అతని మాటలు విన్నవారందరు ఆశ్చర్యపడి, “యెరూషలేములో యేసు పేరట ప్రార్థించిన వారిని నాశనం చేసినవాడు ఇతడే కదా? ముఖ్య యాజకుల దగ్గరకి వారిని బందీలుగా పట్టుకుని వెళ్లడానికే ఇక్కడి వచ్చాడు కదా?” అని చెప్పుకొన్నారు. అయినా సౌలు మరింత ఎక్కువ బలపడి యేసే క్రీస్తు అని రుజువుచేస్తూ దమస్కులో జీవిస్తున్న యూదులను ఆశ్చర్యపరిచాడు. చాలా రోజులు గడిచిన తర్వాత అతన్ని చంపాలని యూదులు కుట్ర చేశారు. కాని వారి కుట్ర గురించి సౌలు తెలుసుకున్నాడు. అతన్ని చంపడానికి వారు రాత్రింబగళ్ళు పట్టణపు ద్వారాల దగ్గర చాలా జాగ్రత్తగా కాపలా కాస్తున్నారు. అయితే అతని అనుచరులు రాత్రివేళలో అతన్ని తీసుకెళ్లి గంపలో కూర్చోబెట్టి గోడలోని సందు గుండా క్రిందకు దించారు. అతడు యెరూషలేముకు వచ్చినప్పుడు, శిష్యులతో చేరడానికి ప్రయత్నించాడు, కాని అతడు నిజమైన శిష్యుడని నమ్మలేక వారు అతనికి భయపడ్డారు. కానీ బర్నబా అతన్ని దగ్గరకు చేరదీసి అపొస్తలుల దగ్గరకు అతన్ని తీసుకువచ్చాడు. సౌలు తన ప్రయాణంలో ప్రభువును ఎలా చూశాడు, ప్రభువు అతనితో మాట్లాడిన విషయం, అతడు దమస్కులో యేసు పేరట ధైర్యంగా ఎలా బోధించాడు అనే విషయాలను వారికి చెప్పాడు. కాబట్టి సౌలు వారితో కలిసి ఉంటూ యెరూషలేములో స్వేచ్ఛగా తిరుగుతూ ప్రభువు పేరట ధైర్యంగా బోధించసాగాడు. అతడు గ్రీకుభాష మాట్లాడే యూదులతో మాట్లాడుతూ వాదించాడు, అయితే వారు అతన్ని చంపాలని ప్రయత్నించారు. దీనిని గురించి తెలుసుకొన్న విశ్వాసులు, అతన్ని కైసరయకు తీసుకువచ్చి తార్సుకు పంపించారు. ఆ తర్వాత యూదయ, గలిలయ సమరయ ప్రాంతాల్లో ఉన్న సంఘం కొంత సమయం ప్రశాంతాన్ని ఆనందిస్తూ బలపడింది. దేవుని భయాన్ని కలిగి జీవిస్తూ పరిశుద్ధాత్మచేత ప్రోత్సాహింపబడి, సంఘం సంఖ్య మరింత పెరిగింది. పేతురు దేశమంతా ప్రయాణిస్తూ, లుద్ద అనే ఊరిలో నివసిస్తున్న పరిశుద్ధులను కలవడానికి వచ్చాడు. అక్కడ పక్షవాతంతో ఎనిమిది సంవత్సరాలుగా మంచం మీద ఉన్న ఐనెయ అనే వ్యక్తిని కలిశాడు. పేతురు అతనితో, “ఐనెయా, యేసు క్రీస్తు నిన్ను స్వస్థపరస్తున్నారు. నీవు లేచి నీ పడకను సర్దుకో” అని చెప్పిన వెంటనే ఐనెయ లేచి నిలబడ్డాడు. లుద్ద షారోనులో నివసించే వారందరు అతన్ని చూసి ప్రభువు వైపుకు తిరిగారు. యొప్పే పట్టణంలో తబితా అనే ఒక శిష్యురాలు ఉంది, గ్రీకు భాషలో ఆమెకు దొర్కా అని పేరు దానికి లేడి అని అర్థము. ఆమె ఎప్పుడూ మంచి పనులు చేస్తూ పేదలకు సహాయం చేసేది. ఆ సమయంలో ఆమె అనారోగ్యంతో చనిపోయింది, కాబట్టి ఆమె శరీరాన్ని కడిగి మేడ గదిలో ఉంచారు. లుద్ద యొప్పేకు దగ్గరగా ఉంటుంది. పేతురు లుద్దలో ఉన్నాడని శిష్యులు విని, “వెంటనే రమ్మని బ్రతిమాలడానికి” ఇద్దరిని అతని దగ్గరకు పంపించారు. కాబట్టి పేతురు వారితో వెళ్లాడు, అతడు అక్కడ చేరుకొన్న తర్వాత అతన్ని మేడ గదికి తీసుకెళ్లారు. విధవరాండ్రందరు అతని చుట్టూ నిలబడి, ఏడుస్తూ దొర్కా తమతో ఉన్నప్పుడు ఆమె తయారుచేసిన అంగీలను ఇతర వస్త్రాలను అతనికి చూపించారు. పేతురు వారందరిని గది నుండి బయటకు పంపించి, మోకరించి ప్రార్థించాడు. చనిపోయిన ఆ స్త్రీ శవం వైపు తిరిగి, “తబితా లే!” అని చెప్పాడు. ఆమె తన కళ్లను తెరిచి పేతురును చూసి లేచి కూర్చుంది. అతడు ఆమె చేయి పట్టుకుని పైకి లేపి నిలబెట్టాడు. అప్పుడు అతడు విశ్వాసులను, ముఖ్యంగా విధవరాండ్రను పిలిచి ఆమెను సజీవంగా వారికి అప్పగించాడు. ఈ సంగతి యొప్పే పట్టణమంతా తెలిసి, చాలామంది ప్రజలు ప్రభువును నమ్ముకున్నారు. పేతురు సీమోను అనే చర్మకారునితో కలిసి కొంతకాలం యొప్పే పట్టణంలో ఉన్నాడు.
చదువండి అపొస్తలుల కార్యములు 9
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: అపొస్తలుల కార్యములు 9:21-43
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్లైన్లో చదవండి, బోధన క్లిప్లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు