“ ‘అతిపరిశుద్ధమైన, అపరాధపరిహారబలికి సంబంధించిన నియమాలు ఇవి: దహనబలి వధించబడిన స్థలంలోనే అపరాధపరిహారబలిని వధించాలి, దాని రక్తాన్ని బలిపీఠం చుట్టూ చల్లాలి. దాని కొవ్వంతా అనగా క్రొవ్విన తోక, లోపలి అవయవాలపై ఉన్న క్రొవ్వు, రెండు మూత్రపిండాలు, నడుము దగ్గర వాటి మీద ఉన్న క్రొవ్వు, మూత్రపిండాలతో పాటు తొలగించే కాలేయం మీది క్రొవ్వు అర్పించాలి. యెహోవాకు అర్పించిన హోమబలిగా యాజకుడు వాటిని బలిపీఠం మీద కాల్చివేయాలి. ఇది అపరాధపరిహారబలి. యాజకుల కుటుంబాలలో ప్రతి పురుషుడు దాన్ని పరిశుద్ధాలయ ప్రాంగణంలో తినవచ్చు; అది అతిపరిశుద్ధము.
“ ‘అదే నియమం పాపపరిహారబలి, అపరాధపరిహారబలి, రెండింటికీ వర్తిస్తుంది: వాటితో ప్రాయశ్చిత్తం చేసే యాజకునికి అవి చెందుతాయి. దహనబలి తెచ్చినప్పుడు దాన్ని అర్పించే యాజకునికి ఆ బలి పశువు చర్మం చెందుతుంది. ప్రతి భోజనార్పణ, పొయ్యిమీద వండిందైనా కుండలో లేదా పెనం మీద చేయబడినదైనా గాని, అర్పించే యాజకునికి చెందుతుంది. ప్రతి భోజనార్పణ, ఒలీవనూనెతో కలిపినదైనా లేదా పొడిగా ఉన్నదైనా, అహరోను కుమారులందరికి సమానంగా చెందుతుంది.
“ ‘ఎవరైనా యెహోవాకు సమాధానబలి సమర్పించాలంటే నియమాలు ఇవి:
“ ‘ఒకవేళ వారు దానిని కృతజ్ఞత అర్పణగా అర్పిస్తే, కృతజ్ఞతార్పణతో పాటు వారు ఒలీవనూనె కలిపి చేసిన పులియని మందమైన రొట్టెలు, నూనె రాసి తయారుచేసిన పులియని సన్నని రొట్టెలు, నూనె కలిపి మెత్తగా పిసికిన నాణ్యమైన పిండితో తయారుచేసిన మందమైన రొట్టెలు అర్పించాలి. కృతజ్ఞతతో కూడిన సమాధానబలితో పాటు వారు పులిసిన మందమైన రొట్టెలను సమర్పించాలి. వారు ప్రతి దానిలో నుండి ఒకదాన్ని అర్పణగా, యెహోవాకు ప్రత్యేక నైవేద్యంగా తీసుకురావాలి; అది బలిపీఠం వైపు సమాధానబలి రక్తాన్ని ప్రోక్షించిన యాజకునికి చెందుతుంది. కృతజ్ఞతతో అర్పించిన సమాధానబలి మాంసం అది అర్పించిన రోజే వారు తినాలి; ఉదయం వరకు అందులో దేన్ని మిగిలించకూడదు.
“ ‘ఒకవేళ వారి అర్పణ మ్రొక్కుబడి కోసం గాని, స్వేచ్ఛార్పణ గాని అయితే, దానిని అర్పించిన రోజే తినాలి, అయితే మిగిలింది మరుసటిరోజు తినవచ్చు. మూడవ రోజు ఆ బలి మాంసంలో ఏమైనా మిగిలితే దానిని కాల్చివేయాలి. సమాధానబలి మాంసం మూడవ రోజు కాబట్టి తింటే దానిని అర్పించిన వారు అంగీకరించబడరు. తెచ్చిన వానికి గుర్తింపు ఉండదు, ఎందుకంటే అది అపవిత్రమైంది; కాబట్టి దానిలో ఏదైన తింటే వారు దోషశిక్షను భరిస్తారు.
“ ‘మాంసానికి ఏదైనా ఆచారరీత్య అపవిత్ర పదార్థం తగిలితే అది తినకూడదు. అది కాల్చివేయాలి. ఇతర మాంసం అయితే ఆచార ప్రకారం శుభ్రంగా ఉన్నవారు తినవచ్చు. కాని అపవిత్రంగా ఉన్న ఎవరైనా యెహోవాకు చెందిన సమాధానబలి మాంసం తింటే, వారు తమ ప్రజల్లో నుండి తొలగించబడాలి. ఎవరైనా అపవిత్రమైన దాన్ని అది మానవ అపవిత్రత గాని అపవిత్రమైన జంతువునే గాని నేలపై ప్రాకే జీవులనే గాని తాకి, యెహోవాకు చెందిన సమాధానబలి మాంసం తింటే, వారు తమ ప్రజల్లో నుండి తొలగించబడాలి.’ ”
యెహోవా మోషేతో ఇలా అన్నారు, “నీవు ఇశ్రాయేలీయులకు ఇలా చెప్పు: ‘పశువులదే గాని గొర్రెలదే గాని లేదా మేకలదే గాని క్రొవ్వును మీరు తినకూడదు. చచ్చిన జంతువు క్రొవ్వును లేదా అడవి మృగాలు చీల్చిన జంతువు క్రొవ్వును దేనికైనా ఉపయోగించవచ్చు కాని దానిని తినకూడదు. ఎవరైనా యెహోవాకు హోమబలిగా అర్పించే జంతువు యొక్క క్రొవ్వును తింటే వారు తమ ప్రజల్లో నుండి తొలగించబడాలి. మీరు నివసించే చోట పక్షి రక్తం గాని, జంతు రక్తం గాని తినకూడదు. ఎవరైనా రక్తాన్ని తింటే వారు తమ ప్రజల్లో నుండి తొలగించబడాలి.’ ”