యోహాను సువార్త 11:1-17

యోహాను సువార్త 11:1-17 OTSA

బేతనియ గ్రామానికి చెందిన మరియ, మార్తల సహోదరుడైన లాజరు అనారోగ్యంతో ఉన్నాడు. అనారోగ్యంతో ఉన్న లాజరు సహోదరియైన మరియ ఈమెనే ప్రభువు పాదాల మీద పరిమళద్రవ్యాన్ని పోసి తన తలవెంట్రుకలతో తుడిచింది. కాబట్టి అతని సహోదరీలు, “ప్రభువా, నీవు ప్రేమించినవాడు అనారోగ్యంగా ఉన్నాడు” అని కబురు పంపించారు. యేసు అది విని, “ఈ అనారోగ్యం చావు కోసం వచ్చింది కాదు. దేవుని కుమారునికి మహిమ కలిగేలా దేవుని మహిమ పరచడానికే వచ్చింది” అని అన్నారు. యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించారు. లాజరు అనారోగ్యంతో ఉన్నాడని యేసు విని కూడా తాను ఉన్న చోటే మరో రెండు రోజులు ఉన్నారు. ఆ తర్వాత ఆయన తన శిష్యులతో, “యూదయ ప్రాంతానికి వెళ్దాం రండి” అని అన్నారు. అందుకు శిష్యులు, “రబ్బీ, ఇంతకుముందే యూదులు నిన్ను రాళ్లతో కొట్టడానికి ప్రయత్నించారు కదా, అయినా నీవు అక్కడికి మళ్ళీ వెళ్తావా?” అని అడిగారు. అందుకు యేసు, “పగలుకు పన్నెండు గంటలు ఉన్నాయి కదా? పగలు నడిచేవాడు తడబడకుండా నడుస్తాడు ఎందుకంటే అతడు లోకపు వెలుగులో చూడగలడు. అతడు రాత్రివేళ నడిస్తే వెలుగు ఉండదు కాబట్టి అతడు తడబడతాడు” అని చెప్పారు. యేసు ఈ సంగతులు వారితో చెప్పిన తర్వాత ఆయన ఇంకా వారితో, “మన స్నేహితుడు లాజరు నిద్రపోతున్నాడు. కాబట్టి నేను అతన్ని లేపడానికి వెళ్తున్నాను” అని అన్నారు. అందుకు ఆయన శిష్యులు ఆయనతో, “ప్రభువా, అతడు నిద్రపోతే బాగవుతాడు” అన్నారు. యేసు అతని చావు గురించి మాట్లాడారు. కాని వారు సాధారణమైన నిద్ర గురించి అనుకున్నారు. కాబట్టి యేసు వారితో స్పష్టంగా, “లాజరు చనిపోయాడు. అప్పుడు నేను అక్కడ లేనందుకు మీ గురించి సంతోషిస్తున్నాను. దీన్ని బట్టి మీరు నమ్ముతారు. పదండి అతని దగ్గరకు వెళ్దాం” అన్నారు. అప్పుడు దిదుమ అని పిలువబడే తోమా, “ఆయనతో పాటు చనిపోవడానికి ‘మనం కూడ వెళ్దాం రండి’ ” అని తోటి శిష్యులతో అన్నాడు. యేసు అక్కడికి చేరుకుని, లాజరు శవాన్ని సమాధిలో ఉంచి అప్పటికే నాలుగు రోజులు గడిచాయని తెలుసుకున్నారు.