ఇస్సాకు అతన్ని దీవించడం ముగించిన తర్వాత, యాకోబు తండ్రి దగ్గర నుండి వెళ్లీ వెళ్లకముందే, తన సోదరుడు ఏశావు వేటనుండి వచ్చాడు. అతడు కూడా రుచిగల భోజనం వండుకొని తన తండ్రి దగ్గరకు తీసుకువచ్చాడు. అప్పుడతడు, “నా తండ్రి, నన్ను దీవించడానికి నేను వేటాడి తెచ్చిన మాంసంతో సిద్ధం చేసిన భోజనం తిను” అని అతనితో అన్నాడు.
అప్పుడు తన తండ్రి ఇస్సాకు, “నీవెవరివి?” అని అడిగాడు.
అందుకతడు, “నేను నీ కుమారున్ని, నీ మొదటి సంతానమైన ఏశావును” అని జవాబిచ్చాడు.
ఇస్సాకు గజగజ వణకుతూ ఇలా అన్నాడు, “మరీ ఇంతకుముందు వేట మాంసం తెచ్చి పెట్టింది ఎవరు? నీవు రాకముందే నేను తిని అతన్ని దీవించాను; నిజంగా అతడు దీవించబడతాడు!”
తన తండ్రి మాట విన్న వెంటనే ఏశావు దుఃఖంతో బిగ్గరగా ఏడ్చి, “నన్ను కూడా దీవించు, నా తండ్రి!” అని అన్నాడు.
అయితే అతడు, “నీ తమ్ముడు మోసపూరితంగా వచ్చి నీ దీవెనను తీసుకున్నాడు” అన్నాడు.
ఏశావు, “అతనికి యాకోబు అని సరిగ్గానే పేరు పెట్టారు కదా? నన్ను అతడు మోసగించడం ఇది రెండవసారి: నా జ్యేష్ఠత్వం తీసుకున్నాడు, ఇప్పుడు నా దీవెనను దొంగిలించాడు! నా కోసం ఒక్క దీవెన కూడా మిగలలేదా?” అని అడిగాడు.
ఇస్సాకు జవాబిస్తూ, “నేను అతన్ని నీపై ప్రభువుగా నియమించాను, అతని బంధువులందరినీ అతనికి దాసులుగా చేశాను, సమృద్ధిగా ధాన్యం, ద్రాక్షరసం అతనికి సమకూర్చాను. కాబట్టి నా కుమారుడా! ఇప్పుడు నీకోసం నేను ఏమి చేయగలను?” అని అడిగాడు.
అందుకు ఏశావు తన తండ్రితో, “నా తండ్రి, ఒక్క దీవెననే ఉన్నదా? నా తండ్రి, నన్ను కూడా దీవించు!” అని అంటూ గట్టిగా ఏడ్చాడు.
అప్పుడు ఇస్సాకు అతనికి జవాబిస్తూ ఇలా అన్నాడు,
“నీ నివాసం
సారవంతమైన భూమికి దూరంగా,
పైనున్న ఆకాశం యొక్క మంచుకు దూరంగా ఉంటుంది.
నీవు నీ ఖడ్గం చేత జీవిస్తావు
నీ సోదరునికి సేవ చేస్తావు,
అయితే నీవు విశ్రాంతి లేక ఉన్నప్పుడు,
నీ మెడ మీద నుండి అతని కాడి
విరిచి పడవేస్తావు.”
తన తండ్రి యాకోబుకిచ్చిన దీవెనను బట్టి ఏశావు తన సోదరుని మీద పగబెట్టుకున్నాడు, “నా తండ్రిని గురించి దుఃఖించే రోజులు సమీపంగా ఉన్నాయి; తర్వాత నా సోదరుడైన యాకోబును చంపేస్తా” అని తనకు తాను అనుకున్నాడు.
రిబ్కా తన పెద్దకుమారుడైన ఏశావు ఏమన్నాడో తెలుసుకుని, తన చిన్న కుమారుడైన యాకోబును పిలిపించి అతనితో ఇలా అన్నది, “నీ అన్న ఏశావు నిన్ను చంపి ప్రతీకారం తీర్చుకోవాలని ఆలోచిస్తున్నాడు. కాబట్టి నా కుమారుడా! నేను చెప్పేది విను: హారానులో ఉన్న నా సోదరుడైన లాబాను దగ్గరకు పారిపో. మీ అన్న కోపం తగ్గే వరకు అక్కడ కొంతకాలం అతని దగ్గరే ఉండు. అతని కోపం చల్లారి, నీవు అతనికి చేసింది అతడు మరచిపోయిన తర్వాత, నేను నీకు కబురు పెడతాను. ఒక్క రోజే మీ ఇద్దరిని ఎందుకు పోగొట్టుకోవాలి?”
తర్వాత రిబ్కా ఇస్సాకుతో, “ఈ హిత్తీయుల స్త్రీల వలన నేను విసిగిపోయాను. యాకోబు కూడా ఇలాంటి హిత్తీయుల స్త్రీలలా ఈ దేశ స్త్రీని భార్యగా చేసుకుంటే, ఇక నేను బ్రతికి లాభం లేదు” అని అన్నది.