ఆ తర్వాత యేసు పట్టణాలు, గ్రామాల గుండా బోధిస్తూ, యెరూషలేముకు వెళ్లారు. అప్పుడు ఒకడు ఆయనను, “ప్రభువా, కొందరు మాత్రమే రక్షింపబడతారా?” అని అడిగాడు.
ఆయన వారితో, “ఇరుకు ద్వారం గుండా ప్రవేశించడానికి ప్రతీ ప్రయత్నం చేయండి, ఎందుకంటే, చాలామంది ప్రవేశించే ప్రయత్నం చేస్తారు, కాని ప్రవేశించలేరు అని మీకు చెప్తున్నాను. ఒక్కసారి ఇంటి యజమాని లేచి తలుపును మూసివేస్తే, మీరు తలుపు బయట నిలబడి తలుపు తడుతూ, ‘అయ్యా, మాకోసం తలుపు తెరవండి’ అని వేడుకొంటారు.
“కాని అతడు మీతో, ‘మీరు ఎవరో ఎక్కడ నుండి వచ్చారో నాకు తెలియదు’ అని జవాబిస్తాడు.
“అప్పుడు మీరు, ‘మేము నీతో కలిసి తిన్నాము త్రాగాము, నీవు మా వీధుల్లో బోధించావు’ అని అంటారు.
“కాని అతడు, ‘మీరు ఎవరో ఎక్కడ నుండి వచ్చారో నాకు తెలియదు. దుష్ట కార్యాలు చేసేవారలారా, నా దగ్గర నుండి వెళ్లిపొండి!’ అంటాడు.
“మీరు అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు ప్రవక్తలందరినీ దేవుని రాజ్యంలో చూస్తారు, కానీ మీరు మాత్రం వెలుపటికి త్రోసివేయబడతారు, అక్కడ ఏడ్వడం, పండ్లు కొరకడం ఉంటాయి. ప్రజలు తూర్పు, పడమర ఉత్తరం, దక్షిణం నుండి వచ్చి, దేవుని రాజ్యంలో జరిగే విందులో తమ తమ స్థానాల్లో కూర్చుంటారు. వాస్తవానికి చివరి వారు మొదటివారవుతారు, మొదటివారు చివరివారవుతారు.”
ఆ సమయంలో కొందరు పరిసయ్యులు యేసు దగ్గరకు వచ్చి, “నీవు ఈ స్థలాన్ని విడచి ఎక్కడికైన వెళ్లిపోవడం మంచిది. హేరోదు రాజు నిన్ను చంపాలనుకుంటున్నాడు” అని ఆయనతో చెప్పారు.
అందుకు ఆయన, “వెళ్లి ఆ నక్కతో చెప్పండి, ‘ఇవ్వాళ రేపు నేను దయ్యాలను వెళ్లగొడుతూ ప్రజలను స్వస్థపరుస్తూ ఇక్కడే ఉంటాను, మూడవ రోజున నా గమ్యాన్ని చేరుకుంటాను.’ ఏ పరిస్థితిలోనైనా, నేను ఇవ్వాళ రేపు ఎల్లుండి వరకు వీటిని చేస్తూ ఉండాల్సిందే, ఎందుకంటే ఏ ప్రవక్త కూడా యెరూషలేము బయట చావలేడు! అని బదులిచ్చారు.
“యెరూషలేమా, యెరూషలేమా, నీవు ప్రవక్తలను చంపావు నీ దగ్గరకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టినదానా, ఒక కోడి తన రెక్కల క్రింద తన పిల్లలను ఎలా చేర్చుకొంటుందో అలాగే నేను నీ పిల్లలను ఎన్నోసార్లు చేర్చుకోవాలని అనుకున్నాను కాని నీవు అంగీకరించలేదు. చూడు, నీ ఇల్లు నిర్జనమైనదిగా నీకే విడిచిపెట్టబడుతుంది. ‘ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక!’ అని మీరు చెప్పే వరకు నన్ను చూడరని మీతో చెప్తున్నాను” అన్నారు.