“ధైర్యంగా, నిబ్బరంగా ఉండండి. అష్షూరురాజు గురించి గానీ అతనితో ఉన్న సైన్యమంతటి గురించి గానీ మీరు భయపడవద్దు, హడలిపోవద్దు. అతనితో ఉన్న వాడి కంటే మనతో ఉన్నవాడు ఎంతో గొప్పవాడు. అతనికి దేహ సంబంధమైన శక్తి మాత్రమే ఉంది, అయితే మన యుద్ధాల్లో పోరాడడానికి మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడు” అని చెప్పాడు. అప్పుడు ప్రజలు యూదారాజు హిజ్కియా చెప్పిన మాటలను బట్టి ఆదరణ పొందారు. ఆ తరువాత అష్షూరురాజు సన్హెరీబు తన సైన్యమంతటితో లాకీషు ముట్టడించాడు. యెరూషలేములోని యూదారాజు హిజ్కియా దగ్గరికీ యెరూషలేములో ఉన్న యూదావారందరి దగ్గరికీ తన సేవకులను పంపి ఇలా ప్రకటన చేయించాడు. “అష్షూరురాజు సన్హెరీబు తెలియచేసేది ఏంటంటే, దేనిని నమ్మి మీరు ముట్టిడిలో ఉన్న యెరూషలేములో నిలిచి ఉన్నారు? కరువుతో దాహంతో మిమ్మల్ని చంపడానికి ‘మన దేవుడైన యెహోవా అష్షూరురాజు చేతిలో నుంచి మనలను విడిపిస్తాడు’ అని చెప్పి హిజ్కియా మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తున్నాడు గదా? ఆ హిజ్కియా, ‘మీరు ఒక్క బలిపీఠం ముందు నమస్కరించి దాని మీద ధూపం వేయాలి’ అని యూదావారికి యెరూషలేము వారికి ఆజ్ఞ ఇచ్చి, యెహోవా ఉన్నత స్థలాలను బలిపీఠాలను తీసివేశాడు కదా? నేనూ నా పూర్వీకులూ ఇతర దేశాల ప్రజలందరికీ ఏమేమి చేశామో మీకు తెలియదా? ఇతర జాతి ప్రజల దేవుళ్ళు వారి దేశాలను ఎప్పుడైనా నా చేతిలోనుంచి విడిపించగలిగారా? నా పూర్వీకులు బొత్తిగా నిర్మూలం చేసిన ప్రజల దేవుళ్లలో ఏ దేవుడు తన ప్రజలను నా చేతిలోనుంచి విడిపించగలిగాడు? మీ దేవుడు మిమ్మల్ని నా చేతిలోనుంచి ఎలా విడిపిస్తాడు? కాబట్టి ఈ విధంగా ఇప్పుడు మీరు హిజ్కియా చేత మోసపోవద్దు. మీరు అతని మాట నమ్మవద్దు. ఏ ప్రజల దేవుడైనా ఏ రాజ్యపు దేవుడైనా తన ప్రజలను నా చేతిలోనుంచి గాని నా పూర్వీకుల చేతిలోనుంచి గాని విడిపించలేకపోయాడు. అలాంటప్పుడు మీ దేవుడు నా చేతిలోనుంచి మిమ్మల్ని ఏమాత్రం విడిపించలేడు గదా.” సన్హెరీబు సేవకులు దేవుడైన యెహోవా మీదా ఆయన సేవకుడైన హిజ్కియా మీదా వ్యతిరేకంగా ఇంకా మాట్లాడారు. అంతేగాక “ఇతర దేశాల ప్రజల దేవుళ్ళు తమ ప్రజలను నా చేతిలోనుంచి ఎలా విడిపించలేకపోయారో అలాగే హిజ్కియా సేవించే దేవుడు కూడా తన ప్రజలను నా చేతిలోనుంచి విడిపించలేడు” అని ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నిందించడానికి, ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడడానికి సన్హెరీబు ఉత్తరాలు కూడా రాసి పంపాడు. అప్పుడు వారు పట్టణాన్ని పట్టుకోవాలన్న ఉద్దేశంతో, గోడమీదున్న యెరూషలేము ప్రజలను బెదరించడానికీ బాధపెట్టడానికీ యూదా భాషలో బిగ్గరగా వారితో మాట్లాడారు. మిగతా ప్రజల దేవుళ్ళతో వారు (అవి మనుష్యుల చేతులతో చేసినవి) మాట్లాడినట్టు, యెరూషలేము దేవుని మీద కూడా మాట్లాడారు. రాజైన హిజ్కియా, ఆమోజు కొడుకూ, ప్రవక్తా అయిన యెషయా ఈ విషయం గురించి ప్రార్థించి ఆకాశం వైపు మొర్రపెట్టారు. యెహోవా ఒక దూతను పంపాడు. అతడు అష్షూరు రాజు దండులోని పరాక్రమశాలులందరినీ సేనా నాయకులనూ అధికారులనూ చంపేశాడు. అష్షూరు రాజు అవమానంతో తన దేశానికి తిరిగి వెళ్లిపోయాడు. అతడు తన దేవుని గుడిలోకి వెళితే అతని సొంత కొడుకులే అతణ్ణి అక్కడ కత్తితో చంపేశారు. ఈ విధంగా యెహోవా, హిజ్కియానూ యెరూషలేము నివాసులనూ అష్షూరు రాజు సన్హెరీబు చేతిలోనుంచి, మిగతావారందరి చేతిలోనుంచి కాపాడి, అన్ని రకాలుగా వారిని నడిపించాడు. చాలామంది యెరూషలేములో యెహోవాకు అర్పణలను యూదారాజు హిజ్కియాకు విలువైన వస్తువులను తెచ్చారు. అందువలన అతడు అప్పటినుంచి అన్ని రాజ్యాల దృష్టిలో ఘనత పొందాడు. ఆ రోజుల్లో హిజ్కియాకు జబ్బుచేసి చనిపోయేలా ఉన్నాడు. అతడు యెహోవాకు ప్రార్థన చేస్తే, ఆయన అతనితో మాట్లాడి, అతడు బాగుపడతాడనేదానికి ఒక గురుతు ఇచ్చాడు. అయితే హిజ్కియా గర్వించి తనకు చేసిన మేలుకు తగినట్లు ప్రవర్తించలేదు. కాబట్టి అతని మీదికీ యూదా యెరూషలేము మీదికీ యెహోవా కోపం వచ్చింది. అయితే చివరకూ హిజ్కియా తన హృదయ గర్వం విడిచి, తానూ యెరూషలేము నివాసులూ తమను తాము తగ్గించుకున్నారు. కాబట్టి హిజ్కియా రోజుల్లో యెహోవా కోపం ప్రజల మీదికి రాలేదు.
చదువండి 2 దిన 32
వినండి 2 దిన 32
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: 2 దిన 32:7-26
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్లైన్లో చదవండి, బోధన క్లిప్లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు