యిర్మీయా 3:6-18

యిర్మీయా 3:6-18 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

యోషీయా రాజు పాలనలో యెహోవా నాతో ఇలా అన్నారు, “నమ్మకద్రోహియైన ఇశ్రాయేలు ఏమి చేసిందో చూశావా? ఆమె ఎత్తైన ప్రతి కొండ మీదికి, పచ్చని ప్రతి చెట్టు క్రిందికి వెళ్లి, వ్యభిచారం చేసింది. ఇదంతా చేసిన తర్వాత ఆమె నా దగ్గరకు తిరిగి వస్తుందని నేను అనుకున్నాను, కానీ ఆమె అలా చేయలేదు, ఆమె నమ్మకద్రోహియైన సోదరి యూదా దానిని చూసింది. నేను విశ్వాసంలేని ఇశ్రాయేలుకు తన విడాకుల ధృవీకరణ పత్రాన్ని ఇచ్చి, ఆమె చేసిన వ్యభిచారాలన్నిటిని బట్టి ఆమెను పంపివేసాను. అయినప్పటికీ నమ్మకద్రోహియైన ఆమె సహోదరి యూదాకు భయం లేదని నేను చూశాను; ఆమె కూడా బయటకు వెళ్లి వ్యభిచారం చేసింది. ఇశ్రాయేలు అనైతికత ఆమె దృష్టికి చాలా తక్కువ కాబట్టి, ఆమె దేశాన్ని అపవిత్రం చేసింది, రాయితో, కలపతో వ్యభిచారం చేసింది. ఇంత జరిగినా, నమ్మకద్రోహియైన తన సహోదరి యూదా తన పూర్ణహృదయంతో నా వైపు తిరగలేదు, కేవలం నటించింది” అని యెహోవా ప్రకటిస్తున్నారు. యెహోవా నాతో ఇలా అన్నారు: “ద్రోహియైన యూదా కంటే విశ్వాసంలేని ఇశ్రాయేలు నీతిమంతురాలు. నీవు వెళ్లి, ఉత్తరాన ఈ సందేశం ప్రకటించాలి: “ ‘ద్రోహియైన ఇశ్రాయేలూ, తిరిగి రా’ అని యెహోవా ప్రకటిస్తున్నారు, ‘ఇకపై నేను నీవైపు కన్నెత్తి చూడను, ఎందుకంటే నేను నమ్మకస్థుడను’ అని యెహోవా ప్రకటిస్తున్నారు, ‘నేను నిత్యం కోపంగా ఉండను. నీ అపరాధాన్ని ఒప్పుకో నీ దేవుడైన యెహోవా మీద నీవు తిరుగుబాటు చేశావు, నీవు ప్రతి మహా వృక్షం క్రింద పరదేశి దేవుళ్ళకు నీ ఇష్టాన్ని పంచుకున్నావు, నాకు విధేయత చూపలేదు’ ” అని యెహోవా ప్రకటిస్తున్నారు. “విశ్వాసంలేని ప్రజలారా, తిరిగి రండి” అని యెహోవా ప్రకటిస్తున్నారు, “నేను నీ భర్తను కాబట్టి నేను నిన్ను ఎంచుకుంటాను ఒక పట్టణం నుండి ఒకనిగా, ఒక వంశం నుండి ఇద్దరినిగా నిన్ను సీయోనుకు తీసుకువస్తాను. అప్పుడు నేను నీకు నా హృదయానికి చాలా దగ్గరి వారైన కాపరులను ఇస్తాను, వారు జ్ఞానంతో, అవగాహనతో మిమ్మల్ని నడిపిస్తారు. ఆ రోజుల్లో దేశంలో మీ సంఖ్య బాగా పెరిగినప్పుడు” అని యెహోవా ప్రకటిస్తున్నారు, “ప్రజలు ఇకపై, ‘యెహోవా నిబంధన మందసం’ అని అనరు. అది ఎప్పటికీ వారి మనస్సులోకి ఎక్కదు, జ్ఞాపకంలో ఉండదు; అది తప్పిపోదు, మరొకటి తయారుచేయబడదు. ఆ సమయంలో వారు యెరూషలేమును యెహోవా యొక్క సింహాసనం అని పిలుస్తారు, యెహోవా నామాన్ని గౌరవించడానికి అన్ని దేశాలు యెరూషలేములో సమకూడుతాయి. ఇకపై వారు తమ దుష్ట హృదయాల మొండితనాన్ని అనుసరించరు. ఆ రోజుల్లో యూదా ప్రజలు ఇశ్రాయేలు ప్రజలతో కలిసి ఉంటారు, వారు కలిసి ఉత్తర దేశం నుండి నేను మీ పూర్వికులకు వారసత్వంగా ఇచ్చిన దేశానికి వస్తారు.

