లూకా 4:38-41
లూకా 4:38-41 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
యేసు సమాజమందిరం నుండి బయటకు వచ్చి సీమోను ఇంటికి వెళ్లారు. సీమోను అత్త తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ ఉంది, కాబట్టి వారు ఆమెకు సహాయం చేయమని యేసును అడిగారు. కాబట్టి ఆయన ఆమె వైపుకు వంగి జ్వరాన్ని గద్దించారు, జ్వరం ఆమెను వదిలిపోయింది. వెంటనే ఆమె లేచి వారికి పరిచారం చేయడం మొదలుపెట్టింది. సూర్యుడు అస్తమించినప్పుడు, ప్రజలు వివిధ రోగాలు గలవారినందరిని యేసు దగ్గరకు తీసుకువచ్చారు, ఆయన వారందరి మీద తన చేతులుంచి, వారిని స్వస్థపరిచారు. అంతేకాక, చాలామందిలో నుండి దయ్యాలు, “నీవు దేవుని కుమారుడవు” అని కేకలువేస్తూ బయటకు వచ్చాయి! కాని తాను క్రీస్తు అని వాటికి తెలుసు, కాబట్టి ఆయన వాటిని గద్దించి మాట్లాడనివ్వలేదు.
లూకా 4:38-41 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఆయన సమాజ మందిరం నుండి, సీమోను ఇంటికి వెళ్ళాడు. సీమోను అత్త తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ ఉంది. ఆమెను బాగు చేయాలని వారాయన్ని బతిమిలాడారు. ఆయన ఆమె దగ్గర నిలబడి జ్వరాన్ని మందలించగానే జ్వరం ఆమెను విడిచింది. వెంటనే ఆమె లేచి వారికి సేవ చేయసాగింది. పొద్దుగుంకుతున్నపుడు అనేక రకాల జబ్బులున్న వారిని యేసు దగ్గరికి తెచ్చారు. వారిలో ప్రతి ఒక్కరి మీదా ఆయన చేతులుంచి బాగు చేశాడు. వారిలో చాలామందిలో నుండి దయ్యాలు, “నీవు దేవుని కుమారుడివి” అని కేకలు వేస్తూ బయటికి వెళ్ళిపోయాయి. ఆయన క్రీస్తు అని వాటికి తెలుసు కాబట్టి ఆయన వాటిని గద్దించి వాటిని మాట్లాడనివ్వలేదు.
లూకా 4:38-41 పవిత్ర బైబిల్ (TERV)
యేసు సమాజమందిరాన్ని వదిలి సీమోను యింటికి వెళ్ళాడు. సీమోను అత్తకు జ్వరం తీవ్రంగా ఉంది. వాళ్ళు ఆమె జ్వరాన్ని గురించి యేసుకు చెప్పారు. యేసు, ఆమె దగ్గరకు వచ్చి జ్వరాన్ని వదిలి పొమ్మని గద్దించాడు. జ్వరం ఆమెను వదిలి వెళ్ళిపోయింది. వెంటనే ఆమె లేచి అందరిని ఆదరించటం మొదలు పెట్టింది. సూర్యాస్తమయమౌతుండగా ప్రజలు రక రకాల రోగాలున్న వాళ్ళను ఆయన దగ్గరకు తీసుకు వచ్చారు. ఆయన ప్రతి ఒక్కరి మీద తన చేతుల్ని ఉంచి అందరిని నయం చేశాడు. “నీవు దేవుని కుమారుడవు” అని బిగ్గరగా కేకలు వేస్తూ చాలా మంది నుండి దయ్యాలు బయటకు వచ్చాయి. వాటికి తాను క్రీస్తు అని తెలియటం వల్ల యేసు వాటిని మాట్లాడవద్దని గద్దించాడు.
లూకా 4:38-41 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఆయన సమాజమందిరములోనుండి లేచి, సీమోను ఇంటిలోనికి వెళ్లెను. సీమోను అత్త తీవ్రమైన జ్వరముతో పడియుండెను గనుక ఆమె విషయమై ఆయనయొద్ద మనవి చేసికొనిరి. ఆయన ఆమె చెంతను నిలువబడి, జ్వరమును గద్దింపగానే అది ఆమెను విడిచెను; వెంటనే ఆమె లేచి వారికి ఉపచారము చేయసాగెను. సూర్యుడస్తమించుచుండగా నానావిధ రోగములచేత పీడింపబడుచున్నవారు ఎవరెవరియొద్దనుండిరో వారందరు ఆ రోగులను ఆయనయొద్దకు తీసికొని వచ్చిరి; అప్పుడాయన వారిలో ప్రతివానిమీద చేతులుంచి, వారిని స్వస్థపరచెను. ఇంతేకాక దయ్యములు–నీవు దేవుని కుమారుడవని కేకలు వేసి అనేకులను వదలిపోయెను; ఆయన క్రీస్తు అని వాటికి తెలిసియుండెను గనుక ఆయన వాటిని గద్దించి వాటిని మాటాడనీయలేదు.
లూకా 4:38-41 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
యేసు సమాజమందిరం నుండి బయటకు వచ్చి సీమోను ఇంటికి వెళ్లారు. సీమోను అత్త తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ ఉంది, కాబట్టి వారు ఆమెకు సహాయం చేయమని యేసును అడిగారు. కాబట్టి ఆయన ఆమె వైపుకు వంగి జ్వరాన్ని గద్దించారు, జ్వరం ఆమెను వదిలిపోయింది. వెంటనే ఆమె లేచి వారికి పరిచారం చేయడం మొదలుపెట్టింది. సూర్యుడు అస్తమించినప్పుడు, ప్రజలు వివిధ రోగాలు గలవారినందరిని యేసు దగ్గరకు తీసుకువచ్చారు, ఆయన వారందరి మీద తన చేతులుంచి, వారిని స్వస్థపరిచారు. అంతేకాక, చాలామందిలో నుండి దయ్యాలు, “నీవు దేవుని కుమారుడవు” అని కేకలువేస్తూ బయటకు వచ్చాయి! కాని తాను క్రీస్తు అని వాటికి తెలుసు, కాబట్టి ఆయన వాటిని గద్దించి మాట్లాడనివ్వలేదు.