దక్షిణపు గాలి మెల్లగా వీయడం మొదలు పెట్టేటప్పటికి, వారికి అవకాశం ఉన్నట్లు అనిపించింది; కాబట్టి లంగరు పైకెత్తి క్రేతు తీరం వైపు ఓడను నడిపించారు. ఎక్కువసేపు అవ్వక ముందే, ఈశాన్యగాలి అని పిలువబడే, పెనుగాలి బలంగా వీయడంతో, ద్వీపం నుండి దూరంగా కొట్టుకొని పోయాము. ఓడ తుఫానులో చిక్కుకొని గాలికి ఎదురు నడిపించలేక మేము గాలికి కొట్టుకుపోయాము. కౌద అనే చిన్న ద్వీపం వైపు మేము వెళ్లినప్పుడు, చాలా కష్టంగా ఓడకు కట్టిన రక్షక పడవను కాపాడగలిగాము. వాటిని పైకెత్తి కట్టిన తర్వాత తాళ్ళను ఓడ అడుగు నుండి తీసి, రెండింటిని కలిపి గట్టిగా బిగించారు. తాము సూర్తి అనే ఇసుకదిబ్బలను గుద్దుకొంటామేమో అని భయపడి, ఓడ లంగరును క్రిందికి దించి, గాలితో ఓడ కొట్టుకొని పోయేలా చేశారు. తుఫాను గాలి భయంకరంగా కొడుతుంది కాబట్టి మరుసటిరోజు ఓడలోని సరుకులను సముద్రంలో పడవేయడం మొదలుపెట్టారు. మూడవ రోజు, వారు తమ చేతులతో ఓడను నడిపే సామాగ్రిని కూడా పడవేశారు. అనేక రోజులగా సూర్యుడు కాని నక్షత్రాలు కాని కనిపించలేదు. తుఫాను మరింత తీవ్రంగా మారింది. చివరికి మేము ప్రాణాలతో తప్పించుకుంటామనే ఆశ పూర్తిగా పోయింది.
వారు ఆ విధంగా ఆహారం లేకుండా చాలా రోజులు గడిపిన తర్వాత, పౌలు వారి ముందు నిలబడి వారితో, “సహోదరులారా, నేను ఇచ్చిన సలహాను మీరు విని క్రేతు నుండి బయలుదేరకుండా ఉండవలసింది; అప్పుడు మీకు ఈ ప్రమాదం గాని నష్టం కాని జరుగకపోయేది. ఇప్పుడైనా మీరు ధైర్యం తెచ్చుకోండి, ఎందుకంటే మీలో ఎవరికి ప్రాణహాని కలుగదు; కేవలం ఓడ మాత్రమే పాడైపోతుంది. నేను ఎవరికి చెందిన వాడినో, నేను ఎవరిని సేవిస్తున్నానో ఆ దేవుని దూత నిన్న రాత్రి నా ప్రక్కన నిలబడి, ‘పౌలు భయపడకు. నీవు కైసరు ముందు విచారణకు నిలబడవలసి ఉంది. నీతో కూడ ఓడలో ప్రయాణం చేస్తున్న వారందరి జీవితాలను దేవుడు నీకు అనుగ్రహించాడు’ అని నాతో చెప్పాడు. అతడు నాకు చెప్పినట్లే జరుగుతుందని నాకు దేవునిలో విశ్వాసం ఉంది, కాబట్టి సహోదరులారా, మీరు ధైర్యం తెచ్చుకోండి. అయినప్పటికీ, మన ఓడ ఏదైనా ఒక ద్వీపం తగులుకోవాలి” అని చెప్పాడు.
పద్నాలుగవ రోజు రాత్రి మేము ఇంకా అద్రియా సముద్రంలో కొట్టుకొనిపోతుండగా, ఇంచుమించు అర్థరాత్రి సమయంలో ఓడను నడిపేవారు ఒడ్డును సమీపిస్తున్నాం అని గ్రహించారు. వారు ఇనుప గుండు కట్టిన తాడు సముద్రంలో వేసి చూసి దానితో అక్కడ సుమారు నూట ఇరవై అడుగుల లోతుందని తెలుసుకున్నారు. మరికొద్ది సేపటికి సముద్రపు లోతును కనుగొనే దానిని మరలా వేసి తొంభై అడుగుల లోతుందని తెలుసుకొన్నారు. మేము రాతి దిబ్బలకు గుద్దుకొంటామేమో అనే భయంతో వారు నాలుగు లంగరులను ఓడ మూలలో నుండి క్రిందకు వేసి, పగటి వెలుగు కోసం ప్రార్థించాము. ఓడ నడిపేవారు ఓడలో నుండి పారిపోవాలని, తాము ఓడ ముందు భాగం నుండి కొన్ని లంగరులను పడవేయడానికి వెళ్తున్నట్లు నటిస్తూ రక్షక పడవను సముద్రంలోకి దింపారు. అప్పుడు పౌలు శతాధిపతితో, సైనికులతో, “ఈ మనుష్యులు ఓడలో ఉంటేనే తప్ప తమ ప్రాణాలను రక్షించుకోలేరు” అని చెప్పాడు. వెంటనే సైనికులు రక్షకపడవ దూరంగా కొట్టుకొని పోవడానికి దాని త్రాళ్లను కోసివేశారు.
తెల్లవారుతునప్పుడు పౌలు వారందరిని ఆహారం తినమని వేడుకున్నాడు. “గత పద్నాలుగు రోజులనుండి ఏమి జరుగుతుందో అని మీరు ఏమి తినలేదు. మీరు బలహీనం కాకుండా దయచేసి భోజనం చేయండి, మీలో ఎవరి తల నుండి ఒక్క వెంట్రుక కూడా రాలదు” అని వారిని బ్రతిమాలాడు. అతడు ఈ మాటలను చెప్పిన తర్వాత, రొట్టెను తీసుకుని వారందరి ముందు దేవునికి కృతజ్ఞతలు చెల్లించి దానిని విరిచి తినడం ప్రారంభించాడు. అప్పుడు వారందరు ధైర్యం తెచ్చుకుని కొంత ఆహారం తిన్నారు. ఓడలో మొత్తం 276 మంది వ్యక్తులం ఉన్నాము. వారు తమకు కావలసినంత ఆహారం తిన్న తర్వాత, ఓడను తేలిక చేయడానికి ధాన్యాన్ని సముద్రంలో పడవేశారు.
పగటి వెలుగు వచ్చినప్పుడు, వారు ఆ ప్రాంతాన్ని గుర్తించలేదు, కాని ఇసుకతీరం ఉన్న సముద్రపు పాయను చూసి, సాధ్యమైతే దానిలోనికి ఓడను నడిపించాలి అనుకున్నారు. త్రాళ్లను కోసి లంగరులను సముద్రంలో విడిచిపెట్టారు అదే సమయంలో చుక్కానులకు కట్టిన త్రాళ్లను విప్పేసారు. తర్వాత తెరచాపలను గాలికి ఎత్తి తీరం వైపునకు నడిపించారు. కాని రెండు ప్రవాహాలు కలిసిన చోట ఇసుకలో ఓడ ముందు భాగం కూరుకొనిపోయి కదల్లేదు. అలల తాకిడికి ఓడ వెనుక భాగం ముక్కలుగా విరిగి పోసాగింది.
ఖైదీలు ఈదుకుని పారిపోకుండా వారిని చంపేయాలని సైనికులు అనుకున్నారు. కానీ శతాధిపతి పౌలు ప్రాణాన్ని కాపాడాలనుకొని సైనికులను తాము అనుకున్న దానిని చేయకుండా ఆపివేసి, ఈత వచ్చినవారు మొదట సముద్రంలోకి దూకి ఒడ్డుకు చేరుకోవాలని