లూకా 21:20-38

లూకా 21:20-38 TELUBSI

యెరూషలేము దండ్లచేత చుట్టబడుట మీరు చూచు నప్పుడు దాని నాశనము సమీపమైయున్నదని తెలిసి కొనుడి. అప్పుడు యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను; దాని మధ్యనుండువారు వెలుపలికి పోవలెను; పల్లెటూళ్లలోనివారు దానిలో ప్రవేశింపకూడదు. లేఖనములలో వ్రాయబడిన వన్నియు నెర వేరుటకై అవి ప్రతి దండన దినములు. ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చువారికిని శ్రమ. భూమిమీద మిక్కిలి యిబ్బందియు ఈ ప్రజలమీద కోపమును వచ్చును. వారు కత్తివాత కూలుదురు; చెరపట్టబడిన వారై సమస్తమైన అన్యజనములమధ్యకు పోవుదురు; అన్యజనముల కాలములు సంపూర్ణమగువరకు యెరూషలేము అన్యజనములచేత త్రొక్కబడును. మరియు సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలును, భూమిమీద సముద్రతరంగముల ఘోషవలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును. ఆకాశమందలి శక్తులు కదిలింపబడును గనుక లోకము మీదికి రాబోవుచున్న వాటి విషయమై భయము కలిగి, మనుష్యులు ఎదురుచూచుచు ధైర్యముచెడి కూలుదురు. అప్పుడు మనుష్యకుమారుడు ప్రభావముతోను మహా మహిమతోను మేఘారూఢుడై వచ్చుట చూతురు. ఇవి జరుగ నారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తికొనుడి, మీ విడుదల సమీపించుచున్నదనెను. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను –అంజూరపు వృక్షమును సమస్త వృక్షములను చూడుడి. అవి చిగిరించుట చూచి వసంతకాలమప్పుడే సమీపమాయెనని మీ అంతట మీరు తెలిసి కొందురు గదా? అటువలె మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు దేవుని రాజ్యము సమీపమాయెనని తెలిసికొనుడి. అవన్నియు జరుగువరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలేమాత్రమును గతింపవు. మీ హృదయములు ఒకవేళ తిండివలనను మత్తువలనను ఐహిక విచారములవలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరివచ్చినట్టు రాకుండ మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమియందంతట నివసించు వారందరిమీదికి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరుగబోవు వీటినెల్లను తప్పించుకొని, మనుష్యకుమారుని యెదుట నిలువబడుటకు శక్తిగల వారగునట్లు ఎల్లప్పుడును ప్రార్థనచేయుచు మెలకువగా ఉండుడని చెప్పెను. ఆయన ప్రతిదినము పగటియందు దేవాలయములో బోధించుచు రాత్రివేళ ఒలీవలకొండకు వెళ్లుచు కాలము గడుపుచుండెను. ప్రజలందరు ఆయన మాట వినుటకు దేవాలయములో ఆయనయొద్దకు పెందలకడ వచ్చుచుండిరి.