మత్తయి 27:1-31

మత్తయి 27:1-31 TELUBSI

ఉదయమైనప్పుడు ప్రధానయాజకులును, ప్రజల పెద్దలందరును యేసును చంపింపవలెనని ఆయనకు విరోధముగా ఆలోచనచేసి ఆయనను బంధించి, తీసికొనిపోయి, అధిపతియైన పొంతిపిలాతునకు అప్పగించిరి. అప్పుడాయనను అప్పగించిన యూదా, ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి, ఆ ముప్పది వెండి నాణెములు ప్రధానయాజకులయొద్దకును పెద్దలయొద్దకును మరల తెచ్చి – నేను నిరపరాధరక్తమును అప్పగించి పాపము చేసితినని చెప్పెను. వారు దానితో మాకేమి? నీవే చూచుకొనుమని చెప్పగా అతడు ఆ వెండి నాణెములు దేవాలయములో పారవేసి, పోయి ఉరిపెట్టుకొనెను. ప్రధానయాజకులు ఆ వెండి నాణెములు తీసి కొని – ఇవి రక్తక్రయధనము గనుక వీటిని కానుక పెట్టెలో వేయతగదని చెప్పుకొనిరి. కాబట్టి వారు ఆలోచనచేసి వాటినిచ్చి, పరదేశులను పాతిపెట్టుటకు కుమ్మరి వాని పొలము కొనిరి. అందువలన నేటివరకు ఆ పొలము రక్తపు పొలమనబడుచున్నది. అప్పుడు– విలువ కట్టబడినవాని, అనగా ఇశ్రాయేలీయులలో కొందరు విలువకట్టినవాని క్రయధనమైన ముప్పది వెండి నాణెములు తీసికొని ప్రభువు నాకు నియమించినప్రకారము వాటిని కుమ్మరి వాని పొలమున కిచ్చిరి అని ప్రవక్తయైన యిర్మీయాద్వారా చెప్పబడినమాట నెర వేరెను. యేసు అధిపతియెదుట నిలిచెను; అప్పుడు అధిపతి–యూదుల రాజవు నీవేనా? అని ఆయన నడుగగా యేసు అతని చూచి నీవన్నట్టే అనెను ప్రధానయాజకులును పెద్దలును ఆయనమీద నేరము మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరమేమియు ఇయ్యలేదు. కాబట్టి పిలాతు– నీమీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు విన లేదా? అని ఆయనను అడిగెను. అయితే ఆయన ఒక మాటకైనను అతనికి ఉత్తరమియ్యలేదు గనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను. జనులు కోరుకొనిన యొక ఖయిదీని పండుగలో విడుదల చేయుట అధిపతికి వాడుక. ఆ కాలమందు బరబ్బ అను ప్రసిద్ధుడైన యొక ఖయిదీ చెరసాలలో ఉండెను. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు–నేనెవనిని విడుదలచేయవలెనని మీరు కోరుచున్నారు? బరబ్బనా లేక క్రీస్తనబడిన యేసునా? అని వారిని అడిగెను. ఏలయనగా వారు అసూయచేత ఆయనను అప్పగించిరని అతడు ఎరిగి యుండెను అతడు న్యాయపీఠముమీద కూర్చుండియున్నప్పుడు అతని భార్య – నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు; ఈ ప్రొద్దు ఆయ ననుగూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితినని అతని యొద్దకు వర్తమానము పంపెను. ప్రధానయాజకులును పెద్దలును, బరబ్బను విడిపించుమని అడుగుటకును, యేసును సంహరించుటకును జనసమూహములను ప్రేరేపించిరి అధిపతి ఈ యిద్దరిలో నేనెవనిని విడుదల చేయవలెనని మీరు కోరుచున్నారని వారినడుగగా వారు–బరబ్బనే అనిరి. అందుకు పిలాతు ఆలాగైతే క్రీస్తనబడిన యేసును ఏమిచేతునని వారినడుగగా సిలువవేయుమని అందరును చెప్పిరి. అధిపతి–ఎందుకు? ఇతడు ఏ దుష్కా ర్యము చేసెనని అడుగగా వారు సిలువవేయుమని మరి ఎక్కువగా కేకలువేసిరి. పిలాతు అల్లరి ఎక్కువగు చున్నదే గాని తనవలన ప్రయోజనమేమియు లేదని గ్రహించి, నీళ్లు తీసికొని జనసమూహము ఎదుట చేతులు కడుగుకొని–ఈ నీతిమంతుని రక్తమునుగూర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకొనుడని చెప్పెను. అందుకు ప్రజలందరు–వాని రక్తము మా మీదను మా పిల్లలమీదను ఉండుగాకనిరి. అప్పుడతడు వారు కోరినట్టు బరబ్బను వారికి విడుదల చేసి, యేసును కొరడాలతో కొట్టించి సిలువవేయ నప్పగించెను. అప్పుడు అధిపతియొక్క సైనికులు యేసును అధికార మందిరములోనికి తీసికొనిపోయి, ఆయనయొద్ద సైనికుల నందరిని సమకూర్చిరి. వారు ఆయన వస్త్రములు తీసి వేసి, ఆయనకు ఎఱ్ఱని అంగీ తొడిగించి ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి, ఒక రెల్లు ఆయన కుడి చేతిలోనుంచి, ఆయనయెదుట మోకాళ్లూని–యూదుల రాజా, నీకు శుభమని ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మివేసి, ఆ రెల్లును తీసికొని దానితో ఆయనను తలమీద కొట్టిరి. ఆయనను అపహసించిన తరువాత ఆయన మీదనున్న ఆ అంగీని తీసివేసి ఆయన వస్త్రము లాయనకు తొడిగించి, సిలువ వేయుటకు ఆయనను తీసికొనిపోయిరి.