యిర్మీయా 3:6-18 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

యోషీయా రాజు పాలన సమయంలో యెహోవా నాకిలా చెప్పాడు. “ఇశ్రాయేలు ఎంత అపనమ్మకం చూపిందో చూశావా? ఆమె ఎత్తయిన ప్రతి కొండమీదికీ పచ్చని ప్రతి చెట్టు కిందికీ వెళ్ళి అక్కడ వ్యభిచారం చేస్తున్నది. ఆమె వాటన్నిటినీ చేసినా ఆమెను నా దగ్గరికి తిరిగి రమ్మన్నాను కానీ ఆమె రాలేదు. ద్రోహి అయిన ఆమె సోదరి అయిన యూదా దాన్ని చూసింది. ఇశ్రాయేలు వ్యభిచారం చేసినందుకే నేను ఆమెను విడిచిపెట్టి ఆమెకు విడాకులిచ్చి పంపేశాను. విశ్వాసఘాతకురాలైన ఆమె సోదరి యూదా దాన్ని చూసి ఆమె కూడా భయం లేకుండా వ్యభిచారం చేస్తూ ఉంది. రాళ్ళతో, మొద్దులతో విగ్రహాలను చేసుకుని, ఆమె నిర్భయంగా వ్యభిచారం చేసి దేశాన్ని అపవిత్రపరచింది. ఇంత జరిగినా విశ్వాసఘాతకురాలైన ఆమె సోదరి యూదా పైపైనే గాని తన పూర్ణహృదయంతో నా దగ్గరికి రావడం లేదు. కాబట్టి యూదా చేసిన ద్రోహం చూస్తే దానికంటే ఇశ్రాయేలే కొంచెం మంచిది అనిపిస్తున్నది. నువ్వు వెళ్లి ఉత్తరం వైపుకు ఇలా ప్రకటించు, విశ్వాసం లేని ఇశ్రాయేలూ, తిరిగి రా. మీ మీద నేను కోపపడను. నేను దయగలవాణ్ణి కాబట్టి శాశ్వతంగా కోపించేవాణ్ణి కాను.” ఇదే యెహోవా వాక్కు. నీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేస్తూ, నా మాట తోసిపుచ్చి ప్రతి పచ్చని చెట్టు కిందా అన్యులతో వ్యభిచరించావు. నువ్వు నీ దోషాన్ని ఒప్పుకోవాలి. ఇదే యెహోవా వాక్కు. చెడిపోయిన పిల్లలారా, తిరిగి రండి, నేను మీ యజమానిని. ఇదే యెహోవా వాక్కు ఒక్కొక్క ఊరిలోనుండి ఒకణ్ణి, ఒక్కొక్క వంశం లోనుండి ఇద్దరినీ, సీయోనుకు తీసుకొస్తాను. నాకిష్టమైన కాపరులను మీపైన నియమిస్తాను, వారు జ్ఞానంతో, వివేకంతో మిమ్మల్ని పాలిస్తారు. ఆ రోజుల్లో మీరు ఆ దేశంలో అభివృద్ధి పొంది విస్తరిస్తూ ఉన్నప్పుడు ప్రజలు యెహోవా నిబంధన మందసం గురించి మాట్లాడరు. అది వారి మనస్సుకు తట్టదు. దాన్ని జ్ఞాపకం చేసుకోరు. అది లేనందుకు బాధపడరు, ఇక ముందు దాన్ని తయారు చేయరు. ఇదే యెహోవా వాక్కు. ఆ కాలంలో యెరూషలేమును యెహోవా సింహాసనం అంటారు. అన్యజాతులు వారి చెడ్డ హృదయాలను అనుసరించి మూర్ఖులుగా నడుచుకోక ఘనమైన యెహోవా పేరు విని యెరూషలేముకు గుంపులుగా వస్తారు. ఆ రోజుల్లో యూదా వారూ ఇశ్రాయేలు వారూ కలిసి ఉత్తరదేశం నుండి నేను మీ పూర్వీకులకు వారసత్వంగా ఇచ్చిన దేశానికి తిరిగి వస్తారు.

యిర్మీయా 3:6-18 పవిత్ర బైబిల్ (TERV)

రాజైన యోషీయా యూదా రాజ్యాన్ని పాలించే కాలంలో యెహోవా నాతో మాట్లాడినాడు. ఆయన ఇలా అన్నాడు: “యిర్మీయా, ఇశ్రాయేలు చేసిన చెడ్డపనులు నీవు చూశావు. నా పట్ల ఆమె ఎలా విశ్వాసరహితంగా ఉన్నదో నీవు చూశావు! ప్రతి కొండమీద, ప్రతి పచ్చని చెట్టు క్రింద విగ్రహాలతో వ్యభిచరించిన పాపానికి ఇశ్రాయేలు పాల్పడింది. ‘ఈ చెడు కార్యాలన్నీ చేయటం పూర్తయిన పిమ్మట ఇశ్రాయేలు తప్పక నావద్దకు తిరిగి వస్తుంది’ అని నేననుకున్నాను. కాని ఆమె నా వద్దకు రాలేదు. విశ్వాస ఘాతకురాలైన ఇశ్రాయేలు సోదరియగు యూదా ఆమె ఏమి చేసిందో చూసింది. ఇశ్రాయేలు విశ్వాసపాత్రంగా లేదు. ఆమెను నేనెందుకు పంపి వేశానో ఇశ్రాయేలుకు తెలుసు. ఆమె వ్యభిచార దోషానికి పాల్పడినందుకే నేనామెకు విడాకులిచ్చానని ఇశ్రాయేలుకు తెలుసు. కాని అది విశ్యాస ఘాతకురాలైన ఆమె సోదరిని భయపెట్టలేదు. యూదా భయపడలేదు. యూదా కూడా తెగించి వ్యభిచారిణిలా ప్రవర్తించింది. తానొక మరుగులేని వ్యభిచారిణిలా ప్రవర్తిస్తున్నాననే చింతన చేయలేదు. అలా ఆమె తన దేశాన్ని ‘మలిన’ (అపవిత్ర) పర్చింది. రాతితోను, చెక్కలతోను చేసిన విగ్రహాలను ఆరాధించి, వ్యభిచార పాపానికి ఒడిగట్టుకుంది. ఇశ్రాయేలు యొక్క విశ్వాస ఘాతకురాలైన సోదరి (యూదా) హృదయ పూర్వకంగా నావద్దకు తిరిగి రాలేదు. నావద్దకు తిరిగి వచ్చినట్లు ఆమె నటించింది.” ఈ వాక్కు యెహోవా నుండి వచ్చినది. యెహోవా నాతో ఇలా చెప్పినాడు “ఇశ్రాయేలు నాకు విశ్వాసపాత్రంగా లేదు. విశ్వాసం లేని యూదా కంటె ఇశ్రాయేలుకు చెప్పుకొనేందుకు ఒక మంచి సాకువుంది. యిర్మీయా, నీవు వెళ్లి ఈ వర్తమానాన్ని ఉత్తర దేశంలో చెప్పు: “‘విశ్వాసంలేని ఇశ్రాయేలీయులారా తిరిగి రండి.’ ఇది యెహోవా వాక్కు. ‘నిన్ను చూచి ముఖం తిప్పుకోను. నేను నిండు దయతో ఉన్నాను.’ ఈ వాక్కు యెహోవాది. ‘నీ పట్ల నేను శాశ్వతమైన కోపంతో ఉండను. నీవు నీ పాపాన్ని గుర్తించాలి. నీ యెహోవా దేవునికి నీవు వ్యతిరేకమయ్యావు నీ పాపం అదే. ఇతర దేశాలనుండి వచ్చిన వారి విగ్రహాలను నీవు ఆరాధించినావు నీవు ప్రతి పచ్చని చెట్టు క్రిందా విగ్రహారాధన చేశావు నీవు నా ఆజ్ఞను మన్నించలేదు.’” ఇదే యోహోవా వాక్కు. “విశ్వాసంలేని ప్రజలారా, నావద్దకు రండి” అని యెహోవా అంటున్నాడు “నేను మీ యజమానిని. ప్రతి నగరంనుంచీ ఒక్కొక్క వ్యక్తిని, ప్రతి కుటుంబంనుంచీ ఇద్దరు మనుష్యులను తీసుకొని మిమ్మల్ని సీయోనుకు తీసుకొని వస్తాను. అప్పుడు మీకు నూతన కాపరులను (పాలకులు) ఇస్తాను. ఆ పాలకులు నాకు విశ్వాస పాత్రులై ఉంటారు. వారు జ్ఞానంతోను, అవగాహనతోను మిమ్మల్ని నడిపిస్తారు. ఆ రోజుల్లో, రాజ్యంలో మీ సంతతి పెరిగి మీరనేకులై ఉంటారు.” ఈ వాక్కు యెహోవాది. “ఆ సమయంలో ప్రజలు తాము దేవుని నిబంధన మందసాన్ని కలిగివున్న రోజులు గుర్తున్నట్లు చెప్పరు. ఆ యెహోవా ఒడంబడికను గూర్చి వారెంత మాత్రం తలంచరు. వారు దానిని గుర్తుంచుకోరు. పోగొట్టు కోరు. వారు మరో పవిత్ర ఒడంబడికను చేయరు. ఆ సమయంలో యెరూషలేము నగరం ‘యెహోవా సింహాసనం’ అని పిలువబడుతుంది. దేశ దేశాల ప్రజలు యెరూషలేము నగరంలో కలిసి యెహోవాను స్మరించి ఆయన నామాన్ని గౌరవిస్తారు. ప్రజలు తమ మొండి హృదయాలను ఇక ఎంత మాత్రం అనుసరించరు. ఆ రోజుల్లో యూదా వంశం ఇశ్రాయేలు వంశంతో కలుస్తుంది వారు ఉత్తర ప్రాంతంలో ఒకే చోటునుండి కలిసి వస్తారు. వారి పితరులకు నేనిచ్చిన రాజ్యంలోకి వారు వస్తారు.”

