యెషయా 49:8-25

యెషయా 49:8-25 OTSA

యెహోవా చెప్పే మాట ఇదే: “అనుకూల సమయంలో నేను నీకు జవాబు ఇస్తాను, రక్షణ దినాన నేను నీ మీద దయ చూపిస్తాను; దేశాన్ని పునరుద్ధరించి పాడైన స్వాస్థ్యాలను పంచడానికి బంధించబడిన వారితో, ‘బయలుదేరండి’ అని, చీకటిలో ఉన్నవారితో ‘బయటికి రండి’ అని చెప్పడానికి, నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమిస్తాను. “వారు దారి ప్రక్కన తింటారు చెట్లులేని కొండలమీద పచ్చిక దొరుకుతుంది. వారికి ఆకలి గాని దాహం గాని వేయదు. ఎడారి వేడిగాలి గాని, ఎండ గాని వారికి తగలదు. వారిపట్ల దయగలవాడు వారిని తీసుకెళ్లి నీటి ఊటల ప్రక్క వారిని నడిపిస్తాడు. నా పర్వతాలన్నిటిని దారులుగా చేస్తాను నా రహదారులు ఎత్తు చేయబడతాయి. చూడండి, వారు దూరం నుండి వస్తారు కొందరు ఉత్తరం నుండి కొందరు పడమటి నుండి, కొందరు సీనీయుల దేశం నుండి వస్తారు.” ఆకాశాల్లారా, ఉత్సాహ ధ్వని చేయండి; భూమీ, సంతోషించు; పర్వతాల్లారా, ఆనందంతో పాట పాడండి! ఎందుకంటే, యెహోవా తన ప్రజలను ఓదారుస్తారు, బాధించబడిన తన ప్రజల పట్ల జాలి చూపిస్తారు. అయితే సీయోను, “యెహోవా నన్ను విడిచిపెట్టారు. ప్రభువు నన్ను మరచిపోయారు” అని అన్నది. “తల్లి తన చంటిబిడ్డను మరచిపోతుందా? తాను కన్న బిడ్డ మీద జాలిపడకుండ ఉంటుందా? తల్లియైన మరచిపోవచ్చు కాని నేను నిన్ను మరవను! చూడు, నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కుకున్నాను; నీ గోడలు నిత్యం నా ఎదుట ఉన్నాయి. నీ కుమారులు తొందరగా తిరిగి వస్తారు. నిన్ను నాశనం చేసినవారు నీ నుండి వెళ్లిపోతారు. నీ కళ్ళెత్తి చుట్టూ చూడు; నీ పిల్లలందరు కలిసి నీ దగ్గరకు వస్తున్నారు. ‘వారందరిని నీవు ఆభరణంగా ధరించుకుంటావు; పెళ్ళికుమార్తెలా నీవు వారిని ధరించుకుంటావు. నా జీవం తోడని ప్రమాణం చేస్తున్నాను’ అని యెహోవా ప్రకటిస్తున్నారు. “నీవు నాశనమై నిర్మానుష్యంగా చేయబడినా నీ దేశం పాడుబడినా నీ భూమి నీ ప్రజలకు ఇరుకుగా ఉంటుంది, నిన్ను మ్రింగివేసినవారు దూరంగా ఉంటారు. నీవు కోల్పోయిన దుఃఖంలో ఉన్నప్పుడు పుట్టిన పిల్లలు, ‘ఈ స్ధలం మాకు ఇరుకుగా ఉంది. ఇంకా విశాలమైన స్ధలం మాకు ఇవ్వు’ అని నీవు వింటుండగా అంటారు. అప్పుడు నీవు నీ హృదయంలో, ‘వీరిని నా కోసం ఎవరు కన్నారు? నేను నా పిల్లల్ని కోల్పోయిన గొడ్రాలిని; నేను బందీ అయ్యాను, తిరస్కరించబడ్డాను. ఈ పిల్లల్ని ఎవరు పెంచారు? నేను ఒంటరిగా విడిచిపెట్టబడ్డాను. కానీ వీరు ఎక్కడ నుండి వచ్చారు?’ ” అని అనుకుంటావు. ప్రభువైన యెహోవా చెప్పే మాట ఇదే: “చూడు, నేను దేశాలకు సైగ చేస్తాను, జనాంగాల వైపు నా జెండాను ఎత్తుతాను; వారు నీ కుమారులను తమ చేతుల్లో తీసుకువస్తారు నీ కుమార్తెలను తమ భుజాల మీద మోసుకువస్తారు. రాజులు నిన్ను పోషించే తండ్రులుగా వారి రాణులు నీకు పాలిచ్చే తల్లులుగా ఉంటారు. వారు నీ ఎదుట తమ ముఖాన్ని నేలకు ఆనించి నమస్కారం చేస్తారు; నీ పాదాల దగ్గర ఉన్న దుమ్మును నాకుతారు. అప్పుడు నీవు, నేను యెహోవాను అని, నా కోసం నిరీక్షణతో ఉన్నవారు నిరాశ చెందరని తెలుసుకుంటావు.” యోధుల నుండి దోపుడుసొమ్ము తీసుకోబడుతుందా? నీతిమంతుని నుండి బందీలు విడిపించబడతారా? అయితే యెహోవా చెప్పే మాట ఇదే: “అవును, వీరుల నుండి బందీలు విడిపించబడతారు, క్రూరుల నుండి దోపుడుసొమ్ము తిరిగి వస్తుంది; నీతో యుద్ధం చేసేవారితో నేను యుద్ధం చేస్తాను. నీ పిల్లలను నేను రక్షిస్తాను.

యెషయా 49:8-25 కోసం వీడియో