అపొస్తలుల కార్యములు 10:34-48
అపొస్తలుల కార్యములు 10:34-48 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
అప్పుడు పేతురు మాట్లాడడం మొదలుపెట్టాడు, “దేవుడు పక్షపాతం చూపించడు, కానీ ప్రతీ జనాల్లో ఆయనకు భయపడుతూ సరియైనది చేసేవారిని ఆయన స్వీకరిస్తారని నేను ఇప్పుడు స్పష్టంగా తెలుసుకున్నాను. అందరికి ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా సమాధాన సువార్తను ప్రకటిస్తూ, ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానం మీకు తెలుసు. యోహాను ప్రకటించిన బాప్తిస్మం తర్వాత గలిలయ ప్రాంతం మొదలుకొని యూదయ చుట్టుప్రక్కల ప్రాంతాలన్నింటిలో జరిగిన సంగతులు మీకు తెలుసు. దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతో శక్తితో ఎలా అభిషేకించారో, దేవుడు ఆయనకు తోడుగా ఉన్నందుకు ఎలా ఆయన మేలులను చేస్తూ అపవాది శక్తుల క్రింద ఉన్నవారందరిని బాగుచేస్తూ తిరిగాడో మీకు తెలుసు. “యూదయా ప్రాంతంలో యెరూషలేము పట్టణంలో యేసు చేసిన కార్యాలన్నింటికి మేము సాక్షులము. వారు ఆయనను సిలువ మీద వ్రేలాడదీసి చంపారు. కానీ దేవుడు ఆయనను మూడవ రోజున మరణం నుండి సజీవునిగా లేపి మేము ఆయనను చూసేలా మాకు కనుపరిచారు. ఆయన ప్రజలందరికి కనబడలేదు; కానీ దేవుడు ముందుగానే తన సాక్షులుగా ఏర్పరచుకున్నవారికి అనగా ఆయన మరణం నుండి తిరిగి జీవంతో లేచిన తర్వాత ఆయనతో పాటు తిని త్రాగిన మాకు కనబడ్డారు. దేవుడు ఆయననే సజీవులకు, మృతులకు తీర్పు తీర్చేవానిగా నియమించారని ప్రజలకు ప్రకటించి, సాక్ష్యం ఇవ్వమని ఆయన మమ్మల్ని ఆజ్ఞాపించారు. ఆయనను నమ్మిన ప్రతివారు ఆయన పేరట పాపక్షమాపణ పొందుతారని ప్రవక్తలందరు ఆయన గురించి సాక్ష్యం ఇచ్చారు.” పేతురు ఇంకా ఈ మాటలను మాట్లాడుతుండగా, ఈ సందేశాన్ని విన్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగి వచ్చారు. యూదేతరుల మీద కూడా పరిశుద్ధాత్మ వరం కుమ్మరించబడడం చూసి పేతురుతో వచ్చిన సున్నతి పొందిన విశ్వాసులు ఆశ్చర్యపోయారు. దానికి కారణం వారందరు ఇతర భాషల్లో మాట్లాడుతూ దేవుని స్తుతించడం విన్నారు. అప్పుడు పేతురు, “మనం పొందుకొన్న విధంగానే వారు కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నారు కాబట్టి వీరిని నీటి బాప్తిస్మం పొందడానికి ఇక ఆటంకపరచగలమా? ఆటంకపరచలేము కదా” అని అన్నాడు. కాబట్టి వారు యేసు క్రీస్తు పేరట బాప్తిస్మం పొందాలని పేతురు ఆదేశించాడు. ఆ తర్వాత వారు పేతురును తమతో మరికొన్ని రోజులు ఉండమని బ్రతిమాలుకొన్నారు.
అపొస్తలుల కార్యములు 10:34-48 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
“దేవుడు పక్షపాతం లేకుండా అందరినీ సమదృష్టితో చూస్తాడని నేను ఇప్పుడు స్పష్టంగా తెలుసుకున్నాను. ప్రతి జనంలోనూ తనపట్ల భయభక్తులు కలిగి నీతిగా నడుచుకునే వారిని ఆయన అంగీకరిస్తాడు. యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారా దేవుడు శాంతి సువార్తను ప్రకటిస్తూ, ఇశ్రాయేలీయులకు పంపిన సందేశం మీకు తెలిసిందే కదా. యోహాను ప్రకటించిన బాప్తిసం తరువాత గలిలయ మొదలు యూదయ ప్రాంతమంతా జరిగిన సంగతులు కూడా మీకు తెలుసు. అవేవంటే దేవుడు నజరేతువాడైన యేసును పరిశుద్ధాత్మతోనూ, బలప్రభావాలతోనూ అభిషేకించాడు. దేవుడు ఆయనతో ఉన్నాడు కాబట్టి ఆయన మేలు చేస్తూ సాతాను పీడన కింద ఉన్న వారందరినీ బాగుచేస్తూ వెళ్ళాడు. ఆయన యూదుల దేశంలో, యెరూషలేములో చేసిన వాటన్నిటికీ మేము సాక్షులం. ఈ యేసుని వారు మానుకు వేలాడదీసి చంపారు. దేవుడాయనను మూడవ రోజున సజీవంగా తిరిగి లేపాడు. ప్రజలందరికీ కాక దేవుడు ముందుగా ఏర్పరచిన సాక్షులకే, అంటే ఆయన చనిపోయి లేచిన తరువాత ఆయనతో కలిసి అన్నపానాలు చేసిన మాకే, ఆయన ప్రత్యక్షంగా కనిపించేలా అనుగ్రహించాడు. దేవుడు సజీవులకూ మృతులకూ న్యాయాధిపతిగా నియమించినవాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి సాక్షమివ్వాలని ఆయన మాకు ఆజ్ఞాపించాడు. ఆయనలో విశ్వాసముంచే వారంతా ఆయన నామంలో పాపక్షమాపణ పొందుతారని ప్రవక్తలంతా ఆయనను గూర్చి సాక్షమిస్తున్నారు” అని చెప్పాడు. పేతురు ఈ మాటలు చెబుతూ ఉండగానే అతని బోధ విన్న వారందరి మీదికీ పరిశుద్ధాత్మ దిగాడు. సున్నతి పొందిన విశ్వాసులంతా, అంటే పేతురుతో పాటు వచ్చినవారంతా, పరిశుద్ధాత్మ వరాన్ని యూదేతరుల మీద కూడా దేవుడు కుమ్మరించడం చూసి ఆశ్చర్యచకితులయ్యారు. ఎందుకంటే యూదేతరులు భాషల్లో మాట్లాడుతూ దేవుణ్ణి స్తుతించడం వారు విన్నారు. అప్పుడు పేతురు, “మనలాగా పరిశుద్ధాత్మను పొందిన వీరు నీటి బాప్తిస్మం పొందకుండా ఎవరైనా అడ్డు చెప్పగలరా?” అని చెప్పి యేసుక్రీస్తు నామంలో వారు బాప్తిస్మం పొందాలని ఆజ్ఞాపించాడు. అటు తరువాత మరికొన్ని రోజులు తమ దగ్గర ఉండమని వారతన్ని బతిమాలారు.
అపొస్తలుల కార్యములు 10:34-48 పవిత్ర బైబిల్ (TERV)
పేతురు ఇలా చెప్పటం మొదలు పెట్టాడు: “దేవుడు పక్షపాతం చూపడని, తానంటే భయభక్తులున్న వాళ్ళను, నిజాయితీ పరుల్ని వాళ్ళు ఏ దేశస్థులైనా అంగీకరిస్తాడని యిప్పుడు నాకు బాగా తెలిసింది. ఈ సందేశాన్ని దేవుడు ఇశ్రాయేలు వంశీయులకు అందించాడు. దేవుడు మనకందరికి ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా శాంతి లభిస్తుందనే శుభవార్తను ప్రకటించాడు. “యోహాను బోధించిన బాప్తిస్మమును ప్రజలు పొందాక గలిలయలో ఒక సంగతి ప్రారంభమైంది. ఆ సంగతిని గురించిన ప్రకటనలు యూదయ ప్రాంతం అంతా వ్యాపించాయి. ఇది మీకంతా తెలుసు. నజరేతు నివాసి యేసును దేవుడు పవిత్రాత్మతో అభిషేకించాడు. అద్భుతమైన శక్తి యిచ్చాడు. దేవుడు ఆయనతో ఉండటం వల్ల యేసు ప్రజలకు మేలు చేస్తూ అన్ని ప్రాంతాలు పర్యటించాడు. సాతాను పీడవలన బాధపడ్తున్న వాళ్ళకు నయం చేసాడు. ఈ విషయాలన్నీ మీకు తెలుసు. “యెరూషలేము, యూదయ దేశంలో ఉన్న మిగతా ప్రాంతాల్లో ఆయన చేసిన ప్రతి పనిని మేము కళ్ళారా చూసాము. వాళ్ళు ఆయన్ని మ్రానుతో చేసిన సిలువకు మేకులు కొట్టి చంపారు. కాని మూడవ రోజున దేవుడు ఆయన్ని బ్రతికించాడు. ఆయన ప్రజలకు కనిపించాలని దేవుని ఉద్దేశ్యం. అందరూ ఆయన్ని చూడలేదు. ఇదివరకే దేవుడు ఎన్నుకొన్న కొందరు మాత్రం చూసారు. మేమే ఆ సాక్షులం. ఆయన బ్రతికి వచ్చాక మేమంతా ఆయనతో కలిసి భోజనం చేసాం. “ఆయన అందరికి న్యాయాధిపతి. అంటే బ్రతికి ఉన్నవాళ్ళకు, పునర్జీవం పొందనున్న వాళ్ళకు. ఈ పదవిని దేవుడు ఆయనకిచ్చాడు. దీన్ని గురించి ప్రజల ముందు సాక్ష్యం చెప్పమని, సువార్తను ప్రకటించమని ఆయన మాకు ఆజ్ఞాపించాడు. యేసును నమ్మినవాళ్ళు తమ పాపాలకు ఆయన ద్వారా క్షమాపణ పొందుతారని ప్రవక్తలందరు చెప్పారు.” పేతురు యింకా మాట్లాడుతుండగానే అతని సందేశాన్ని వింటున్న అక్కడివాళ్ళందరి మీదికి పరిశుద్ధాత్మ వచ్చాడు. పేతురుతో వచ్చిన వాళ్ళందరు యూదులు. యేసునందు విశ్వసించినవారు. వీళ్ళు యూదులు కానివాళ్ళు యితర భాషల్లో మాట్లాడటం, దేవుణ్ణి స్తుతించటం చూసారు. దేవుడు తన పరిశుద్ధాత్మను వరంగా యూదులు కానివాళ్ళకు కూడా యిచ్చాడని గ్రహించి వాళ్ళకు ఆశ్చర్యం వేసింది. తదుపరి పేతురు యిలా అన్నాడు: “వీళ్ళకు బాప్తిస్మము నివ్వటానికి అడ్డు చేప్పే ధైర్యం ఎవరికుంది? మనలాగే వీళ్ళు కూడా దేవుని పరిశుద్ధాత్మ పొందారు.” యేసు పేరిట వాళ్ళు బాప్తిస్మం పొందాలని పేతురు ఆజ్ఞాపించాడు. ఇదంతా ముగిసాక వాళ్ళు పేతురును తమతో కొద్దిరోజులు ఉండమని అడిగారు.
అపొస్తలుల కార్యములు 10:34-48 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
–దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించియున్నాను. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొనువానిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికి ప్రభువు. ఆయనద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరెరుగుదురు. యోహాను బాప్తిస్మము ప్రకటించిన తరువాత గలిలయమొదలుకొని యూదయ యందంతట ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియును అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించెనను నదియే. దేవుడాయనకు తోడైయుండెను గనుక ఆయన మేలుచేయుచు, అపవాదిచేత పీడింపబడిన వారినందరిని స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఆయన యూదుల దేశమందును యెరూషలేమునందును చేసినవాటికన్నిటికిని మేము సాక్షులము. ఆయనను వారు మ్రానున వ్రేలాడ దీసి చంపిరి. దేవుడాయనను మూడవదినమున లేపి ప్రజలకందరికి కాక దేవునిచేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయన మృతులలోనుండి లేచిన తరు వాత ఆయనతోకూడ అన్నపానములు పుచ్చుకొనిన మాకే, ఆయన ప్రత్యక్షముగా కనబడునట్లు అనుగ్రహించెను. ఇదియుగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతినిగా నియమించినవాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢసాక్ష్యమియ్యవలెనని మాకు ఆజ్ఞాపించెను. ఆయనయందు విశ్వాసముంచువాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరు ఆయననుగూర్చి సాక్ష్య మిచ్చుచున్నారనెను. పేతురు ఈ మాటలు ఇంక చెప్పుచుండగా అతని బోధ విన్నవారందరిమీదికి పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందినవారిలో పేతురుతోకూడ వచ్చిన విశ్వాసులందరు, పరిశుద్ధాత్మ వరము అన్యజనులమీద సయితము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతినొందిరి. ఏలయనగా వారు భాషలతో మాటలాడుచు దేవుని ఘనపరచుచుండగా వినిరి. అందుకు పేతురు–మనవలె పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మము పొందకుండ ఎవడైనను నీళ్లకు ఆటంకము చేయగలడా అని చెప్పి యేసు క్రీస్తు నామమందువారు బాప్తిస్మము పొందవలెనని ఆజ్ఞాపించెను. తరువాత కొన్ని దినములు తమయొద్ద ఉండుమని వారతని వేడుకొనిరి.