యిర్మీయా 3:6-18 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

మరియు రాజైన యోషీయా దినములలో యెహోవా నాకీలాగు సెలవిచ్చెను – ద్రోహినియగు ఇశ్రాయేలు చేయుకార్యము నీవు చూచితివా? ఆమె ఉన్నతమైన ప్రతి కొండమీదికిని పచ్చని ప్రతి చెట్టు క్రిందికిని పోవుచు అక్కడ వ్యభిచారము చేయుచున్నది. ఆమె యీ క్రియలన్నిటిని చేసినను, ఆమెను నాయొద్దకు తిరిగి రమ్మని నేను సెలవియ్యగా ఆమె తిరిగిరాలేదు. మరియు విశ్వాసఘాతకురాలగు ఆమె సహోదరియైన యూదా దాని చూచెను. ద్రోహినియగు ఇశ్రాయేలు వ్యభిచారముచేసిన హేతువుచేతనే నేను ఆమెను విడిచిపెట్టి ఆమెకు పరిత్యాగపత్రిక ఇయ్యగా, విశ్వాసఘాతకురాలగు ఆమె సహోదరియైన యూదా చూచియు తానును భయపడక వ్యభిచారము చేయుచు వచ్చు చున్నది. రాళ్లతోను మొద్దులతోను వ్యభిచారము చేసెను; ఆమె నిర్భయముగా వ్యభిచారము చేసి దేశమును అపవిత్రపరచెను. ఇంతగా జరిగినను విశ్వాసఘాతకురాలగు ఆమె సహోదరియైన యూదా పైవేషమునకే గాని తన పూర్ణహృదయముతో నాయొద్దకు తిరుగుట లేదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాగా విశ్వాసఘాతకురాలగు యూదాకంటె ద్రోహినియగు ఇశ్రాయేలు తాను నిర్దోషినియని ఋజువుపరచుకొని యున్నది. నీవు వెళ్లి ఉత్తరదిక్కున ఈ మాటలు ప్రకటింపుము–ద్రోహినివగు ఇశ్రాయేలూ, తిరిగిరమ్ము; ఇదే యెహోవా వాక్కు. మీమీద నాకోపము పడనీయను, నేను కృపగలవాడను గనుక నేనెల్లప్పుడు కోపించువాడను కాను; ఇదే యెహోవా వాక్కు. –నీ దేవుడైన యెహోవామీద తిరుగుబాటుచేయుచు, నా మాటను అంగీకరింపక ప్రతి పచ్చని చెట్టు క్రింద అన్యులతో కలిసి కొనుటకు నీవు ఇటు అటు పోయిన నీ దోషము ఒప్పుకొనుము; ఇదే యెహోవా వాక్కు. భ్రష్టులగు పిల్లలారా, తిరిగిరండి, నేను మీ యజమానుడను; ఇదే యెహోవా వాక్కు. ఒకానొక పట్టణములోనుండి ఒకనిగాను, ఒకానొక కుటుంబములోనుండి ఇద్దరినిగాను మిమ్మును తీసికొని సీయోనునకు రప్పించెదను. నాకిష్టమైన కాపరులను మీకు నియమింతును, వారు జ్ఞానముతోను వివేకముతోను మిమ్ము నేలుదురు. మీరు ఆ దేశములో అభివృద్ధిపొంది విస్తరించు దినములలో జనులు–యెహోవా నిబంధనమందసమని ఇకను చెప్పరు, అది వారి మనస్సులోనికి రాదు, దానిని జ్ఞాపకము చేసికొనరు, అది పోయినందుకు చింతపడరు, ఇకమీదట దాని చేయరాదు; ఇదే యెహోవా వాక్కు. ఆ కాలమున–యెహోవాయొక్క సింహాసనమని యెరూషలేమునకు పేరు పెట్టెదరు; జనములన్నియు తమ దుష్టమనస్సులో పుట్టు మూర్ఖత్వము చొప్పున నడుచుకొనక యెహోవా నామమునుబట్టి యెరూషలేమునకు గుంపులుగా కూడి వచ్చెదరు. ఆ దినములలో యూదావంశస్థులును ఇశ్రాయేలు వంశస్థులును కలిసి ఉత్తరదేశములోనుండి ప్రయాణమై, మీపితరులకు నేను స్వాస్థ్యముగా ఇచ్చిన దేశమునకు వచ్చెదరు.