యోనాతాను దావీదుతో, “రేపు అమావాస్య. నీ చోటు ఖాళీగా ఉంటుంది కాబట్టి నీవు లేవని తెలుస్తుంది గదా. నీవు మూడు రోజులు ఆగి ఇదంతా మొదలైనప్పుడు నీవు దాక్కున్న స్ధలానికి త్వరగా వెళ్లి ఏసెలు అనే బండ దగ్గర ఉండు. గురి చూసి కొట్టినట్లుగా నేను మూడు బాణాలను దాని ప్రక్కకు వేస్తాను. ‘వెళ్లి బాణాలను వెదకు’ అని ఒక పనివాన్ని పంపుతాను. నేను అతనితో, ‘ఇటువైపు ఉన్న బాణాలు చూడు; వాటిని తీసుకురా’ అని చెప్తే నీవు రావచ్చు; ఎందుకంటే సజీవుడైన యెహోవా మీద ప్రమాణం చేసి చెప్తున్న, నీకు ఏ ప్రమాదం ఉండదు నీవు క్షేమంగా ఉంటావు. అయితే బాణాలను నీకు అవతల వైపు ఉన్నాయని నేను వానితో చెప్తే పారిపొమ్మని యెహోవా చెప్తున్నారని తెలుసుకొని నీవు ప్రయాణమై వెళ్లిపోవాలి. అయితే మనమిద్దరం మాట్లాడుకున్న సంగతులు జ్ఞాపకం ఉంచుకో, నీకు నాకు మధ్య ఎల్లప్పుడు యెహోవాయే సాక్షి” అన్నాడు. కాబట్టి దావీదు పొలంలో దాక్కున్నాడు. అమావాస్య వచ్చినప్పుడు రాజు భోజనానికి కూర్చున్నాడు. ఎప్పటిలాగానే రాజు గోడ దగ్గర ఉన్న తన స్థానంలో యోనాతానుకు ఎదురుగా కూర్చున్నాడు. అబ్నేరు సౌలు ప్రక్కన కూర్చున్నాడు. అయితే దావీదు కూర్చునే చోటు ఖాళీగా ఉంది. “దావీదుకు ఏదో జరిగి అతడు ఆచారరీత్య అపవిత్రమై ఉంటాడు; ఖచ్చితంగా అతడు అపవిత్రుడు” అని సౌలు అనుకుని ఆ రోజు ఏమీ మాట్లాడలేదు. అయితే అమావాస్య తర్వాతి రోజు అనగా నెలలో రెండవ రోజున దావీదు చోటు ఖాళీగా ఉండడం చూసి సౌలు, “నిన్న, ఈ రోజు యెష్షయి కుమారుడు భోజనానికి ఎందుకు రాలేదు?” అని యోనాతానును అడిగాడు. అందుకు యోనాతాను, “బేత్లెహేము వెళ్లడానికి అనుమతి ఇవ్వమని నన్ను దావీదు ఎంతో ప్రాధేయపడి, ‘దయచేసి నన్ను వెళ్లనివ్వు, నా పట్టణంలో మా వంశస్థులు బలి ఇవ్వబోతున్నారు కాబట్టి నేను కూడా అక్కడ ఉండాలని నా అన్న నాకు ఆజ్ఞాపించాడు కాబట్టి నాపై దయచూపించి నేను వెళ్లి నా అన్నలను కలుసుకునేలా నన్ను వెళ్లనివ్వు’ అని నన్ను అడిగి వెళ్లాడు. ఆ కారణంగానే అతడు రాజు బల్ల దగ్గరకు రాలేదు” అని చెప్పాడు. అప్పుడు సౌలు యోనాతాను మీద చాలా కోప్పడి, “వక్రబుద్ధితో తిరుగుబాటుచేసేదాని కుమారుడా, నీకు నిన్ను కన్న తల్లికి అవమానం కలిగేలా నీవు యెష్షయి కుమారుని పక్షం ఉన్నావని నాకు తెలియదనుకున్నావా? యెష్షయి కుమారుడు భూమి మీద బ్రతికినంత కాలం నీవు గాని నీ రాజ్యం గాని స్ధిరపడదు. కాబట్టి నీవు ఎవరినైనా పంపి అతన్ని నా దగ్గరకు రప్పించు, అతడు తప్పక చావాల్సిందే” అని చెప్పాడు. అప్పుడు యోనాతాను, “అతడు మరణశిక్ష ఎందుకు పొందాలి? అతడు ఏమి చేశాడు?” అని సౌలును అడిగాడు. కానీ సౌలు అతన్ని చంపడానికి ఈటె విసిరాడు. తన తండ్రి దావీదును చంపాలనే ఉద్దేశ్యంతో ఉన్నాడని అప్పుడు యోనాతాను గ్రహించాడు. యోనాతాను తీవ్రమైన కోపంతో బల్ల దగ్గర నుండి లేచి, తన తండ్రి దావీదును అవమానపరచినందుకు అతని కోసం దుఃఖిస్తూ, ఆ అమావాస్య పండుగ మరుసటిరోజు అతడు భోజనం చేయలేదు. ఉదయాన యోనాతాను దావీదును కలుసుకోడానికి ఒక పనివానిని తీసుకుని పొలంలోనికి వెళ్లాడు. అతడు వానితో, “నీవు పరుగెత్తుకొని వెళ్లి నేను వేసే బాణాలను వెదుకు” అని చెప్పి వాడు పరుగెత్తుతున్నప్పుడు బాణం వాని అవతలకు వేశాడు. అయితే వాడు యోనాతాను వేసిన బాణం పడ్డ చోటికి వచ్చినప్పుడు యోనాతాను వాని వెనుక నుండి కేక వేసి, “నీ అవతల బాణం ఉంది కదా? నీవు ఆలస్యం చేయకుండా తొందరగా వెళ్లు” అన్నాడు. పనివాడు బాణాలను ఏరుకుని తన యాజమాని దగ్గరకు వాటిని తీసుకువచ్చాడు. విషయం ఏమీ వానికి తెలియదు. యోనాతానుకు దావీదుకు మాత్రమే ఆ విషయం తెలుసు. యోనాతాను తన ఆయుధాలను వాని చేతికిచ్చి వీటిని పట్టణానికి తీసుకెళ్లమని చెప్పి వానిని పంపివేశాడు. వాడు వెళ్లిపోయిన వెంటనే దావీదు బండ దక్షిణ దిక్కునుండి బయటకి వచ్చి యోనాతాను ఎదుట మూడుసార్లు మోకరించి తలవంచి నమస్కారం చేసిన తర్వాత వారు ఒకరినొకరు ముద్దు పెట్టుకుంటూ ఏడ్చారు. ఇలా ఉండగా దావీదు మరింత గట్టిగా ఏడ్చాడు. అప్పుడు యోనాతాను, “యెహోవా నీకు నాకు మధ్య, నీ సంతానానికి నా సంతానానికి మధ్య ఎప్పటికీ సాక్షిగా ఉండును గాక. మనమిద్దరం యెహోవా నామాన్ని బట్టి ప్రమాణం చేసుకున్నాం కాబట్టి మనస్సులో నెమ్మది కలిగి వెళ్లు” అని దావీదుతో చెప్పగా దావీదు బయలుదేరి వెళ్లిపోయాడు. యోనాతాను పట్టణానికి తిరిగి వెళ్లాడు.
చదువండి 1 సమూయేలు 20
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: 1 సమూయేలు 20:18-42
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్లైన్లో చదవండి, బోధన క్లిప్లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు