు ఎల్లప్పుడును రాత్రింబగళ్లు సమాధులలోను కొండలలోను కేకలువేయుచు, తన్నుతాను రాళ్లతో గాయపరచుకొనుచు నుండెను. 6వాడు దూరమునుండి యేసును చూచి, పరుగెత్తికొనివచ్చి, ఆయనకు నమస్కారముచేసి 7–యేసూ, సర్వోన్నతుడైన దేవునికుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచకుమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను. 8ఎందుకనగా ఆయన–అపవిత్రాత్మా, యీ మనుష్యుని విడిచి పొమ్మని వానితో చెప్పెను. 9మరియు ఆయన–నీ పేరేమని వానినడుగగా వాడు–నా పేరు సేన, యేలయనగా మేము అనేకులమని చెప్పి 10తమ్మును ఆ దేశములోనుండి తోలివేయవద్దని ఆయనను మిగుల బతిమాలుకొనెను. 11అక్కడ కొండదగ్గర పందుల పెద్ద మంద మేయుచుండెను. 12గనుక – ఆ పందులలో ప్రవేశించునట్లు మమ్మును వాటియొద్దకు పంపుమని, ఆ దయ్యములు ఆయనను బతిమాలుకొనెను. 13యేసు వాటికి సెలవియ్యగా ఆ అపవిత్రాత్మలు వానిని విడిచి పందులలో ప్రవేశించెను. ప్రవేశింపగా ఇంచుమించు రెండువేల సంఖ్యగల ఆ మంద ప్రపాతమునుండి సముద్రపుదారిని వడిగా పరుగెత్తికొనిపోయి, సముద్రములో పడి ఊపిరి తిరుగక చచ్చెను. 14ఆ పందులు మేపుచున్నవారు పారిపోయి పట్టణములోను గ్రామములలోను ఆ సంగతి తెలియజేసిరి. 15జనులు జరిగినది చూడ వెళ్లి యేసునొద్దకు వచ్చి, సేన అను దయ్యములు పెట్టినవాడు బట్టలు ధరించుకొని, స్వస్థచిత్తుడై కూర్చుండియుండుట చూచి భయపడిరి. 16జరిగినది చూచినవారు దయ్యములు పెట్టినవానికి కలిగిన స్థితియు పందుల సంగతియు ఊరివారికి తెలియ జేయగా 17తమ ప్రాంతములు విడిచిపొమ్మని వారాయనను బతిమాలుకొనసాగిరి. 18ఆయన దోనెయెక్కినప్పుడు, దయ్యములు పెట్టినవాడు ఆయనయొద్ద తన్నుండనిమ్మని ఆయనను బతిమాలుకొనెను గాని 19ఆయన వానికి సెలవియ్యక–నీవు నీ యింటివారియొద్దకు వెళ్లి, ప్రభువు నీయందు కనికరపడి, నీకు చేసిన కార్యములన్నిటిని వారికి తెలియజెప్పుమనెను. 20వాడు వెళ్లి, యేసు తనకు చేసిన వన్నియు దెకపొలిలో ప్రకటింప నారంభింపగా అందరు ఆశ్చర్యపడిరి.
21యేసు మరల దోనె యెక్కి అద్దరికి వెళ్లినప్పుడు బహుజనసమూహము ఆయనయొద్దకు కూడివచ్చెను. 22ఆయన సముద్రతీరమున నుండగా సమాజమందిరపు అధికారులలో యాయీరను నొకడు వచ్చి, ఆయనను చూచి ఆయన పాదములమీదపడి 23–నా చిన్నకుమార్తె చావనై యున్నది; అది బాగుపడి బ్రదుకునట్లు నీవు వచ్చి దానిమీద నీచేతులుంచవలెనని ఆయనను మిగుల బతిమాలుకొనగా 24ఆయన అతనితోకూడ వెళ్లెను; బహుజనసమూహమును ఆయనను వెంబడించి ఆయన మీద పడుచుండిరి.
25పండ్రెండేండ్లనుండి రక్తస్రావ రోగము కలిగిన యొక స్త్రీ యుండెను. ఆమె అనేక వైద్యులచేత ఎన్నో తిప్పలుపడి 26తనకు కలిగినదంతయు వ్యయము చేసికొని, యెంతమాత్రమును ప్రయోజనములేక మరింత సంకట పడెను. 27-28ఆమె యేసునుగూర్చి విని–నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుదుననుకొని, జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. 29వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరములోని ఆ బాధ నివారణయైనదని గ్రహించుకొనెను. 30వెంటనే యేసు తనలోనుండి ప్రభావము బయలువెళ్లెనని తనలోతాను గ్రహించి, జనసమూహమువైపు తిరిగి–నా వస్త్రములు ముట్టిన దెవరని అడుగగా 31ఆయన శిష్యులు –జనసమూహము నీ మీద పడుచుండుట చూచుచున్నావే; నన్నుముట్టినదెవడని అడుగుచున్నావా? అనిరి. 32ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలెనని ఆయన చుట్టు చూచెను. 33అప్పుడా స్త్రీ తనకు జరిగినది యెరిగి, భయపడి, వణకుచువచ్చి, ఆయన ఎదుట సాగిలపడి, తన సంగతి యంతయు ఆయనతో చెప్పెను. 34అందుకాయన – కుమారీ, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానవై పొమ్ము; నీ బాధ నివారణయై నీకు స్వస్థత కలుగుగాక అని ఆమెతో చెప్పెను.
35ఆయన ఇంకను మాటలాడుచుండగా, సమాజమందిరపు అధికారి యింటనుండి కొందరు వచ్చి–నీ కుమార్తె చనిపోయినది; నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు వనిరి. 36యేసు వారు చెప్పినమాట లక్ష్యపెట్టక–భయపడకుము, నమ్మిక మాత్రముంచుమని సమాజమందిరపు అధికారితో చెప్పి 37పేతురు, యాకోబు, యాకోబు సహోదరుడగు యోహాను అనువారిని తప్ప మరి ఎవరినైనను తన వెంబడి రానియ్యక 38సమాజమందిరపు అధికారి యింటికి వచ్చి, వారు గొల్లుగానుండి చాల యేడ్చుచు, ప్రలాపించుచు నుండుట చూచి 39లోపలికిపోయి– మీరేల గొల్లుచేసి యేడ్చుచున్నారు? ఈ చిన్నది నిద్రించు చున్నదేగాని చనిపోలేదని వారితో చెప్పెను. 40అందుకు వారు ఆయనను అపహసించిరి. అయితే ఆయన వారినందరిని బయటకు పంపివేసి, ఆ చిన్నదాని తలిదండ్రులను తనతో ఉన్నవారిని వెంటబెట్టుకొని, ఆ చిన్నది పరుండి యున్న గదిలోనికి వెళ్లి 41ఆ చిన్నదాని చెయిపెట్టి– తలీతాకుమీ అని ఆమెతో చెప్పెను. ఆ మాటకు చిన్నదానా, లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము. 42వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగెను; ఆమె పండ్రెండు సంవత్సరముల ప్రాయము గలది. వెంటనే వారు బహుగా విస్మయమొందిరి. 43జరిగినది ఎవనికి తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి, ఆమెకు ఆహారము పెట్టుడని చెప్పెను.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

మార్కు 5: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in