మనం తిరిగి బాషాను దారిలో వెళ్తుండగా బాషాను రాజు ఓగు, అతని ప్రజలంతా ఎద్రెయీలో మనతో యుద్ధం చేయడానికి ఎదురుగా వచ్చారు. యెహోవా నాతో ఇలా అన్నాడు. “అతనికి భయపడ వద్దు. అతన్నీ అతని ప్రజలనూ అతని దేశాన్నీ నీ చేతికి అప్పగించాను. హెష్బోనులో అమోరీయుల రాజు సీహోనుకు చేసినట్టే ఇతనికి కూడా చేయాలి.” ఆ విధంగా మన దేవుడు యెహోవా బాషాను రాజు ఓగును, అతని ప్రజలందరినీ మన చేతికి అప్పగించాడు. అతనికి ఎవ్వరూ మిగలకుండా అందరినీ హతం చేశాం. ఆ కాలంలో అతని పట్టణాలన్నీ స్వాధీనం చేసుకున్నాం. మన స్వాధీనంలోకి రాని పట్టణం ఒక్కటీ లేదు. బాషానులో ఓగు రాజ్యం అర్గోబు ప్రాంతంలో ఉన్న 60 పట్టణాలు ఆక్రమించుకున్నాం. ఆ పట్టణాలన్నీ గొప్ప ప్రాకారాలు, ద్వారాలు, గడియలతో ఉన్న దుర్గాలు. అవిగాక ప్రాకారాలు లేని ఇంకా చాలా పట్టణాలు స్వాధీనం చేసుకున్నాం. మనం హెష్బోను రాజు సీహోనుకు చేసినట్టు వాటిని నిర్మూలం చేశాం. ప్రతి పట్టణంలోని స్త్రీ పురుషులనూ పిల్లలనూ నాశనం చేశాం. వారి పశువులనూ ఆ పట్టణాల ఆస్తినీ దోచుకున్నాం. ఆ కాలంలో అర్నోను లోయ నుండి హెర్మోను కొండ వరకూ, యొర్దాను అవతల ఉన్న దేశాన్ని ఇద్దరు అమోరీయుల రాజుల దగ్గర నుండి స్వాధీనం చేసుకున్నాం. సీదోనీయులు హెర్మోనును “షిర్యోను” అనేవారు. అమోరీయులు దాన్ని “శెనీరు” అనేవారు. మైదానంలోని పట్టాణాలన్నిటిని, బాషానులోని ఓగు రాజ్య పట్టణాలైన సల్కా, ఎద్రెయీ అనేవాటి వరకూ గిలాదు అంతటినీ బాషానునూ ఆక్రమించాం. రెఫాయీయులలో బాషాను రాజు ఓగు మాత్రం మిగిలాడు. అతనిది ఇనుప మంచం. అది అమ్మోనీయుల రబ్బాలో ఉంది గదా? దాని పొడవు తొమ్మిది మూరలు, వెడల్పు నాలుగు మూరలు. అర్నోను లోయలో ఉన్న అరోయేరు పట్టణం నుండి గిలాదు కొండ ప్రాంతంలో సగమూ మనం అప్పుడు స్వాధీనం చేసుకొన్న దేశమూ దాని పట్టణాలూ రూబేనీయులకు, గాదీయులకు ఇచ్చాను. ఓగు రాజుకు చెందిన బాషాను అంతటినీ, గిలాదులో మిగిలిన రెఫాయీయుల దేశమని పిలిచే బాషానునూ, అర్గోబు ప్రాంతమంతా మనష్షే అర్థ గోత్రానికి ఇచ్చాను. మనష్షే కొడుకు యాయీరు గెషూరీయుల, మాయాకాతీయుల సరిహద్దుల వరకూ అర్గోబు ప్రాంతాన్ని పట్టుకుని, తన పేరును బట్టి వాటికి యాయీరు బాషాను గ్రామాలు అని పేరు పెట్టాడు. ఈ రోజు వరకూ వాటి పేరు అదే. మాకీరీయులకు గిలాదును ఇచ్చాను. గిలాదు నుండి అర్నోను లోయ మధ్య వరకూ, యబ్బోకు నది వరకూ, అమ్మోనీయుల పడమటి సరిహద్దు వరకూ రూబేనీయులకూ గాదీయులకూ ఇచ్చాను. ఇవి కాక, కిన్నెరెతు నుండి తూర్పున పిస్గా కొండ వాలుల కింద, ఉప్పు సముద్రం అని పిలిచే అరాబా సముద్రం దాకా వ్యాపించిన అరాబా ప్రాంతాన్ని, యొర్దాను లోయ మధ్యభూమిని, రూబేనీయులకూ గాదీయులకూ ఇచ్చాను. అప్పుడు నేను మీతో “మీరు స్వాధీనం చేసుకోడానికి మీ దేవుడు యెహోవా ఈ దేశాన్ని మీకిచ్చాడు. మీలో యుద్ధవీరులంతా సిద్ధపడి మీ సోదరులైన ఇశ్రాయేలు ప్రజలతో కలిసి నది దాటి రావాలి. యెహోవా మీకు విశ్రాంతినిచ్చినట్టు మీ సోదరులకు కూడా విశ్రాంతినిచ్చే వరకూ నేను మీకిచ్చిన పట్టణాల్లో నివసించాలి. అంటే మీ యెహోవా దేవుడు యొర్దాను అవతల వారికి ఇస్తున్న దేశాన్ని వారు స్వాధీనం చేసుకునే వరకూ, మీ భార్యలు, మీ పిల్లలు, మీ మందలు నేను మీకిచ్చిన పట్టణాల్లో నివసించాలి. ఆ తరువాత మీరు మీ స్వాస్థ్యాలకు తిరిగి రావాలి అని మీకు ఆజ్ఞాపించాను. మీ మందలు చాలా ఎక్కువని నాకు తెలుసు” అన్నాను.
చదువండి ద్వితీ 3
వినండి ద్వితీ 3
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: ద్వితీ 3:1-20
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్లైన్లో చదవండి, బోధన క్లిప్లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు