అబీమెలెకు మూడేళ్ళు ఇశ్రాయేలు మీద పాలించిన తర్వాత, దేవుడు అబీమెలెకుకు, షెకెము పౌరులకు వైరం కలిగించారు, కాబట్టి వారు అబీమెలెకుకు ద్రోహం చేశారు. యెరుబ్-బయలు డెబ్బైమంది కుమారులను చంపి వారికి చేసిన ద్రోహానికి, వారిని చంపిన వారి సోదరుడైన అబీమెలెకు మీదికి, తన సోదరులను చంపడానికి అతనికి సహాయం చేసిన షెకెము పౌరుల మీదికి ప్రతిఫలం వచ్చేలా దేవుడు చేశారు. అతనికి వ్యతిరేకంగా ఈ షెకెము పౌరులు దారిలో వెళ్లే వారందరి మీద దాడి చేసి దోచుకునేలా కొండ శిఖరాల మీద మనుషులను ఉంచారు. ఇది అబీమెలెకుకు తెలిసింది.
ఎబెదు కుమారుడైన గాలు అతని సోదరులతో షెకెముకు వెళ్లగా షెకము నాయకులు అతనిపై నమ్మకం ఉంచారు. వారు పొలాలలోనికి వెళ్లి ద్రాక్షపండ్లను ఏరుకుని వాటిని త్రొక్కిన తర్వాత, తమ దేవుని గుడిలో పండగ చేసుకున్నారు. వారు తింటూ, త్రాగుతూ అబీమెలెకును శపించారు. అప్పుడు ఎబెదు కుమారుడైన గాలు ఇలా అన్నాడు, “మనం సేవ చేయడానికి అబీమెలెకు ఎవరు, షెకెము ఎవరు? అతడు యెరుబ్-బయలు కుమారుడు కాడా? జెబూలు తన క్రింది అధికారి కాడా? మనం షెకెము తండ్రియైన హమోరు కుటుంబానికి సేవ చేద్దాం! అబీమెలెకుకు ఎందుకు మనం సేవ చేయాలి? ఈ ప్రజలు నా ఆధీనంలో ఉండి ఉంటే నేను అతన్ని తొలగించేవాన్ని. ‘నీ సైన్యమంతటిని పిలిపించు!’ అని అబీమెలెకుకు చెప్పేవాన్ని.”
పట్టణ అధికారియైన జెబూలు ఎబెదు కుమారుడైన గాలు మాటలను విన్నప్పుడు అతడు చాలా కోప్పడ్డాడు. రహస్యంగా అబీమెలెకు దగ్గరకు దూతలను పంపి, “ఎబెదు కుమారుడైన గాలు అతని సోదరులు షెకెముకు వచ్చి నీ మీదికి పట్టణాన్ని రెచ్చగొడుతున్నారు. కాబట్టి రాత్రివేళ నీవు, నీ మనుష్యులు వచ్చి పొలాల్లో దాక్కొని ఉండండి. ఉదయం సూర్యోదయ సమయంలో పట్టణం మీద దాడి చేయండి. గాలు అతని మనుష్యులు నీ మీదికి వచ్చినప్పుడు అవకాశం చూసి వారిపై దాడి చేయి” అని చెప్పాడు.
కాబట్టి అబీమెలెకు, అతని మనుష్యులంతా రాత్రివేళ వచ్చి షెకెము దగ్గర దాక్కొని నాలుగు గుంపులుగా సిద్ధంగా ఉన్నారు. ఎబెదు కుమారుడైన గాలు బయలుదేరి పట్టణ ద్వారం దగ్గర నిలబడి ఉన్నప్పుడు, అబీమెలెకు, అతని మనుష్యులు దాక్కున్న స్థలం నుండి బయటకు వచ్చారు.
గాలు వారిని చూసినప్పుడు జెబూలుతో, “చూడు, ప్రజలు పర్వత శిఖరాల నుండి వస్తున్నారు!” అన్నాడు.
అందుకు జెబూలు, “పర్వతాల నీడలు నీకు మనుష్యులుగా కనబడుతున్నాయి” అన్నాడు.
అయితే గాలు మళ్ళీ, “చూడు, దేశపు ఎత్తైన స్థలం నుండి మనుష్యులు దిగివస్తున్నారు, ఓ గుంపు భవిష్యవాణి చెప్పేవారి మస్తకిచెట్టు త్రోవ నుండి వస్తుంది.”
అప్పుడు జెబూలు అతనితో, “ ‘మనం అతన్ని సేవించడానికి అబీమెలెకు ఎవడు?’ అని నీవు చెప్పిన గొప్పలు ఏమయ్యాయి, నీవు హేళన చేసింది వీరిని కాదా? ఇప్పుడు లేచి వెళ్లి వారితో పోరాడు!” అన్నాడు.
కాబట్టి గాలు షెకెము పౌరులను నడిపిస్తూ వెళ్లి అబీమెలెకుతో పోరాడాడు. అబీమెలెకు అతన్ని ద్వారం వరకు వెంటాడగా వారు పారిపోతూ చాలామంది చంపబడ్డారు. తర్వాత అబీమెలెకు అరుమలో నివసించాడు. జెబూలు గాలును అతని సోదరులను షెకెము నుండి తరిమివేశాడు.
మరుసటిరోజు షెకెము ప్రజలు పొలాలలోనికి వెళ్లారు, ఈ విషయం అబీమెలెకుకు తెలిసింది. కాబట్టి అతడు దాడి చేయడానికి పొలాల్లో తన మనుష్యులను మూడు గుంపులుగా చేశాడు. ప్రజలు పట్టణం నుండి రావడం చూసి అతడు లేచి వారిపై దాడి చేశాడు. అబీమెలెకు, అతనితో ఉన్న గుంపులు, ముందుకు వెళ్లి పట్టణ ద్వారం దగ్గర నిలిచి ఉన్నప్పుడు, ఆ రెండు గుంపులు పొలాల్లో ఉన్నవారిపై దాడి చేసి వారిని చంపారు. ఆ రోజంతా అబీమెలెకు పట్టణంపై దాడి చేసి, ముట్టడిచేసి, దాని ప్రజలను చంపాడు. తర్వాత పట్టణాన్ని నాశనం చేసి దానిపై ఉప్పు చల్లాడు.
ఈ వార్త విని, షెకెము గోపుర పౌరులు ఏల్-బెరీతు గుడి యొక్క కోటలోనికి చొరబడ్డారు. షెకెము గోపుర పౌరులు అక్కడ గుమికూడారని అబీమెలెకు విన్నప్పుడు, అతడు, అతనితో ఉన్న మనుష్యులందరు, సల్మోను కొండ ఎక్కారు. అబీమెలెకు ఒక గొడ్డలి తీసుకుని కొన్ని కొమ్మలను నరికి, తన భుజంపై పెట్టుకున్నాడు. తన మనుష్యులను ఆదేశిస్తూ, “త్వరపడండి! నేను ఏమి చేస్తున్నానో అదే మీరు చేయండి!” అన్నాడు. కాబట్టి ఆ మనుష్యులందరు కొమ్మలు నరికి అబీమెలెకును వెంబడించారు. వారు బలమైన కోటను ముట్టడిచేసి ప్రజలు అందులో ఉన్నప్పుడే దానిని కాల్చారు. కాబట్టి షెకెము గోపురంలో ఉన్న దాదాపు వేయిమంది పురుషులు స్త్రీలు చనిపోయారు.
తర్వాత అబీమెలెకు తేబేసుకు వెళ్లి దాని మీద దాడి చేసి దానిని వశపరచుకున్నాడు. అయితే ఆ పట్టణం మధ్యలో బలమైన గోపురం ఉంది. స్త్రీలు, పురుషులు, నాయకులు అందరు దానిలోకి వెళ్లారు. వారు లోనికి వెళ్లి, తాళం వేసుకుని గోపురం కప్పుమీదికి ఎక్కారు. అబీమెలెకు ఆ గోపురం దగ్గరకు వెళ్లి, దానిపై దాడి చేసి దాన్ని కాల్చివేయడానికి ఆ గోపుర ద్వారం దగ్గరకు వెళ్లినప్పుడు, ఒక స్త్రీ అబీమెలెకు తలమీద తిరగలి రాతిని పడవేయడంతో అతని కపాలం పగిలింది.
అతడు తన ఆయుధాలు మోసేవాన్ని కంగారుగా పిలిచి, “ ‘అబీమెలెకును ఒక స్త్రీ చంపింది’ అని ఎవరూ చెప్పుకోకుండా నీ కత్తి తీసి నన్ను చంపు” అన్నాడు. కాబట్టి అతని దాసుడు అతన్ని పొడవగా అతడు చనిపోయాడు. అబీమెలెకు చనిపోయాడని ఇశ్రాయేలీయులు చూసి తమ గృహాలకు వెళ్లారు.
ఈ విధంగా అబీమెలెకు తన డెబ్బైమంది సోదరులను చంపి తన తండ్రికి చేసిన ద్రోహాన్ని దేవుడు తిరిగి అతని మీదికి రప్పించారు. అంతేకాదు, షెకెము వారు కూడా తమ చెడు కార్యాలన్నిటికి వెల చెల్లించేలా దేవుడు చేశారు. యెరుబ్-బయలు కుమారుడైన యోతాము శాపం వారి మీదికి వచ్చింది.