ఆదికాండము 41:15-45
ఆదికాండము 41:15-45 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
ఫరో యోసేపుతో, “నేనొక కలగన్నాను, దాని భావం ఎవరూ చెప్పలేకపోయారు. కానీ నీవు ఒక కల వింటే దాని భావం చెప్తావని నీ గురించి విన్నాను” అని అన్నాడు. అందుకు యోసేపు, “నేను చేయలేను, అయితే ఫరోకు క్షేమకరమైన జవాబు దేవుడు ఇస్తారు” అని ఫరోతో అన్నాడు. అప్పుడు ఫరో యోసేపుతో అన్నాడు, “నా కలలో నేను నైలు నది తీరాన నిలబడ్డాను, నదిలో నుండి పుష్టిగా అందంగా ఉన్న ఏడు ఆవులు పైకి వచ్చి జమ్ము మధ్య మేస్తున్నాయి. వాటి తర్వాత చిక్కిపోయి వికారంగా ఉన్న మరో ఏడు ఆవులు పైకి వచ్చాయి. అంత వికారమైన ఆవులను ఈజిప్టులో నేనెప్పుడు చూడలేదు. బక్కగా వికారంగా ఉన్న ఆవులు ముందు వచ్చిన పుష్టిగా ఉన్న ఏడు ఆవులను తినివేశాయి. కానీ అవి తిన్నా కూడా అవి తిన్నాయని ఎవరు చెప్పలేరు; అవి ముందు ఉన్నట్లే వికారంగా ఉన్నాయి. అప్పుడు నేను నిద్రలేచాను. “నా కలలో పుష్టిగా మంచిగా ఉన్న ఏడు వెన్నులు ఒకే కాడకు పెరుగుతున్నాయి. వాటి తర్వాత పీలగా తూర్పుగాలికి ఎండిపోయిన మరో పీలవెన్నులు వాటి తర్వాత మొలిచాయి. పీలవెన్నులు పుష్టిగా ఉన్న ఏడు వెన్నులను మ్రింగివేశాయి. ఇది మాంత్రికులకు చెప్పాను, కానీ దాని అర్థాన్ని చెప్పేవారు ఎవరూ లేరు.” అప్పుడు యోసేపు ఫరోకు చెప్పాడు, “ఫరో కలల భావం ఒక్కటే. దేవుడు ఏమి చేయబోతున్నారో ఫరోకు తెలియజేశారు. ఆ ఏడు మంచి ఆవులు ఏడు సంవత్సరాలు, అలాగే ఏడు మంచి వెన్నులు ఏడు సంవత్సరాలు; రెండు కలల భావం ఒకటే. వాటి తర్వాత వచ్చిన చిక్కిపోయి వికారంగా ఉన్న ఏడు ఆవులు ఏడు సంవత్సరాలు, పీలగా తూర్పుగాలికి ఎండిపోయిన ఏడు వెన్నులు కూడా అవే ఏడు సంవత్సరాలు; అవి ఏడు సంవత్సరాలు కరువు కాలము. “నేను ఫరోకు చెప్పినట్టే జరుగుతుంది. దేవుడు తాను ఏమి చేయబోతున్నారో ఫరోకు చూపించారు. ఈజిప్టు దేశమంతటా గొప్ప సమృద్ధిగల ఏడు సంవత్సరాలు రాబోతున్నాయి. కానీ వాటి తర్వాత ఏడు సంవత్సరాలు కరువు వస్తుంది. ఆ సమయంలో ఈజిప్టులో ఉండే సమృద్ధి అందరు మరిచిపోతారు, కరువు దేశాన్ని నాశనం చేస్తుంది. తర్వాత వచ్చే కరువు ఇంకా తీవ్రంగా ఉంటుంది కాబట్టి దేశంలో ఉండిన సమృద్ధి ఎవరికీ జ్ఞాపకం ఉండదు. కల రెండు విధాలుగా ఫరోకు ఇవ్వబడిన కారణం ఏంటంటే ఇది దేవునిచే దృఢంగా నిర్ణయించబడింది, దేవుడు త్వరలో దానిని చేస్తారు. “ఇప్పుడు ఫరో జ్ఞాన వివేచనలు కలిగిన ఒక వ్యక్తిని ఈజిప్టు అంతటి మీద అధికారిగా నియమించాలి. సమృద్ధిగా పండే ఏడు సంవత్సరాల్లో పంటలో అయిదవ భాగాన్ని సేకరించడానికి ఫరో దేశమంతా పర్యవేక్షకులను నియమించాలి. వారు ఈ మంచి సంవత్సరాల్లో పండే ధాన్యం సేకరించి ఫరో ఆధీనంలో