నిర్గమ 19:1-15

నిర్గమ 19:1-15 OTSA

ఇశ్రాయేలీయులు ఈజిప్టు నుండి బయటకు వచ్చిన మూడవ నెల మొదటి రోజున వారు సీనాయి అరణ్యానికి వచ్చారు. వారు రెఫీదీము నుండి బయలుదేరిన తర్వాత, వారు సీనాయి ఎడారిలో ప్రవేశించారు, అక్కడ పర్వతం ఎదురుగా ఇశ్రాయేలీయులు బసచేశారు. తర్వాత మోషే దేవుని దగ్గరకు ఎక్కి వెళ్లగా, ఆ పర్వతం నుండి యెహోవా అతన్ని పిలిచి, “యాకోబు వంశస్థులకు నీవు చెప్పాల్సింది, ఇశ్రాయేలు ప్రజలకు నీవు చెప్పాల్సింది ఇదే: ‘నేను ఈజిప్టుకు ఏమి చేశానో, గ్రద్ద రెక్కల మీద మోసినట్లు నేను మిమ్మల్ని నా దగ్గరకు తెచ్చుకున్నది మీరే స్వయంగా చూశారు. మీరిప్పుడు నాకు పూర్తిగా లోబడి నా ఒడంబడికను పాటిస్తే, అన్ని దేశాల్లో మీరు నా విలువైన ఆస్తి అవుతారు. ఈ భూమి అంతా నాదే అయినా, మీరు నాకు ఒక యాజకుల రాజ్యంగా పరిశుద్ధ జనంగా ఉంటారు.’ నీవు ఇశ్రాయేలీయులతో చెప్పాల్సిన మాటలు ఇవే” అని చెప్పారు. మోషే తిరిగివెళ్లి ప్రజల పెద్దలను పిలిపించి యెహోవా తనకు ఆజ్ఞాపించి చెప్పమన్న మాటలన్నీ వారికి తెలియచేశాడు. ప్రజలంతా కలిసి స్పందించి, “యెహోవా చెప్పిందంతా మేము చేస్తాము” అని అన్నారు. అప్పుడు మోషే వారి సమాధానాన్ని యెహోవా దగ్గరకు తీసుకెళ్లాడు. అప్పుడు యెహోవా మోషేతో, “నేను నీతో మాట్లాడడం ప్రజలు విని నీ మీద ఎప్పటికీ వారు నమ్మకం ఉంచేలా, నేను దట్టమైన మేఘంలో నీ దగ్గరకు వస్తాను” అని అన్నారు. అప్పుడు మోషే ప్రజలు చెప్పిన మాటలు యెహోవాకు చెప్పాడు. యెహోవా మోషేతో, “నీవు ప్రజల దగ్గరకు వెళ్లి ఈ రోజు రేపు వారిని ప్రతిష్ఠించు. వారు తమ వస్త్రాలను ఉతుక్కుని, మూడవరోజున సిద్ధంగా ఉండాలి, ఎందుకంటే ఆ రోజు ప్రజలందరి కళ్ళెదుట యెహోవా సీనాయి పర్వతం మీదికి దిగివస్తారు. నీవు పర్వతం చుట్టూ ప్రజలకు సరిహద్దు ఏర్పాటు చేసి ప్రజలతో, ‘మీరు ఎవరు పర్వతం దగ్గరకు రాకూడదు దాని అంచును తాకకూడదు. ఎవరైనా ఆ పర్వతాన్ని తాకితే వారు చంపబడతారు. ఎవరైనా తమ చేతులతో ముట్టుకుంటే వారు బాణాలతో గుచ్చబడి లేదా రాళ్లతో కొట్టబడి చంపబడాలి; తాకింది మనిషైనా ఒక జంతువైనా చంపబడాలి’ అని చెప్పాలి. పొట్టేలు కొమ్ము బూర శబ్దం సుదీర్ఘంగా విన్నప్పుడు వారు పర్వతం దగ్గరకు రావాలి” అని చెప్పారు. మోషే పర్వతం నుండి దిగి ప్రజల దగ్గరకు వెళ్లి వారిని పవిత్రపరిచాడు. వారు తమ వస్త్రాలను ఉతుక్కున్నారు. అప్పుడు మోషే ప్రజలతో, “మూడవరోజుకు మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. లైంగిక సంబంధాలు పెట్టుకోకూడదు” అని చెప్పాడు.

నిర్గమ 19:1-15 కోసం వీడియో