యేసు యెరికో పట్టణంలోనికి ప్రవేశించి దానిగుండా వెళ్తున్నారు. అక్కడ జక్కయ్య అనే పేరు కలవాడు ఉన్నాడు, అతడు ప్రధాన పన్ను వసూలుదారుడు ధనవంతుడు. అతడు యేసు ఎవరో చూడాలని ఆశించాడు, కాని అతడు పొట్టివాడు కాబట్టి జనసమూహం మధ్యలో ఉన్న యేసును చూడలేకపోయాడు. కాబట్టి యేసు ఆ దారిలోనే వస్తున్నాడు, కాబట్టి అతడు పరుగెత్తి యేసును చూడాలని మేడి చెట్టు ఎక్కాడు.
యేసు ఆ చోటికి వచ్చినప్పుడు, ఆయన పైకి చూసి అతనితో, “జక్కయ్యా, వెంటనే క్రిందికి దిగు. నేను ఈ రోజు నీ ఇంట్లో ఉండాలి” అన్నారు. అతడు వెంటనే క్రిందకు దిగి సంతోషంతో ఆయనను తన ఇంటికి తీసుకుని వెళ్లాడు.
ప్రజలందరు అది చూసి, “ఈయన ఒక పాపాత్ముని ఇంటికి అతిథిగా వెళ్లాడు” అని సణగడం మొదలుపెట్టారు.
కానీ జక్కయ్య నిలబడి ప్రభువుతో, “చూడు, ప్రభువా! నా ఆస్తిలో సగం బీదలకిస్తున్నాను, నేనెవరి దగ్గరైనా అన్యాయంగా ఏదైనా తీసుకుని ఉంటే, వారికి నాలుగంతలు నేను చెల్లిస్తాను” అని చెప్పాడు.
అందుకు యేసు అతనితో, “ఇతడు కూడా అబ్రాహాము కుమారుడే, కాబట్టి నేడు రక్షణ ఈ ఇంటికి వచ్చింది. ఎందుకంటే మనుష్యకుమారుడు వచ్చిందే తప్పిపోయిన వాటిని వెదకి రక్షించడానికి.”
వారు ఈ మాటలు వింటూ ఉండగా, యేసు తాను యెరూషలేముకు దగ్గరగా ఉన్నందుకు, ప్రజలు దేవుని రాజ్యం అకస్మాత్తుగా వచ్చేస్తుందని భావిస్తున్నందుకు, ఆయన వారికి ఒక ఉపమానం చెప్పారు “గొప్ప జన్మించిన వ్యక్తి సుదూర దేశానికి వెళ్లి తనను తాను రాజుగా నియమించుకొని తిరిగి వచ్చేయాలి. అందుకతడు తన పదిమంది సేవకులను పిలిచి వారికి పది మినాలను ఇచ్చి, ‘నేను తిరిగి వచ్చేవరకు, వీటితో వ్యాపారం చేయండి’ అని వారితో చెప్పాడు.
“కాని ఆ పట్టణస్థులు అతన్ని ద్వేషించారు కాబట్టి, ‘ఇతడు మాకు రాజుగా వద్దు’ అనే సందేశాన్ని అతనికి పంపించారు.
“ఎలాగైతేనేం, అతడు రాజ్యాన్ని స్వాధీనపరచుకుని తిరిగి ఇంటికి వచ్చాడు. తర్వాత అతడు తాను డబ్బు ఇచ్చిన సేవకులు దానితో ఏమి లాభం పొందారో తెలుసుకోవడానికి వారిని పిలిపించాడు.
“మొదటివాడు వచ్చి, ‘అయ్యా, నీవు ఇచ్చిన ఒక్క మినా పది మినాలను సంపాదించింది’ అని చెప్పాడు.
“ఆ యజమాని, ‘భళా, మంచి దాసుడా! నీవు, ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు, కాబట్టి పది పట్టణాల మీద నిన్ను అధికారిగా నియమిస్తున్నాను’ అని వానితో చెప్పాడు.
“తర్వాత రెండవవాడు వచ్చి, ‘అయ్యా, నీవు ఇచ్చిన ఒక్క మినా అయిదు మినాలు సంపాదించింది’ అని చెప్పాడు.
“అతని యజమాని అతనితో, ‘నిన్ను అయిదు పట్టణాల మీద అధికారిగా నియమిస్తున్నాను’ అన్నాడు.
“అప్పుడు మరొకడు వచ్చి, ‘అయ్యా, నీవు పెట్టని చోట తీసుకునే, విత్తని చోట పంటను కోసే కఠినుడవని భయపడి, ఇదిగో నీవు ఇచ్చిన ఈ మినాను రుమాలులో దాచి పెట్టాను’ అన్నాడు.
“అందుకు ఆ యజమాని, ‘చెడ్డ దాసుడా, నీ నోటి మాటతోనే నీకు తీర్పు తీరుస్తాను! నేను పెట్టని చోట తీసుకొనేవాడినని, విత్తని చోట పంటను కోసేవాడినని, కఠినుడనని నీకు తెలుసు, అవునా? అలాంటప్పుడు నీవు నా సొమ్మును, నేను తిరిగివచ్చిన తర్వాత, వడ్డీతో సహా తీసుకునేలా, వడ్డీ వ్యాపారుల దగ్గర ఎందుకు పెట్టలేదు?’ అన్నాడు.
“ఆ తర్వాత ఆ యజమాని తన దగ్గర నిలిచిన వారితో, ‘వీని నుండి ఆ మినా తీసుకుని ఇప్పటికే పది మినాలు గలవానికి ఇవ్వండి’ అని చెప్పాడు.
“వారు, ‘అయ్యా, అతని దగ్గర ఇప్పటికే పది మినాలు ఉన్నాయి!’ అన్నారు.
“అందుకు ఆ యజమాని, ‘కలిగిన ప్రతివానికి మరి ఎక్కువగా ఇవ్వబడుతుంది, లేనివాని నుండి, వానికి కలిగి ఉన్నది కూడా తీసివేయబడుతుంది అని మీతో చెప్తున్నాను’ అన్నాడు. అతడు ఇంకా ఏమి చెప్పాడంటే, ‘అయితే నేను పరిపాలించడం ఇష్టం లేని నా శత్రువులను ఇక్కడకు తెచ్చి నా ముందు వారిని సంహరించండి’ అన్నాడు.”
యేసు ఈ మాటలను చెప్పి యెరూషలేముకు ప్రయాణమై వెళ్లారు.