న్యాయాధిపతులు 13:2-25

న్యాయాధిపతులు 13:2-25 TELUBSI

ఆ కాలమున దానువంశస్థుడును జొర్యాపట్టణస్థుడునైన మానోహ అను నొకడుండెను. అతని భార్య గొడ్రాలై కానుపులేకయుండెను. యెహోవాదూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై–ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపులేకపోయెను; అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు. కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి, ద్రాక్షారసమునేగాని మద్యమునేగాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనను తినకుండుము. నీవు గర్భవతివై కుమారుని కందువు. అతని తలమీద మంగలకత్తి వేయకూడదు; ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడినవాడై ఫిలిష్తీయుల చేతిలోనుండి ఇశ్రాయేలీయులను రక్షింప మొదలుపెట్టునని ఆమెతో అనగా ఆ స్త్రీ తన పెనిమిటియొద్దకు వచ్చి –దైవజనుడొకడు నా యొద్దకు వచ్చెను; అతని రూపము దేవదూత రూపమును పోలినదై మిక్కిలి భీకరముగా ఉండెను. అతడు ఎక్కడ నుండి వచ్చెనో నేనడుగలేదు, అతడు తనపేరు నాతో చెప్పలేదు గాని–ఆలకించుము, నీవు గర్భవతివై కుమారుని కందువు. కాబట్టి నీవు ద్రాక్షారసమునేగాని మద్యమునేగాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనను తినకుండుము, ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని చని పోవువరకు దేవునికి నాజీరు చేయబడినవాడైయుండునని నాతో చెప్పెననెను. అందుకు మానోహ–నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరల మా యొద్దకువచ్చి, పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలెనో దానిని మాకు నేర్పునట్లు దయచేయుమని యెహోవాను వేడు కొనగా దేవుడు మానోహ ప్రార్థన నాలకించెను గనుక, ఆ స్త్రీ పొలములో కూర్చుండగా దేవునిదూత ఆమెను దర్శించెను. ఆ సమయమున ఆమె పెనిమిటియైన మానోహ ఆమె యొద్దయుండలేదు గనుక ఆ స్త్రీ త్వరగా పరుగెత్తి–ఆనాడు నాయొద్దకు వచ్చిన పురుషుడు నాకు కనబడెనని అతనితో చెప్పెను. అప్పుడు మానోహ లేచి తన భార్య వెంబడి వెళ్లి ఆ మనుష్యునియొద్దకు వచ్చి–ఈ స్త్రీతో మాటలాడినవాడవు నీవేనా అని అతని నడుగగా అతడు–నేనే అనెను. అందుకు మానోహ–కావున నీ మాట నెరవేరునప్పుడు ఆ బిడ్డ ఎట్టివాడగునో అతడు చేయవలసిన కార్యమేమిటో తెలుపుమని మనవిచేయగా యెహోవాదూత–నేను ఆ స్త్రీతో చెప్పినదంతయు ఆమె చేకొనవలెను; ఆమె ద్రాక్షావల్లినుండి పుట్టినదేదియు తినకూడదు, ఆమె ద్రాక్షారసమునైనను మద్యమునైనను త్రాగకూడదు, అపవిత్రమైన దేనినైనను తినకూడదు, నేను ఆమె కాజ్ఞాపించినదంతయు ఆమె చేకొనవలెనని మానోహతో చెప్పెను. అప్పుడు మానోహ–మేము ఒక మేక పిల్లను సిద్ధపరచి నీ సన్నిధిని ఉంచువరకు నీవు ఆగుమని మనవి చేసికొనుచున్నామని యెహోవాదూతతో చెప్పగా యెహోవాదూత–నీవు నన్ను నిలిపినను నీ భోజనము నేను తినను; నీవు దహనబలి అర్పించ నుద్దేశించినయెడల యెహోవాకు దాని నర్పింపవలెనని మానోహతో చెప్పెను. అతడు యెహోవాదూత అని మానోహకు తెలియలేదు. మానోహ–నీ మాటలు నెరవేరిన తరువాత మేము నిన్ను సన్మానించునట్లు నీ పేరేమని యెహోవాదూతను అడుగగా యెహోవాదూత–నీ వేల నాపేరు అడుగుచున్నావు? అది చెప్పశక్యముకాని దనెను. అంతట మానోహ నైవేద్యముగా నొక మేకపిల్లను తీసికొని యొక రాతిమీద యెహోవాకు అర్పించెను. మానోహయు అతని భార్యయు చూచుచుండగా ఆ దూత యొక ఆశ్చర్య కార్యము చేసెను. ఎట్లనగా, జ్వాలలు బలిపీఠము మీదనుండి ఆకాశమునకు లేచుచుండగా యెహోవాదూత బలిపీఠముమీదనున్న ఆ జ్వాలలలో పరమునకు ఆరో హణమాయెను. మానోహయు అతని భార్యయు దానిని చూచి నేలకు సాగిలపడిరి. ఆ తరువాత యెహోవాదూత మానోహకును అతని భార్యకును మరెన్నడు ప్రత్య క్షము కాలేదు. ఆయన యెహోవాదూత అని మానోహ తెలిసికొని–మనము దేవుని చూచితిమి గనుక మనము నిశ్చయముగా చనిపోదుమని తన భార్యతో అనగా అతని భార్య–యెహోవా మనలను చంపగోరినయెడల ఆయన దహనబలిని నైవేద్యమును మనచేత అంగీకరింపడు, ఈ సంగతులన్నిటిని మనకు చూపింపడు, ఈ కాలమున ఇట్టి సంగతులను మనకు వినిపింపడని అతనితో చెప్పెను. తరువాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సమ్సోను అను పేరు పెట్టెను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతని నాశీర్వదించెను. మరియు యెహోవా ఆత్మ జొర్యాకును ఎష్తాయోలుకును మధ్యనున్న మహనెదానులో అతని రేపుటకు మొదలు పెట్టెను.