లూకా సువార్త 13:1-24

లూకా సువార్త 13:1-24 TSA

అక్కడ ఉండిన ప్రజల్లో కొందరు యేసుతో, పిలాతు గలిలయుల రక్తాన్ని బలులతో కలిపిన సంగతిని చెప్పారు. అందుకు యేసు, “ఈ గలిలయులు అలా శ్రమను అనుభవించారు కాబట్టి మిగిలిన గలిలయుల కంటే వీరు ఘోర పాపులని మీరు అనుకుంటున్నారా? నేను మీతో చెప్తున్న, కాదు అని! మీరు పశ్చాత్తాపపడితేనే తప్ప, లేకపోతే మీరు కూడా అలాగే నశిస్తారు. సిలోయము గోపురం కూలి దాని క్రిందపడి పద్దెనిమిది మంది చనిపోయారు, వారు యెరూషలేములో జీవిస్తున్న వారందరికంటే ఎక్కువ పాపం చేశారని అనుకుంటున్నారా? కాదని నేను మీతో చెప్తున్నాను! మీరు పశ్చాత్తాపపడాలి, లేకపోతే మీరందరు కూడా అలాగే నశిస్తారు.” తర్వాత ఆయన ఈ ఉపమానం చెప్పారు: “ఒక మనుష్యుడు తన ద్రాక్షతోటలో ఒక అంజూర చెట్టును పెంచుతున్నాడు, అతడు వెళ్లి పండ్ల కోసం ఆ చెట్టును చూశాడు కాని ఏమి దొరకలేదు. కాబట్టి అతడు తోటమాలితో, ‘ఇదిగో మూడేళ్ళ నుండి నేను ఈ అంజూర చెట్టు పండ్ల కోసం వచ్చి చూస్తున్నాను గాని ఇంతవరకు ఏమి దొరకలేదు. దీనిని నరికివేయి! దీని వల్ల భూసారం ఎందుకు వృధా అవ్వాలి?’ అని అన్నాడు. “అయితే ఆ తోటమాలి, ‘అయ్యా, ఇంకొక సంవత్సరం దానిని ఉండనివ్వండి, నేను దాని చుట్టూ త్రవ్వి, ఎరువు వేసి చూస్తాను. ఒకవేళ అది పండ్లు ఇస్తే సరి, లేకపోతే నరికించండి’ అన్నాడు.” ఒక సబ్బాతు దినాన యేసు సమాజమందిరంలో బోధిస్తున్నారు, అక్కడ పద్దెనిమిది సంవత్సరాల నుండి అపవిత్రాత్మ చేత పట్టబడి నడుము వంగిపోయి నిటారుగా నిలబడలేకపోతున్న ఒక స్త్రీ ఉండింది. యేసు ఆమెను చూసి, ముందుకు రమ్మని పిలిచి, “అమ్మా, నీ బలహీనత నుండి నీవు విడుదల పొందావు” అని చెప్పారు. తర్వాత ఆయన ఆమె మీద చేతులుంచారు, వెంటనే ఆమె నిటారుగా నిలబడి దేవుని స్తుతించింది. సబ్బాతు దినాన యేసు స్వస్థపరిచారని, ఆ సమాజమందిరపు అధికారి మండిపడి ప్రజలతో, “పని చేసుకోవడానికి ఆరు దినాలు ఉన్నాయి. కాబట్టి ఆ దినాల్లో వచ్చి స్వస్థత పొందండి, అంతేకాని సబ్బాతు దినాన కాదు” అని చెప్పాడు. అందుకు ప్రభువు అతనితో, “వేషధారులారా! మీలో ప్రతివాడు సబ్బాతు దినాన తన ఎద్దును గాని గాడిదను గాని పశువులశాల దగ్గరి నుండి వాటిని విప్పి తోలుకొనిపోయి వాటికి నీళ్లు పెట్టరా? అలాంటప్పుడు అబ్రాహాము కుమార్తెయై ఉండి, పద్దెనిమిది సంవత్సరాలు సాతానుచేత బంధించబడి ఉన్న ఈ స్త్రీని సబ్బాతు దినాన ఎందుకు విడిపించకూడదు?” అని ప్రశ్నించారు. ఆయన ఈ విధంగా చెప్పినప్పుడు, ఆయనను వ్యతిరేకించిన వారందరు సిగ్గుపడ్డారు, కానీ ప్రజలందరు ఆయన చేస్తున్న మహత్కార్యాలను చూసి సంతోషించారు. అప్పుడు యేసు వారిని, “దేవుని రాజ్యం ఎలా ఉంటుంది? దాన్ని దేనితో పోల్చాలి? అని అడిగి, అది ఒక ఆవగింజ లాంటిది, ఒకడు దాన్ని తీసుకెళ్లి తన పొలంలో నాటాడు. అది పెరిగి వృక్షమయ్యింది, ఆకాశపక్షులు వచ్చి దాని కొమ్మల్లో గూళ్ళు కట్టుకున్నాయి.” మరల ఆయన, “దేవుని రాజ్యాన్ని దేనితో పోల్చగలం? అని అడిగి, అది ఒక స్త్రీ ఇరవై ఏడు కిలోల పిండిని కలిపి ఆ పిండంతా పొంగడానికి దానిలో కలిపిన కొంచెం పులిసిన పిండి లాంటిది” అని చెప్పారు. ఆ తర్వాత యేసు పట్టణాలు, గ్రామాల గుండా బోధిస్తూ, యెరూషలేముకు వెళ్లారు. అప్పుడు ఒకడు ఆయనను, “ప్రభువా, కొందరు మాత్రమే రక్షింపబడతారా?” అని అడిగాడు. ఆయన వారితో, “ఇరుకు ద్వారం గుండా ప్రవేశించడానికి ప్రతీ ప్రయత్నం చేయండి, ఎందుకంటే, చాలామంది ప్రవేశించే ప్రయత్నం చేస్తారు, కాని ప్రవేశించలేరు అని మీకు చెప్తున్నాను.