ఆదికాండము 42:29-38

ఆదికాండము 42:29-38 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

వారు కనాను దేశంలో తమ తండ్రి యాకోబు దగ్గరకు వచ్చినప్పుడు, తమకు జరిగిందంతా అతనికి చెప్పారు. వారు అన్నారు, “ఆ దేశాధిపతి మాతో కఠినంగా మాట్లాడాడు, మేము ఆ దేశానికి వేగుచూడటానికి వచ్చామని అనుకున్నాడు. అతనికి, ‘మేము యథార్థవంతులం; వేగులవారం కాము. మేము పన్నెండుమంది సోదరులం, ఒక తండ్రి కుమారులము. ఒకడు చనిపోయాడు, కనిష్ఠుడు కనానులో తండ్రి దగ్గర ఉన్నాడు’ అని చెప్పాము. “ఆ దేశాధిపతి మాతో, ‘ఇలా మీరు యథార్థవంతులని నాకు తెలుస్తుంది: మీ సోదరులలో ఒకరిని ఇక్కడ నా దగ్గర వదిలేసి, ఆకలితో ఉన్న మీ ఇంటివారికి ఆహారం తీసుకెళ్లండి. కాని మీ తమ్మున్ని నా దగ్గరకు తీసుకురండి, తద్వారా మీరు యథార్థవంతులని తెలుసుకుంటాను. అప్పుడు మీ సోదరుని తిరిగి ఇచ్చేస్తాను, ఈ దేశంలో మీరు వ్యాపారం చేసుకోవచ్చు’ అన్నాడు.” వారు తమ గోనెసంచులను ఖాళీ చేస్తుండగా, ఎవరి గోనెసంచిలో వారి వెండి మూట ఉంది. వారు, వారి తండ్రి, వారి డబ్బు మూటలు చూసి భయపడిపోయారు. వారి తండ్రి యాకోబు వారితో, “మీరు నన్ను పిల్లలు కోల్పోయేలా చేశారు. యోసేపు లేడు, షిమ్యోను లేడు, ఇప్పుడు బెన్యామీనును కూడా తీసుకెళ్లాలని చూస్తున్నారు. ప్రతిదీ నాకు వ్యతిరేకంగా ఉంది!” అని అన్నాడు. అప్పుడు రూబేను తన తండ్రితో, “నేను బెన్యామీనును తిరిగి నీ దగ్గరకు తీసుకురాకపోతే, నా ఇద్దరు కుమారులను నీవు చంపవచ్చు. అతన్ని నాకు అప్పగించు, నేను తిరిగి అతన్ని నీ దగ్గరకు తీసుకువస్తాను” అన్నాడు. అయితే యాకోబు, “నా కుమారుడు నీతో అక్కడికి రాడు; అతని అన్న చనిపోయాడు, మిగిలింది ఒక్కడే. మీరు వెళ్లే ప్రయాణంలో ఏదైన హాని జరిగితే, మీరు నెరిసిన వెంట్రుకలతో ఉన్న నన్ను దుఃఖంలో సమాధికి తీసుకెళ్తారు” అని అన్నాడు.

ఆదికాండము 42:29-38 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

వారు కనాను దేశంలో ఉన్న తమ తండ్రి యాకోబు దగ్గరికి వచ్చి తమకు జరిగినదంతా అతనికి తెలియచేశారు. “ఆ దేశానికి అధిపతి, మాతో కఠినంగా మాట్లాడి, మేము ఆ దేశాన్ని వేగు చూడడానికి వచ్చామనుకున్నాడు. అప్పుడు మేము, ‘అయ్యా, మేము నిజాయితీపరులం, గూఢచారులం కాదు. పన్నెండు మంది సోదరులం, ఒక్క తండ్రి కొడుకులం, ఒకడు లేడు, చిన్నవాడు ఇప్పుడు కనాను దేశంలో మా నాన్న దగ్గర ఉన్నాడు’ అని అతనితో చెప్పాము. అందుకు ఆ దేశాధిపతి, మాతో ‘మీరు నిజాయితీపరులని ఇలా తెలుసుకుంటాను. మీ సోదరుల్లో ఒకణ్ణి నా దగ్గర విడిచిపెట్టి, మీ ఇంట్లోవారికి కరువు తీరేలా ధాన్యం తీసుకు వెళ్ళండి. నా దగ్గరికి ఆ చిన్నవాణ్ని తీసుకు రండి. అప్పుడు మీరు నిజాయితీపరులనీ గూఢచారులు కారనీ నేను తెలుసుకుని మీ సోదరుణ్ణి మీకప్పగిస్తాను. అప్పుడు మీరు ఈ దేశంలో వ్యాపారం చేసుకోవచ్చు’ అని చెప్పాడు” అన్నారు. వారు తమ సంచులు కుమ్మరిస్తే ఎవరి డబ్బుల మూట వారి సంచుల్లో ఉంది. వారూ వారి తండ్రీ ఆ డబ్బుల మూటలు చూసి భయపడ్డారు. అప్పుడు వారి తండ్రి యాకోబు “మీరు నా పిల్లల విషయంలో నన్ను దుఃఖానికి గురిచేశారు. యోసేపు లేడు, షిమ్యోను లేడు, మీరు బెన్యామీనును కూడా తీసుకుపోతారు. ఇవన్నీ నా మీదికే వచ్చాయి” అని వారితో అన్నాడు. అందుకు రూబేను “నేనతన్ని నీ దగ్గరికి తీసుకు రాకపోతే, నా ఇద్దరు కొడుకులను నువ్వు చంపెయ్యవచ్చు. అతన్ని నా చేతికి అప్పగిస్తే, అతన్ని తిరిగి మీ దగ్గరికి తీసుకు వస్తాను” అని చెప్పాడు. అయితే అతడు “నా కొడుకును మీతో వెళ్ళనివ్వను. అతని అన్న చనిపోయాడు, ఇతడు మాత్రమే మిగిలాడు. మీరు వెళ్ళే దారిలో ఇతనికి హాని కలిగితే తల నెరిసిన నన్ను దుఃఖంతో మృత్యులోకంలోకి దిగిపోయేలా చేస్తారు” అన్నాడు.

ఆదికాండము 42:29-38 పవిత్ర బైబిల్ (TERV)

సోదరులు కనాను దేశంలో ఉన్న తమ తండ్రి యాకోబు దగ్గరకు వెళ్లారు. జరిగిన విషయాలన్నీ యాకోబుతో చెప్పారు. వాళ్లు ఇలా చెప్పారు: “ఆ దేశ పాలకుడు మాతో కఠినంగా మాట్లాడాడు. మేము అక్కడి ప్రజల్ని నాశనం చేయాలనుకొనే గూఢచారులమని అనుకొన్నాడు అతడు. కానీ మేము నిజాయితీపరులం అని, గూఢచారులకు చెందినవాళ్లం కాదని మేము చెప్పాం. మేము పన్నెండుమంది సోదరులం అని చెప్పాం. కనానులో ఇంటి దగ్గర మా తండ్రితో మా చిన్న తమ్ముడు ఒకడు ఉన్నాడని మరియు మా మరియొక చిన్న తమ్ముడు ఒకడు చనిపోయాడని మేము అతనితో చెప్పాం. “అప్పుడు, ఆ దేశపాలకుడు మాతో ఇలా అన్నాడు: ‘మీరు నమ్మకమైనవాళ్లని రుజువు చేయటానికి ఇదొక మార్గం. మీ సోదరులలో ఒకడ్ని నా దగ్గర ఉంచండి. మీ ధాన్యం మీ కుటుంబాలకు తీసుకొని వెళ్లండి. తర్వాత మీ చిన్న సోదరుడ్ని నా దగ్గరకు తీసుకొని రండి. అప్పుడు నిజంగా మీరు నిజాయితీపరులో, లేక మమ్మల్ని నాశనం చేసేందుకు పంపబడిన గూఢచారులో నాకు తెలుస్తుంది. మీరు చెప్పేది నిజమైతే మీ సోదరుడ్ని మళ్లీ మీకు అప్పగిస్తాను. అతణ్ణి మీకు అప్పగిస్తాను, మా దేశంలో మీరు స్వేచ్ఛగా ధాన్యం కొనుక్కోవచ్చు.’” అప్పుడు ఆ సోదరులు వారి సంచుల్లో నుండి ధాన్యం తీయటానికి వెళ్లగా వారిలో ప్రతి సోదరునికి తన ధాన్యపు సంచిలో తన డబ్బుసంచి కనిపించింది. ఆ సోదరులు, వారి తండ్రి కూడ ఆ డబ్బును చూచి చాలా భయపడిపోయారు. యాకోబు, “నేను నా పిల్లలందర్నీ పోగొట్టుకోవాలని మీరు అనుకొంటున్నారా? యోసేపు పోయాడు. షిమ్యోను పోయాడు. ఇప్పుడు బెన్యామీనును గూడ మీరు తీసుకొని పోవాలనుకొంటున్నారు” అని వాళ్లతో అన్నాడు, అప్పుడు రూబేను, “నాయనా, బెన్యామీనును గనుక నేను తిరిగి నీ దగ్గరకు తీసుకొని రాకపోతే, నా ఇద్దరు కుమారులను నీవు చంపేసేయ్. నన్ను నమ్ము. బెన్యామీనును నేను మళ్లీ నీ దగ్గరకు తీసుకొని వస్తాను” అని తన తండ్రితో చెప్పాడు. అయితే యాకోబు చెప్పాడు: “బెన్యామీనును మీతో నేను వెళ్లనివ్వను. అతని సోదరుడు మరణించాడు, నా భార్య రాహేలు కుమారులలో ఇతను ఒక్కడే మిగిలాడు. ఈజిప్టు ప్రయాణంలో ఇతనికి ఏమైనా సంభవిస్తే నేను చచ్చిపోతాను. నా వృద్ధాప్యంలో దుఃఖంతోనే మీరు నన్ను సమాధికి పంపిస్తారు.”

ఆదికాండము 42:29-38 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

వారు కనాను దేశమందున్న తమ తండ్రియైన యాకోబునొద్దకు వచ్చి తమకు సంభవించినది యావత్తును అతనికి తెలియ చేసిరి. ఎట్లనగా–ఆ దేశమునకు ప్రభువైనవాడు మాతో కఠినముగా మాటలాడి, మేము ఆ దేశమును వేగుచూడ వచ్చినవారమని అనుకొనెను. అప్పుడు–మేము యథార్థవంతులము, వేగులవారము కాము. పండ్రెండుమంది సహోదరులము, ఒక్కతండ్రి కుమారులము, ఒకడు లేడు, మా తమ్ముడు నేడు కనాను దేశమందు మా తండ్రియొద్ద ఉన్నాడని అతనితో చెప్పితిమి. అందుకు ఆ దేశపు ప్రభువు మమ్మును చూచి–మీరు యథార్థవంతులని దీని వలన నేను తెలిసికొందును. మీ సహోదరులలో ఒకనిని నాయొద్ద విడిచిపెట్టి మీ కుటుంబములకు కరవు తీరునట్లు ధాన్యము తీసికొనిపోయి, నాయొద్దకు ఆ చిన్నవాని తోడుకొనిరండి. అప్పుడు మీరు యథార్థవంతులేగాని వేగులవారు కారని నేను తెలిసికొని మీ సహోదరుని మీకప్పగించెదను; అప్పుడు మీరు ఈ దేశమందు వ్యాపారము చేసికొనవచ్చునని చెప్పెననిరి. వారు తమ గోనెలను కుమ్మరించినప్పుడు ఎవరి రూకల మూట వారి గోనెలో ఉండెను. వారును వారి తండ్రియు ఆ రూకల మూటలు చూచి భయపడిరి. అప్పుడు వారి తండ్రియైన యాకోబు వారిని చూచి– మీరు నన్ను పుత్రహీనునిగా చేయుచున్నారు; యోసేపు లేడు; షిమ్యోను లేడు; మీరు బెన్యామీనును కూడ తీసికొనిపోవుదురు; ఇవన్నియు నాకు ప్రతికూలముగా ఉన్నవని వారితో చెప్పెను. అందుకు రూబేను–నేనతని నీయొద్దకు తీసికొని రానియెడల నా యిద్దరు కుమారులను నీవు చంపవచ్చును; అతని నా చేతికప్పగించుము, అతని మరల నీయొద్దకు తీసికొని వచ్చి అప్పగించెదనని తన తండ్రితో చెప్పెను. అయితే అతడు–నా కుమారుని మీతో వెళ్లనియ్యను; ఇతని అన్న చనిపోయెను, ఇతడు మాత్రమే మిగిలియున్నాడు. మీరు పోవు మార్గమున ఇతనికి హాని సంభవించినయెడల నెరసిన వెండ్రుకలు గల నన్ను మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయుదురని చెప్పెను.