యేసు రాకముందు, యోహాను మారుమనస్సును గురించి బాప్తిస్మమును గురించి ఇశ్రాయేలు ప్రజలకు బోధించాడు. తన కర్తవ్యం ముగిసే చివరి దశలో అతడు ఇలా అన్నాడు: ‘నేనెవర్ననుకొన్నారు? నేను మీరనుకొంటున్న వాణ్ణి కాదు! కాని నా తర్వాత ఆయన రాబోతున్నాడు. ఆయన చెప్పులు తాకే అర్హత కూడా నాకు లేదు.’ “సోదరులారా! అబ్రాహాము వంశీయులారా! దైవభీతిగల ఇతర ప్రజలారా! రక్షణ గురించి తెలియ చేసే సందేశాన్ని దేవుడు మనకు తెలియచేసాడు. కాని యెరూషలేము ప్రజలు, వాళ్ళ పాలకులు ఈ యేసును గుర్తించలేదు. యేసుకు మరణదండన వేయించి ప్రతి విశ్రాంతి రోజున చదివే ప్రవక్తల మాటలు నిజం చేసారు. ఆయనకు మరణదండన విధించటానికి వాళ్ళకు ఏ కారణం దొరక్కపోయినా ఆయనను చంపివేయించమని పిలాతును కోరారు. “లేఖనాల్లో ఆయన్ని గురించి వ్రాసిన విధంగా వాళ్ళాయనను చంపారు. ఆ తర్వాత సిలువనుండి క్రిందికి దింపి సమాధి చేసారు. కాని దేవుడాయన్ని బ్రతికించాడు. ఇదివరలో ఆయనతో కలిసి గలిలయనుండి యెరూషలేమునకు ప్రయాణం చేసిన ప్రజలకు చాలా రోజుల దాకా కనిపించాడు. “వాళ్ళు ఆయన కోసం ఇశ్రాయేలు ప్రజల ముందు సాక్ష్యం చెప్పటానికి సిద్ధంగా ఉన్నారు. దేవుడు మన పూర్వులకు చేసిన వాగ్దానాన్ని యిప్పుడు వాళ్ళ సంతతియైన మన కోసం పూర్తి చేసాడు. యేసును బ్రతికించటంతో ఈ వాగ్దానం పూర్తి అయింది. ఇదే మేము చెప్పే సువార్త. దీన్ని గురించి కీర్తన గ్రంథంలో ఇలా వ్రాయబడివుంది: ‘నీవు నా కుమారుడవు! నేడు నేను నీకు తండ్రినయ్యాను.’ దేవుడు ఆయన్ని బ్రతికించాడు. ఆయన ఎన్నటికీ మట్టిలో కలిసిపోడు. అందువల్ల దేవుడు మరొక చోట, ‘నేను దావీదుకు తప్పక యిస్తానన్న పవిత్రమైన ఆశీస్సులను నీకిస్తాను’ అని అన్నాడు. మరొక చోట యిలా చెప్పబడింది: ‘నీ పవిత్రుడి దేహాన్ని సమాధిలో నీవు క్రుళ్ళిపోనియ్యవు!’ “దావీదు తన కాలంలో దేవుని ఆజ్ఞానుసారం నడుచుకొన్నాడు. అతడు చనిపోగానే అతణ్ణి అతని పూర్వికులతో సమాధి చేసారు. అతని దేహం మట్టిలో కలిసిపోయింది. కాని దేవుడు బ్రతికించినవాడు మట్టిలో కలిసిపోలేదు. మీరీ విషయం తెలుసుకోవాలి. యేసు ద్వారా మీ పాపాలు క్షమించబడుతాయని మేము ప్రకటిస్తున్నాము. మోషే ధర్మశాస్త్రం క్షమించలేని పాపాలనుండి, యేసు తనను నమ్ముకొన్న ప్రతి ఒక్కణ్ణీ క్షమిస్తాడు. ప్రవక్తలు చెప్పిన ఈ విషయాలు మీకు సంభవించకుండా జాగ్రత్తపడండి: ‘పరిహాసం చేసే ప్రజలారా! ఆశ్చర్యం పొందండి! నశించకండి! ఎందుకనగా మీ కాలంలో మీరు నమ్మలేనిది నేనొకటి చేయబోతున్నాను! మరొకరు చెప్పినా మీరు నమ్మరు.’” పౌలు, బర్నబా యూదుల సమాజ మందిరాన్ని వదిలి వెళ్తుండగా వచ్చే విశ్రాంతి రోజు ఈ విషయాల్ని గురించి యింకా ఎక్కువగా మాట్లాడండని ప్రజలు అడిగారు. ప్రజలు వెళ్ళిపోయాక చాలామంది యూదులు, యూదుల మతంలో భక్తిగలవాళ్ళు పౌలు, బర్నబా వెంట వెళ్ళారు. పౌలు, బర్నబా ప్రజలతో, “దేవుని అనుగ్రహాన్ని విశ్వసిస్తూ యిలాగే జీవిస్తూ ఉండండి!” అని చెప్పారు. మరుసటి విశ్రాంతి రోజున పట్టణమంతా ప్రభువు సందేశాన్ని వినాలని సమావేశం అయ్యింది. సమావేశమయిన ప్రజల్ని చూసి యూదుల్లో అసూయ నిండిపోయింది. వాళ్ళు పౌలుకు ఎదురు తిరిగి మాట్లాడి అతణ్ణి దూషించారు. పౌలు, బర్నబా ధైర్యంగా సమాధానం చెబుతూ, “అందరికన్నా ముందు దైవసందేశాన్ని మీకు చెప్పటం మా కర్తవ్యం. కాని మీరు నిరాకరించటంవల్ల, నిత్యజీవానికి అనర్హులమని మీలో మీరు అనుకోవటం వల్ల మేము మిమ్మల్ని వదిలి యితరుల దగ్గరకు వెళ్తున్నాము. ప్రభువు యిలా ఆజ్ఞాపించాడు అని అన్నాడు: ‘ప్రపంచానికి రక్షణ కలిగించాలని యితర దేశాలకు నిన్నొక వెలుగుగా చేసాను!’” యూదులు కానివాళ్ళు ఇది విని ఆనందించారు. ప్రభువు సందేశాన్ని అంగీకరించారు. అనేకులు విశ్వాసులయ్యారు. శాశ్వతమైన క్రొత్త జీవితాన్నివ్వటానికి దేవుడు వీళ్ళను ఎన్నుకొన్నాడు. దైవసందేశం ఆ ప్రాంతమంతా వ్యాపించింది. కాని యూదులు పట్టణంలోని పెద్దలతో, దైవభక్తి గల గొప్పింటి స్త్రీలతో మాట్లాడి వాళ్ళకు పౌలుపట్ల, బర్నబాపట్ల కోపం కలిగేటట్లు చేసారు. అంతా కలిసి వాళ్ళను హింసించి ఆ తదుపరి వాళ్ళను తమ పట్టణంనుండి తరిమివేసారు. పౌలు, బర్నబా తమ నిరసనకు చిహ్నంగా కాలి ధూళిని దులిపి “ఈకొనియ” అనే పట్టణానికి వెళ్ళిపోయారు. కాని విశ్వాసులపై పవిత్రాత్మ ప్రభావం ఉండటంవల్ల వాళ్ళలో ఉన్న ఉత్సాహం తగ్గలేదు.
చదువండి అపొస్తలుల 13
వినండి అపొస్తలుల 13
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: అపొస్తలుల 13:24-52
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్లైన్లో చదవండి, బోధన క్లిప్లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు