2 రాజులు 17:13-40

2 రాజులు 17:13-40 OTSA

యెహోవా ఇశ్రాయేలును, యూదాను తన ప్రవక్తలందరి ద్వారా, దీర్ఘదర్శులందరి ద్వారా, “మీ చెడు మార్గాలను విడిచిపెట్టండి. మీ పూర్వికులకు ఆజ్ఞాపించిన, నా సేవకులైన ప్రవక్తల ద్వారా మీకు అప్పగించిన నా ధర్మశాస్త్రం అంతటి ప్రకారం నా ఆజ్ఞలను, శాసనాలను పాటించండి” అని హెచ్చరించారు. అయితే వారు వినలేదు, తమ దేవుడైన యెహోవాపై నమ్మకముంచని తమ పూర్వికుల్లా మొండిగా ఉన్నారు. ఆయన శాసనాలను, ఆయన తమ పూర్వికులతో చేసిన నిబంధనను, ఆయన పాటించమని హెచ్చరించిన ధర్మశాస్త్రాన్ని వారు నిరాకరించారు. అయోగ్యమైన విగ్రహాలను అనుసరించి అయోగ్యులయ్యారు. యెహోవా వారికి, “వారు చేసినట్లు మీరు చేయకూడదు” అని చెప్పినప్పటికి తమ చుట్టూ ఉన్న ప్రజల విధానాలను వారు అనుసరించారు. తమ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలన్నీ విడిచిపెట్టి, తమ కోసం పోతపోసిన రెండు దూడలను, అషేరా స్తంభాన్ని చేసుకున్నారు. వారు నక్షత్రాలకు నమస్కరించి బయలును సేవించారు. తమ కుమారులను, కుమార్తెలను అగ్నిలో బలి ఇచ్చారు. భవిష్యవాణి, సోదె చెప్పించడం చేసి, యెహోవా దృష్టిలో చెడు చేయడానికి తమను తాము అమ్ముకుని ఆయనకు కోపం రేపారు. కాబట్టి యెహోవా ఇశ్రాయేలు మీద చాలా కోప్పడి, తన సముఖం నుండి వారిని తొలగించారు. యూదా గోత్రం మాత్రమే మిగిలింది. యూదా వారు కూడా తమ దేవుడైన యెహోవా ఆజ్ఞలను పాటించలేదు. ఇశ్రాయేలు ప్రవేశపెట్టిన ఆచారాలను వారు అనుసరించారు. కాబట్టి యెహోవా ఇశ్రాయేలు ప్రజలందరినీ తిరస్కరించారు; ఆయన వారిని బాధకు గురిచేసి, తన సముఖం నుండి వారిని త్రోసివేసే వరకు వారిని దోపిడి మూకలకు అప్పగించారు. ఆయన ఇశ్రాయేలును దావీదు రాజవంశం నుండి విడగొట్టినప్పుడు, వారు నెబాతు కుమారుడైన యరొబామును తమ రాజుగా చేసుకున్నారు. వారు యెహోవాను అనుసరించకుండా ఘోరమైన పాపం చేయడానికి యరొబాము కారణమయ్యాడు. ఇశ్రాయేలీయులు యరొబాము చేసిన పాపాలను విడిచిపెట్టకుండా వాటినే చేస్తూ వచ్చారు. చివరికి యెహోవా తన సేవకులైన ప్రవక్తలందరి ద్వారా హెచ్చరించినట్లు, వారిని తన సముఖం నుండి త్రోసివేశారు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు తమ స్వదేశం నుండి బందీలుగా అష్షూరుకు వెళ్లారు, ఈనాటికీ వారక్కడ ఉన్నారు. అష్షూరు రాజు బబులోను, కూతా, అవ్వా, హమాతు, సెఫర్వయీము నుండి మనుష్యులను తీసుకువచ్చి, సమరయ పట్టణాల్లో ఇశ్రాయేలీయులకు బదులుగా వారిని ఉంచాడు. వారు సమరయను స్వాధీనం చేసుకుని దాని పట్టణాల్లో నివసించారు. వారు మొదట అక్కడ నివసించినప్పుడు, వారు యెహోవాకు భయపడలేదు; కాబట్టి ఆయన వారి మధ్యకు సింహాలను పంపించారు, అవి వారిలో కొంతమందిని చంపాయి. అష్షూరు రాజుకు, “మీరు తీసుకువచ్చి సమరయ పట్టణాల్లో ఉంచిన ప్రజలకు ఈ దేశం యొక్క దేవుని నియమాలు తెలియవు. ఆయనకు ఏం కావాలో ప్రజలకు తెలియదు కాబట్టి సింహాలు వారిని చంపుతూ ఉన్నాయని వారు అష్షూరు రాజుకు చెప్పారు.” అప్పుడు అష్షూరు రాజు, “సమరయ నుండి బందీలుగా తీసుకువచ్చిన యాజకులలో ఒకడిని అక్కడికి వెళ్లి అక్కడ నివసిస్తూ ఆ దేశ దేవుని నియమాలను ఆ ప్రజలకు బోధించడానికి పంపించండి” అని ఆజ్ఞాపించాడు. కాబట్టి సమరయ నుండి బందీలుగా వెళ్లిన యాజకులలో ఒకడు బేతేలులో నివసించడానికి వచ్చి, యెహోవాను భయభక్తులతో ఎలా ఆరాధించాలో వారికి బోధించాడు. అయినా కొంతమంది ప్రజలు తాము స్థిరపడ్డ అనేక పట్టణాల్లో తమ సొంత దేవుళ్ళను చేసుకుని, ఎత్తైన స్థలాల దగ్గర సమరయ ప్రజలు కట్టుకున్న క్షేత్రాల్లో వాటిని నిలబెట్టారు. బబులోనువారు సుక్కోత్-బెనోతు, కూతు వారు నెర్గలును, హమాతు వారు అషీమా విగ్రహాన్ని చేశారు; ఆవీయులు నిబ్హజును, తర్తాకును విగ్రహాలుగా చేసుకున్నారు. సెఫర్వీయులు తమ పిల్లలను ఆద్రమ్మెలెకు, అనెమ్మెలెకు అనే సెఫర్వయీము దేవుళ్ళకు అగ్నిలో బలిగా అర్పించారు. వారు యెహోవాను ఆరాధించారు కాని ఎత్తైన స్థలాల్లో ఉన్న క్షేత్రాల్లో అన్ని రకాల ప్రజలను యాజకులుగా చేసుకున్నారు. వారు యెహోవాను ఆరాధించారు కాని వారు తాము ఏ దేశాల నుండి వచ్చారో, ఆ దేశాల ఆచారాల ప్రకారం తమ దేవుళ్ళను కూడా సేవించారు. వారు ఈనాటి వరకు తమ పూర్వాచారాలను పాటిస్తున్నారు. యెహోవా ఇశ్రాయేలు అని పేరుపెట్టబడిన యాకోబు సంతానం ఆయనను ఆరాధించలేదు, ఆయన శాసనాలను, నిబంధనలను, నియమాలను, ఆజ్ఞలను అనుసరించలేదు. యెహోవా ఇశ్రాయేలీయులతో నిబంధన చేసినప్పుడు, ఆయన వారికి ఇలా ఆజ్ఞాపించారు: “మీరు ఏ ఇతర దేవుళ్ళను పూజించకూడదు; వాటికి మొక్కకూడదు, సేవించకూడదు వాటికి బలులు అర్పించకూడదు. ఎవరైతే మిమ్మల్ని ఈజిప్టు దేశం నుండి గొప్ప బలప్రభావాలతో, చాచిన హస్తంతో బయటకు తెచ్చారో, ఆ యెహోవాను మీరు ఆరాధించాలి. ఆయనకు మొక్కి, ఆయనకు బలులు అర్పించాలి. ఆయన మీకోసం వ్రాసిన శాసనాలను, నిబంధనలను, నియమాలను, ఆజ్ఞలను పాటించడంలో జాగ్రత వహించాలి. ఇతర దేవుళ్ళను పూజించకూడదు. నేను మీతో చేసిన నిబంధన మరచిపోవద్దు, ఇతర దేవుళ్ళను పూజించకూడదు. కాని మీ దేవుడైన యెహోవాను భయభక్తులతో ఆరాధించాలి; ఆయనే మీ శత్రువులందరి చేతిలో నుండి మిమ్మల్ని విడిపిస్తారు.” అయితే వారు ఆయన మాట వినకుండా, తమ పూర్వాచారాలను అనుసరించారు.