మత్తయి సువార్త 13:24-46

మత్తయి సువార్త 13:24-46 TSA

“ఆయన వారికి మరొక ఉపమానం చెప్పారు, పరలోక రాజ్యం తన పొలంలో మంచి విత్తనాలను విత్తిన రైతును పోలి ఉంది. కాని అందరు నిద్రపోతున్నప్పుడు, అతని శత్రువు వచ్చి గోధుమల మధ్య కలుపు మొక్కల విత్తనాలు చల్లాడు. గోధుమ విత్తనం పెరిగి కంకులు వేసినప్పుడు ఆ కలుపు మొక్కలు కూడా కనిపించాయి. “ఆ పొలంలో పని చేసే దాసులు వచ్చి యజమానిని, ‘అయ్యా, నీ పొలంలో మంచి విత్తనాలను చల్లావు కదా! ఈ కలుపు మొక్కలు ఎలా వచ్చాయి?’ అని అడిగారు. “ఆయన వారితో, ‘ఇది శత్రువు చేసిన పని’ అన్నాడు. “అందుకు ఆ దాసులు, ‘అయితే మమ్మల్ని వెళ్లి ఆ కలుపు మొక్కలను పీకెయ్యమంటారా?’ అని అడిగారు. “అందుకతడు ‘వద్దు, ఎందుకంటే కలుపు మొక్కలను పీకివేసేటప్పుడు వాటితో గోధుమ మొక్కలను కూడా పీకేస్తారేమో. కోతకాలం వరకు రెండింటిని కలిసి పెరగనివ్వండి. కోతకాలం వచ్చినప్పుడు ముందుగా కలుపు మొక్కలను పోగు చేసి వాటిని కాల్చివేయడానికి కట్టలుగా కట్టి ఆ తర్వాత గోధుమలను నా ధాన్యపు కొట్టులోనికి చేర్చండి అని కోత కోసే వారితో చెప్తాను అన్నాడు.’ ” ఆయన వారికి మరో ఉపమానం చెప్పారు, “పరలోక రాజ్యం, ఒకడు తన పొలంలో నాటిన ఆవగింజ లాంటిది. అది విత్తనాలన్నింటిలో చిన్నదైనప్పటికి అది పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటి కంటే పెద్దగా పెరిగి, పక్షులు వచ్చి దాని కొమ్మల్లో గూళ్ళు కట్టుకునే ఒక చెట్టుగా ఎదుగుతుంది.” యేసు వారికి మరో ఉపమానం చెప్పారు, “పరలోక రాజ్యం ఒక స్త్రీ ఇరవై ఏడు కిలోల పిండిని కలిపి ఆ పిండంతా పొంగడానికి దానిలో కలిపిన కొంచెం పులిసిన పిండి లాంటిది.” యేసు ఈ సంగతులను ఉపమానాలుగా జనసమూహానికి చెప్పారు. ఆయన ఉపమానం లేకుండా వారికేమి చెప్పలేదు. ప్రవక్త ద్వారా చెప్పబడిన ఈ మాటలు నెరవేరాయి: “నేను ఉపమానాలతో నా నోరు తెరుస్తాను. సృష్టికి పునాది వేయబడక ముందే రహస్యంగా ఉంచిన విషయాలు నేను మాట్లాడతాను.” అప్పుడు యేసు జనసమూహాన్ని పంపివేసి ఇంట్లోకి వెళ్లారు. యేసు శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి, “పొలం లోని కలుపు మొక్కల ఉపమానాన్ని మాకు వివరించండి” అని అడిగారు. అందుకు యేసు వారితో, “మంచి విత్తనాలను చల్లేది మనుష్యకుమారుడు. పొలం అనేది ఈ లోకము. మంచి విత్తనాలు పరలోక రాజ్యానికి సంబంధించినవారు. కలుపు మొక్కలు దుష్టునికి సంబంధించినవారు. ఆ కలుపులను విత్తిన శత్రువు అపవాది. కోతకాలం ఈ యుగసమాప్తి సమయం ఆ కోత కోసేవారు దేవదూతలు. “కలుపు మొక్కలను పెరికి, పోగు చేసి అగ్నిలో కాల్చినట్టే ఈ యుగసమాప్తిలో జరుగుతుంది. మనుష్యకుమారుడు తన దేవదూతలను పంపుతాడు, వారు ఆయన రాజ్యంలో పాపానికి కారణమైన ప్రతిదీ దుష్ట కార్యాలను చేసే వారినందరిని బయటకు తొలగిస్తారు. వారు వారిని అగ్నిగుండంలో పారవేస్తారు, అక్కడ ఏడ్వడం పండ్లు కొరకడం ఉంటాయి. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యునిలా ప్రకాశిస్తారు. వినడానికి చెవులుగలవారు విందురు గాక!” అని అన్నారు. పరలోక రాజ్యం పొలంలో దాచబడిన ధనం వంటిది. ఒకడు దానిని కనుగొనగానే దానిని మరల దాచిపెట్టి, సంతోషంతో వెళ్లి తనకు ఉన్నదంతా అమ్మివేసి ఆ పొలాన్ని కొన్నాడు. ఇంకా, పరలోక రాజ్యం అమూల్యమైన ముత్యాల కోసం వెదకే ఒక వ్యాపారిని పోలి ఉంది. వానికి చాలా విలువైన ఒక ముత్యం కనబడగానే అతడు వెళ్లి తన దగ్గర ఉన్నదంతా అమ్మివేసి ఆ ముత్యాన్ని కొంటాడు.