1 సమూ 4:1-11

1 సమూ 4:1-11 IRVTEL

ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులతో యుద్ధం చేయడానికి సిద్ధపడి ఎబెనెజరులో సమావేశమయ్యారు. ఫిలిష్తీయులు ఆఫెకులో ఉన్నారు. ఫిలిష్తీయులు బారులు తీరి నిలబడి ఇశ్రాయేలీయులపై యుద్ధం చేయగా ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల చేతిలో ఓడిపోయి యుద్ధభూమిలోనే దాదాపు నాలుగు వేలమంది మరణించారు. ప్రజలు ఊరికి తిరిగి వచ్చాక ఇశ్రాయేలీయుల పెద్దలు “యెహోవా ఈ రోజు ఎందుకు మనలను ఫిలిష్తీయుల చేతిలో ఓడిపోయేలా చేశాడు? షిలోహులో ఉన్న యెహోవా నిబంధన మందసాన్ని తీసుకొచ్చి మన మధ్యనే ఉంచుకుందాము. అది మన మధ్య ఉంటే మనలను శత్రువుల చేతిలో నుండి కాపాడుతుంది” అన్నారు. కాబట్టి పెద్దలు కొందరిని షిలోహుకు పంపించి అక్కడనుండి కెరూబుల మధ్య ఆసీనుడై ఉన్న సైన్యాలకు అధిపతి యెహోవా నిబంధన మందసాన్ని తెప్పించారు. ఏలీ ఇద్దరు కుమారులు హొఫ్నీ, ఫీనెహాసు కూడా అక్కడే దేవుని నిబంధన మందసం దగ్గర ఉన్నారు. యెహోవా నిబంధన మందసాన్ని ప్రజల మధ్యకు తెచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలంతా భూమి దద్దరిల్లి పోయేలా కేకలు వేశారు. ఫిలిష్తీయులు ఆ కేకలు విని, హెబ్రీయుల గుంపులో ఈ గొప్ప కేకలు ఏమిటో అని ఆరా తీసి, యెహోవా నిబంధన మందసాన్ని శిబిరంలోకి తెచ్చారని తెలుసుకున్నారు. వారు భయపడి, దేవుడు శిబిరంలోకి వచ్చాడనుకుని “అయ్యో, ఇక మనకి మూడింది. ఇలాంటిది ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదు, అయ్యో, మహాశూరుడైన ఈ దేవుడి చేతిలోనుండి మనలను ఎవరు విడిపిస్తారు? అరణ్యంలో రకరకాల తెగుళ్ళు రప్పించి ఐగుప్తు వారిని సంహరించిన దేవుడు ఈయనే గదా. ఫిలిష్తీయులారా, వారు మన ముందు ఓడిపోయి దాసులు అయినట్టు మనం ఈ హెబ్రీయులకి దాసులు కాకూడదు. మనమంతా ధైర్యంగా నిలబడి బలం తెచ్చుకుని యుద్ధం చేద్దాం” అని చెప్పుకున్నారు. ఫిలిష్తీయులు యుద్ధం చేసినప్పుడు ఇశ్రాయేలీయులు ఓడిపోయి అందరూ పారిపోయి తమ డేరాలకు తిరిగి వచ్చారు. అప్పుడు భయంకరమైన వధ జరిగింది. ఇశ్రాయేలీయుల్లో 30 వేలమంది సైనికులు చనిపోయారు. శత్రువులు దేవుని మందసాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఏలీ కొడుకులు హొఫ్నీ, ఫీనెహాసు ఇద్దరినీ చంపేశారు.