2 దిన 29:1-21

2 దిన 29:1-21 IRVTEL

హిజ్కియా పరిపాలించడం మొదలుపెట్టినప్పుడు అతని వయసు 25 సంవత్సరాలు. అతడు 29 ఏళ్ళు యెరూషలేములో పాలించాడు. అతని తల్లి జెకర్యా కుమార్తె, ఆమె పేరు అబీయా. అతడు తన పూర్వీకుడు దావీదు చేసిన ప్రకారం యెహోవా దృష్టికి యధార్థంగా ప్రవర్తించాడు. అతడు తన పరిపాలనలో మొదటి సంవత్సరం మొదటి నెల యెహోవా మందిరం తలుపులు తెరిచి వాటిని బాగుచేసి, యాజకులనూ లేవీయులనూ పిలిపించి, తూర్పువైపున రాజవీధిలో వారిని సమకూర్చి వారికిలా ఆజ్ఞాపించాడు. “లేవీయులారా, నా మాట వినండి. ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకుని, మీ పూర్వీకుల దేవుడైన యెహోవా మందిరాన్ని ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలం నుంచి నిషిద్ధ వస్తువులన్నిటినీ బయటికి తీసికెళ్ళండి.” “మన పూర్వీకులు అవిధేయులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలు నడచి ఆయన్ని విసర్జించి, ఆయన నివాస స్థలం వైపు నుంచి ముఖం తిప్పుకుని నిర్లక్ష్యం చేశారు. వారు వసారా తలుపులు మూసివేశారు. దీపాలు ఆర్పివేశారు. పరిశుద్ధ స్థలం లో ఇశ్రాయేలీయుల దేవునికి ధూపం వేయలేదు. దహనబలులు అర్పించలేదు. అందుచేత యెహోవా ఉగ్రత యూదామీదా, యెరూషలేము మీదా పడింది. మీరు కన్నులారా చూస్తున్నట్టు ఆయన వారిని భీతికీ భయానికీ నిందకూ గురి చేశాడు. అందుకే మన తండ్రులు కత్తి చేత కూలారు, మన కొడుకులూ కూతుళ్ళూ భార్యలూ బందీలయ్యారు. ఇప్పుడు మనమీదున్న ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మహోగ్రత చల్లారేలా ఆయనతో మనం నిబంధన చేయాలని ఉద్దేశించాను. నా కుమారులారా, ఆయనకు పరిచారకులై ఉండి ధూపం వేయడానికీ ఆయన ఎదుట నిలబడి సేవచేయడానికీ యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఈ సమయంలో మీరు అశ్రద్ధ చేయవద్దు.” అప్పుడు లేవీయులు పనికి సిద్ధపడ్డారు. వారెవరంటే కహాతీయుల్లో అమాశై కొడుకు మహతు, అజర్యా కొడుకు యోవేలు, మెరారీయుల్లో అబ్దీ కొడుకు కీషు, యెహల్లెలేలు కొడుకు అజర్యా, గెర్షోనీయుల్లో జిమ్మా కొడుకు యోవాహు, యోవాహు కొడుకు ఏదెను, ఎలీషాపాను సంతానంలో షిమ్రీ, యెహీయేలు, ఆసాపు సంతానంలో జెకర్యా, మత్తన్యా హేమాను సంతానంలో యెహీయేలు, షిమీ, యెదూతూను సంతానంలో షెమయా, ఉజ్జీయేలు. వీరు తమ సోదరులను సమకూర్చి తమ్మును ప్రతిష్ఠించుకుని యెహోవా మాటలనుబట్టి రాజు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం యెహోవా మందిరాన్ని బాగు చేయడానికి వచ్చారు. బాగు చేయడానికి యాజకులు యెహోవా మందిరపు లోపలి భాగానికి పోయి యెహోవా మందిరంలో తమకు కనబడిన నిషిద్ధ వస్తువులన్నిటినీ యెహోవా మందిరం ఆవరణంలోకి తీసుకు వచ్చారు. లేవీయులు వాటిని ఎత్తి కిద్రోను వాగులో పారవేశారు. మొదటి నెల మొదటి రోజు వారు శుద్ధి చేయడం మొదలు పెట్టి, ఆ నెల ఎనిమిదవ రోజున యెహోవా వసారా వరకూ వచ్చారు. వారు మరో ఎనిమిది రోజులు యెహోవా మందిరాన్ని శుద్ధి చేస్తూ మొదటి నెల 16 వ రోజున పని ముగించారు. అప్పుడు వారు రాజ భవనం లోపల ఉన్న రాజైన హిజ్కియా దగ్గరికి పోయి “మేము యెహోవా మందిరమంతా బాగు చేసాం. దహన బలిపీఠాన్ని దాని సామానంతటిని, సన్నిధి రొట్టెలుంచే బల్లనూ బాగు చేసాం. రాజైన ఆహాజు పాలించిన కాలంలో అతడు ద్రోహం చేసి పారవేసిన సామానంతా కూడా మేము సిద్ధం చేసి ప్రతిష్టించాం. అవి యెహోవా బలిపీఠం ఎదుట ఉన్నాయి” అని చెప్పారు. అప్పుడు రాజైన హిజ్కియా పెందలకడ లేచి, పట్టణపు అధికారులను సమకూర్చి యెహోవా మందిరానికి వెళ్ళాడు. వారు రాజ్యం కోసం పరిశుద్ధస్థలం కోసం యూదావారి కోసం పాపపరిహారార్థబలి చేయడానికి ఏడు కోడెలు, ఏడు పొట్టేళ్ళు, ఏడు గొర్రెపిల్లలు, ఏడు మేకపోతులను తెచ్చారు. యెహోవా బలిపీఠం మీద వాటిని అర్పించమని అహరోను వంశం యాజకులకు అతడు ఆజ్ఞాపించాడు.