ప్రకటన 6:7-11
ప్రకటన 6:7-11 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
ఆ వధించబడిన గొర్రెపిల్ల నాలుగవ ముద్రను విప్పినప్పుడు, నాలుగవ ప్రాణి, “వచ్చి చూడు!” అని చెప్పడం నేను విన్నాను. అప్పుడు నాకు బూడిద రంగు గుర్రం కనబడింది. దాని మీద సవారిచేసేవాని పేరు మృత్యువు, పాతాళం అతన్ని అతి సమీపంగా వెంబడిస్తుంది. ఖడ్గంతో, కరువుతో, తెగుళ్ళతో ఇంకా భూమి మీద ఉండే క్రూర మృగాలతో ప్రజలను చంపడానికి భూమి నాలుగవ భాగంపై అతనికి అధికారం ఇవ్వబడింది. ఆ వధించబడిన గొర్రెపిల్ల అయిదవ ముద్రను విప్పినప్పుడు, దేవుని వాక్యం బట్టి తాము ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి వధించబడిన వారి ఆత్మలను ఒక బలిపీఠం క్రింద చూశాను. వారు పెద్ద స్వరంతో, “ఓ సర్వశక్తిగల ప్రభువా! పరిశుద్ధుడా, సత్యవంతుడా, మా రక్తానికి ప్రతిగా భూనివాసులను తీర్పు తీర్చడానికి ఇంకా ఎంతకాలం?” అని కేకలు వేశారు. అప్పుడు వారిలో అందరికి తెల్లని వస్త్రాలను ఇచ్చి, “మీలాగే ఇంకా హతులైన మీ తోటి సేవకుల, సహోదరీ సహోదరుల సంఖ్య పూర్తయ్యే వరకు ఇంకా కొంతకాలం వేచి ఉండాలి” అని వారికి చెప్పబడింది.
ప్రకటన 6:7-11 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
గొర్రెపిల్ల నాలుగవ సీలు తెరచినప్పుడు, “ఇలా రా” అని నాలుగవ ప్రాణి చెప్పడం విన్నాను. అప్పుడు బూడిద రంగులో పాలిపోయినట్టు ఉన్న ఒక గుర్రం కనిపించింది. దాని మీద కూర్చున్న వాడి పేరు మరణం. పాతాళం వాడి వెనకే వస్తూ ఉంది. కత్తితో, కరువుతో, వ్యాధులతో, క్రూరమృగాలతో చంపడానికి భూమి మీద నాలుగవ భాగంపై అతనికి అధికారం ఇవ్వడం జరిగింది. ఆయన అయిదవ సీలు తెరచినప్పుడు దేవుని వాక్కు కోసమూ, తమ సాక్ష్యం కారణంగానూ హతమైన వారి ఆత్మలను ఒక బలిపీఠం కింద చూశాను. వారు బిగ్గరగా ఇలా అరుస్తున్నారు, “సర్వాధికారీ, పరిశుద్ధుడా, సత్యవంతుడా, ఎంతకాలం ఇలా తీర్పు తీర్చకుండా ఉంటావు? మా రక్తానికి ప్రతిగా భూమిపై ఉన్నవారిని శిక్షించకుండా ఎంతకాలం ఉంటావు?” అప్పుడు వారిలో ప్రతి ఒక్కరికీ తెల్లని దుస్తులు ఇచ్చారు. “మీలాగే హతం కావాల్సిన మీ తోటి సేవకుల, సోదర సోదరీల లెక్క మొత్తం పూర్తి అయేంతవరకూ ఇంకా కొంత సమయం వేచి ఉండాలి” అని వారికి చెప్పడం జరిగింది.
ప్రకటన 6:7-11 పవిత్ర బైబిల్ (TERV)
ఆ గొఱ్ఱెపిల్ల నాల్గవ ముద్రను తీసినప్పుడు నాల్గవ ప్రాణి “రా!” అని అనటం విన్నాను. అక్కడ నా ముందు పాలిపోయినట్టుగా ఉన్న ఒక గుఱ్ఱం కనిపించింది. దాని రౌతు పేరు “మృత్యువు.” మృత్యులోకము వానిని అనుసరిస్తూ వాని వెనుకనే ఉంది. భూమి నాల్గవ వంతుపై అతనికి అధికారం యివ్వబడింది. కత్తితో, కరువుతో, తెగులుతో, క్రూర మృగాలతో భూనివాసులను చంపటానికి అతనికి అధికారం యివ్వబడింది. ఆ గొఱ్ఱెపిల్ల ఐదవ ముద్రను తీసినప్పుడు, వధింపబడిన ఆత్మల్ని బలిపీఠం క్రింద చూసాను. వీళ్ళు దేవుని సందేశాన్ని బోధించటంవల్ల మరియు సాక్ష్యం చెప్పటంవల్ల వధింపబడినవాళ్ళు. వాళ్ళు పెద్ద స్వరంతో, “మహా ప్రభూ! నీవు పరిశుద్ధుడవు, సత్యవంతుడవు. ఈ భూమ్మీద నివసించేవాళ్ళపై తీర్పు చెప్పటానికి, మా రక్తము నిమిత్తము పగ తీర్చుకోవటానికి యింకా ఎంతకాలం పడ్తుంది?” అని అన్నారు. ఆ తర్వాత ప్రతి ఒక్కరికి ఒక తెల్లటి వస్త్రం యివ్వబడింది. “మీరు చంపబడినట్లే, మీ తోటి సేవకులు, సోదరులు చంపబడతారు. వాళ్ళ సంఖ్య ముగిసే వరకు మీరు మరికొంత కాలం కాచుకొని ఉండాలి” అని వాళ్ళకు తెలుపబడింది.
ప్రకటన 6:7-11 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఆయన నాలుగవ ముద్రను విప్పినప్పుడు–రమ్ము అని నాలుగవ జీవి చెప్పుట వింటిని. అప్పుడు నేను చూడగా, ఇదిగో పాండుర వర్ణముగల ఒక గుఱ్ఱము కనబడెను; దాని మీద కూర్చున్నవాని పేరు మృత్యువు. పాతాళ లోకము వానిని వెంబడించెను. ఖడ్గమువలనను కరవువలనను మరణమువలనను భూమిలోనుండు క్రూరమృగములవలనను భూనివాసులను చంపుటకు భూమియొక్క నాలుగవభాగముపైన అధికారము వానికియ్యబడెను. ఆయన అయిదవ ముద్రను విప్పినప్పుడు, దేవుని వాక్యము నిమిత్తమును, తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడినవారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. వారు–నాథా, సత్యస్వరూపీ, పరిశుద్ధుడా, యెందాక తీర్పు తీర్చకయు, మా రక్తము నిమిత్తము భూని వాసులకు ప్రతి దండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలువేసిరి. తెల్లని వస్త్రము వారిలో ప్రతివాని కియ్య బడెను; మరియు–వారివలెనే చంపబడబోవువారి సహ దాసులయొక్కయు సహోదరులయొక్కయు లెక్క పూర్తియగువరకు ఇంక కొంచెము కాలము విశ్రమింపవలెనని వారితో చెప్పబడెను.