నెహెమ్యా 5:1-12

నెహెమ్యా 5:1-12 IRVTEL

తరువాత ప్రజలు, వారి భార్యలు తమ సాటి యూదుల మీద తీవ్రమైన ఆరోపణలు చేశారు. కొందరు వచ్చి “మేమూ, మా కొడుకులూ కూతుళ్ళు చాలామంది ఉన్నాం. మేము తిని బ్రతకడానికి మాకు ధాన్యం ఇప్పించు” అన్నారు. మరి కొంతమంది “కరువు కాలంలో మా భూములను, ద్రాక్షతోటలను, మా ఇళ్ళను తాకట్టు పెట్టాం, కనుక మాకు కూడా ధాన్యం ఇప్పించాలి” అన్నారు. మరికొందరు “రాజుగారికి పన్ను చెల్లించడానికి మా భూములను, ద్రాక్షతోటలను తాకట్టు పెట్టాం. మా కొడుకులను, కూతుళ్ళను బానిసలుగా పంపించ వలసి వచ్చింది. ఇప్పటికీ మా కూతుళ్ళలో చాలామంది బానిసలుగానే ఉన్నారు. మా పిల్లలు వాళ్ళ పిల్లల వంటివారు కాదా? మా ప్రాణాలు వాళ్ళ ప్రాణాల వంటివి కావా? మా భూములు, ద్రాక్షతోటలు ఇతరుల ఆధీనంలో ఉన్నాయి. వాటిని విడిపించుకునే శక్తి మాకు లేదు” అని చెప్పారు. ఈ విషయాలు, వారి ఆరోపణలు వినగానే నాకు తీవ్రమైన కోపం వచ్చింది. అప్పుడు నాలో నేను ఆలోచించాను. ప్రధానులను, అధికారులను గద్దించాను “మీరు మీ సహోదరుల దగ్గర వడ్డీ తీసుకొంటున్నారు” అని చెప్పి వారిని ఆ పని మాన్పించడానికి ఒక సమావేశం ఏర్పాటు చేశాను. “ఇతర ప్రజలకు అమ్ముడుబోయిన మన సోదర యూదులను మా శక్తి కొద్దీ విడిపించాం. మళ్ళీ మన సాటి యూదులు అమ్ముడుబోయేలా మీరు చేస్తున్నారా?” అని వారితో అన్నాను. వారు ఏమీ మాట్లాడలేక మౌనం వహించారు. నేను ఇలా అన్నాను “మీరు చేస్తున్నది మంచి పని కాదు. మన శత్రువులైన అన్యుల నుండి వచ్చే నిందను బట్టి మన దేవుని పట్ల భయం కలిగి ఉండాలి కదా? నేనూ నా బంధువులు, నా బానిసలు కూడా వారికి అప్పు ఇచ్చాం. ఆ బాకీలన్నీ వదిలేస్తున్నాం. ఈ రోజే వాళ్ళ దగ్గరనుండి మీరు ఆక్రమించుకొన్న భూములను, ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను, వాళ్ళ గృహాలను వారికి తిరిగి ఇచ్చెయ్యాలి. అప్పుగా ఇచ్చిన ధనం, ధాన్యం, కొత్త ద్రాక్షారసం, నూనెలను పూర్తిగా తిరిగి అప్పగించాలి.” అప్పుడు వాళ్ళు “నువ్వు చెప్పినట్టుగా అవన్నీ ఇచ్చేస్తాం, వాళ్ళ నుండి ఏదీ ఆశించం” అన్నారు. నేను యాజకులను పిలిచి వాళ్ళు వాగ్దానం చేసినట్టు జరిగిస్తామని వాళ్ళచేత ప్రమాణం చేయించాను.