యేసు ఆ జనసమూహాన్ని చూసి కొండ మీదికి వెళ్లి కూర్చుని ఉండగా ఆయన శిష్యులు ఆయన దగ్గరకు వచ్చారు. అప్పుడు ఆయన వారికి బోధించడం మొదలుపెట్టారు. ఆయన ఇలా బోధించారు: “ఆత్మ కోసం దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదే. దుఃఖించే వారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. సాత్వికులు ధన్యులు, వారు భూమిని స్వతంత్రించుకుంటారు. నీతి కోసం ఆకలిదప్పులు కలవారు ధన్యులు, వారు తృప్తిపొందుతారు. కనికరం చూపేవారు ధన్యులు, వారు కనికరం పొందుతారు. హృదయశుధ్ధి కలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. సమాధానపరిచేవారు ధన్యులు, వారు దేవుని బిడ్డలుగా పిలువబడతారు. నీతి కోసం హింసల పాలయ్యేవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదే. “నా నిమిత్తం ప్రజలు మిమ్మల్ని అవమానించి, హింసించి మీరు చెడ్డవారని మీమీద అపనిందలు వేసినప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించండి. ఎందుకంటే పరలోకంలో మీ బహుమానం గొప్పది, మీకన్నా ముందు వచ్చిన ప్రవక్తలను కూడా వారు ఇలాగే హింసించారు. “మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. కాని ఉప్పు తన సారం కోల్పోతే అది తిరిగి సారవంతం కాగలదా? ఇక అది దేనికి పనికిరాదు, బయట పారవేయబడి త్రొక్కబడడానికే తప్ప మరి దేనికి పనికిరాదు. “మీరు లోకానికి వెలుగై ఉన్నారు. కొండమీద కట్టబడిన పట్టణం కనపడకుండా ఉండలేదు. అలాగే ఎవ్వరూ దీపాన్ని వెలిగించి దానిని పాత్ర క్రింద పెట్టరు, కాని దానిని దీపస్తంభం మీద పెడతారు. అప్పుడే ఇంట్లో ఉన్నవారందరికి వెలుగు ఇస్తుంది. అదే విధంగా, ఇతరులు మీ మంచి పనులను చూసి పరలోకమందు ఉన్న మీ తండ్రిని మహిమపరిచేలా ఇతరుల ముందు మీ వెలుగును ప్రకాశింపనివ్వండి. “నేను ధర్మశాస్త్రాన్ని లేదా ప్రవక్తల మాటలను రద్దు చేయడానికి వచ్చానని అనుకోవద్దు. నేను వాటిని నెరవేర్చడానికే కాని రద్దు చేయడానికి రాలేదు. ఆకాశం భూమి గతించిపోకముందు, ధర్మశాస్త్రం అంతా నెరవేరే వరకు అందులో నుండి ఒక పొల్లు కానీ, ఒక సున్నా కానీ తప్పిపోదని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను. కాబట్టి ఈ ఆజ్ఞలలో అతి చిన్నదైన ఒకదాన్ని చేయకుండ ఇతరులకు వాటిని బోధించేవారు పరలోకరాజ్యంలో చాలా తక్కువగా ఎంచబడతారు, అయితే ఈ ఆజ్ఞల ప్రకారం చేస్తూ బోధించేవారు పరలోకరాజ్యంలో గొప్పవారిగా గుర్తించబడతారు. ధర్మశాస్త్ర ఉపదేశకుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే, మీ నీతి అధికంగా లేకపోతే మీరు పరలోకరాజ్యంలో ప్రవేశించలేరని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను. “ ‘మీరు హత్య చేయకూడదు. ఎవరైనా హత్య చేస్తే, వారు శిక్షకు గురవుతారు’ అని మీ పూర్వికులకు చెప్పిన మాట మీరు విన్నారు కదా. కాని నేను చెప్పేదేంటంటే, తన సహోదరుని మీద కాని సహోదరి మీద కాని కోప్పడేవారు తీర్పుకు గురవుతారు. అంతేకాక తన సహోదరుని కాని సహోదరిని కాని చూసి ద్రోహి అని పలికేవారు న్యాయస్థానం ఎదుట నిలబడాలి. ‘వెర్రివాడ లేదా వెర్రిదాన!’ అనే వారికి నరకాగ్నికి తప్పదు. “కాబట్టి మీరు బలిపీఠం దగ్గర కానుకను అర్పిస్తూ ఉండగా మీ సహోదరునికైనా సహోదరికైనా మీమీద ఏదైన విరోధం ఉందని జ్ఞాపకం వస్తే, మీ కానుకను అక్కడ బలిపీఠం ముందే పెట్టి, మొదట వెళ్లి మీ సహోదరునితో లేక సహోదరితో సమాధానపడి ఆ తర్వాత వచ్చి మీ కానుకను అర్పించాలి. “మీలో ఎవరైనా మీ విరోధితో నీకున్న వివాదం విషయంలో మీరిద్దరు న్యాయస్థానానికి వెళ్తున్నట్లయితే ఇంకా దారిలో ఉండగానే సమాధానపడడం మంచిది. లేకపోతే మీ విరోధి మిమ్మల్ని న్యాయాధిపతికి అప్పగించవచ్చు, ఆ న్యాయాధిపతి మిమ్మల్ని అధికారికి అప్పగించి చెరసాలలో వేయించవచ్చు. అప్పుడు జరిగేదేంటంటే చివరి పైసా చెల్లించే వరకు మీరు బయట పడలేరని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను.
చదువండి మత్తయి సువార్త 5
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: మత్తయి సువార్త 5:1-26
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్లైన్లో చదవండి, బోధన క్లిప్లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు