యెషయా 49:8-25

యెషయా 49:8-25 IRVTEL

యెహోవా ఇలా చెబుతున్నాడు, “అనుకూల సమయంలో నేను నీకు జవాబిస్తాను. విమోచన దినాన నీకు సహాయం చేస్తాను. దేశాన్ని తిరిగి కట్టడానికీ పాడైన వారసత్వాన్ని మళ్ళీ అప్పగించడానికీ నిన్ను కాపాడతాను. ప్రజలకు నిబంధనగా నిన్ను నియమిస్తాను. నువ్వు బందీలతో, ‘బయలుదేరండి’ అనీ చీకట్లో ఉన్నవారితో, ‘బయటికి రండి’ అనీ చెబుతావు. వాళ్ళు దారిలో మేస్తారు. చెట్లు లేని కొండలమీద వారికి మేత దొరుకుతుంది. వారిమీద జాలిపడేవాడు వారిని వెంటపెట్టుకుని వెళ్తాడు. నీటిఊటల దగ్గరికి వారిని నడిపిస్తాడు. కాబట్టి వారికి ఆకలి గానీ దప్పిక గానీ వేయదు. ఎండ, వడగాడ్పులూ వారికి తగలవు. నా పర్వతాలన్నిటినీ దారిగా చేస్తాను. నా జాతీయ రహదారులను సరిచేస్తాను.” చూడండి. వీళ్ళు దూర ప్రాంతం నుంచి వస్తున్నారు. కొంతమంది ఉత్తరం నుంచీ పడమటి నుంచి వస్తున్నారు. మరికొంతమంది సీనీయుల దేశం నుంచి వస్తున్నారు. బాధకు గురి అయిన తన ప్రజల మీద యెహోవా జాలిపడి వారిని ఓదారుస్తాడు. ఆకాశమా, ఉత్సాహధ్వని చెయ్యి. భూమీ, సంతోషించు. పర్వతాల్లారా, ఆనందగీతాలు పాడండి. అయితే సీయోను “యెహోవా నన్ను విడిచిపెట్టాడు, ప్రభువు నన్ను మరచిపోయాడు” అంది. స్త్రీ, తన గర్భాన పుట్టిన బిడ్డ మీద జాలిపడకుండా ఉంటుందా? తన చంటిపిల్లను మరచిపోతుందా? వాళ్ళు మరచిపోవచ్చు గానీ నేను నిన్ను మరచిపోను. చూడు, నా అరచేతుల్లో నిన్ను పచ్చబొట్టు పొడిపించుకున్నాను. నీ గోడలు ఎప్పటికీ నా ఎదుట ఉన్నాయి. నీ పిల్లలు త్వరగా వస్తున్నారు. నిన్ను నాశనం చేసినవాళ్ళు వెళ్ళిపోతున్నారు. అటూ ఇటూ చూడు. వాళ్ళంతా కలిసి నీ దగ్గరికి వస్తున్నారు. నా జీవం తోడని యెహోవా ఇలా చెబుతున్నాడు. “నువ్వు వీళ్ళందరినీ ఆభరణంగా ధరించుకుంటావు. పెళ్ళికూతురులాగా నువ్వు వారిని ధరించుకుంటావు. నువ్వు పాడైపోయి నిర్జనంగా ఉన్నా నీ దేశం నాశనమైపోయినా ఇప్పుడు నీ నివాసులకు నీ భూమి ఇరుకుగా ఉంది. నిన్ను మింగివేసినవారు దూరంగా ఉంటారు. నీ దుఃఖదినాల్లో నీకు పుట్టిన పిల్లలు ‘ఈ స్థలం మాకు ఇరుకుగా ఉంది. మేము ఉండడానికి ఇంకా విశాలమైన ప్రాంతం మాకివ్వు’ అంటారు. అప్పుడు నువ్వు ఇలా అనుకుంటావు, ఈ పిల్లలను నా కోసం ఎవరు కన్నారు? నేను నా పిల్లలను కోల్పోయి ఏడ్చాను. గొడ్రాలిని, బందీని అయ్యాను. ఈ పిల్లలను ఎవరు పెంచారు? నేను ఏకాకినయ్యాను. వీళ్ళు ఎక్కడ నుంచి వచ్చారు?” ప్రభువైన యెహోవా ఇలా చెబుతున్నాడు, “నేను రాజ్యాల వైపు నా చెయ్యి ఎత్తుతాను. ప్రజలకు నా జెండాను సంకేతంగా ఎత్తుతాను. వాళ్ళు నీ కొడుకులను తమ చేతుల్లో తీసుకు వస్తారు. నీ కూతుళ్ళను తమ భుజాలమీద మోసుకువస్తారు. రాజులు, నిన్ను పోషించే తండ్రులుగా వారి రాణులు నీకు పాలిచ్చే దాదులుగా ఉంటారు. వాళ్ళు నీకు సాష్టాంగ నమస్కారం చేస్తారు. నీ పాదాల దుమ్ము నాకుతారు. అప్పుడు నేను యెహోవాననీ నా కోసం ఆశతో చూసే వారికి ఆశాభంగం కలగదనీ నువ్వు తెలుసుకుంటావు.” బలశాలి చేతిలోనుంచి దోపిడీ సొమ్ము ఎవడు తీసుకోగలడు? నియంత దగ్గర నుంచి బందీలను ఎవడు విడిపించగలడు? అయితే యెహోవా ఇలా చెబుతున్నాడు, “నియంత దగ్గర నుంచి బందీలను విడిపించడం జరుగుతుంది. బలశాలి చేతిలోనుంచి దోపిడీ సొమ్ము తీసుకోవడం జరుగుతుంది. నీతో యుద్ధం చేసేవారితో నేనే యుద్ధం చేస్తాను. నీ పిల్లలను నేనే రక్షిస్తాను.

యెషయా 49:8-25 కోసం వీడియో