పట్టణాల్లో ఆహారం ఉండేలా నిలువచేయాలి. ఈ ఆహారం దేశం కోసం నిలువచేయబడి ఈజిప్టు మీదికి వచ్చే ఏడు సంవత్సరాల కరువు కాలంలో ఉపయోగించబడుతుంది, అప్పుడు కరువు ద్వారా దేశం నాశనం కాదు.” ఈ మాట ఫరోకు అతని అధికారులకు నచ్చింది. కాబట్టి ఫరో వారిని, “ఇతనిలా దేవుని ఆత్మ కలిగిన వారెవరినైనా కనుగొనగలమా?” అని అడిగాడు. అప్పుడు ఫరో యోసేపుతో, “దేవుడు నీకు ఇదంతా తెలియజేశారు కాబట్టి, నీలా వివేచన జ్ఞానం కలిగిన వారెవరూ లేరు. నా రాజభవన అధికారిగా నీవు ఉంటావు, నా ప్రజలంతా నీ ఆదేశాలకు లోబడతారు. సింహాసనం విషయంలో మాత్రమే నేను నీ పైవాడిగా ఉంటాను” అని అన్నాడు. కాబట్టి ఫరో యోసేపుతో, “నేను నిన్ను ఈజిప్టు దేశమంతటికి అధికారిగా ప్రకటిస్తున్నాను” అని అన్నాడు. ఫరో తన రాజముద్ర ఉంగరం తీసి యోసేపు వ్రేలికి పెట్టాడు. సన్నని నారబట్టలు అతనికి తొడిగించాడు, అతని మెడలో బంగారు గొలుసు వేశాడు. తన రెండవ రథంలో అతన్ని కూర్చోబెట్టాడు, అప్పుడు ప్రజలు, “నమస్కారం చేయండి!” అని అంటూ అతని ముందు కేకలు వేశారు. ఈ విధంగా అతడు యోసేపును దేశమంతటిమీద అధికారిగా చేశాడు. అప్పుడు ఫరో యోసేపుతో, “నేను ఫరోను, కానీ నీ అనుమతి లేకుండా ఈజిప్టు అంతటిలో ఎవరు కూడా తన చేయి కానీ కాలు కానీ ఎత్తరు” అని అన్నాడు. ఫరో యోసేపుకు జఫెనత్-ఫనేహు అనే పేరు పెట్టాడు, ఓనులో యాజకుడైన పోతీఫెర కుమార్తె, ఆసెనతును అతనికి భార్యగా ఇచ్చాడు. యోసేపు ఈజిప్టు దేశమంతటా పర్యటించాడు.
ఆదికాండము 41:15-45 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఫరో యోసేపుతో “నేనొక కల కన్నాను. దాని అర్థం చెప్పేవారు ఎవరూ లేరు. నువ్వు కలను వింటే దాని అర్థాన్ని తెలియచేయగలవని నిన్నుగూర్చి విన్నాను” అన్నాడు. యోసేపు “అది నావలన కాదు, దేవుడే ఫరోకు అనుకూలమైన సమాధానం ఇస్తాడు” అని ఫరోతో చెప్పాడు. అందుకు ఫరో “నా కలలో నేను ఏటి ఒడ్డున నిలబడ్డాను. బలిసిన, అందమైన ఏడు ఆవులు ఏటిలోనుండి పైకివచ్చి జమ్ముగడ్డిలో మేస్తున్నాయి. నీరసంగా చాలా వికారంగా చిక్కిపోయిన మరి ఏడు ఆవులు వాటి తరువాత పైకి వచ్చాయి. వీటి అంత వికారమైనవి ఐగుప్తు దేశంలో ఎక్కడా నాకు కనబడలేదు. చిక్కిపోయి వికారంగా ఉన్న ఆవులు బలిసిన మొదటి ఏడు ఆవులను తినేశాయి. అవి వాటి కడుపులో పడ్డాయి గాని అవి కడుపులో పడినట్టు కనబడలేదు, మొదట ఉన్నట్లే అవి చూడ్డానికి వికారంగా ఉన్నాయి. అంతలో నేను మేలుకున్నాను. నా కలలో నేను చూస్తే, పుష్టిగల ఏడు మంచి వెన్నులు ఒక్క కంకికి పుట్టాయి. తూర్పు గాలిచేత చెడిపోయి, ఎండిన ఏడు పీలవెన్నులు వాటి తరువాత మొలిచాయి. ఈ పీలవెన్నులు ఆ మంచి వెన్నులను మింగివేశాయి. ఈ కలను పండితులకు తెలియచేశాను గాని దాని అర్థాన్ని తెలియచేసే వారెవరూ లేరు” అని అతనితో చెప్పాడు. అందుకు యోసేపు “ఫరో కనిన కల ఒక్కటే. దేవుడు తాను చేయబోయేది ఫరోకు తెలియచేశాడు. ఆ ఏడు మంచి ఆవులు, ఏడేళ్ళు. ఆ ఏడు మంచికంకులు ఏడేళ్ళు. కల ఒక్కటే. వాటి తరువాత చిక్కిపోయి వికారంగా పైకి వచ్చిన ఏడు ఆవులూ ఏడేళ్ళు. తూర్పు గాలి చేత చెడిపోయిన ఏడు తాలువెన్నులు, ఏడేళ్ళ కరువు. నేను ఫరోతో చెప్పే మాట ఇదే. దేవుడు తాను చేయబోయేది ఫరోకు చూపించాడు. ఇదిగో ఐగుప్తు దేశమంతటా చాలా సమృద్ధిగా పంట పండే ఏడేళ్ళు రాబోతున్నాయి. వాటి తరువాత ఏడేళ్ళ కరువు వస్తుంది. అప్పుడు ఆ పంట సమృద్ధినంతా ఐగుప్తు దేశం మరచిపోతుంది. ఆ కరువు దేశాన్ని నాశనం చేస్తుంది. దాని తరువాత వచ్చే కరువుచేత దేశంలో ఆ పంట సమృద్ధి జ్ఞాపకంలో లేకుండా పోతుంది. ఆ కరువు చాలా భారంగా ఉంటుంది. ఈ పని దేవుడే నిర్ణయించాడు. దీన్ని దేవుడు చాలా త్వరగా జరిగిస్తాడు. అందుకే ఆ కల ఫరోకు రెండుసార్లు వచ్చింది. కాబట్టి ఫరో వివేకమూ జ్ఞానమూ ఉన్నమనిషిని వెతికి ఐగుప్తు దేశం మీద అతన్ని నియమించాలి. ఫరో అలా చేసి ఈ దేశం మీద పర్యవేక్షకులను నియమించి, సమృద్ధిగా పంట పండే ఏడేళ్ళలో ఐగుప్తు దేశమంతటా అయిదో భాగం తీసుకోవాలి. వారు రాబోయే ఈ మంచి సంవత్సరాల్లో దొరికే ఆహారమంతా సమకూర్చాలి. ఆ ధాన్యాన్ని ఫరో ఆధీనంలో ఉంచి, పట్టణాల్లో భద్రం చేయాలి. కరువు వలన ఈ దేశం నశించి పోకుండా ఆ ధాన్యం ఐగుప్తు దేశంలో రాబోయే ఏడేళ్ళ కరువు కాలంలో సిద్ధంగా ఉంటుంది” అని ఫరోతో చెప్పాడు. ఈ సలహా ఫరోకూ అతని పరివారమందరి దృష్టికీ నచ్చింది. ఫరో తన పరివారంతో “ఇతనిలాగా దేవుని ఆత్మ ఉన్నవాడు మనకు దొరుకుతాడా?” అన్నాడు. ఫరో, యోసేపుతో “దేవుడు ఇదంతా నీకు తెలియచేశాడు కాబట్టి నీలాగా వివేకమూ జ్ఞానమూ ఉన్న వారెవరూ లేరు. నువ్వు నా భవనంలో అధికారిగా ఉండాలి. నా ప్రజలంతా నీకు లోబడతారు. సింహాసనం విషయంలోనే నేను నీకంటే పైవాడిగా ఉంటాను” అన్నాడు. ఫరో “చూడు, ఐగుప్తు దేశమంతటి మీద నేను నిన్ను నియమించాను” అని యోసేపుతో చెప్పాడు. ఫరో తన చేతికి ఉన్న తన రాజముద్ర ఉంగరాన్ని తీసి యోసేపు చేతికి పెట్టాడు. శ్రేష్ఠమైన బట్టలు అతనికి తొడిగించి, అతని మెడలో బంగారు గొలుసు వేశాడు. తన రెండవ రథంలో అతన్ని ఎక్కించాడు. కొందరు అతని ముందు నడుస్తూ “నమస్కారం చేయండి” అని కేకలు వేశారు. ఐగుప్తు దేశమంతటి మీదా ఫరో అతన్ని నియమించాడు. ఫరో యోసేపుతో “నేను ఫరోని. నీ సెలవు లేకుండా ఐగుప్తు దేశమంతటా ఎవరూ తన చేతిని కానీ కాలిని కానీ ఎత్తకూడదు” అన్నాడు. ఫరో, యోసేపుకు “జఫనత్ పనేహు” అని పేరు పెట్టాడు. అతనికి ఓను అనే పట్టణ యాజకుడైన పోతీఫెర కూతురు ఆసెనతుతో పెళ్ళిచేశాడు.
ఆదికాండము 41:15-45 పవిత్ర బైబిల్ (TERV)
అప్పుడు ఫరో “నాకో కల వచ్చింది, అయితే ఆ కలను నాకు వివరించగల వాళ్లు ఒక్కళ్లూ లేరు. ఎవరైనా వారి కల నీతో చెబితే నీవు వాటిని వివరించి, భావంకూడ చెప్పగలవని నేను విన్నాను” అని యోసేపుతో అన్నాడు. యోసేపు, “కలలను గ్రహించటంలో నా నైపుణ్యం ఏమీ లేదు. ఆ శక్తి దేవుడికే ఉంది. కనుక దేవుడే ఫరోకు కూడ ఈ పని చేసి పెడ్తాడు” అని జవాబిచ్చాడు. అప్పుడు ఫరో యోసేపుతో చెప్పాడు: “నా కలలో నేను నైలునది ప్రక్కగా నిలబడ్డాను. ఆ నదిలోనుంచి ఏడు ఆవులు బయటకు వచ్చి గడ్డి మేయటం నేను చూశాను. ఈ ఆవులు బలిసి, అందంగా ఉన్నాయి. అప్పుడు మరో ఏడు ఆవులు నదిలో నుంచి రావటం నేను చూశాను. ఈ ఆవులు బక్కచిక్కి రోగిష్ఠివిగా ఉన్నాయి. ఈజిప్టు దేశం మొత్తంలో నేను చూసిన ఆవుల్లో అవి పరమ అసహ్యంగా ఉన్నాయి. అసహ్యమైన ఈ ఏడు ఆవులు ముందు వచ్చిన అందమైన ఏడు ఆవులను తినివేశాయి. అయితే ఆ ఏడు ఆవులను తినివేసిన తర్వాత కూడ అవి ఇంకా బక్కచిక్కి ఉన్నాయి. వాటిని చూస్తే, అవి ఏడు ఆవులను తిన్న వాటిల్లాగ అగుపించవు. ముందు అవి ఎంత బక్కగా అసహ్యంగా ఉన్నాయో యిప్పుడూ అలానే కనబడ్డాయి. అప్పుడు నేను మేల్కొన్నాను. “తర్వాత నాకు వచ్చిన మరో కలలో ఒకే ధాన్యపు మొక్కకు ఏడు వెన్నులు పెరగటం నేను చూశాను. ఆ వెన్నులు నిండుగా, చక్కగా, అందంగా ఉన్నాయి. తర్వాత వాటికి యింకా ఏడు వెన్నులు పెరిగాయి. కానీ ఆ వెన్నులు పీలగా, అసహ్యంగా ఉండి, వేడి గాడ్పులకు పాడైపోయాయి. అప్పుడు ఏడు మంచి వెన్నులను పీల వెన్నులు తినివేశాయి. “మంత్రాలు తెలిసిన నా మనుష్యులకు, విద్వాంసులకు నేను ఈ కల చెప్పాను. కానీ ఎవ్వరూ ఆ కలను వివరించలేక పోతున్నారు. ఏమిటి దీని భావం?” అప్పుడు ఫరోతో యోసేపు ఇలా చెప్పాడు: “ఈ రెండు కలల భావం ఒక్కటే. ఏమి చేయనున్నాడో అది దేవుడు మీతో చెబుతున్నాడు. ఏడు మంచి ఆవులు ఏడు సంవత్సరాలు. ఏడు మంచి ధాన్యపు వెన్నులు ఏడు సంవత్సరాలు. రెండు కలల్లోని సంగతి ఒక్కటే. బక్కచిక్కి ఉన్న ఆవులు ఏడు, పీలగా ఉన్న ధాన్యపు వెన్నులు కూడ ఏడు. అంటే, అవి ఈ దేశంలో ఏడు ఆకలి సంవత్సరాలు. ఏడు మంచి సంవత్సరాల తర్వాత ఈ ఏడు సంవత్సరాలు వస్తాయి. త్వరలో ఏమి జరుగుతుందో దాన్ని దేవుడు మీకు చూపెట్టాడు. నేను చెప్పినట్టే ఇది జరుగుతుంది. ఈజిప్టు దేశమంతటా ఏడేళ్లపాటు మంచి పంటలు పండి, తినటానికి సమృద్ధిగా ఉంటుంది. అయితే ఆ ఏడు సంవత్సరాల తర్వాత, దేశమంతటా కరవు సంవత్సరాలు ఏడు వస్తాయి. ఈజిప్టులో పండిన పంట ఎంత అయినా, దానిని మరచిపోతారు. ఈ ఆకలి దేశాన్ని నాశనం చేస్తుంది. సమృద్ధిగా భోజనం చేయటం అంటే ఏమిటో ప్రజలు మరచిపోతారు. “ఫరోగారూ, ఒకే విషయాన్ని గూర్చి మీకు రెండు కలలు ఎందుకు వచ్చాయి? దేవుడు తప్పక జరిపిస్తాడని చూపించేందుకు ఇలా జరిగింది. అదీ త్వరలోనే దేవుడు జరిగిస్తాడని సూచిస్తోంది. కనుక ఓ ఫరో, చాలా తెలివి, జ్ఞానం ఉన్న ఒక మనిషిని మీరు ఏర్పాటు చేసుకోవాలి. ఆ మనిషిని ఈజిప్టు దేశం అంతటిమీద అధికారిగా మీరు నియమించాలి. ఆ తర్వాత ప్రజల దగ్గర్నుండి ధాన్యం సేకరించేందుకు మరి కొందర్ని మీరు నియమించాలి. ప్రతీ వ్యక్తి ఏడు మంచి సంవత్సరాల్లో పండించే మంచి పంటలో అయిదవ భాగం ఇవ్వాలి. రాబోయే మంచి సంవత్సరాల కాలంలో ఈ ధాన్యం అంతా సేకరించమని ఈ మనుష్యులకు ఆజ్ఞాపించండి. ఈ ధాన్యం పట్టణాల్లో భద్రం చేయటానికి వాళ్లకు అధికారం ఉందని ఈ మనుష్యులకు చెప్పండి. తర్వాత ఆ ధాన్యం అవసరం వచ్చేంతవరకు వారు దాన్ని కాపాడాలి. ఫరో! ఈ విధంగా ఆ ఆహారం మీ అధీనంలో ఉంటుంది. ఈజిప్టు దేశంలో వచ్చే ఏడు ఆకలి సంవత్సరాల్లో ఈ ధాన్యం సహాయపడుతుంది. అప్పుడు ఈజిప్టు ప్రజలు ఆ ఏడు సంవత్సరాల్లో కరువు కారణంగా మరణించరు.” ఇది చాలా చక్కని తలంపులా కనబడింది ఫరోకు. అతని సేవకులంతా ఒప్పుకొన్నారు. “ఈ పని చేసేందుకు యోసేపు కంటే మంచివాడ్ని ఇంకెవరినైనా మీరు కనుగొనగలరా? దేవుని ఆత్మ మూలంగా ఇతడు నిజంగా జ్ఞాని” అని ఫరో తన సేవకులతో చెప్పాడు. కనుక ఫరో, “వీటన్నింటిని దేవుడే నీకు చూపెట్టాడు కనుక నీవు అందరిలో మహా జ్ఞానివై ఉండాలి. అంచేత నిన్నే ఈ దేశం మీద అధిపతిగా నేను చేస్తాను. ప్రజలు నీ ఆజ్ఞలన్నింటికి విధేయులవుతారు. ఈ దేశంలో నేను ఒక్కడ్ని మాత్రమే నీకంటె గొప్ప అధికారిగా ఉంటాను” అని యోసేపుతో చెప్పాడు. (ఫరో యోసేపును రాజ్యపాలకునిగా నియమించినప్పుడు ప్రత్యేక సమావేశం మరియు ఊరేగింపు ఉండినవి.) అప్పుడు ఫరో, “ఇప్పుడు ఈజిప్టు దేశం అంతటి మీద నిన్ను నేను పాలకునిగా నియమిస్తున్నాను” అని యోసేపుతో చెప్పాడు. అప్పుడు ఫరో రాజముద్రగల తన ఉంగరాన్ని యోసేపుకు ఇచ్చాడు. యోసేపు ధరించటానికి నాణ్యతగల ఒక అంగీని అతడు ఇచ్చాడు. యోసేపు మెడలో ఒక బంగారు గొలుసు ఫరో వేశాడు. రెండో రాజరథం మీద తిరగమని ఫరో యోసేపుతో చెప్పాడు. ప్రత్యేక సంరక్షకులు అతని రథానికి ముందర నడిచారు. “ప్రజలారా, యోసేపుకు సాష్టాంగపడండి” అంటూ వాళ్లు ప్రజలను హెచ్చరించారు. కనుక ఈజిప్టు దేశం అంతటి మీద యోసేపు పాలకునిగా నియమించబడ్డాడు. అతనితో ఫరో అన్నాడు: “నేను ఫరోను అంటే రాజును. కనుక నేను ఏమి అయినా చేయాలనుకొంటే అది చేస్తాను. కానీ, ఈజిప్టులో మరి ఏ వ్యక్తి అయినా నీవు చెప్పకుండ ఒక చేయి ఎత్తకూడదు, కాలు కదపగూడదు.” ఫరో యోసేపుకు జప్నత్పనేహు అనే మరో పేరు పెట్టాడు. ఓను యాజకుడు పోతీఫెర కుమార్తె ఆసెనతును యోసేపుకు భార్యగా ఫరో ఇచ్చాడు. కనుక ఈజిప్టు దేశం అంతటిమీద యోసేపు పాలకుడయ్యాడు.
ఆదికాండము 41:15-45 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఫరో యోసేపుతో–నేనొక కల కంటిని, దాని భావమును తెలుపగలవారెవరును లేరు. నీవు కలను విన్నయెడల దాని భావమును తెలుపగలవని నిన్నుగూర్చి వింటినని అతనితో చెప్పినందుకు యోసేపు–నావలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరమిచ్చునని ఫరోతో చెప్పెను. అందుకు ఫరో–నా కలలో నేను ఏటి యొడ్డున నిలుచుంటిని. బలిసినవియు, చూపునకందమైనవియునైన, యేడు ఆవులు ఏటిలోనుండి పైకివచ్చి జమ్ములో మేయుచుండెను. మరియు నీరసమై బహు వికారరూపము కలిగి చిక్కిపోయిన మరి యేడు ఆవులు వాటి తరువాత పైకి వచ్చెను. వీటి అంత వికారమైనవి ఐగుప్తు దేశమందు ఎక్కడను నాకు కనబడలేదు. చిక్కిపోయి వికారముగానున్న ఆవులు బలిసిన మొదటి యేడు ఆవులను తినివేసెను. అవి వాటి కడుపులో పడెనుగాని అవి కడుపులో పడినట్టు కనబడలేదు, మొదట ఉండినట్లే అవి చూపునకు వికారముగా నుండెను. అంతలో నేను మేలుకొంటిని. మరియు నా కలలో నేను చూడగా పుష్టిగల యేడు మంచి వెన్నులు ఒక్క దంటున పుట్టెను. మరియు తూర్పు గాలిచేత చెడి పోయి యెండిన యేడు పీలవెన్నులు వాటి తరువాత మొలిచెను. ఈ పీలవెన్నులు ఆ మంచి వెన్నులను మ్రింగివేసెను. ఈ కలను జ్ఞానులకు తెలియ చెప్పితినిగాని దాని భావమును తెలుపగలవారెవరును లేరని అతనితో చెప్పెను. అందుకు యోసేపు–ఫరో కనిన కల ఒక్కటే. దేవుడు తాను చేయబోవుచున్నది ఫరోకు తెలియచేసెను. ఆ యేడు మంచి ఆవులు ఏడు సంవత్సరములు ఆ యేడు మంచి వెన్నులును ఏడు సంవత్సరములు. కల ఒక్కటే. వాటి తరువాత, చిక్కిపోయి వికారమై పైకివచ్చిన యేడు ఆవులును ఏడు సంవత్సరములు; తూర్పు గాలిచేత చెడిపోయిన యేడు పీలవెన్నులు కరవుగల యేడు సంవత్సరములు. నేను ఫరోతో చెప్పు మాట యిదే. దేవుడు తాను చేయబోవుచున్నది ఫరోకు చూపించెను. ఇదిగో ఐగుప్తు దేశమందంతటను బహు సమృద్ధిగా పంటపండు ఏడు సంవత్సరములు వచ్చుచున్నవి. మరియు కరవు గల యేడు సంవత్సరములు వాటి తరువాత వచ్చును; అప్పుడు ఐగుప్తు దేశమందు ఆ పంట సమృద్ధి యావత్తును మరువబడును, ఆ కరవు దేశమును పాడుచేయును. దాని తరువాత కలుగు కరవుచేత దేశమందు ఆ పంట సమృద్ధి తెలియబడకపోవును; ఆ కరవు మిక్కిలి భారముగా నుండును. ఈ కార్యము దేవునివలన నిర్ణయింపబడి యున్నది. ఇది దేవుడు శీఘ్రముగా జరిగించును. అందుచేతనే ఆ కల ఫరోకు రెట్టింపబడెను. కాబట్టి ఫరో వివేక జ్ఞానములుగల ఒక మనుష్యుని చూచుకొని ఐగుప్తు దేశముమీద అతని నియమింపవలెను. ఫరో అట్లు చేసి యీ దేశముపైన అధిపతులను నియమించి సమృద్ధిగా పంటపండు ఏడు సంవత్సరములలో ఐగుప్తు దేశ మందంతటను అయిదవభాగము తీసికొనవలెను. రాబోవు ఈ మంచి సంవత్సరములలో దొరుకు ఆహార మంతయు సమకూర్చి ఆ ధాన్యము ఫరో చేతికప్పగించి ఆయా పట్టణములలో ఆహారమునకై భద్రము చేయవలెను. కరవుచేత ఈ దేశము నశించి పోకుండ ఆ ఆహారము ఐగుప్తుదేశములో రాబోవు కరవు సంవత్సరములు ఏడింటికి ఈ దేశమందు సంగ్రహముగానుండునని ఫరోతో చెప్పెను. ఆ మాట ఫరోదృష్టికిని అతని సమస్త సేవకుల దృష్టికిని యుక్తమైయుండెను గనుక అతడు తన సేవకులను చూచి–ఇతనివలె దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొనగలమా అని యనెను. మరియు ఫరో–దేవుడు ఇదంతయు నీకు తెలియపరచెను గనుక నీవలె వివేకజ్ఞానములుగలవారెవరును లేరు. నీవు నా యింటికి అధికారివై యుండవలెను, నా ప్రజలందరు నీకు విధేయులైయుందురు; సింహాసన విషయములో మాత్రమే నేను నీకంటె పైవాడనై యుందునని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో–చూడుము, ఐగుప్తు దేశ మంతటిమీద నిన్ను నియమించియున్నానని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి, సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి, అతని మెడకు బంగారు గొలుసు వేసి తన రెండవ రథముమీద అతని నెక్కించెను. అప్పుడు–వందనము చేయుడని అతని ముందర జనులు కేకలువేసిరి. అట్లు ఐగుప్తు దేశమంతటిమీద అతని నియమించెను. మరియు ఫరో యోసేపుతో–ఫరోను నేనే; అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశమందంతటను ఏ మనుష్యుడును తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పెను. మరియు ఫరో యోసేపునకు జప్నత్ప నేహు అను పేరు పెట్టి, అతనికి ఓనుయొక్క యాజకుడైన పోతీఫెర కుమార్తెయగు ఆసెనతు నిచ్చి పెండ్లి చేసెను.
ఆదికాండము 41:15-45 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
ఫరో యోసేపుతో, “నేనొక కలగన్నాను, దాని భావం ఎవరూ చెప్పలేకపోయారు. కానీ నీవు ఒక కల వింటే దాని భావం చెప్తావని నీ గురించి విన్నాను” అని అన్నాడు. అందుకు యోసేపు, “నేను చేయలేను, అయితే ఫరోకు క్షేమకరమైన జవాబు దేవుడు ఇస్తారు” అని ఫరోతో అన్నాడు. అప్పుడు ఫరో యోసేపుతో అన్నాడు, “నా కలలో నేను నైలు నది తీరాన నిలబడ్డాను, నదిలో నుండి పుష్టిగా అందంగా ఉన్న ఏడు ఆవులు పైకి వచ్చి జమ్ము మధ్య మేస్తున్నాయి. వాటి తర్వాత చిక్కిపోయి వికారంగా ఉన్న మరో ఏడు ఆవులు పైకి వచ్చాయి. అంత వికారమైన ఆవులను ఈజిప్టులో నేనెప్పుడు చూడలేదు. బక్కగా వికారంగా ఉన్న ఆవులు ముందు వచ్చిన పుష్టిగా ఉన్న ఏడు ఆవులను తినివేశాయి. కానీ అవి తిన్నా కూడా అవి తిన్నాయని ఎవరు చెప్పలేరు; అవి ముందు ఉన్నట్లే వికారంగా ఉన్నాయి. అప్పుడు నేను నిద్రలేచాను. “నా కలలో పుష్టిగా మంచిగా ఉన్న ఏడు వెన్నులు ఒకే కాడకు పెరుగుతున్నాయి. వాటి తర్వాత పీలగా తూర్పుగాలికి ఎండిపోయిన మరో పీలవెన్నులు వాటి తర్వాత మొలిచాయి. పీలవెన్నులు పుష్టిగా ఉన్న ఏడు వెన్నులను మ్రింగివేశాయి. ఇది మాంత్రికులకు చెప్పాను, కానీ దాని అర్థాన్ని చెప్పేవారు ఎవరూ లేరు.” అప్పుడు యోసేపు ఫరోకు చెప్పాడు, “ఫరో