యోబు 20
20
జోఫరు
1అప్పుడు నయమాతీయుడు జోఫరు ఇలా జవాబు చెప్పాడు,
2నువ్వు అలా చెప్పినందువల్ల నాలో కలిగిన ఆత్రుత నీకు తగిన జవాబు చెప్పాలని తొందర చేస్తున్నది.
3నన్ను అవమానపరిచే నింద నీ నుండి వినవలసి వచ్చింది గనుక తెలివిగల నా మనసు జవాబు చెప్పేందుకు నన్ను పురిగొల్పుతున్నది.
4ఆదిలో మనుషులు భూమి మీద నివసించడం మొదలు పెట్టినప్పటి నుంచి ఇలాగే జరుగుతున్నదని నీకు తెలియదా?
5దుర్మార్గులకు దక్కే విజయం అశాశ్వితం. భక్తిహీనులకు లభించే సంతోషం క్షణకాలం మాత్రం ఉండేది.
6వాళ్ళ గొప్పదనం ఆకాశం కన్నా ఎత్తుగా ఎదిగి, మేఘాల కంటే ఎత్తుగా తలెత్తుకుని తిరగవచ్చు.
7అయితే వాళ్ళ మలం లాగా వాళ్ళు ఎప్పటికీ కనబడకుండా కనుమరుగైపోతారు. అంతకు ముందు వాళ్ళను చూసిన వాళ్ళు “వాళ్ళంతా ఏమయ్యారు?” అని అడుగుతారు.
8కల లాగా వాళ్ళు కరిగి పోయి మళ్ళీ కనబడకుండా పోతారు. రాత్రివేళ వచ్చే కలలాగా వాళ్ళు చెదరిపోతారు.
9వాళ్ళను చూసిన కళ్ళు ఇకపై వాళ్ళను చూడవు. అతని నివాసం అతన్నిక చూడదు.
10వాళ్ళ సంతతి వాళ్ళు కనికరించమని దరిద్రులను వేడుకుంటారు. వారి చేతుల్లో#20:10 వారి చేతుల్లో వారి పిల్లలు ఉన్న ఆస్తిని తిరిగి ఇచ్చివేస్తారు.
11వాళ్ళ ఎముకల్లో యవ్వన శక్తి నిండి ఉన్నప్పటికీ అది కూడా వాళ్ళతో కలసి మట్టిలో నిద్రిస్తుంది.
12చెడుతనం వాళ్ళ నోటికి తియ్యగా ఉంది. వాళ్ళ నాలుకల కింద దాన్ని దాచి ఉంచారు.
13దాన్ని జాగ్రత్త చేసుకుని తమలోనే ఉంచుకున్నారు. తమ నోట్లోనే భద్రం చేసుకున్నారు.
14అయితే వాళ్ళ కడుపులో ఉన్నదంతా పులిసిపోతుంది. వాళ్ళ శరీరంలో అది నాగుపాము విషంగా మారుతుంది.
15వాళ్ళు దిగమింగిన ధనాన్ని ఇప్పుడు కక్కివేస్తారు. దేవుడే వాళ్ళ కడుపులోనుండి కక్కివేసేలా చేస్తాడు.
16వాళ్ళు కట్లపాముల విషం లోపలికి పీల్చుకునేవాళ్ళు. నాగుపాము కోరలు వాళ్ళను చంపివేస్తాయి.
17తేనెధారలు, వెన్నపూస ఏరులై పారుతున్నప్పటికీ వాళ్ళు సంతోషించరు.
18వాళ్ళు సంపాదించిన ఆస్తి మేరకు కష్టాలు పెరుగుతాయి. వాళ్ళు కష్టపడి సంపాదించుకున్నదంతా అనుభవించకుండానే తిరిగి అప్పగిస్తారు.
19వాళ్ళు దరిద్రులపై దాడులు చేసి విడిచిపెట్టినవాళ్ళు. తమవి కాని ఇళ్ళను బలవంతంగా ఆక్రమించుకుంటారు. ఆ ఇళ్ళను కట్టి పూర్తి చేయరు.
20వాళ్ళు తమ అత్యాశతో సంపాదించుకున్న ఇష్టమైన వస్తువుల్లో ఒక దానితోనైనా తమను తాము కాపాడుకోలేరు.
21వాళ్ళు దిగమింగిన వాటిలో ఏదీ మిగలడం లేదు. అందువల్ల వాళ్ళ క్షేమ స్థితి నిలబడదు.
22వాళ్ళు మితిలేని సంపాదన కలిగి ఉన్న రోజుల్లో ఇబ్బందులకు గురౌతారు. ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళందరూ వాళ్ళపై దాడి చేస్తారు.
23వాళ్ళు తమ కడుపు నింపుకునే సమయంలో దేవుడు వాళ్ళ మీద తన కోపాగ్ని కురిపిస్తాడు. వాళ్ళు తినే సమయంలోనే అది కురుస్తుంది.
24ఇనప ఆయుధం నుండి తప్పించుకొనేందుకు పారిపోతున్నప్పుడు ఇత్తడి విల్లు నుండి బాణం వాళ్ళ దేహాల్లోకి దూసుకుపోతుంది.
25ఆ బాణం వాళ్ళ దేహాలను చీల్చివేసి శరీరం నుండి బయటకు వస్తుంది. దాన్ని బయటకు తీసినప్పుడు కాలేయం తుత్తునియలు అవుతుంది. మరణభయం వాళ్ళ మీదికి వస్తుంది.
26వాళ్ళ ధన సంపదలు చీకటిమయం అవుతాయి. ఎవ్వరూ రాజేయకుండానే అగ్ని లేచి వాళ్ళను మింగివేస్తుంది. వాళ్ళ గుడారాల్లో మిగిలినదాన్ని అది కాల్చివేస్తుంది.
27వాళ్ళ దోషాలకు ఆకాశం సాక్షిగా నిలబడుతుంది. భూమి వారిపై తిరగబడుతుంది.
28వాళ్ళ ఇళ్ళకు చేరిన సంపాదన కనబడకుండా పోతుంది. దేవుని ఉగ్రత దినాన అదంతా నాశనమౌతుంది.
29దేవుని దగ్గర నుంచి దుష్టులైన మనుషులకు ప్రాప్తించేది ఇదే. దేవుడు వాళ్ళకు నియమించే వారసత్వం ఇదే.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
యోబు 20: IRVTel
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
TEL-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.