రోమా పత్రిక 10:5-15

రోమా పత్రిక 10:5-15 OTSA

ధర్మశాస్త్రం వలన నీతిని జరిగించే వారి గురించి మోషే, “వీటిని చేసేవారు వాటి వల్లనే జీవిస్తారు” అని వ్రాశాడు. అయితే విశ్వాసం ద్వారా వచ్చే నీతి ఇలా చెప్తుంది: “క్రీస్తును క్రిందకు తేవడానికే ‘పరలోకంలోకి ఎవరు ఎక్కి వెళ్తారు?’ అని మీ హృదయంలో అనుకోవద్దు.” “లేదా ‘క్రీస్తును మృతులలో నుండి పైకి తేవడానికే అగాధం లోనికి ఎవరు దిగి వెళ్తారు?’ ” అని మీ హృదయాల్లో అనుకోవద్దు. అయితే ఇది ఏమి చెప్తుంది? “వాక్యం మీకు దగ్గరగా ఉంది, అది మీ నోటిలో, మీ హృదయంలో ఉంది.” అది మేము ప్రకటిస్తున్న విశ్వాస వాక్యమే. మీరు మీ నోటితో “యేసు ప్రభువు” అని ఒప్పుకుని, మీ హృదయాల్లో “దేవుడు ఆయనను మరణం నుండి లేపాడు” అని నమ్మితే మీరు రక్షించబడతారు. అంటే, మీరు మీ హృదయంలో నమ్మినప్పుడు నీతిమంతులుగా తీర్చబడతారు. మీరు మీ నోటితో మీ విశ్వాసాన్ని ఒప్పుకున్నప్పుడు రక్షించబడతారు. “ఆయనలో నమ్మకం ఉంచేవారు ఎన్నడూ సిగ్గుపరచబడరు” అని లేఖనం చెప్తుంది. యూదులకు, యూదేతరులకు భేదం లేదు. ఒక్క ప్రభువే అందరికి ప్రభువై ఆయనకు మొరపెట్టిన వారందరిని ఆయన సమృద్ధిగా దీవిస్తాడు. ఎందుకంటే, “ప్రభువు పేరట మొరపెట్టిన ప్రతి ఒక్కరూ రక్షింపబడతారు.” అయితే, వారు తాము నమ్మని వానికి ఎలా మొరపెడతారు? తాము విననివానిని ఎలా నమ్ముతారు? వారికి ఎవరూ ప్రకటించకపోతే ఎలా వినగలరు? ప్రకటించేవారిని పంపకపోతే ఎలా ప్రకటించగలరు? దీని గురించి, “సువార్తను తెచ్చేవారి పాదాలు ఎంతో అందమైనవి!” అని వ్రాయబడి ఉంది.

రోమా పత్రిక 10:5-15 కోసం వీడియో