కలల భావం ఒక్కటే. దేవుడు ఏమి చేయబోతున్నారో ఫరోకు తెలియజేశారు. ఆ ఏడు మంచి ఆవులు ఏడు సంవత్సరాలు, అలాగే ఏడు మంచి వెన్నులు ఏడు సంవత్సరాలు; రెండు కలల భావం ఒకటే. వాటి తర్వాత వచ్చిన చిక్కిపోయి వికారంగా ఉన్న ఏడు ఆవులు ఏడు సంవత్సరాలు, పీలగా తూర్పుగాలికి ఎండిపోయిన ఏడు వెన్నులు కూడా అవే ఏడు సంవత్సరాలు; అవి ఏడు సంవత్సరాలు కరువు కాలము. “నేను ఫరోకు చెప్పినట్టే జరుగుతుంది. దేవుడు తాను ఏమి చేయబోతున్నారో ఫరోకు చూపించారు. ఈజిప్టు దేశమంతటా గొప్ప సమృద్ధిగల ఏడు సంవత్సరాలు రాబోతున్నాయి. కానీ వాటి తర్వాత ఏడు సంవత్సరాలు కరువు వస్తుంది. ఆ సమయంలో ఈజిప్టులో ఉండే సమృద్ధి అందరు మరిచిపోతారు, కరువు దేశాన్ని నాశనం చేస్తుంది. తర్వాత వచ్చే కరువు ఇంకా తీవ్రంగా ఉంటుంది కాబట్టి దేశంలో ఉండిన సమృద్ధి ఎవరికీ జ్ఞాపకం ఉండదు. కల రెండు విధాలుగా ఫరోకు ఇవ్వబడిన కారణం ఏంటంటే ఇది దేవునిచే దృఢంగా నిర్ణయించబడింది, దేవుడు త్వరలో దానిని చేస్తారు. “ఇప్పుడు ఫరో జ్ఞాన వివేచనలు కలిగిన ఒక వ్యక్తిని ఈజిప్టు అంతటి మీద అధికారిగా నియమించాలి. సమృద్ధిగా పండే ఏడు సంవత్సరాల్లో పంటలో అయిదవ భాగాన్ని సేకరించడానికి ఫరో దేశమంతా పర్యవేక్షకులను నియమించాలి. వారు ఈ మంచి సంవత్సరాల్లో పండే ధాన్యం సేకరించి ఫరో ఆధీనంలో పట్టణాల్లో ఆహారం ఉండేలా నిలువచేయాలి. ఈ ఆహారం దేశం కోసం నిలువచేయబడి ఈజిప్టు మీదికి వచ్చే ఏడు సంవత్సరాల కరువు కాలంలో ఉపయోగించబడుతుంది, అప్పుడు కరువు ద్వారా దేశం నాశనం కాదు.” ఈ మాట ఫరోకు అతని అధికారులకు నచ్చింది. కాబట్టి ఫరో వారిని, “ఇతనిలా దేవుని ఆత్మ కలిగిన వారెవరినైనా కనుగొనగలమా?” అని అడిగాడు. అప్పుడు ఫరో యోసేపుతో, “దేవుడు నీకు ఇదంతా తెలియజేశారు కాబట్టి, నీలా వివేచన జ్ఞానం కలిగిన వారెవరూ లేరు. నా రాజభవన అధికారిగా నీవు ఉంటావు, నా ప్రజలంతా నీ ఆదేశాలకు లోబడతారు. సింహాసనం విషయంలో మాత్రమే నేను నీ పైవాడిగా ఉంటాను” అని అన్నాడు. కాబట్టి ఫరో యోసేపుతో, “నేను నిన్ను ఈజిప్టు దేశమంతటికి అధికారిగా ప్రకటిస్తున్నాను” అని అన్నాడు. ఫరో తన రాజముద్ర ఉంగరం తీసి యోసేపు వ్రేలికి పెట్టాడు. సన్నని నారబట్టలు అతనికి తొడిగించాడు, అతని మెడలో బంగారు గొలుసు వేశాడు. తన రెండవ రథంలో అతన్ని కూర్చోబెట్టాడు, అప్పుడు ప్రజలు, “నమస్కారం చేయండి!” అని అంటూ అతని ముందు కేకలు వేశారు. ఈ విధంగా అతడు యోసేపును దేశమంతటిమీద అధికారిగా చేశాడు. అప్పుడు ఫరో యోసేపుతో, “నేను ఫరోను, కానీ నీ అనుమతి లేకుండా ఈజిప్టు అంతటిలో ఎవరు కూడా తన చేయి కానీ కాలు కానీ ఎత్తరు” అని అన్నాడు. ఫరో యోసేపుకు జఫెనత్-ఫనేహు అనే పేరు పెట్టాడు, ఓనులో యాజకుడైన పోతీఫెర కుమార్తె, ఆసెనతును అతనికి భార్యగా ఇచ్చాడు. యోసేపు ఈజిప్టు దేశమంతటా పర్యటించాడు.