యెహోషువ 7:2-26

యెహోషువ 7:2-26 TELUBSI

యెహోషువ–మీరు వెళ్లి దేశమును వేగు చూడుడని చెప్పి బేతేలు తూర్పుదిక్కున బేతావెను దగ్గరనున్న హాయి అను పురమునకు యెరికోనుండి వేగుల వారిని పంపగా వారు వెళ్లి హాయి పురమును వేగుచూచి యెహోషువ యొద్దకు తిరిగి వచ్చి–జనులందరిని వెళ్లనీయకుము, రెండు మూడు వేలమంది వెళ్లి హాయిని పట్టుకొన వచ్చును, జనులందరు ప్రయాసపడి అక్కడికి వెళ్లనేల? హాయి వారు కొద్దిగానున్నారు గదా అనిరి. కాబట్టి జనులలో ఇంచుమించు మూడు వేలమంది అక్కడికి వెళ్లిరిగాని వారు హాయివారి యెదుట నిలువలేక పారిపోయిరి. అప్పుడు హాయివారు వారిలో ముప్పది ఆరు గురు మనుష్యులను హతము చేసిరి. మరియు తమ గవినియొద్ద నుండి షేబారీమువరకు వారిని తరిమి మోరాదులో వారిని హతము చేసిరి. కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయెను. యెహోషువ తన బట్టలు చింపుకొని, తానును ఇశ్రాయేలీయుల పెద్దలును సాయంకాలమువరకు యెహోవా మందసము నెదుట నేలమీద ముఖములు మోపుకొని తమ తలలమీద ధూళి పోసికొనుచు –అయ్యో, ప్రభువా యెహోవా, మమ్మును నశింపజేయునట్లు అమోరీయుల చేతికి మమ్మును అప్పగించుటకు ఈ జనులను ఈ యొర్దాను నీ వెందుకు దాటించితివి? మేము యొర్దాను అవతల నివసించుట మేలు. ప్రభువా కనికరించుము; ఇశ్రాయేలీయులు తమ శత్రువులయెదుట నిలువలేక వెనుకకు తిరిగినందుకు నేనేమి చెప్పగలను? కనానీయులును ఈ దేశ నివాసులందరును విని, మమ్మును చుట్టుకొని మా పేరు భూమిమీద ఉండకుండ తుడిచివేసినయెడల, ఘనమైన నీ నామమునుగూర్చి నీవేమి చేయుదువని ప్రార్థింపగా యెహోవా యెహోషువతో ఇట్లనెను–లెమ్ము, నీ వేల యిక్కడ ముఖము నేల మోపికొందువు? ఇశ్రాయేలీయులు పాపము చేసియున్నారు. నేను వారితో చేసిన నిబంధనను వారు మీరియున్నారు. శపితమైన దాని కొంత తీసికొని, దొంగిలి బొంకి తమ సామానులో దాని ఉంచుకొనియున్నారు. కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువులయెదుట నిలువలేక తమ శత్రువుల యెదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైనవారు మీ మధ్యనుండకుండ మీరు వారిని నిర్మూలము చేసితేనే తప్ప నేను మీకు తోడైయుండను. నీవు లేచి జనులను పరిశుద్ధపఱచి వారితో ఈలాగు చెప్పుము–రేపటికి మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి; ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా–ఇశ్రాయేలీయులారా, మీ మధ్య శాపగ్రస్తమైన దొకటికలదు; మీరు దానిని మీ మధ్యనుండకుండ నిర్మూలము చేయువరకు మీ శత్రువుల యెదుట మీరు నిలువలేరు. ఉదయమున మీ గోత్రముల వరుసనుబట్టి మీరు రప్పింపబడుదురు; అప్పుడు యెహోవా ఏ గోత్రమును సూచించునో అది వంశముల వరుసప్రకారము దగ్గరకు రావలెను; యెహోవా సూచించు వంశము కుటుంబములప్రకారము దగ్గరకు రావలెను; యెహోవా సూచించు కుటుంబము పురుషుల వరుసప్రకారము దగ్గరకు రావలెను. అప్పుడు శపితమైనది యెవనియొద్ద దొరుకునో వానిని వానికి కలిగినవారినందరిని అగ్నిచేత కాల్చివేయవలెను, ఏలయనగా వాడు యెహోవా నిబంధనను మీరి ఇశ్రాయేలులో దుష్కా ర్యము చేసినవాడు అనెను. కాబట్టి యెహోషువ ఉదయమున లేచి ఇశ్రాయేలీయులను వారి గోత్రముల వరుసనుబట్టి దగ్గరకు రప్పించి నప్పుడు యూదాగోత్రము పట్టబడెను. యూదా వంశమును దగ్గరకు రప్పించినప్పుడు జెరహీయుల వంశము పట్టబడెను. జెరహీయుల వంశమును పురుషుల వరుసను దగ్గ రకు రప్పించినప్పుడు జబ్ది పట్టబడెను. అతడును అతని యింటి పురుషుల వరుసను దగ్గరకు రప్పింపబడినప్పుడు యూదా గోత్రములోని జెరహు మునిమనుమడును జబ్ది మనుమడును కర్మీ కుమారుడునైన ఆకాను పట్టబడెను. అప్పుడు యెహోషువ ఆకానుతో నా కుమారుడా ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మహిమను చెల్లించి, ఆయన యెదుట ఒప్పుకొని, నీవు చేసినదానిని మరుగుచేయక నాకు తెలుపుమని నిన్ను వేడుకొనుచున్నానని చెప్పగా ఆకాను యెహోషువతో ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పైవస్త్రమును రెండువందల తులముల వెండిని ఏబది తులముల యెత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసికొంటిని; అదిగో నా డేరామధ్య అవి భూమిలో దాచబడియున్నవి, ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనెను. అప్పుడు యెహోషువ దూతలను పంపగా వారు ఆ డేరా యొద్దకు పరుగెత్తి చూచినప్పుడు అది డేరాలో దాచబడి యుండెను, ఆ వెండి దాని క్రిందనుండెను. కాబట్టి వారు డేరా మధ్యనుండి వాటిని తీసికొని యెహోషువ యొద్దకును ఇశ్రాయేలీయులయొద్దకును తెచ్చి యెహోవా సన్నిధిని ఉంచిరి. తరువాత యెహోషువయు ఇశ్రాయేలీయులందరును జెరహు కుమారుడైన ఆకానును ఆ వెండిని ఆ పైవస్త్రమును ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమారులను కుమార్తెలను ఎద్దులను గాడిదలను మందను డేరాను వానికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయలోనికి తీసికొనివచ్చిరి. అప్పుడు యెహోషువ– నీవేల మమ్మును బాధ పరిచితివి? నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా ఇశ్రాయేలీయులందరు వానిని రాళ్లతో చావగొట్టిరి; వారిని రాళ్లతో కొట్టిన తరువాత అగ్నిచేత కాల్చి వారిమీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. అది నేటివరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకము విడిచినవాడై మళ్లుకొనెను. అందుచేతను నేటివరకు ఆ చోటికి ఆకోరు లోయ అనిపేరు.