2 సమూయేలు 5:9-24

2 సమూయేలు 5:9-24 OTSA

దావీదు కోటలో నివాసం ఏర్పరచుకున్నాడు, దానికి దావీదు పట్టణం అని పేరు పెట్టాడు. అతడు మిద్దె నుండి ఆ స్థలం లోపల కోట కట్టించాడు. సైన్యాల యెహోవా దేవుడు అతనికి తోడుగా ఉన్నారు కాబట్టి దావీదు అంతకంతకు శక్తిమంతుడయ్యాడు. తూరు రాజైన హీరాము దావీదు దగ్గరకు దూతలను, వారితో పాటు దేవదారు దుంగలను, వడ్రంగివారిని, రాళ్లతో పనిచేసే మేస్త్రీలను పంపాడు. వారు దావీదుకు రాజభవనం నిర్మించారు. ఇశ్రాయేలు ప్రజల మీద యెహోవా తనను రాజుగా స్థిరపరిచారని, ఆయన ప్రజలైన ఇశ్రాయేలీయుల కోసం తన రాజ్యాన్ని గొప్ప చేశారని దావీదు గ్రహించాడు. హెబ్రోను నుండి వచ్చిన తర్వాత దావీదు యెరూషలేములో మరికొందరిని భార్యలుగా ఉపపత్నులుగా చేసుకున్న తర్వాత ఇంకా చాలామంది కుమారులు కుమార్తెలు పుట్టారు. యెరూషలేములో అతనికి పుట్టిన పిల్లల పేర్లు ఇవి: షమ్మూయ, షోబాబు, నాతాను, సొలొమోను, ఇభారు, ఎలీషువ, నెఫెగు, యాఫీయ, ఎలీషామా, ఎల్యాదా, ఎలీఫెలెతు. ఇశ్రాయేలు అంతటి మీద దావీదును రాజుగా అభిషేకించారని ఫిలిష్తీయులు విని, అతన్ని పట్టుకోవడానికి సైన్యమంతటితో బయలుదేరి వచ్చారు, అయితే దావీదు ఆ సంగతి విని సురక్షిత స్థలానికి వెళ్లాడు. ఫిలిష్తీయులు వచ్చి రెఫాయీము లోయను విస్తరించారు. అప్పుడు దావీదు, “నేను వెళ్లి ఫిలిష్తీయుల మీద దాడి చేయాలా? మీరు నాకు వారిని అప్పగిస్తారా?” అని యెహోవాను అడిగాడు. అందుకు యెహోవా, “వెళ్లు, నేను వారిని తప్పకుండా నీ చేతికి అప్పగిస్తాను” అని అతనికి జవాబిచ్చారు. కాబట్టి దావీదు బయల్-పెరాజీముకు వెళ్లి వారిని ఓడించాడు. అతడు, “నీళ్లు కొట్టుకుపోయినట్లుగా యెహోవా నా శత్రువులను నా ఎదుట ఉండకుండా నాశనం చేశారు” అని చెప్పి ఆ స్థలానికి బయల్-పెరాజీము అని పేరు పెట్టాడు. ఫిలిష్తీయులు తమ విగ్రహాలను అక్కడే విడిచిపెట్టి పారిపోగా దావీదు అతని మనుష్యులు వాటిని పట్టుకెళ్లారు. మరోసారి ఫిలిష్తీయులు లేచి రెఫాయీము లోయలో గుమికూడారు. కాబట్టి దావీదు యెహోవా దగ్గర విచారణ చేసినప్పుడు యెహోవా, “నీవు తిన్నగా వెళ్లకుండా చుట్టూ తిరిగివెళ్లి వారి వెనుక నుండి కంబళి చెట్లకు ఎదురుగా వారిమీద దాడి చేయి. కంబళి చెట్ల కొనల్లో అడుగుల శబ్దం వినబడగానే వేగంగా కదులు ఎందుకంటే ఫిలిష్తీయుల సైన్యాన్ని నాశనం చేయడానికి యెహోవా నీకు ముందుగా వెళ్లారని దాని అర్థం” అని అతనికి జవాబిచ్చారు.